రెండువారాలు అలా గడిపితే..

30 Mar, 2018 09:32 IST|Sakshi
ఫైల్‌ఫోటో

లండన్‌ : ఆధునిక సౌకర్యాలు మనిషి జీవితాన్ని సుఖమయం చేసినా అదే సమయంలో లేజీనెస్‌ పెరగడం మన శరీరాలను ఛిద్రం చేస్తోంది. రోజంతా డెస్క్‌కు అంకితమవడం, అదేపనిగా డ్రైవింగ్‌, వారాంతాల్లో సోఫాల్లో అతుక్కుపోవడం ఇలా ఓ రెండు వారాలు గడిచినా అనారోగ్యానికి దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. నిత్యం బద్ధకంతో గడిపితే కొన్నేళ్లలోనే శరీరం వ్యాధుల కుప్పగా మారుతుందని హెచ్చరించింది. దీర్ఘకాలంలో ఇది టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె జబ్బులు, స్ర్టోక్‌ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు.

అయితే చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ పరిస్థితిని నివారించవచ్చని చెబుతున్నారు. లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రత్యామ్నాయంగా సూపర్‌ మార్కెట్‌కు వెళ్లడం, రోజుకు అరగంట పాటు నడవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. శరీరాన్ని చురుకుగా ఉంచకపోతే భవిష్యత్‌ వ్యాధులకు పునాదులు వేసినట్టేనని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ డేనియల్‌ కూత్‌బెర్ట్స్‌న్‌ హెచ్చరించారు.

ఆధునిక జీవితంతో సమాజం యాంత్రిక జీవనశైలిలో మగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కదలికలు లేని జీవనశైలి ప్రమాదకరమని..ఇది దీర్ఘకాలం కొనసాగితే శరీరం వ్యాధులకు నిలయమవుతుందన్నారు.  

మరిన్ని వార్తలు