వెలుతురు పండుగ

15 Oct, 2017 00:50 IST|Sakshi

దీపావళి

అమావాస్య రోజున జరుపుకొనే వెలుతురు పండుగ దీపావళి.దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ప్రతీకగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొనేపండుగ ఇది. హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా దీపావళి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకొంటారు.దీపావళి నాటి రాత్రి పల్లెలు మొదలుకొని మహా నగరాల వరకు దీపకాంతులతో కనువిందు చేస్తాయి. బాణసంచా వెలుగులతో నింగీనేలా ధగధగలాడిపోతాయి. చీకటిని తరిమి వెలుతురు నింపే దీపావళి విశేషాలు...

లోక కంటకుడైన నరకాసురుడిని సత్యభామ సాయంతో చతుర్దశి రోజున సంహరించాడు. నరకాసురుడు మరణించిన మర్నాడు జనాలందరూ అతడి పీడ విరగడైనందుకు సంబరాలు చేసుకున్నారు. ఊరూ వాడా ఇంటింటా దీపాలు వెలిగించుకున్నారు. అప్పటి నుంచి నరక చతుర్దశి మర్నాడు అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణాల కథనం. క్రూరుడైన నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించేవాడు. కంటికి నచ్చిన స్త్రీనల్లా చెరపట్టేవాడు. అతడి భయానికి స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. రాత్రివేళల్లో ఇళ్లలో దీపాలను వెలిగించుకోవడానికి కూడా భయపడేవారు. మహా బలవంతుడైన నరకుడిని దేవ దానవ మానవులలో ఎవరూ ఎదిరించలేకపోయేవారు. తనకు ఎదురే లేకపోవడంతో నరకాసురుడు యథేచ్ఛగా ముల్లోకాలనూ పీడించేవాడు. అతడి బాధలను తాళలేని దేవతలు, మునులు మహావిష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. కృష్ణావతారంలో తాను అతడిని అంతమొందిస్తానని విష్ణువు వారికి మాట ఇచ్చాడు.  ఆ మాట ప్రకారమే కృష్ణావతారంలో నరకుడిపై యుద్ధానికి దిగుతాడు. నరకునితో జరిగిన యుద్ధానికి కృష్ణుడితో పాటు సత్యభామ కూడా వెళుతుంది. నరకుడి సేనాని మురాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో హతమవుతాడు. నరకుడు క్రోధావేశంతో కృష్ణుడితో తలపడతాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు కాసేపు సొమ్మసిల్లిపోతాడు. అప్పుడు సత్యభామ స్వయంగా ధనుర్బాణాలు ధరించి నరకుడితో యుద్ధం కొనసాగిస్తుంది. సత్యభామ పోరు సాగిస్తుండగా మెలకువలోకి వచ్చిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకుడిని అంతమొందిస్తాడు. లోకాలను వణికించే నరకుడిపై సత్యభామ ధైర్యంగా పోరు సాగించిన కారణంగా దీపావళిని స్త్రీశక్తికి ప్రతీకగా భావిస్తారు.

ఐదు రోజుల వేడుకలు
దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు కొనసాగుతాయి. ఆశ్వీయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’గా జరుపుకొంటారు. ఉత్తరాదిలో దీనినే ‘ధన్‌ తెరాస్‌’ అంటారు. దేవదానవులు  క్షీరసాగర మథనం చేసినప్పుడు ఇదే రోజు ధన్వంతరి, లక్ష్మీదేవి ఉద్భవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరికి, ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి పుట్టిన రోజు ధనత్రయోదశి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుతూ ఈ రోజు ధన్వంతరికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధనత్రయోదశి మర్నాడు వచ్చే నరక చతుర్దశి నాడు అభ్యంగన స్నానాలు ఆచరించి, ఇళ్లకు అలంకరణలు చేస్తారు. దీపావళి వేడుకలకు సన్నాహాలు ప్రారంభిస్తారు. దీపావళి రోజున ప్రధానంగా లక్ష్మీపూజ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవితో పాటు గణపతికి, సరస్వతికి, కుబేరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. మార్వాడీలకు, గుజరాతీలకు దీపావళి నాటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. వారు నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటారు. బంధు మిత్రులకు మిఠాయిలు పంచుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సాయంత్రం చీకటి పడగానే ఇళ్ల ముందు వరుసగా దీపాలను వెలిగించి, బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చడం వల్ల దుష్టశక్తులు పారిపోతాయని విశ్వసిస్తారు. రావణ వధ తర్వాత సీతా రామలక్ష్మణులు దీపావళి రోజునే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని పురాణాలు చెబుతాయి. దీపావళి మర్నాడు వచ్చే కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా పాటిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమి రోజునే ‘పడ్వ’ అని అంటారు. దంపతుల మధ్య పరస్పర అనురాగం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి ప్రీతి కోసం గోవర్ధన పూజ చేస్తారు. కార్తీక శుద్ధ విదియ రోజున కొన్ని ప్రాంతాల్లో ‘భాయీ దూజ్‌’గా పాటిస్తారు. రక్షాబంధనం తరహాలోనే సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి చిహ్నంగా ఈ పండుగ జరుపుకొంటారు. అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. సోదరులను ఇంటికి పిలిచి పిండివంటలతో భోజనం పెడతారు. యముడికి అతడి సోదరి యమున ఇదేరోజు ఆతిథ్యం ఇచ్చిందని పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఈ పండుగను ‘యమ ద్వితీయ’ అని కూడా అంటారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం, బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. కాళీమాతను ఆరాధిస్తారు.

