‘ఈట్’ మాంగే మోర్

16 Oct, 2014 01:22 IST|Sakshi
‘ఈట్’ మాంగే మోర్

సందడే సందడి.. ఎటుచూసినా చిన్నారుల కోలాహలం... చిత్ర, విచిత్ర వేషధారణలు..  మాదాపూర్‌లోని శిల్పకళా వేదికగా బుధవారం ప్రారంభమైన ‘హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ వర్క్‌షాప్-2014’ విద్యార్థులతో కలర్‌ఫుల్‌గా కనిపించింది. సాయంత్రం 6.30 గంటలకు ముంబైకి చెందిన హబిజాబి ప్రొడక్షన్స్ ప్రదర్శించిన ‘ఈట్’ నాటకం ఆకట్టుకుంది.
 
 ‘స్కూల్‌కు వెళ్లే పిల్లాడిని ఇద్దరు ఆకతాయిలు చెత్త కుండీలో పడేస్తారు. అక్కడే అరటి తొక్క, యాపిల్ ముక్కతో స్నేహ ం ఏర్పడుతుంది. అప్పటికే అక్కడ ఉన్న ఎలియన్లు అనేక మంది పిల్లలకు జిలేబీ ఆశ చూపి చంపుతుంటారు. అయితే అరటి తొక్క, యాపిల్ ముక్క చెప్పే మాటలను వింటూ స్కూల్‌కు వెళ్లిన పిల్లాడు ఎలియన్లను చంపే కిటుకు తెలుసుకుంటాడు.  ఎలియన్ల బారి నుంచి తన స్నేహితులను రక్షించి వాటి అంతు చూస్తాడు..’ ఇదీ ఈట్ స్టోరీ. ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తిన ఈ నాటకంలోని అన్ని పాత్రలను రక్తికట్టించింది సుహాస్ అహుజా, జిమ్ సర్బ్, రత్నావళి భట్టాచార్జి. ఈ సందర్భంగా ఆ ముగ్గురితో ‘సిటీప్లస్’ ముచ్చటించింది.
 
 ఈ ముగ్గురి ప్యాషన్ థియేటర్ ఆర్టే. వీరి అభిరుచులు ఒక్కటి కావడంతో ‘హబిజబి ప్రొడక్షన్స్’ ఏర్పాటైంది. ఈ ప్రొడక్షన్స్ గత ఫిబ్రవరిలో ముంబైలోని పృథ్వీ థియేటర్‌లో నాటకం ప్రదర్శించింది.  ఈ బ్యానర్ హైదరాబాద్‌లో ఇచ్చిన తొలి ప్రదర్శన  ఇదే కావడం విశేషం.
 
 థియేటర్‌తో మంచి పేరు
 న్యూయార్క్, అట్లాంటాలో నటనలో శిక్షణ తీసుకున్నా. మూడేళ్ల క్రితం ముంబై తిరిగి వచ్చా.
 నాయిసెస్ ఆఫ్, డెతోఫా సేల్స్‌మన్, ద గ్లాస్ మెనేజరీ నాటకాలు మంచి పేరు తెచ్చాయి.
 - జిమ్ సర్బ్
 
 నాకు పాషన్....
 మా కుటుంబానిది నాటకాల నేపథ్యం.  అమెరికాలోని మిడిల్‌బరీ నుంచి ఫిల్మ్ డిగ్రీ చేశాను. థియేటర్ ఆర్ట్స్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నా. 2011లో రత్నావళి భట్టాచార్జితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లింది.
 -సుహాస్ అహుజా, డెరైక్టర్
 
 ఎంజాయ్ చేస్తున్నా..
 ముంబైలో థియేటర్‌కు మంచి ఆదరణ ఉంది. 1998 నుంచి ఈ ఫీల్డ్‌లోనే ఉన్నా. 2009 నుంచి పిల్లలకు థియేటర్ మెలకువలు నేర్పుతున్నా. నా ఇష్టం, మా వారు సుహాస్ లక్ష్యం ఒక్కటే కావడంతో ఈ ప్యాషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాను.
 - రత్నావళి భట్టాచార్జి.
 వాంకె శ్రీనివాస్

>
మరిన్ని వార్తలు