విశ్వ వినాయకమ్‌

9 Sep, 2018 00:14 IST|Sakshi

కవర్‌ స్టోరీ

సెప్టెంబర్‌ 13 వినాయకచవితి

సనాతన సంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేపట్టినా, ఏ యజ్ఞ యాగాదులు చేపట్టినా వినాయకుడికే తొలిపూజ చేసి, ఆ తర్వాత మిగిలిన క్రతువులను కొనసాగించడం ఆనవాయితీ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ప్రమథ గణాలకు ఆధిపత్యం పొందినందున గణపతిగా, విఘ్నాలను నివారించే దేవుడు కనుక విఘ్నేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. పార్వతి తయారు చేసిన వినాయకుడు శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోగా, ఏనుగు తలను తగిలించి తిరిగి బతికించినందున గజాననుడిగా, ఒకే దంతం మిగిలినందున ఏకదంతుడిగా,  మోదకాలంటే ఇష్టం కలిగిన వాడు కావడంతో మోదకప్రియుడిగా, పెద్ద ఉదరం కలిగి ఉన్నందున లంబోదరుడిగా, మూషికాన్ని వాహనం చేసుకున్నందున మూషిక వాహనుడిగా, స్కందుడిగా పేరుపొందిన కుమారస్వామికి అన్న అయినందున స్కందాగ్రజుడిగా వినాయకుడు వినుతికెక్కాడు. వినాయకుడికి గల సహస్రనామాలు, ఆయన గురించిన ప్రసిద్ధ పురాణగాథలు వినాయక వ్రతకల్పంలో జనానికి తెలిసినవే. వినాయకుడి గురించిన కొన్ని అరుదైన అపురూపమైన విశేషాలు...

పార్వతీదేవి స్నానం చేస్తుండగా నలుగుపిండి ముద్దతో వినాయకుడిని రూపొందించి, అతడికి ప్రాణం పోసిందనే కథనం అందరికీ తెలిసిందే. బాల వినాయకుడిని కావలి ఉంచగా, అతడు బయటి నుంచి కైలాసానికి తిరిగి వచ్చిన శివుడిని అడ్డగించి తలపడటం, శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం, ఏనుగు తలను తగిలించి అతడిని బతికించడం కూడా దాదాపు అందరికీ తెలిసిన సంగతే. వినాయక వ్రతకల్పంలోని గాథ వినాయకుడి సృష్టి ఎలా జరిగిందో మాత్రమే చెబుతుంది. అయితే, పార్వతీ పరమేశ్వరులు గణపతిని ఎందుకు సృష్టించారనే దానికి సంబంధించిన గాథ స్కాంద పురాణంలో ఉంది. ఇది వ్రతకల్పంలోని గాథకు కొంత భిన్నమైనది.

గణపతిని ఎందుకు సృష్టించారంటే..?
స్వర్గలోకం సకల భోగాలకు నిలయం. భూలోకంలో జీవితాంతం అలాంటి భోగాలను అనుభవించడం అసాధ్యం. జరామరణాలతో కూడిన మర్త్య జీవితం కంటే, స్వర్గాన్ని చేరి అమర సౌఖ్యాలను అనుభవిస్తేనే కదా సార్థకత అనుకున్న మానవులు ఘోర తపస్సులు ఆచరిస్తూ, తపః ఫలితంగా ఒక్కొక్కరే స్వర్గానికి వెళ్లసాగారు. స్వర్గంలో దేవతల కంటే మనుషులే ఎక్కువయ్యారు. స్వర్గంలో తమ ఆధిక్యత పెరగడంతో మానవులు ఏకంగా దేవతల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్వైరవిహారం చేయడం ప్రారంభించారు. మానవులంటేనే దేవతలు భయపడే పరిస్థితి దాపురించింది. మానవులకు భయపడుతూ బతకడం దుస్సహంగా ఉందని, వాళ్లను ఎలాగైనా నియంత్రించాలని స్వర్గంలోని దేవతలందరూ దేవేంద్రుడితో మొరపెట్టుకున్నారు. తపస్సులు సాగించి స్వర్గానికి వచ్చిన వాళ్లను ఎలా నియంత్రించాలో దిక్కుతోచని దేవేంద్రుడు నేరుగా కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి, వారిని పరిపరి విధాల స్తుతించాడు. ‘దేవేంద్రా! నీ రాకకు కారణమేమిటి?’ అని పరమేశ్వరుడు ప్రశ్నించగా, తన మొర వినిపించాడు.

