బాబు, రాజన్నపాలనలో... విద్య

4 May, 2014 01:03 IST|Sakshi
బాబు, రాజన్నపాలనలో... విద్య

 బాబు పాలన

ఆ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో యువత ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల చదువు పట్ల బాబుకు చిన్నచూపు ఉండేది.తానే హైటెక్‌సిటీ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబుకు అప్పుడు పల్లెల్లోని పేదలు గుర్తుకు రాలేదు. మెరిట్ ప్రతిపాదికన కాకుండా బీసీలందరికీ స్కాలర్‌షిప్పులు ఇవ్వాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. 2000-01లో 18,782 మంది బీసీ విద్యార్థులకు కేవలం రూ.2.99 కోట్లు కేటాయించారు.స్కాలర్‌షిప్పులు, మెస్ ఛార్జీలు పెంచాలని ఎన్ని ఉద్యమాలు చేసినా వాటిని అణచివేయడమే తప్ప రూపాయి కూడా అదనంగా ఇచ్చింది లేదు.

విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, మేనేజ్‌మెంటుకు కోటాలో లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా చేశారు. కొత్త ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటును పట్టించుకోలేదు.9 ఏళ్ల బాబు పాలనలో ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు 3 మాత్రమే.
 
 రాజన్న రాజ్యం

ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే విద్యార్థుల సమస్యలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టి పెట్టారు.విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, మెస్ చార్జీలు ఏయేటికాయేడు పెంచుతూ విడుదల చేస్తున్నప్పటికీ సంతృప్త (శాచ్యురేషన్) పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు వికలాంగులైన విద్యార్థులందరికీ లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్‌‌సమెంట్ పథకాన్ని ప్రారంభించారు.ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థీ ఎలాంటి ఫీజుల భారమూ లేకుండా విద్యను అభ్యసించడమే ఈ పథకం లక్ష్యం. ఇది విజయవంతం కావడంతో ఈబీసీ విద్యార్థులకు సైతం 2009-10 నుంచి అమలు చేశారు.2008-09 బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.1373 కోట్లు కేటాయించిన ఆయన, ఏకంగా రూ.1565.37 కోట్లు విడుద ల చేశారు.2009-10 బడ్జెట్‌లో రూ. 2,333.04 కోట్లు కేటాయించారు. అయితే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం అనంతరం పథకంపై నీలినీడలు అలుముకున్నాయి.

ఉన్నత విద్యను వికేంద్రీకరించే ఉద్దేశంతో మొత్తం 18 విశ్వవిద్యాలయాలను వై.ఎస్. ఏర్పాటు చేశారు.అనేక డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం అందించారు.జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు తోడ్పాటునందించారు.అంతర్జాతీయ స్థాయి కలిగిన హైదరాబాద్ ఐఐటీ, బిట్స్ వంటి సంస్థల ఏర్పాటుకు చొరవ చూపారు.  పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్పులు, మెస్ ఛార్జీల కోసం భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ విడుదల చేశారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 2004-05 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 386.37 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.409.34కోట్ల మేర విడుదల చేశారు.2005-06 సంవత్సరంలో 409.07 కోట్లు, 2006-07లో రూ.609.91 కోట్లు, 2007-08లో రూ.883.74 కోట్లు విద్యార్థుల కోసం విడుదల చేశారు.
 
 సక్సెస్ స్కూళ్లు

6,500 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసి, 6 నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్య అందించారు.అన్ని స్థాయుల్లోనూ డ్రాపవుట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.

 మధ్యాహ్న భోజనం

 కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా, దానిని 9, 10 తరగతులకు కూడా వైఎస్ వర్తింపజేశారు.ఇందుకు ఏటా అయ్యే ఖర్చు రూ. 250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు.
 
ట్రిపుల్ ఐటీలు

నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు 2008లో ఏపీ ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు.రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని  ఏర్పాటు చేసి దాని నేతృత్వంలో తెలంగాణలోని బాసరలో, రాయలసీమలోని ఇడుపులపాయలో, కోస్తాంధ్రలోని నూజివీడులో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు.ఒక్కో క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,000 సీట్లను అందుబాటులోకి తెచ్చారు.

జగన్ సంకల్పం

అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రస్తుతమున్న ఆంక్షలను, పరిమితులను తొలగించడం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన 6,500 సక్సెస్ స్కూళ్లను విజయవంతం చేయడం. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం.  రాష్ర్టంలో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేయడం.చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ వర్గాలకు చెందిన ప్రతి పేద విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడమే లక్ష్యం.  పరిమితుల్లేని బడ్జెట్ కేటాయించి, భారమెంతైనా కానీ పథకాన్ని మాత్రం అమలు చేస్తారు.
 

>
మరిన్ని వార్తలు