విదేశాల్లో దీపావళి
దీపావళి వేడుకలను భారత్‌తో పాటు పలు దేశాల్లో ఘనంగా జరుపుకొంటారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, మలేసియా, సింగపూర్, ఫిజి, సురినేమ్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, పాకిస్తాన్‌లోని సిం«ద్‌ రాష్ట్రంలో దీపావళి అధికారిక సెలవుదినం కావడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఇండోనేసియా, కరీబియన్‌ దీవులు, అమెరికాలలోనూ దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసంలో కూడా దీపావళి వేడుకలను ఏటా నిర్వహిస్తుండటం విశేషం. బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో దీపావళి వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. భారత్‌లోని నగరాల తర్వాత లీసెస్టర్‌ నగరంలోనే అంత ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతాయి. సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రాంతంలో కూడా దీపావళిని దేదీప్యమానంగా జరుపుకొంటారు. నేపాల్‌లో దీపావళిని ‘తీహార్‌’ అని, ‘స్వాంతి’ అని అంటారు. భారత్‌లో మాదిరిగానే నేపాల్‌లోనూ దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు చేసుకుంటారు. మొదటిరోజును ‘కాగ్‌ తీహార్‌’ అంటారు. ఆ రోజు కాకులకు ఆహారం పెడతారు. రెండో రోజు ‘కుకుర్‌ తీహార్‌’ అంటారు. ఆ రోజు శునకాలను అలంకరించి, వాటికి ఆహారం పెడతారు. మూడో రోజు ‘గాయి తీహార్‌’ సందర్భంగా గోవులను పూజిస్తారు. అదేరోజు లక్ష్మీపూజ చేస్తారు. సాయంత్రం ఇళ్ల ముంగిట దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తారు. దీపావళి మర్నాడు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ తర్వాతి రోజు భారత్‌లో ‘భాయి దూజ్‌’ జరుపుకొన్నట్లే నేపాలీలు ‘భాయి టీకా’ వేడుకలు జరుపుకొంటారు. మహిళలు తమ సోదరులను ఇళ్లకు ఆహ్వానించి, వారి నుదట తిలకం దిద్ది, విందు భోజనాలు పెడతారు. నేపాల్‌లోని నేవార్‌ బౌద్ధులు వజ్రయాన సంప్రదాయం ప్రకారం దీపావళి సందర్భంగా ‘మహాపూజ’ నిర్వహిస్తారు. ఇండోనేసియాలోని బాలి దీవిలో దీపావళిని ‘గలుంగాన్‌’ అంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ తమిళులు సుమత్రా దీవిలోని మరియమ్మన్‌ ఆలయంలో దీపావళికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్‌లోనూ అక్కడి భారతీయులతో పాటు స్థానికులు కూడా దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
 

దీపావళి గురించి అవీ ఇవీ...
►దీపావళి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలు వివిధ పద్ధతుల్లో జరుపుకొంటారు. ఇది ఒకే మతానికి పరిమితమైన పండుగ కాదు, నాలుగు మతాల వారు జరుపుకునే పండుగ.
►వర్ధమాన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినందున జైనులు ఈ రోజును అత్యంత పవిత్రదినంగా భావిస్తారు. మహావీరుడిని తలచుకుంటూ జైనులు తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగిస్తారు.
మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ చెర నుంచి సిక్కుల మతగురువు గురు హరగోవింద్‌ సింగ్‌  విడుదలైన రోజు కావడంతో సిక్కులు కూడా దీపావళి రోజున వేడుకలు చేసుకుంటారు. క్రీస్తుశకం 1577 సంవత్సరంలో ►దీపావళి రోజునే అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన జరగడం విశేషం.
►దీపావళి రోజున దేశవ్యాప్తంగా కాల్చే బాణసంచా విలువ వందలాది కోట్ల రూపాయల మేరకు ఉంటుంది. తమిళనాడులోని శివకాశీలో బాణసంచా తయారీ పరిశ్రమ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ తయారైన బాణసంచా దేశ విదేశాలకు సరఫరా అవుతుంది.
►క్రీస్తుశకం ఆరోశతాబ్ది కాలంలో చైనావారు బాణసంచా తయారీలో కీలకమైన పొటాషియం నైట్రేట్‌ను కనుగొన్నారు. బాణసంచా కనుగొనడానికి ముందు దీపావళి వేడుకల్లో కేవలం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు.
►మందుగుండు కనుగొన్న తర్వాత చిత్రవిచిత్రమైన బాణసంచా సామగ్రిని తయారు చేసేవారు. దీపావళి రోజున బాణసంచా కాల్చడం మన దేశంలో క్రమంగా వాడుకలోకి వచ్చింది. ఇతర దేశాల్లోనూ వివిధ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం మొదలైంది.
►అమెరికాలో ఏటా ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు జూలై 4న భారీస్థాయిలో బాణసంచా కాలుస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా బాణసంచా వినియోగించే సంస్థగా ‘వాల్డ్‌ డిస్నీ’ రికార్డులకెక్కింది.
►బ్రిటిష్‌ పాలకులకు బాణసంచా కాల్పులంటే చాలా ఇష్టం ఉండేది. బ్రిటిష్‌ రాణి మొదటి ఎలిజబెత్‌ వైవిధ్యభరితమైన బాణసంచా సామగ్రి తయారు చేసే వ్యక్తి కోసం ఏకంగా ‘ఫైర్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’ అనే ఆస్థాన పదవిని కల్పించింది. బ్రిటిష్‌ రాజు రెండవ జేమ్స్‌కు కూడా బాణసంచాపై విపరీతమైన మోజు ఉండేది. తన పట్టాభిషేక వేడుకల్లో వింతవింత బాణసంచా కాల్పులను ప్రదర్శించిన వ్యక్తిని ‘నైట్‌హుడ్‌’తో సత్కరించాడు.

మరిన్ని వార్తలు