పీడ‌క‌ల‌పై పిడికిలి మీ టూ

21 Oct, 2018 01:35 IST|Sakshi

కవర్‌ స్టోరీ

లైంగిక పీడనకు వ్యతిరేకంగా మహిళలు పిడికిలి బిగిస్తున్నారు.సామాజిక మాధ్యమాలే వేదికగా తమ గళం వినిపిస్తున్నారు.‘మీ టూ’ ఉద్యమం ధాటికి ఎందరో ‘మగా’నుభావులు అదిరిపడుతున్నారు. ‘మీ టూ’ పెనుగాలుల తాకిడికి ఒక్కొక్కరి ముసుగులే తొలగిపోతున్నాయి.ఇప్పటికే కొందరు ప్రముఖుల పేర్లు బజారునపడ్డాయి... రానున్న రోజుల్లో ఇంకెందరి అసలు రంగులు బయటపడతాయో చూడాల్సిందే!

‘నేను సైతం’ అంటూ ముందుకొస్తున్నారు మహిళలు. తమకు జరిగిన లైంగిక వేధింపులపై ‘మీ టూ’ అంటూ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. డబ్బు, అధికారం, పలుకుబడి కలిగి సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న పురుషపుంగవుల అసలు రంగును బట్టబయలు చేస్తున్నారు. ‘మీ టూ’ సోషల్‌ మీడియాలో ఒక అక్టోబర్‌ విప్లవం. హాలీవుడ్‌ మొదలుకొని బాలీవుడ్, టాలీవుడ్‌ వరకు ‘మీ టూ’ సెగలు వ్యాపించాయి. ‘మీ టూ’ దెబ్బకి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల బాగోతాలు బజారున పడ్డాయి. ‘మీ టూ’ ధాటికి బజారున పడ్డవారిలో ఆర్థికరంగ ప్రముఖులు, మతగురువులు, క్రీడా ప్రముఖులు, సంగీత ప్రముఖులు, వైద్య ప్రముఖులు, సైనిక ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తాజాగా ‘మీ టూ’ మంటలు మీడియాకూ వ్యాపించాయి. సమాజానికి సుద్దులు చెప్పే పలువురు ప్రముఖ పాత్రికేయుల అసలు రంగులు ప్రపంచానికి తేటతెల్లమైపోతున్నాయి. ‘మీ టూ’ పెనుగాలులకు రానున్న రోజుల్లో ఎందరు పెద్దమనుషుల నిజస్వరూపాలు బయటపడతాయో వేచిచూడాల్సిందే.

సోషల్‌ మీడియాలో నిప్పురవ్వలా మొదలైన ‘మీ టూ’ ఉద్యమం అనతికాలంలోనే దావానలంలా మారింది. హాలీవుడ్‌ నటి అలీసా మిలానో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై గత ఏడాది అక్టోబర్‌ 15న ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌తో ‘ట్విట్టర్‌’లో ఒక పోస్టు పెట్టింది. ఆ రోజు గడిచేలోగానే ‘ట్విట్టర్‌’లో రెండులక్షల మందికి పైగా యూజర్లు ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌తో తాము ఎదుర్కొన్న అనుభవాలను ఏకరువు పెడుతూ ‘ట్విట్టర్‌’ను హోరెత్తించారు. ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌ మొదలైన తొలి ఇరవైనాలుగు గంటల్లో ‘ఫేస్‌బుక్‌’లోనైతే ఏకంగా 47 లక్షల మందికి పైగా యూజర్లు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై దాదాపు 1.20 కోట్ల పోస్టులు పెట్టారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో తొలి ఇరవైనాలుగు గంటల్లో మార్మోగిన ట్వీట్లు, పోస్టుల్లో దాదాపు 45 శాతం అమెరికా నుంచే వచ్చాయి. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రతిరోజూ వేలాదిగా ‘మీ టూ’ పోస్టులు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. ‘మీ టూ’ పోస్టుల ఆధారంగా పత్రికల్లో, టీవీ చానళ్లలో దాదాపు ప్రతిరోజూ కథనాలు వెలువడుతున్నాయి. 


పన్నెండేళ్ల కిందటే ‘మీ టూ’ మూలాలు
సోషల్‌ మీడియాలో ‘మీ టూ’ కథనాలు వైరల్‌ కావడం మొదలై ఏడాదవుతోంది. అయితే, పన్నెండేళ్ల కిందటే సోషల్‌ మీడియాలో ‘మీ టూ’ మూలాలు ఏర్పడ్డాయి. ఆఫ్రికన్‌ సంతతికి చెందిన అమెరికన్‌ సామాజిక కార్యకర్త తరానా బుర్కే తొలిసారిగా ‘మీ టూ’ పదబంధంతో తనకు తారసపడిన ఒక పదమూడేళ్ల బాలిక కథనాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘మై స్పేస్‌’ అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌ అప్పట్లో అంతగా వైరల్‌ కాలేదు. అమెరికాలో నల్లజాతి బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగిస్తున్నారు. ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకోవడంతో బుర్కే ఇదే పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు.

