అబ్రస్‌

28 Oct, 2018 01:33 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

ఆదివారం ఉదయం. సమయం ఏడున్నర.  ఆనందరావు గారింట్లో నుండి పెద్ద కేక. ఆ ఇంటి పనిమనిషి మంగది. సమాచారం కొద్ది క్షణాల్లోనే దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. 

‘‘గురివిందగింజ అంటే ఎలా ఉంటుంది నాన్నా?’’  అడిగాడు హన్సాల్, ఇన్‌స్పెక్టర్‌  విహారి ఏకైక పుత్రుడు. ‘‘గురివింద గింజ అంటే, ఒకవైపు ముదురు ఎరుపు రంగులో, మరొక వైపు తక్కువ భాగంలో నలుపు రంగు.......’’  చెప్పాడు విహారి. హన్సాల్‌ అనుమానం తీరిన కొద్దిసేపటికే విహారి మొబైల్‌ మోగింది. మరుక్షణంలో  విహారి జీప్‌ ఆనందరావు ఇంటివైపు పరుగు తీసింది. అనాథ అయిన ఆనందరావు  ఒక బంగారు షాపులో పనివాడిగా పని చేస్తూ, అంచెలంచెలుగా ఎదిగి ఒక మోస్తరు జ్యూయెల్లర్స్‌ షాప్‌ యజమాని అయ్యాడు.  ఆనందరావు ఇప్పుడు మంచం మీద విగత జీవుడై ఉన్నాడు.మృతదేహాన్ని మొదట చూసింది మంగ. ఆ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తోంది. నమ్మకమైన మనిషి. యజమాని ఇంటికి వెనుక వైపు, రేకుల షెడ్లోనే ఉంటుంది. ఉదయాన్నే రావుగారి గది ఊడ్వటానికని వచ్చి, ఆనందరావుని చూసి అనుమానం వచ్చి కదిపింది. భయంతో అరచింది.  విహారిని  గదిని నిశితంగా పరిశీలించాడు.  సహజంగా మరణించినట్టే కనపడుతోంది. పెనుగులాట జరిగిన దాఖలాలు గాని, వంటి మీద గాయాలూ లేవు.అయితే గుండెపోటు వచ్చి ఉండాలి. లేదా? ?..... విహారికి ఇంట్లో మంగ తప్ప వేరే ఎవరూ కనిపించలేదు. ప్రాథమిక పరిశీలన పూర్తయ్యేసరికి ఉదయం 12 గంటలు దాటింది. ఆ ఇంటికొచ్చిన వారిని కలియచూశాడు. సాధారణంగా జరిగింది హత్య అయితే, ఎక్కువ సందర్భాలలో హంతకుడు ఘటనా స్థలానికి వచ్చే అవకాశాలు ఎక్కువ.  తోటి బంగారు షాపు యజమానులు, పనివాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు విహారి దృష్టిని ఆకర్షించింది ఆ టౌన్‌లో ఉన్న అనా««థాశ్రమం నుండి ఎక్కువ మంది పిల్లలు విషణ్ణ వదనాలతో అక్కడ ఉండటం. వాకబు చేస్తే ఆనందరావు పెరిగింది ఆ ఆశ్రమంలోనే అని తెలిసింది. ఆశ్రమ నిర్వహకుడు కూడా వచ్చాడు.

ప్రాథమిక విచారణలో ఎక్కడా అనుమానాస్పదమైన విషయాలు కనపడలేదు. ఆనందరావు భార్య పేరు సుందరి. మూడు రోజుల కింద సుందరి   పుట్టింటికి వెళ్లింది. ఇలా చిన్నా చితకా విషయాలు తప్ప ఎటువంటి క్లూ దొరకలేదు.క్లూస్‌ టీం వచ్చింది. వీలైన అన్ని చోట్లా వేలిముద్రలు సేకరించారు. క్రైమ్‌ సీన్‌ మ్యాపింగ్, పరిధి నిర్ణయం జరిగింది.

