చేతి పట్టీ

15 Oct, 2017 00:08 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

వాళ్లిద్దరూ కలిసి ఆటో ఎక్కారు. వందన తన ఇష్టపూర్వకంగానే ఆ యువకుడితో భుజాల మీద చేతులు వేసి నవ్వుతూ ఆటో ఎక్కింది. ఫుటేజ్‌ను తన పెన్‌ డ్రైవ్‌లో వేసుకున్నాడు డిటెక్టివ్‌ శిరీష్‌. తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీస్‌ స్టేషన్‌ హడావిడిగా ఉంది. జూ పార్క్‌ వద్ద ఉన్న చెట్ల గుబురుల్లో పోలీసులకు ఒక యువతి శవం దొరికింది. ఆమె ఒంటిమీద హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌కు సంబంధించిన గుర్తింపు కార్డు ఉంది.‘‘సర్‌! మీకోసమే ఎదురుచూస్తున్నాం’’ అన్నాడు ఇంటి యజమాని. ఆయన కూతురునే దుండగులు ఎత్తుకుపోయారు. సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యింది. ఆయన చాపిన చేతిని అందుకుని కరచాలనం చేశాడు డిటెక్టివ్‌ శిరీష్‌.

వాళ్లిద్దరూ ఎదురెదురుగా డ్రాయింగ్‌ రూంలో కూర్చున్నారు. శిరీష్‌ చేతిలో ఒక యువతి ఫొటో ఉంచాడు తండ్రి. యువతికి పదిహేడూ, పద్దెనిమిది ఉంటుంది వయసు. అందగత్తె. ‘‘హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ చేస్తోంది. నిన్న రాత్రి తన ఇన్‌స్టిట్యూట్‌ నుండి తిరిగివస్తూ తప్పిపోయింది’’ అన్నాడు తండ్రి. తరువాత ఆయనే చెప్పుకొచ్చాడు. ఆయన కూతురు పేరు వందన. నిన్న రాత్రి ఏడున్నర తర్వాత ఆమె ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అయిపోయింది. ఇంటికి సాధారణంగా ఎనిమిది గంటల లోపు చేరుకుంటుంది వందన. రాత్రి పది అవుతున్నా సరే రాకపోయేసరికి పోలీసులకు తెలియపరచాడు వందన తండ్రి. వందన స్నేహితుల వివరాలు అడిగాడు డిటెక్టివ్‌ శిరీష్‌. వాళ్ల ఫోన్‌ నంబర్లతో పాటు అందించాడు వందన తండ్రి. ‘‘మీ ఇంటి పైవాటాలో ఉంటున్న రామభద్రాన్ని పోలీసులు ఎందుకు తీసుకువెళ్లారు?’’ అడిగాడు శిరీష్‌.
‘‘అదేనండీ అయోమయంగా ఉంది! ఆయన మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిని అపహరించినట్టు ఆయనను అనుమానిస్తున్నారు పోలీసులు. ఆయన కొడుకులూ, కూతుళ్లూ ఇతర నగరాల్లో ఉన్నారు. బాగా బ్రతికిన మనిషి. తన పెన్షన్‌ డబ్బులతో ఇక్కడే జీవిస్తున్నాడు ఆయన. ఎవరి జోలికీ వెళ్లే రకం కాదు’’ అన్నాడు వందన తండ్రి.

ఆయనకు భార్య కూడా లేదట! ‘‘రామభద్రం నిన్న సాయంకాలం బయటికి వెళ్లారు. రాత్రి ఏ సమయంలో వచ్చారో తెలియదు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన మా అమ్మాయితో మాట్లాడేడట. కొంత కాలం నుండి మా అమ్మాయిని తన మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నాడు ఆయన. అదే చివరి ఫోన్‌ కాల్‌. కాల్‌ డేటా సంపాదించారు పోలీసులు. రామభద్రం గారి ఫోన్‌ డేటా దొరికింది. ప్రశ్నించడానికి తమ స్టేషన్‌కి తీసుకుపోయారు’’ మరిన్ని వివరాలు చెప్పాడు వందన తండ్రి. ‘‘ఆయన మీద మీకు అనుమానం లేదు కదా!’’ అడిగాడు డిటెక్టివ్‌ శిరీష్‌. ‘‘లేదండీ! తన సొంత మనవరాలి కంటే ఎక్కువగా అభిమానిస్తాడు రామభద్రం గారు’’ అన్నాడు వందన తండ్రి. ‘‘మీ అమ్మాయికి ఎవరైనా మగ స్నేహితులు ఉన్నారా?’’ అడిగాడు డిటెక్టివ్‌ శిరీష్‌. ‘‘ఇందాక మీకు అందించిన స్నేహితుల వివరాల్లో కుమార్‌ అన్నవాడు మా ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు. అతడిని మా అమ్మాయి ఇష్టపడుతోందని మా అనుమానం’’ ‘‘అతడి ఇల్లు ఎక్కడ?’’ అడిగాడు డిటెక్టివ్‌ శిరీష్‌. వందన తండ్రి చిరునామా ఇచ్చాడు. డిటెక్టివ్‌ శిరీష్‌ బయలుదేరాడు. ఆయన కారు రాంనగర్‌ రెండో వీధిలో అయిదో ఇంటి ముందు ఆగింది. కుమార్‌ ఇంట్లోనే దొరికాడు.

‘‘వందనను చివరిసారి ఎప్పుడు కలుసుకున్నావ్‌?’’ అడిగాడు డిటెక్టివ్‌ శిరీష్‌. కుమార్‌ ఆశ్చర్యంగా చూసి, ‘‘ఎందుకు సార్‌ అలా అడుగుతున్నారు?’’ అని అడిగాడు. వందన కనిపించకుండా పోయే సంగతి వివరించాడు డిటెక్టివ్‌ శిరీష్‌. ‘‘నిన్ననే కలుసుకున్నానండీ! తన ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లే ముందు మా ఇంటికి వచ్చింది వందన’’ అన్నాడు కుమార్‌.‘‘మీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారా?’’ కుమార్‌ మొహంలో ఒక విచిత్రమైన భావన వెలువడి మెరుపులాగా మాయమైంది. డిటెక్టివ్‌ శిరీష్‌ పెదిమలు బిగించాడు.‘‘ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి ఏమిటండీ! పైగా మా ఇద్దరికీ ఏమంత వయసు ముంచుకొచ్చిందనీ! కనీసం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అయినా చేయాలి ఇద్దరమూ’’‘‘రామభద్రం అనే ఓ ముసలాయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారట. వందనను ఆయన ఎక్కడో దాచిపెట్టాడని పోలీసులకు అనుమానం’శిరీష్‌ మాటలు ముగించకముందే కలగజేసుకున్నాడు కుమార్‌.‘‘రామభద్రం అంటే వందన వాళ్లింట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తే కదండీ? వందనను ఆయన తన మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడట. వందనకు వాళ్ల సంబంధం ఇష్టం లేదు. రామభద్రంగారంటే వందనకు కోపంగా కూడా ఉంది. అలా అని చెప్పి రామభద్రంగారు అపకారం చేసే మనిషని భావించలేము.’’
తన నోట్‌ పుస్తకంలో ఈ సంగతి రాసుకున్నాడు డిటెక్టివ్‌ శిరీష్‌.

