అకాల దెయ్యం

13 May, 2018 01:17 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

అక్కంటే అతడికి ప్రాణం. పల్లె నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో ఎన్ని రకాల పళ్లు, కాయలు దొరుకుతాయో అవన్నీ బుట్టల్లో వేసుకుని వస్తాడు. బరువు అనుకోడు. అక్క, బావ, పిల్లలు తింటారు కదా అనుకుంటాడు.

ఆ మధ్యాహ్నం క్లైమేట్‌ ఒక్కసారిగా మారిపోయింది. మంచి ఎండ కాస్తున్న సమయంలో ముసురు పట్టేసింది. సాయంత్రానికి సన్నటి జల్లులు. రాత్రికి వర్షం.‘‘అకాల వర్షం’’ అన్నాడు రామ్మూర్తి..గొణుక్కున్నట్లుగా. ‘‘అంటే ఏంటి మామయ్యా?’’ అన్నాడు పండు. ‘‘ఎండాకాలం ఎండ కాస్తుంది. వర్షాకాలం వర్షం పడుతుంది. చలికాలం చలేస్తుంది. ఇది ఎండాకాలం కదా. అయినాగానీ వర్షం పడిందంటే.. అకాల వర్షం అన్నమాట’’.. చెప్పాడు రామ్మూర్తి. ‘‘అకాల వర్షం లాగా అకాల చలి, అకాల ఎండ కూడా ఉంటాయా మామయ్యా?’’.. మళ్లీ ఇంకో ప్రశ్న వేశాడు పండు. రామ్మూర్తి నవ్వాడు. ‘‘కాలం కాని సమయంలో ఏది వచ్చినా అది అకాలమే’’ అన్నాడు. ఆ మాట పిల్లలిద్దరికీ అర్థం అయీ కానట్లుగా ఉంది. దాన్ని వదిలేసి మామయ్యను  కథ చెప్పమని అడిగారు. పండు, వాడి తమ్ముడు ఆ మామయ్య ఎప్పుడు ఊర్నుంచి వచ్చినా, మళ్లీ ఆయన ఊరు వెళ్లేవరకు ఆయన చుట్టూనే తిరుగుతుంటారు. ఎప్పుడో గాని అక్కను చూడ్డానికి రాడు రామ్మూర్తి. ‘వచ్చిపోరా’ అని అక్క అడగాల్సిందే గానీ తనకై తను రాడు. పల్లెలో ఉంటాడు. పల్లె పనుల్లో ఉంటాడు. అక్కంటే అతడికి ప్రాణం. పల్లె నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో ఎన్ని రకాల పళ్లు, కాయలు దొరుకుతాయో అవన్నీ బుట్టల్లో వేసుకుని వస్తాడు. బరువు అనుకోడు. అక్క, బావ, పిల్లలు తింటారు కదా అనుకుంటాడు. 

‘‘కథ చెప్పు మామయ్యా’’ మళ్లీ అడిగారు పిల్లలు. ‘‘ఏం కథ చెప్పన్రా?’’ అన్నాడు రామ్మూర్తి. ‘‘మామయ్యా.. మామయ్యా.. ఇప్పుడు అకాల వర్షం పడుతోంది కదా. అందుకని అకాల దెయ్యం కథ చెప్పు మామయ్యా..’’ అన్నాడు పండు తమ్ముడు.. మామయ్య చేతిని పట్టుకుని కుదిపేస్తూ. రామ్మూర్తికి నవ్వొచ్చింది. వాడు కనుక అకాల దెయ్యం అని అనకపోయి ఉంటే, జీవితంలో తనకు ఏనాటికీ అకాల దెయ్యం అనే మాటే స్ఫురించేది కాదు. ఊహకు అందని విధంగా భలే మాట్లాడతారు పిల్లలు అనుకున్నాడు రామ్మూర్తి. ‘‘ఓరేయ్‌.. అకాల దెయ్యాలు ఉండవురా. సమ్మర్‌లో, రెయినీ సీజన్‌లో,  వింటర్‌లో.. అన్ని కాలాల్లో దెయ్యాలు ఉంటాయి’’ అని తమ్ముడి అజ్ఞానానికి పెద్దగా నవ్వి, మామయ్య వైపు చూసి.. ‘‘కదా మామయ్యా..’’ అన్నాడు పండు. రామ్మూర్తి మాట్లాడలేదు. గది బయటికి దీక్షగా చూస్తున్నాడు. ఆ చీకట్లో  నీడలేవో కదులుతున్నాయి! వీళ్లున్న గదిలో కూడా ఏమంత వెలుతురు లేదు. ఎప్పుడు వేశారో గానీ పిల్లలు మెయిన్‌ ౖలైట్‌ ఆఫ్‌ చేసి, బెడ్‌ లైట్‌ వేశారు. ఆ మాత్రం ఎఫెక్ట్‌ ఉంటే గానీ దెయ్యం కథను వాళ్లు ఎంజాయ్‌ చెయ్యలేరు!‘‘చెప్పు మామయ్యా.. ’’ మళ్లీ మామయ్యను పట్టుకుని ఊపేశారు పండు, వాడి తమ్ముడు. రామ్మూర్తి అప్పటికప్పుడు దెయ్యం కథల్ని సృష్టించగలడు. కానీ ఆ రోజు ఎందుకనో సృష్టించలేకపోయాడు. గదిలో ఓ మూల ఊర్నుంచి తను తెచ్చిన మామిడి పండ్ల బుట్ట కనిపించింది. అక్కే వాటిని మగ్గబెట్టడానికి అక్కడ ఉంచింది. వాటిని చూడగానే ఎక్కడో తను విన్న దెయ్యం కథ గుర్తుకొచ్చింది రామ్మూర్తికి. చెప్పడం మొదలుపెట్టాడు. 