డెడ్‌ బాడీని పోస్ట్‌మార్టం కొరకు తరలించడానికి సిద్ధమవుతుండగా సుందరి, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు వచ్చారు. సుందరితో విడిగా మాట్లాడాడు విహారి. వారు ఎవరి మీదా అనుమానం వ్యక్తం చేయలేదు. వెనుకా ముందు ఎవరూ లేకున్నా వృద్ధిలోకొస్తున్నాడని, ఆనందరావుకి సుందరినిచ్చి పెళ్లి చేశారు. ఆరేళ్లు దాటినా పిల్లలు లేరు.  తీరా ఇప్పుడు ఈ ఘోరం జరిగిపోయింది. పోస్ట్‌మార్టం కూడా అవసరం లేదని, మా అమ్మాయి తలరాత ఇంతే అని సరిపెట్టుకుంటామని విలపించారు.  ‘‘మా డ్యూటీ ప్రకారం మేం నడుచుకోవాలని’’ బదులిస్తూ, తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేశాడు విహారి. క్రైమ్‌  సీన్‌ డాక్యుమెంటేషన్‌ కూడా పూర్తయింది. ఇంటికి సీల్‌ వేశారు. సాయంత్రానికి పోస్ట్‌మార్టం అయింది. మృతదేహాన్ని సుందరి వాళ్ళూరికే తీసుకెళ్లారు.ఇది సహజ మరణమే, కేస్‌ క్లోజ్‌ అవుతుందనుకున్న విహారి అంచనా తలకిందులైంది. విషప్రయోగం వల్ల ఆనందరావు చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టు తేల్చింది. అతని మరణం ముందురోజు(శనివారం) రాత్రి 11 గంటలకు జరిగి ఉండొచ్చనేది దాని సారాంశం. విహారి వద్దనున్న సమాచారం ప్రకారం ఆనందరావు భార్య సుందరి అంతకు మూడు రోజుల కిందనే పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అప్పుడప్పుడు అలా వెళ్ళడం మామూలే అనేది మంగ తెలిపిన విషయం. మరి విషప్రయోగం ఎవరు చేసి ఉంటారు? ఉంటే గింటే ఆ అవకాశం మంగకే ఉంది. ఒక వేళ ఆమే చేసి ఉంటే అందువల్ల మంగకేమి లాభం? ఎటూ తేల్చుకోలేక పోయాడు. ఆనందరావుకున్న రోజువారీ అలవాట్లను కూడా మంగ ద్వారా సేకరించాడు. రోజూ రాత్రి ఇంటికి రాగానే రెండు పెగ్గులు మందుతాగడం తప్ప ఇతర అలవాట్లేమీ లేవు. పలు దఫాల విచారణ అనంతరం మంగను నిర్దోషిగా నిర్థారించుకున్నాడు విహారి. ఈ సంఘటనలో క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినా  ఏం లాభం లేదనిపిస్తోంది.

విహారి మరోసారి ఆనందరావు ఇంటికి చేరుకున్నాడు. క్రైమ్‌ సీన్‌ అలాగే ఉంది. ఇల్లంతా శోధించాడు. అల్మరాలో చాలా నగల పెట్టెలు ఉన్నాయి. కెంపులు, పగడాలు, ముత్యాలు అలాగే రకరకాల పూసలతో చుట్టబడిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. నగల వ్యాపారి కాబట్టి అందులో విచిత్రమేమీ అనిపించలేదు. ఎందుకైనా మంచిదని వాటిని ఫొటోస్‌ తీయించాడు. అందులో ఒక పూసలు చుట్టి ఉన్న నగ అతని దృష్టిని ఆకర్షించింది. రెండు వైపులా సమాన సంఖ్యలో పూసలు లేకపోవడమూ విహారి దృష్టిని దాటిపోలేదు. ఒక పూసను జాగ్రత్తగా సేకరించాడు. ఒక షెల్ఫ్‌లో అతను రోజూ తాగే ఆల్కహాలు సీసాలు రెండు కనపడ్డాయి. ఖరీదైన విదేశీ మద్యం. అందులో ఒకటి సీల్‌ తీయనిది. విహారికి అనుమానం వచ్చింది. ఇంతలో మరో విషయం గుర్తొచ్చింది. ఫ్రిజ్‌ తెరచి చూశాడు. ఏవీ అనుమానాస్పదంగా కనిపించలేదు. ఫ్రిజ్‌ మీద ఖాళీ ఐస్‌ క్యూబ్‌ ట్రే పెట్టి ఉంది.  వెనుకకు మళ్లిన వాడల్లా ఆగి, ఆ ట్రేను కూడా ఒక ఎవిడెన్స్‌గా తీసుకున్నాడు. సేకరించిన వాటిని ల్యాబ్‌కు పంపాడు. పంచనామా అనంతరం ఆభరణాలను కూడా సుందరికి అప్పగించాడు. కొద్దిరోజుల్లోనే ఇల్లు కూడా సుందరికి హ్యాండోవర్‌ చేశారు.కేసు ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు. సమాజంలో మంచి పేరు ఉన్నవాడు కావడంతో పై అధికారుల నుండి కేసు పరిష్కారానికి ఒత్తిడి పెరిగింది. ఆలోచనలో ఉన్న విహారికి  ఉన్నట్టుండి అనాథాశ్రమం గుర్తొచ్చింది. అరగంటలో అక్కడున్నాడు. ఆశ్రమ నిర్వహణకు ఒక స్థిర ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పిన ఆనందరావు ఈ లోపులోనే మరణించడాన్ని ఆశ్రమ నిర్వాహకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆనందరావు బావమరిది శ్యాంసుందర్‌కి ఈ విషయం గుర్తు చేస్తే, అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని సూచించిన సంగతి బయటికి వచ్చింది.