‘పరమేశ్వరా! ఘోర తపస్సులు చేసి, తపః ఫలాల కారణంగా స్వర్గానికి చేరుకున్న మానవులు దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదేమని నిలదీసిన దేవతలను నానా రకాలుగా బాధిస్తున్నారు. వారి దాష్టీకాలకు స్వర్గంలో ప్రశాంతత లేకుండా పోయింది. మానవజాతి అంటేనే దేవతలు భయభ్రాంతులయ్యే పరిస్థితి దాపురించింది. మానవుల బెడద నుంచి మమ్మల్ని నీవే కాపాడాలి తండ్రీ!’ అని వేడుకున్నాడు. దేవేంద్రుడి మాటలు విన్న పరమేశ్వరుడు సాలోచనగా పార్వతీదేవి వైపు చూసి చిరునవ్వు చిందించాడు. అప్పుడు పార్వతీదేవి మట్టి తీసుకుని తన చేతులతో ఒక ఆకృతిని రూపొందించింది.ఏనుగు ముఖం, పెద్దబొజ్జ, భారీ శరీరం, నాలుగు చేతులు కలిగిన వింత ఆకారం ప్రాణం దాల్చి, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, పార్వతీదేవితో ఇలా అన్నాడు. ‘అమ్మా! నన్ను ఎందుకు సృష్టించారో చెబుతారా?’అందుకు పార్వతీ దేవి, ‘నాయనా! నీవల్ల నెరవేరవలసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లు. అక్కడ స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న మానవులకు విఘ్నాలు కలిగించు. ఈ బృహత్కార్యంలో నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా ఉంటారు’ అని బదులిచ్చింది. ప్రమథ గణాలకు అధిపతిగా తానే స్వయంగా గణేశుడికి అభిషేకం చేయించింది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన దేవతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గణేశునికి జయజయ ధ్వానాలతో ఆశీస్సులు పలికి, పుష్పవృష్టి కురిపించారు.

పరమేశ్వరుడు గణపతికి పరశువును, బ్రహ్మ తికాలజ్ఞతను, విష్ణువు బుద్ధిని, కుబేరుడు ఐశ్వర్యాన్ని , సూర్యుడు పరాక్రమాన్ని, చంద్రుడు కాంతిని, దేవేంద్రుడు సౌభాగ్యాన్ని, పార్వతీదేవి మోదకపాత్రను ఇచ్చారు. కుమారస్వామి మూషికాన్ని గణేశునికి వాహనంగా బహూకరించాడు. ఇలా దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చి, గణేశుని గణాధిపత్యాన్ని ఆమోదించడంతో అతడు అమిత బలశాలిగా మారి, పార్వతీదేవి అనుజ్ఞతో దేవతలంతా తనపై ఉంచిన కార్యభారాన్ని నెరవేర్చేందుకు భూలోకానికి పయనమయ్యాడు. స్వార్థబుద్ధులై స్వర్గప్రాప్తిని ఆశించే మానవులకు ప్రతి పనిలోనూ విఘ్నాలు కలిగించడం ప్రారంభించాడు. వినాయకుడు కల్పించిన విఘ్నాలను అధిగమించడం మానవులకు దుస్సాధ్యంగా మారింది. వినాయకుడి ప్రభావంతో స్వర్గలోకానికి వెళ్లే మానవుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.స్వర్గంలో తిరిగి ప్రశాంతత ఏర్పడింది. మానవుల్లో గణపతి పట్ల భయభక్తులు ఏర్పడ్డాయి. అందుకే ఏ పని మొదలుపెట్టినా, విఘ్నాలు తొలగించుకోవడం కోసం వినాయకుడికి తొలిపూజలు చేయడం ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో పూజించి వినాయకుడి అనుగ్రహం పొందిన వారు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని, ఆయనకు ఆగ్రహం కలిగిస్తే విఘ్నాలు తప్పవనే నమ్మకం బలపడింది. వినాయకుడు అవతరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక వ్రతం ఆచరించడం అప్పటి నుంచే మొదలైందని ప్రతీతి.

వినాయకుడు ఎలా ఏకదంతుడయ్యాడంటే..?
వినాయకుడికి గల గజముఖానికి మొదట్లో రెండు దంతాలూ ఉండేవట. పరశురాముడి గొడ్డలి దెబ్బ వల్ల ఒక దంతాన్ని పోగొట్టుకుని ఏకదంతుడయ్యాడట. అదెలాగంటే... కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరుశురాముడు పరమశివుడి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని అడ్డగించి, ‘ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడద’న్నాడు. ‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవ్వడివి‘ అంటూ పరుశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాటా మాటా పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్లు బైర్లుకమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడి పైకి విసిరాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీపరమేశ్వరులు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురోడుతున్న బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముడిని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటి ఆ కథ ముగిసినా, వినాయకుడు ఏకదంతుడిగా పేరుపొందాడు.

ప్రణవరూపుడు
వినాయకుడు ప్రణవరూపుడు. ప్రణవనాదమైన ఓంకారం ఆకారంలోనే వినాయకుడు కనిపిస్తాడు. దేవనాగరి లిపిలోని ఓంకారం ఆకారంలోనే చాలా వరకు పురాతన వినాయక విగ్రహాలు కనిపిస్తాయి. అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఉపపురాణాలలో వినాయకుని ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుని గురించిన విపులమైన కథనాలు గణేశ పురాణంలోను, ముద్గల పురాణంలోను కనిపిస్తాయి. ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి ఎనిమిది అవతారాలు ఉన్నాయి. అవి: వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు. ఈ ఎనిమిదింటిలోనూ ఐదు అవతారాలకు వినాయకుని వాహనం ఎలుక. వక్రతుండ అవతారానికి సింహం, వికటావతారానికి నెమలి, విఘ్నరాజ అవతారానికి శేషువు వాహనాలు. గణేశ పురాణం ప్రకారం వినాయకునికి నాలుగు అవతారాలు ఉన్నాయి. అవి: మహోటక అవతారం, మయూరేశ్వర అవతారం, ధూమ్రకేతు అవతారం, గజానన అవతారం. మహోటక అవతారానికి సింహం, మయూరేశ్వర అవతారానికి నెమలి, ధూమ్రకేతు అవతారానికి గుర్రం, గజానన అవతారానికి ఎలుక వాహనాలుగా ఉన్నట్లు గణేశ పురాణ కథనం. చారిత్రకంగా చూసుకుంటే తొలినాటి వినాయక శిల్పాలలో ఎక్కడా ఎలుక వాహనం కనిపించదు. ఏడో శతాబ్ది తర్వాతి నాటి శిల్పాలలో మాత్రమే వినాయకునితో పాటు ఎలుక వాహనం కనిపిస్తుంది. పురాణాల్లో చూసుకుంటే మత్స్య పురాణంలో వినాయకుని మూషిక వాహన ప్రస్తావన తొలిసారిగా కనిపిస్తుంది. ఎలుకను తామస ప్రవృత్తికి చిహ్నంగా భావిస్తారు. ఎలుకపై స్వారీ చేయడం ద్వారా వినాయకుడు మానవులలోని కామ క్రోధ లోభ మోహాది తామస ప్రవృత్తిని నియంత్రిస్తాడని ప్రతీతి.