న్యాయ వ్యవస్థపైనా మరకలు
‘మీ టూ’ ఉద్యమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ‘మీ టూ’ కథనాల్లో చాలావరకు చట్టపరమైన ఫిర్యాదుల వరకు వెళ్లడం లేదు. కేవలం అఘాయిత్యాలకు పాల్పడిన ‘పెద్దమనుషుల’ పేర్లు బయటపెట్టడానికే పరిమితమవుతున్నాయి. ఈ ఉద్యమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందినవారు, మత గురువులు అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.లైంగిక వేధింపుల బాధితులు తమకు చట్టబద్ధంగా న్యాయం దక్కాలనుకుంటే న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థపై కూడా మరకలు ఉండటం గమనార్హం. ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో వ్యాపించడానికి కొన్నేళ్ల ముందే, 2013లో ఒక మహిళ తన బ్లాగులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరిపై ఆయన పేరు బయటపెట్టకుండానే ఆరోపణలు ఎక్కుపెట్టారు. బ్లాగులో రాసిన విషయంపై మీడియా కథనాలు న్యాయవ్యవస్థలో కలకలం రేపాయి. మీడియా కథనాలు వెలువడిన తర్వాత ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సదరు న్యాయమూర్తి పేరును బయటపెట్టారు. న్యాయమూర్తి పేరు కూడా బయటకు రావడంతో ఈ విషయమై విచారణ కోసం హడావుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీని దోషిగా తేల్చింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టం అదే ఏడాది అమలులోకి వచ్చింది. 


చట్టం ఏం చెబుతోందంటే...
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వైధింపులను నిరోధించడానికి 2013లో అమలులోకి వచ్చిన చట్టం లైంగిక వేధింపులకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ‘అవతలి వ్యక్తి నుంచి అభ్యంతరం వచ్చినప్పటికీ, పనిచేసే చోట మహిళలను తాకడం, సెక్స్‌ కోరడం, పోర్నోగ్రఫీ చూపించడం, అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం వంటి చర్యలను లైంగిక వేధింపులుగానే పరిగణించాలి’ అని ఈ చట్టం చెబుతోంది.ఈ చట్ట ప్రకారం పని ప్రదేశంలో మహిళలను ఉద్దేశించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అశ్లీల వ్యాఖ్యలు చేసినా, మహిళల ఆమోదం లేకుండా అనవసరంగా తాకినా, లైంగికవాంఛ తీర్చాలని ప్రాధేయపడినా లేదా డిమాండ్‌ చేసినా, మాటల ద్వారా లేదా చేతల ద్వారా లైంగిక ఉద్దేశాన్ని బయటపెట్టేలా ఎలాంటి చర్యలకు పాల్పడినా, మహిళలను వెంబడించినా, అశ్లీల చిత్రాలను వారికి చూపించినా, సెల్‌ఫోన్లు, ఈ–మెయిల్స్‌ ద్వారా వాటిని పంపినా అలాంటి చర్యలను నేరంగానే పరిగణించడం జరుగుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు జరిపిన విచారణలో నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. పని ప్రదేశంలో ఒక మహిళపై లైంగిక వేధింపులు జరిగినట్లుగా ఎవరు నిర్ధారించాలనే దానిపై కూడా ఈ చట్టం తగిన నిబంధనలను రూపొందించింది. పదిమంది కంటే ఎక్కువ మంది సిబ్బంది కలిగిన ప్రతి సంస్థా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి ఒక సీనియర్‌ మహిళా ఉద్యోగి నాయకత్వం వహించాలి. కమిటీలో సగానికి పైగా మహిళా సభ్యులే ఉండాలి. మహిళల కోసం పనిచేసే ఏదో ఒక ఎన్జీవో ప్రతినిధికి కూడా ఈ కమిటీలో సభ్యత్వం ఉండాలి. పదిమంది కంటే తక్కువ మంది సిబ్బంది ఉన్న సంస్థల్లో మహిళా ఉద్యోగులు ఎవరైనా లైంగిక వేధింపులకు గురైనట్లయితే, వారు జిల్లా స్థాయి కమిటీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులపై కమిటీలు విచారణ జరిపి అవి నిజమో, కాదో నిర్ధారిస్తాయి. ఒకవేళ ఫిర్యాదు నిజమేనని విచారణలో రుజువైతే అంతర్గతంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేక పోలీసులకు ఫిర్యాదు చేయాలా అనే విషయాన్ని కూడా ఈ కమిటీలే నిర్ణయిస్తాయి. అలాగే, అబద్ధపు ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఈ కమిటీలకే ఉంటుంది.

మహిళా పాత్రికేయులకు బాసటగా ‘సిస్టర్‌హుడ్‌’ ఉద్యమం
సోషల్‌ మీడియాలో ‘మీ టూ’కు తోడుగా ‘సిస్టర్‌హుడ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం మొదలైంది. మహిళా పాత్రికేయులకు బాసటగా రుతుపర్ణ ఛటర్జీ అనే పాత్రికేయురాలు ‘ట్విట్టర్‌’ వేదికగా ‘సిస్టర్‌హుడ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం ప్రారంభించారు. ‘సిస్టర్‌హుడ్‌’ క్యాంపెయిన్‌ ద్వారా తన సమస్యకు పరిష్కారం దొరికిందని దీప్‌శిఖ అనే పాత్రికేయురాలు వెల్లడించారు. వేధింపుల సమస్యల నుంచి గట్టెక్కడానికి తగిన అనుభవజ్ఞుల సలహాలు ‘సిస్టర్‌హుడ్‌’ క్యాంపెయిన్‌లో లభిస్తున్నాయని, ఇది మహిళా పాత్రికేయులకు చాలా ఉపయోగకరంగా ఉంటోందని రాజేశ్వరీ గణేశన్‌ అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ చెబుతున్నారు.

మీ టూ కంటే ముందే...
సోషల్‌ మీడియా అందుబాటులో లేని కాలంలోనే, ‘మీ టూ’ ఉద్యమం ఏమిటో తెలియని కాలంలోనే చాలామంది ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. పాప్‌ ప్రపంచానికి తిరుగులేని రారాజుగా చలామణీ అయిన మైకేల్‌ జాక్సన్‌ ఒక పదమూడేళ్ల బాలుడిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ 1993లో ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆ బాలుడి తల్లి స్వయంగా మైకేల్‌ జాక్సన్‌కు వ్యతిరేకంగా మీడియాకెక్కింది. బాలుడి కుటుంబానికి ఆర్థిక పరిహారం చెల్లించిన మైకేల్‌ జాక్సన్‌ ఆ వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నాడు. బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ ఒక అత్యాచారం కేసులో 1992లో దోషిగా తేలి, జైలు శిక్ష అనుభవించాడు. ఇంగ్లిష్‌ సంగీతకారుడు గ్యారీ గ్లిట్టర్‌ బాలలపై అఘాయిత్యాలు, చైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసుల్లో 1999, 2006 సంవత్సరాల్లో జైలు శిక్ష పొందాడు. హాలీవుడ్‌ నటుడు జెఫ్రీ జోన్స్‌కు చైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. 

సోషల్‌ మీడియా పెద్దగా పరిచయం లేని రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల కిందట పంజాబ్‌ మాజీ డీజీపీ కేపీఎస్‌ గిల్‌ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారు. రూపన్‌దేవల్‌ బజాజ్‌ అనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె సాగించిన న్యాయపోరాట ఫలితంగా గిల్‌కు శిక్ష పడింది. ఇన్ఫోసిస్‌ డైరెక్టర్లలో ఒకరైన ఫణీష్‌మూర్తి 2002లో లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తనపై ఫణీష్‌మూర్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన వద్ద ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శిగా పనిచేసే మహిళ ఫిర్యాదు చేశారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఫణీష్‌మూర్తి ఆమెకు 30 లక్షల డాలర్లు (రూ.22 కోట్లు) పరిహారంగా చెల్లించి, వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నారు. మీడియా రంగంలో సంచలన పాత్రికేయుడిగా పేరుపొందిన ‘తెహల్కా’ వ్యవస్థాపకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ లైంగికదాడి కేసులో న్యాయవిచారణ ఎదుర్కొంటున్నారు. తెహల్కాలోనే పనిచేసే ఒక మహిళా ఉద్యోగి 2013లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లెక్కలేనంతగా జరుగుతున్న సంఘటనల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వివిధ రంగాల్లో ఇలాంటి వివాదాలు చాలానే ఉంటున్నా, చాలామంది ప్రముఖుల పేర్లు వార్తాకథనాల్లో బయటకు వస్తున్నా,  వారికి శిక్షలు పడ్డ సందర్భాలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.

వేధింపులు ఈనాటివి కావు
మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఈనాటివి కావు. నాగరికత మొదలైన నాటి నుంచే మహిళలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. మహిళలపై అణచివేతకు ఫలితంగానే మాతృస్వామ్య వ్యవస్థ అంతరించి, పితృస్వామ్య వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించి మన పురాణాల్లోనే కొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడే వారిని ఇప్పటి ఆధునిక ప్రసారసాధనాలు సైతం కీచకుడితో పోలుస్తుంటాయి. ఇంతకూ కీచకుడికి ఎందుకు అంతటి బరితెగింపు, బలుపు అంటారా..? కీచకుడు స్వయంగా ఏ రాజ్యానికీ రాజు కాడు.మత్స్య దేశాన్ని ఏలే విరాటరాజుకు బావమరిది. అమిత బలసంపన్నుడు. ‘సింహబలుడు’ అనేది అతగాడి ముద్దుపేరు. అంతటి బలవంతుడు బావమరిది అయినందుకు సంబరపడ్డ విరాటరాజు అతగాడికి సర్వసేనాధిపతిగా పట్టంకట్టాడు. కీచకుడు సర్వసేనాని అయిన తర్వాత విరాటరాజు కేవలం ఉత్సవవిగ్రహంగా మాత్రమే మిగిలాడు. రాజ్యంలో కీచకుడే పెత్తనం చలాయించేవాడు. కంటికి నదరుగా కనిపించే స్త్రీలను చెరచడం అతగాడికి ఆటవిడుపుగా ఉండేది. విరాటరాజ్యంలో పరిస్థితులు ఇలా ఉన్న రోజుల్లోనే పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండవులు మారువేషాల్లో అతడి పంచన చేరుతారు.రకరకాల ఉద్యోగాల్లో కుదురుకుంటారు. విరాటుని భార్య సుధేష్ణ వద్ద ద్రౌపది ‘సైరంధ్రి’గా కుదురుకుంటుంది. ఆమెపై కన్నేసిన కీచకుడు ఆమెను లోబరచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు.నిండు సభ వరకు ఆమెను వెంటాడతాడు. ద్రౌపదిని తరుముతూ కీచకుడు సభలోకి రావడం చూసి వలలుడి పేరుతో వంటవాడిగా ఉన్న భీముడు ఆగ్రహోదగ్రుడవుతాడు. సభలో అతడిని ఏమీ చేయలేక, ద్రౌపదితో కలసి ఉపాయం పన్నుతాడు. కీచకుడిని రాత్రివేళ నర్తనశాలకు రప్పించి, అతడిని అంతం చేస్తాడు. ‘మహాభారతం’ పుణ్యాన మహిళలను వెంటాడి వేధించే దుర్మార్గులకు ‘కీచకుడు’ పర్యాయపదంగా మారిపోయాడు. అలాగని పురాణాల్లో కీచకుడొక్కడే మహిళల పాలిటి దుర్మార్గుడనుకోవడానికి వీల్లేదు. 

దుర్యోధనుడి ప్రోద్బలంతో ద్రౌపదిని నిండుసభలోకి జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి, ఆమెను వివస్త్రను చేయడానికి ప్రయత్నించిన దుశ్శాసనుడు సైతం కీచకుడికి ఏమీ తీసిపోడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నకాలంలో వారు ఉండే పర్ణశాలలో ఎవరూ లేనప్పుడు చొరబడిన సైంధవుడు ద్రౌపదిపై అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. సైంధవుడి దురాగతాన్ని దూరం నుంచి గమనించిన భీముడు ఒక్క ఉదుటన అక్కడకు చేరుకుని, వాడితో తలపడ్డాడు. అతడిని అక్కడికక్కడే చంపబోయిన భీముడిని ధర్మరాజు వారించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, అతడిని విడిచిపెడతారు. సైంధవుడి అసలుపేరు జయద్రథుడు. నూరుగురు కౌరవుల ఏకైక సోదరి దుస్సలకు భర్త. నిజానికి ద్రౌపది అతడికి వరుసకు సోదరి అవుతుంది. అయినా వావివరుసలు చూసుకోకుండా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డ నీచుడు అతడు. కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుడు భీముడి చేతిలోను, సైంధవుడు అర్జునుడి చేతిలోను మరణిస్తారు. మహిళలపై దారుణాలు సాగించిన పురాణపురుషుల్లో నరకాసురుడి గురించి తప్పక చెప్పుకోవాల్సిందే. ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించే నరకుడు తొలిరోజుల్లో మంచిగానే ఉండేవాడు. తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకునేవాడు. నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజించేవాడు. కొన్నాళ్లకు అతడికి పొరుగు రాజ్యమైన శోణితపురాన్ని ఏలే బాణాసురుడితో స్నేహం కుదిరింది. బాణాసురుడి దృష్టిలో స్త్రీ భోగవస్తువు మాత్రమే. మహిళలను తల్లిలా భావించడాన్ని అతడు హేళన చేసేవాడు. నరకుడు నెమ్మదిగా బాణుడి ప్రభావంలో పడ్డాడు. అమ్మవారి పూజలు నిలిపివేశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలపై దండెత్తి నచ్చిన యువతులందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి బంధించేవాడు. అలా పదహారువేల మంది రాకుమార్తెలను చెరబట్టాడు. చివరకు శ్రీకృష్ణుడి చేతిలో హతమయ్యాడు. 

మరిన్ని వార్తలు