విహారి, ఆనందరావు షాపులోకి అడుగుపెట్టాడు. సుందరి, ఆమె తమ్ముడు శ్యాంసుందర్‌  షాపు నిర్వహణ చూసుకుంటున్నారు. సుందరిని యోగక్షేమాలు అడిగాడు. శ్యాంసుందర్‌  ఉండబట్టి గానీ, లేకపోతే ఈ వ్యాపారం మూతపడేదని, తమ్ముడిని చూపిస్తూ చెప్పింది. ఆమె మాటలు వింటున్న విహారి చూపు, సుందరి వేసుకున్న నగపై పడింది. అది పూస సేకరించిన నగ. నగకు అన్ని పూసలు ఉన్నాయి.అనుమానం వచ్చిన విహారి, ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ‘‘మీతో ప్రైవేటుగా మాట్లాడాలి’’ అన్నాడు.     ఇది విన్న శ్యాంసుందర్‌ ‘‘ అసలే బావ పోయిన బాధలో ఉంది. మీకు కావలసిన వివరాలు నేను చెబుతాను..’’ అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు.  విహారి సున్నితంగా తిరస్కరించి, సుందరిని ప్రక్క గదిలోకి తీసుకెళ్ళాడు. వారిద్దరూ అర గంట తరువాత బయటికి వచ్చారు. విహారి జీప్‌ వెళ్లిపోయింది.ఉదయాన్నే స్టేషన్‌కు వచ్చేసరికి విహారి ఎదురుచూస్తున్న రిపోర్టులు ఆఫీస్‌లో టేబుల్‌ మీద ఉన్నాయి. వాటిని చూసిన విహారి పెదాలపై నవ్వు చోటు చేసుకుంది. అదే రోజు విహారి ఆనందరావు అత్తగారి ఊరు వెళ్ళాడు. అక్కడ, తిరిగి వచ్చి టౌన్‌లోనూ అవసరమైన అన్ని వివరాలు సేకరించాడు.  విహారి ఊహకు ఆధారం దొరికింది. మరుసటి గంటలోనే ఆనందరావు ఇంట్లో, సుందరి తమ్ముడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఫార్మకొగ్నసీ స్పెషలైజేషన్‌తో పీజీ చేసిన శ్యాంసుందర్‌కి ఎక్కడా ఉద్యోగం దొరకక ఖాళీగా ఉన్నాడు. చిన్నా చితకా ఉద్యోగాలు చేయడం కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం కోసం చూస్తున్నాడు. పెళ్లీడు వచ్చినా ఎటూ స్థిరపడక పోవడంతో ఇంట్లోనూ ఈసడింపులు ఎక్కువయ్యాయి.మరోవైపు పిల్లలు లేని ఆనందరావు ఆస్తిలో ఎక్కువ మొత్తాన్ని అనా«థ శరణాలయానికి,  కేటాయించే ఉద్దేశంలో ఉన్న సంగతి శ్యాంసుందర్‌ పసిగట్టాడు. ఆనందరావు పట్టుదల తెలిసిన వాడు కావడంతో, బావను అడ్డు తొలగిస్తే అతని వ్యాపారం, ఆస్తి తన చేతిలోకి వస్తాయని ఆలోచించాడు. సుందరికి ఆభరణాలు అంటే ఇష్టం. శ్యాంసుందర్‌ ఒక నెల క్రితం పూసలతో చేసిన ఒక నగను  అక్కకు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే కొన్ని  పూసలు తక్కువ  ఉండటం గమనించింది. తమ్ముడిని అడిగితే, తెగిపోయి ఉంటాయనీ,  సూటయ్యే  పూసలు దొరికినప్పుడు రిపేర్‌ చేయిస్తానని చెప్పాడు. కానీ నిజానికి ఆ పూసలను కావాలని తొలగించి చూర్ణం చేసి దగ్గర పెట్టుకున్నాడు.అనుకున్న రోజు రాగానే, సుందరి వద్దకు వచ్చి ఇంటికి రమ్మని కోరాడు. తరచుగా పుట్టింటికి వెళ్ళడం సాధారణంగా జరిగేదే కాబట్టి సుందరికి అనుమానం రాలేదు. సుందరి రెడీ అవుతున్న సమయంలోనే ఫ్రిజ్‌లో ఉన్న ట్రేని తీసి అందులో ఒక వరుసలో తన వద్దనున్న పౌడర్‌ని చల్లి నీళ్ళు పోసి య«థావిధిగా ఫ్రిజ్‌లో పెట్టేశాడు. ఇందుకోసం మంగ ఉండని సమయాన్ని ఎంచుకున్నాడు.ప్రతి రోజూ, ఐసు ముక్కలతో మందు తాగే ఆనందరావు అలవాటు తెలిసిన శ్యాంసుందర్‌ లెక్క ప్రకారం ఆ ఐస్‌ ముక్కలు అయిపోయే సరికి ఆనందరావు మరణం సంభవిస్తుంది. అది ఏ రోజైనా కావచ్చు. మూడో రోజులకి ఆ ట్రేలోని పౌడర్‌ కలిపిన ఐసు ముక్కలు కలుపుకొని ఆల్కహాలు సేవించాడు. అదే రాత్రి మరణించాడు.బావ మరణించిన రోజూ కూడా, శ్యాంసుందర్‌ పరిస్థితి తెలుసుకోవడానికే అక్కతో వచ్చాడు. కోర్టులో విచారణ తుది దశకు చేరుకుంది.పూసలు తక్కువగా ఉన్న  నగ ఫొటో, ఆ పూసల తాలూకూ ఎనాలసిస్‌ రిపోర్టు, ఐస్‌ ట్రే ఎక్స్‌ట్రాక్ట్స్‌ రిపోర్ట్, శ్యాంసుందర్‌ తాలూకూ విద్యార్హతల పత్రాలు, సుందరిని ఇంటికి తీసుకెళ్లిన రోజు సిసి టీవి ఫుటేజ్, సుందరి, ఆశ్రమ నిర్వహకుల సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టబడ్డాయి.  ఆనందరావును హత్య చేసినందుకుగాను శ్యాంసుందర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది.