ఇద్దరు పిల్లలు తోటలోకి వెళ్లి దొంగతనంగా మామిడి కాయలు కోస్తారు. వాటిని సంచిలో వేసుకుంటారు. మరి వాటిని రహస్యంగా పంచుకోవాలి కదా. ఎక్కడా చోటు దొరకదు. దగ్గర్లో ఒక పెద్ద గేటు కనిపిస్తుంది. దాన్నెక్కి అవతలి వైపుకు దూకేస్తారు. అది శ్మశానం! దూకేటప్పుడు సంచిలోంచి రెండు మామిడి కాయలు సంచీలోంచి ఇవతలే పడిపోతాయి. వాటిని అలాగే వదిలేస్తారు. శ్మశానంలో ఎవరికీ కనిపించని చోట కూర్చొని.. ‘నీకొకటి, నాకొకటీ.. నీకొకటి, నాకొకటి..’ అని పంచుకుంటూ ఉంటారు. అప్పుడే ఓ తాగుబోతు శ్మశానం గేటు పక్కగా వెళుతూ వీళ్ల మాటలు విని ఆగిపోతాడు. మనుషులు కనపడరు. మాటలు వినబడుతుంటాయి! భయం వేసి వెంటనే చర్చి ఫాదర్‌ దగ్గరికి పరుగులు తీస్తాడు. ‘‘ఫాదర్‌.. శ్మశానంలో దెయ్యాలు శవాల్ని పంచుకుంటున్నాయి’’ అని చెప్తాడు. ‘‘నువ్వు చూశావా?’’ అని అడుగుతాడు ఫాదర్‌.  ‘‘ఈ చెవులతో విన్నాను ఫాదర్‌.. ‘నీకొకటి, నాకొకటి’ అని పంచుకుంటున్నాయి’’ అని చెబుతాడు తాగుబోతు. 

ఫాదర్‌ వెంటనే.. ‘సరే.. చూద్దాం పద’ అని బయల్దేరుతాడు. ఇంతవరకు చెప్పి కథను ఆపేశాడు రామ్మూర్తి. పిల్లలు నిద్రపోతే రేపటికి ఒక కథ మిగిలి ఉంటుందని అతడి ఆలోచన. ‘‘చెప్పు మామయ్యా.. తర్వాత ఏమైంది?’’ అన్నారు పిల్లలిద్దరూ. కథను కంటిన్యూ చేయక తప్పలేదు రామ్మూర్తికి. ఫాదర్, తాగుబోతు వెళ్లి శ్మశానం గేటు బయట నిలుచుంటారు. లోపల్నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ‘నీకొకటి నాకొకటి’ అని!ఆ తర్వాత సడెన్‌గా కొన్ని క్షణాలు మాటలు ఆగిపోతాయి. ఆ వెంటనే.. ‘‘మరి గేటు దగ్గర ఉన్న ఆ రెండిటి సంగతేంటి?’’ అనే మాట వినిపిస్తుంది. అంతే.. ఫాదర్, తాగుబోతు ఇద్దరూ ఒక్కసారిగా భయంతో ‘మేమింకా చావలేదు నాయనోయ్‌’ అనుకుంటూ.. అక్కణ్నుంచి పరుగుతీస్తారు..  అని కథను ముగించాడు రామ్మూర్తి. ‘‘ఇది దెయ్యం కథ కాదు మామయ్యా. జోకు. నా వాట్సాప్‌లో కూడా ఉంది చూడు’’ అంటూ చూపించబోయాడు పండు. ‘‘దెయ్యం కథలన్నీ జోకులేరా’’ అన్నాడు రామ్మూర్తి.‘‘అయితే నిజంగా దెయ్యాలు లేవా మామయ్యా..’’ అడిగాడు పండు, నిరుత్సాహంగా.  వాడిని మరీ అంతగా నిరుత్సాహ పడనివ్వదలచుకోలేదు రామ్మూర్తి. ‘‘ఉన్నాయనుకుంటే ఉన్నట్లు. లేవనుకుంటే లేనట్లు. ఇందాకట్నుంచీ ఆ చీకట్లో నాకేదో కనిపిస్తోంది. మీకేమైనా కనిపిస్తోందా?’’ అన్నాడు రామ్మూర్తి.పిల్లలిద్దరూ గబుక్కున మామయ్య డొక్కల్లో ముఖం దాచుకున్నారు.  రామ్మూర్తి నవ్వుకున్నాడు. ఏ కాలంలోనైనా మనిషిలోని భయమే అకాల దెయ్యం అని పిల్లలకు చెప్పాలనుకున్నాడు.
- మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు