విభజన ప్రక్రియను తుది దశకు చేర్చిన కిరణ్

16 Nov, 2013 15:45 IST|Sakshi
విభజన ప్రక్రియను తుది దశకు చేర్చిన కిరణ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను సమైక్యవాదినని చెబుతూనే విభజన ప్రక్రియను తుది దశకు చేర్చారు. కేంద్ర  శరవేగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రక్రియను కొనసాగిస్తోంది. రాష్ట్ర విభజనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం), కేంద్రంలోని, రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అన్ని అంశాలపై చర్చించారు. ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలు, అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవడం చెకచెకా జరిగిపోతున్నాయి. విభజనకు సంబంధించిన పనులు వెంటవెంటనే పూర్తి చేయాలని అన్ని శాఖలకు కేంద్ర హొం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న జిఓఎం పలువురితో తుది విడత చర్చలు జరుపనుంది.  తెలంగాణ బిల్లు కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ బిల్లును పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లోనే   ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే  వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభమవుతాయి. ఈ నెల 21న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.  మంత్రి మండలి ఆమోదించిన వెంటనే  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతారు. రాష్ట్రపతి నుంచి బిల్లు ఈ నెలాఖరుకల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుంది.   ఈ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ  శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. సీమాంధ్ర ప్రజల నుంచి (కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నుంచి కాదు) ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డిసెంబరు చివరికల్లా రాష్ట్రాన్ని విభజించాలన్నా కృతనిశ్చయంతో ఉంది.

ఓ పక్క విభజన ఏర్పాట్లు ఇంత వేగంగా జరుగుతున్నా, సీఎం కిరణ్ ఇంకా తాను సమైక్యవాదినని, జిఓఎం వద్ద సమైక్యవాదం వినిపిస్తానని సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే తనకు పదవి ముఖ్యం కాదని కూడా చెబుతూనే ఉన్నారు. నిన్న విశాఖపట్నం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ సమైక్యం కోసం చేసే పోరాటంలో తాను పదవిని సైతం లెక్క చేయనని చెప్పారు. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చినా ఆయన ఇంకా జనాన్ని నమ్మించడానికే ప్రయత్నిస్తున్నారు గానీ, రాజీనామా మాత్రం చేయరు. సిఎం పదవిని వదులుకోవడానికి ఇష్టపడని ఆయన ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటున్నట్లు అర్ధమవుతోంది.   రాష్ట్రం విభజన జరిగితే తెలంగాణ ప్రాంతమే ఎక్కువ నష్టపోతుందన్న కొత్త వాదన సిఎం ఇటీవల లేవనెత్తారు.  పరోక్షంగా విభజన వల్ల సీమాంధ్రకే మేలు కలుగుతుందన్న భావన వ్యక్తమయ్యే విధంగా మాట్లాడుతున్నారు.  నిన్న పశ్చిమగోదావరి జిల్లా   జగన్నాథపురం గ్రామంలో జరిగిన రచ్చబండలో ఇదేతీరున మాట్లాడారు.   విడిపోతే  విద్య, ఉద్యోగాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ తెలంగాణకే నష్టమని నొక్కిమరీ చెప్పారు.  ఈ నెల 18న జిఓఎం ముందు సమైక్యవాదాన్ని వినిపిస్తానని ఈ రోజు కూడా కృష్ణా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విభజనకు సహకరిస్తున్నట్లు కూడా ఆరోపించారు.  కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే ఆయన ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి ఈ నెల 18న ఢిల్లీ జరిగే సమావేశంలో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు  అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కిరణ్కు మంత్రుల బృందం దిశానిర్దేశం చేస్తుందని తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై సీఎంతో  కేంద్రం జరిపే తుది చర్చ ఇదేనని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిచోట సిఎం తాను సమైక్యవాదినని చెబుతూ విభజన ప్రక్రియను తుది దశకు చేర్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు