కీబోర్డు డాక్టర్లు

8 Dec, 2017 14:04 IST|Sakshi

లండన్‌: జలుబు, దగ్గు నుంచి ఛాతీ ఇన్ఫెక్షన్‌ల వరకూ వైద్య నిపుణుల సాయం లేకుండా బ్రిటన్‌ పౌరులు తామే నయం చేసుకుంటున్నారు.వ్యాధి లక్షణాలను గూగుల్‌లో శోధించి ఇంటర్నెట్‌లోనే నివారణకు మార్గాలు అన్వేషిస్తున్నారు.చిన్న,చిన్న అనారోగ్యాల నుంచి ఓ మాదిరి వ్యాధులకూ డాక్టర్‌ వద్దకు వెళ్లేందుకు పదిమందిలో ఏడుగురు నిరాకరిస్తున్నారని బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అథ్యయనం తేల్చింది.మూడింట రెండు వంతుల మంది సొంత వైద్యానికే మొగ్గుచూపుతున్నారని ఈ అథ్యయనం నిగ్గుతేల్చింది.

వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి వైద్య నిపుణుల చేయి పడకుండానే స్వస్ధత పొందగలమని భావించే వారి సంఖ్య పెరుగుతోంది.దీంతో ఏడాదికి ఒకటి రెండు సార్లు మించి ఎవరూ వైద్య నిపుణుడిని సందర్శించడం లేదని వెల్లడైంది.చిన్నపాటి అనారోగ్యాలకు ఇప్పుడు చాలావరకూ విశ్రాంతి తీసుకుని, ఆరోగ్యకర ఆహారంతో పాటు రాత్రివేళల్లో కంటి నిండా నిద్ర పోతే చెక్‌ పెట్టవచ్చనే అభిప్రాయం బలపడిందని ఈ అథ్యయనం నిర్వహించిన ఫ్యూచర్‌యూ ప్రతినిధి చెప్పారు. ఇంటి చిట్కాతో గతంలో అనారోగ్యం దూరం చేసుకున్నామని 75 శాతం మంది చెప్పినట్టు అథ్యయనం పేర్కొంది.

ఇక ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్న తర్వాత తమ ఆరోగ్యం బాగా కుదుటపడిందని 70 శాతం మంది వెల్లడించారు. మరికొందరు డాక్టర్‌ వద్దకు వెళ్లే లోగానే తమ వ్యాధి లక్షణాలను గూగుల్‌లో శోధిస్తున్నారని తేలింది. ఇక జలుబుకు సంబంధించి 78 శాతం మంది వైద్యుడు ఊసే ఎత్తడం లేదు. జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, డయేరియా, పంటినొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, ఇన్సోమ్నియా, హెమరాయిడ్స్‌, అలర్జిక్‌ రియాక్షన్‌, అర్ధరైటిస్‌, జాయింట్‌ పెయిన్‌, ఛాతీ ఇన్ఫెక్షన్‌ వంటి వ్యాధులకు నెట్టింట్లోనే పరిష్కారం వెదుక్కుంటున్నట్టు వెల్లడైంది.

మరిన్ని వార్తలు