వినాయకుని ముందు ఎందుకు గుంజీలు తీస్తారంటే..?
వినాయక వ్రతం ఆచరించిన వారు పూజ ముగించిన తర్వాత వినాయకుడి ముందు గుంజీలు తీయడం ఆచారంగా వస్తోంది. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు. బావగారైన శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు. సుదర్శనం, గద తదితర ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి, శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శనచక్రాన్ని తీసుకుని, అమాంతం అప్పడంలా నోట్లో వేసుకుని మింగేశాడు. శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో మరచానేమోనని సుదర్శనం కోసం వెదకడం ప్రారంభిస్తాడు. విష్ణువు వెదుకులాడుతుండటం చూసిన వినాయకుడు ‘మామా! దేనికోసం వెదుకుతున్నావు?’ అని అడిగాడు. ‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరచాను. దాని కోసమే వెదుకుతున్నాను’ అని చెప్పాడు విష్ణువు. ‘ఓహో! సుదర్శనమా! దానిని నేను మింగేశాగా!’ అని నవ్వుతూ అన్నాడు వినాయకుడు. బాలుడైన వినాయకుడిని ఏమీ చేయలేక తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని నానా రకాలుగా బతిమాలుకుంటాడు. గణపతి విష్ణువు బతిమాలుతున్న కొద్దీ నవ్వుతూ అతడిని ఆటపట్టిస్తాడు. అప్పుడు అంతటి మహావిష్ణువు తన కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు. విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో అతడి కడుపున ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువంతటి వాడు వినాయకుడి ముందు గుంజీలు తీయడంతో వినాయక వ్రత పూజ తర్వాత గుంజీలు తీయడం ఆచారంగా మారింది. 

వినాయకుడి కుంటుంబం
వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడని సాధారణంగా తెలిసిన విషయం. అయితే, వినాయకుని జననానికి సంబంధించి పురాణాలలో రకరకాల గాథలు ఉన్నాయి. పార్వతి నలుగు పెట్టుకునేటప్పుడు నలుగుపిండితో వినాయకుడిని రూపొందించినట్లుగా చెబుతున్న గాథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, శివుడే ఇతడిని సృష్టించాడని, పుణ్యక వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి వినాయకుడిని కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుడిని సృష్టించారని, స్వయంభువుగా వెలసిన వినాయకుడిని పార్వతీ పరమేశ్వరులు కనుగొన్నారని... ఇలా రకరకాల గాథలు ఉన్నాయి. వినాయకుడి తమ్ముడు కుమారస్వామి. ఇతడికే కార్తికేయుడని, స్కందుడని కూడా అంటారు. వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని గాథలలోను, అతడికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని మరికొన్ని గాథలలోను ఉంది. శివపురాణం ప్రకారం వినాయకుడికి క్షేమం, లాభం అనే ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారని ప్రతీతి. సనాతన సంప్రదాయంలో ఆరు మతాలు ఉన్నాయి. వీటినే షణ్మతాలు అంటారు. అవి: శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణపత్య స్కంద మతాలు. వీటిలో శైవ వైష్ణవ మతాలు మాత్రమే ఇప్పటికీ ప్రధానంగా ఉనికిలో ఉన్నాయి. శాక్తేయం కొంతవరకు ఉనికిలోల ఉన్నా, ఆరాధన పద్ధతులు చాలావరకు మారాయి. చరిత్రను తరచి చూస్తే క్రీస్తుశకం ఆరో శతాబ్ది వరకు స్కంద ఆరాధన ఎక్కువగా ఉండేది. స్కందుని పూజను వీర పూజ అనేవారు. ఆరో శతాబ్ది తర్వాతి నుంచి వినాయకుని ఆరాధన క్రమంగా పెరిగింది. వినాయకుని ఆరాధనకు ప్రాచుర్యం పెరిగిన తొలినాళ్లలో గాణపత్య మతం ప్రత్యేక మతంగా ఉనికిలో ఉండేది. గాణపత్యాన్ని అవలంబించే వారిలో కొందరు గణపతిని తాంత్రిక పద్ధతుల్లో పూజించేవారు కూడా. ఉచ్చిష్ట గణపతి సాధన వంటి తాంత్రిక ఆరాధనలు అప్పట్లో మొదలై ఉంటాయని చరిత్రకారుల అంచనా. వినాయకుని తొలినాటి శిల్పాలు అఫ్ఘానిస్థాన్‌లో దొరికాయి. ఇవి క్రీస్తుశకం నాలుగో శతాబ్దం నాటివని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉదయగిరి గుహలు, రామగఢ్‌ కొండ, భుమరా ఆలయంలో కూడా వినాయకుని అతి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇవన్నీ గుప్తుల కాలం నాటివని, అంటే సుమారు క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటివని చెబుతున్నారు. గణపతిని ప్రధాన దైవంగా ఆరాధించే గాణపత్య మతం క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికి బాగా ప్రాచుర్యంలో ఉండేదని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. 

