దుబాయ్‌లోనూ మనోళ్లే టాప్

27 Oct, 2017 09:05 IST|Sakshi

సాక్షి, ముంబయి: దుబాయ్‌లో విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లలో భారతీయులు ముందువరుసలో ఉన్నారు. 2016 జనవరి నుంచి జూన్‌ 2017 వరకూ మనోళ్లు దుబాయ్‌లో రూ. 42 వేల కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం అంతకుముందు ఏడాది కంటే రూ. 12,000 కోట్లు అధికం. దుబాయ్‌లో మనోళ్లు ఎక్కువగా అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేస్తుండగా, మరికొందరు విల్లాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌పై భారతీయులకున్న క్రేజ్‌ ఏపాటిదో దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన గణాంకాలతో స్పష్టమవుతోంది.

ముంబయి, పుణే, అహ్మదాబాద్‌కు చెందిన వారు ఎక్కువగా దుబాయ్‌ ఆస్తులపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో అత్యధికులు దుబాయ్‌లో అపార్ట్‌మెంట్‌, విల్లా కొనుగోలుకు రూ. 6.5 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది శాతం మంది రూ. 65 లక్షల నుంచి రూ. 3.24 కోట్లలో ఆస్తి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని దుబాయ్‌ ప్రాపర్టీ షో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఇక 9 శాతం మంది భారతీయులు దుబాయ్‌లో​ కమర్షియల్‌ ప్రాపర్టీని, ఆరు శాతం మంది స్థలాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దుబాయ్‌ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరల్లో ప్రాపర్టీలను అందిస్తోందని, రూపాయి బలోపేతమవడం కూడా ప్రాపర్టీ మార్కెట్‌కు ఊతం ఇస్తోందని అధ్యయనం తేల్చింది.

మరిన్ని వార్తలు