విహారి వస్తూనే ‘‘నీ వల్ల ఒక కేసు సాల్వ్‌ అయిందిరా’’ అంటూ కొడుకు హన్సాల్‌ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. సాక్ష్యంగా ఉన్న నగ గురివింద గింజలతో ఉన్న తీగ అల్లకం. ‘‘గురివింద గింజల శాస్త్రీయ నామం అబ్రస్‌ ప్రికాటోరియస్‌. దీనిని ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడతారు. వీటిలో ఉండే అబ్రస్‌ అత్యంత విషపూరితం. ఒక గింజను పూర్తిగా సేవిస్తే, మనిషి మరణం త«థ్యం. డెబ్బై కేజీల మనిషి చనిపోవడానికి ఒక గ్రాము కన్నా తక్కువ అబ్రస్‌ చాలు.’’ వికీపీడియాలో గురువింద గింజల గురించి శోధించిన సమాచారం విహారి కళ్ళముందు అలా..అలా... కదిలిపోయింది. ఒకవేళ నేరస్తుడు నగనుండి కాకుండా, విడిగా గింజలను సేకరించి ఈ హత్య చేసి ఉంటే.... ఏం జరిగి ఉండేది విహారి ఊహకు అందలేదు.‘నేరస్తుడు క్లూ వదలకుండా నేరం చేయలేడు’ క్రిమినాలజీలో ముఖ్య సూత్రం తలపుకి వచ్చి, ఇలా కాకపోతే మరో విధంగానైనా పట్టుబడేవాడు అనుకుంటూ, ఎదురుగా ఉన్న ఫైల్‌ అందుకున్నాడు.
 - బి. హన్మంతరావు 

>
మరిన్ని వార్తలు