విదేశాల్లో వినాయకుడు
భారత ఉపఖండం నుంచి వినాయకుడు అనతి కాలంలోనే సముద్రాలకు ఆవల ఉన్న పలు ఇతర దేశాలకూ విస్తరించాడు. నౌకా వాణిజ్య సంబంధాల కారణంగా వినాయకుని ఆరాధన విదేశాలకూ పాకింది. చైనాలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే వినాయకుని ఆరాధన ఉండేదనేందుకు అక్కడ దొరికిన గణపతి శిల్పాలే నిదర్శనం. గణపతి ఆరాధన క్రీస్తుశకం ఐదు–ఆరు శతాబ్దాల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినా, దీనికి మూలాలు సింధులోయ నాగరికత కాలంలోనే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇరాన్‌లోని లోరెస్తాన్‌ ప్రావిన్స్‌లో జరిపిన తవ్వకాల్లో దొరికిన లోహఫలకంపై గణపతిని పోలిన ఆకారం ఉండటంతో గజాననుడి ఆరాధనకు మూలాలు క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల  కిందటే ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వైదిక సాహిత్యాన్ని తీసుకుంటే రుగ్వేదంలో వినాయకుని ప్రస్తావన ‘బ్రాహ్మణస్పతి’ అనే పేరిట కనిపిస్తుంది. కృష్ణ యజుర్వేదంలోను, తైత్తరీయ అరణ్యకంలోను కూడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వమే ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు కూడా గణపతి ఆరాధనను స్వీకరించాయి. ఈ మతాలు వ్యాపించిన దేశాల్లో కూడా గణపతి ఆరాధన విభిన్నమైన విలక్షణమైన పద్ధతుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. హేరంబ రూపంలోని వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. హేరంబుని వాహనం సింహం. నేపాల్, టిబెట్‌లలో నృత్యముద్రలో ఉన్న గణపతిని కూడా ఆరాధించేవారు. శ్రీలంక, బర్మా, చైనా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా దేశాల్లో కూడా వినాయకుడు విలక్షణ రూపాల్లో కనిపిస్తాడు. జైన గ్రంథాలలో వినాయకుని ప్రస్తావన లేకున్నా, జైనులు మాత్రం వినాయకుడిని ఆరాధిస్తారు. జైనులు తమ సంప్రదాయంలో గణేశునికి కొన్ని కుబేరుని లక్షణాలను ఆపాదించినట్లు కనిపిస్తుంది. బౌద్ధ గ్రంథాలలో అక్కడక్కడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది.
– పన్యాల జగన్నాథదాసు 

మరిన్ని వార్తలు