‘‘రాత్రి నుండి వందన తన ఇంటికి చేరుకోలేదు. నీ అభిప్రాయం ఏమిటి?’’ అడిగాడు డిటెక్టివ్‌ శిరీష్‌.‘‘వందన ఎప్పుడైనా ఆగిపోతే కేవలం మా ఇంట్లో మాత్రమే ఆగిపోతుందండీ. మా చెల్లెలూ, వందనా మంచి ఫ్రెండ్స్‌’’‘‘అయితే వందన ఎక్కడున్నట్టూ?’’‘‘ఈ రకంగా కూడా అవకాశం ఉంది. రామభద్రం గారు ఆమెను ఢిల్లీ పంపించి ఉంటారు. రహస్యంగా. ఎవరినో తోడు ఇచ్చి. లేకపోతే పోలీసులు మాత్రం ఆయనను అకారణంగా ఎందుకు ప్రశ్నిస్తూ ఉంటారు?’’‘‘అంతే అయి ఉండాలి కుమార్‌!’’కుమార్‌ మొహంలో కావాల్సినంత ఉపశమనం.‘‘రామభద్రమే మీ వందనను అపహరించి ఉంటే కేసు సులువుగా తేలిపోయినట్టే!’’ అంటూ శిరీష్‌ అక్కడి నుండి బయలుదేరాడు. మధ్య దారిలో వందన తండ్రి ఆయనను కలుసుకున్నాడు. ఆయన చేతికి ఒక పట్టీ ఇచ్చాడు. పబ్స్‌లో ప్రవేశించేటప్పుడు చేతికి కట్టే పట్టీ అది. నగరంలో ఉన్నపబ్స్‌లో రకరకాల పట్టీలు కడుతూ ఉంటారు.‘‘ఈ పట్టీ మా అమ్మాయి దుస్తుల్లో దొరికిందండి’’ అన్నాడు వందన తండ్రి.     
∙∙
హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ బోధించే ఇన్‌స్టిట్యూట్‌కి చుట్టుపక్కల ఉన్న పబ్స్‌లో దర్యాప్తు మొదలుపెట్టాడు డిటెక్టివ్‌ శిరీష్‌. వందన పోలికలు కల యువతిని వాళ్లు ఎవ్వరూ గుర్తుపట్టలేదు. వాళ్లు తమ వినియోగదారుల చేతులకు కట్టే పట్టీలు కూడా వేరే విధంగా ఉన్నాయి. ఉమర్‌ ఖయ్యూమ్‌ పబ్‌లో మాత్రం అదే పట్టీ. వందన ఆ పబ్‌కు వస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. వందనతో పాటు కుమార్‌ కూడా వచ్చేవాడట.పబ్‌లో సీసీ కెమెరాలు పకడ్బందీగా పని చేస్తున్నాయి. ముందు రాత్రి ఫుటేజ్‌లో వందన కనిపించలేదు. అంటే గత రాత్రి వందన ఈ పబ్‌కి రాలేదు. రోడ్డువైపు అమర్చిన కెమెరాల ఫుటేజ్‌ కూడా పరిశీలించాడు డిటెక్టివ్‌ శిరీష్‌.రోడ్డుమీద ఒక ఆటోరిక్షా వద్ద వందన ఒక యువకుడితో కలిసి మాట్లాడుతోంది. సమయం రాత్రి 8:17.వాళ్లిద్దరూ కలిసి ఆటో ఎక్కారు. వందన తన ఇష్టపూర్వకంగానే ఆ యువకుడితో భుజాల మీద చేతులు వేసి నవ్వుతూ ఆటో ఎక్కింది. ఫుటేజ్‌ను తన పెన్‌ డ్రైవ్‌లో వేసుకున్నాడు డిటెక్టివ్‌ శిరీష్‌. తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీస్‌ స్టేషన్‌ హడావిడిగా ఉంది. జూ పార్క్‌ వద్ద ఉన్న చెట్ల గుబురుల్లో పోలీసులకు ఒక యువతి శవం దొరికింది. ఆమె ఒంటిమీద హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌కు సంబంధించిన గుర్తింపు కార్డు ఉంది.రామభద్రం గారిని విడుదల చేశారు పోలీసులు.

‘‘వందనను హత్య చేసింది కుమార్‌ అని మీకు ఎప్పుడు అనుమానం కలిగింది?’’ అడిగాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ సంగతే కుమార్‌ను అడిగాను. కుమార్‌ మొహంలో ఒక నిరసన భావన వెలువడి క్షణంలో మాయమైంది. అంతకు ముందు వరకూ రామభద్రం గారిని అనుమానించనక్కర్లేదన్న కుమార్‌ అటు తరువాత వందనను ఆయన ఢిల్లీ పంపించి ఉంటారని నాలో లేని పోని ఒక అనుమానం ప్రవేశపెట్టాడు. అంటే వందన కొంత కాలంపాటు కనిపించకుండా పోతే ఆమె ఢిల్లీలోనే ఉన్నట్టు మనం భావించాలన్నమాట. నేను నమ్మినట్టు కనిపించాను. అతడి మొహంలో గొప్ప రిలీఫ్‌ వ్యక్తమయ్యింది.వాళ్లిద్దరూ ఉమర్‌ ఖయ్యూమ్‌ పబ్‌ వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి ఏడు గంటల తర్వాత పబ్‌ వద్ద వాళ్లిద్దరూ కలిసి ఆటో రిక్షా ఎక్కారు. అంతకుముందే వందనను హత్య చెయ్యాలని నిర్ణయించుకుని ఉన్నాడు కుమార్‌. ఆమె తనను పెళ్లి గురించి విపరీతంగా హింస పెడుతోందని కుమార్‌ ఇబ్బంది పడుతున్నాడు. ఫలితంగా ఘర్షణ, అటుతరువాత హత్య ఒకదాని వెనుక ఒకటి తోసుకువచ్చి ఉంటాయి’’ అన్నాడు డిటెక్టివ్‌ శిరీష్‌.  


పబ్‌లో సీసీ కెమెరాలు పకడ్బందీగా పని చేస్తున్నాయి. ముందు రాత్రి ఫుటేజ్‌లో వందన కనిపించలేదు.అంటే గత రాత్రి వందన ఈ పబ్‌కి రాలేదు. రోడ్డువైపు అమర్చిన కెమెరాల ఫుటేజ్‌ కూడా పరిశీలించాడు డిటెక్టివ్‌ శిరీష్‌. రోడ్డుమీద మాత్రం ఒక ఆటోరిక్షా వద్ద వందన ఒక యువకుడితో కలిసి మాట్లాడుతోంది. సమయం రాత్రి 8:17.

మరిన్ని వార్తలు