వీరికి అక్కడ ఏం పని?!

21 Jul, 2019 07:56 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

శ్రీహరి కోట నుంచి మార్క్‌–3 రాకెట్‌ ద్వారా చ్రందయాన్‌–2 యాత్ర మొదలైన విషయం మీకు తెలిసిందే.

సరిగ్గా కొన్ని నెలల తరువాత...
రాకెట్‌ నుంచి విడిపోయిన ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలో సెటిలైపోయింది.
చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్‌ చేస్తూ పుంఖాను పుంఖాలుగా ఫొటోలు పంపుతోంది ఆర్బిటర్‌.
నీటిజాడలు, కొన్ని రసాయనాల  ఫొటోలు,  హీలియం వనరుల ఆనవాలు కనిపెట్టిన ఫొటోలు... ఒక్కటా రెండా... పరంపరగా వస్తూనే ఉన్నాయి. 
ప్రతి ఒక్క ఫొటోని వేయికళ్లతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇస్రో సైంటిస్టులు.
అలా చూస్తున్న క్రమంలో ఒక ఫొటోని చూసి షాక్‌ తిన్నారు!
సదరు ఆ ఫొటోలో రామ్‌గోపాల్‌వర్మ–కెఏ పాల్‌  ఎదురుబొదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు!!
‘నిజమా, భ్రమా’ అని ఆ ఫొటోని మళ్లీ మళ్లీ పరిశీలించారు. అక్షరాల నిజమే!

‘‘విక్రమార్కా! ఇంత టఫ్‌ కొచ్చెన్‌ నీ లైఫ్‌టైమ్‌లోనే ఫేస్‌ చేసి ఉండవు. ఇప్పుడు చెప్పు...చంద్రమండలం నుంచి ఆర్బిటర్‌ పంపిన ఫొటోలో రామ్‌గోపాల్‌వర్మ–పాల్‌లు ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నకు తెలిసికూడా ఆన్సర్‌ చెప్పలేకపోయావో...’’ అని హెచ్చరించాడు బేతాళుడు.
అప్పుడు విక్రమార్కుడు ఇవ్విధంబుగా సమాధానం చెప్పాడు.

‘‘బేతాళా! నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పరమ తిక్కలోడని ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలానికి తెలిసిందే. ఈ తిక్కలోడు ఒకసారి తన డాబాపై మందుకొడుతూ, ధాబాలో తెప్పించిన స్పెషల్‌ చికెన్‌ నంజుకుంటూ, టీవీలో వస్తున్న ‘కలవారి కోడలు కలికి కామక్షి’ ఎపిసోడ్‌ నెంబర్‌–16497 చూస్తూ, టీవీలో ప్రకటనలు వచ్చినప్పుడు అలా చంద్రుడి వైపు చూస్తున్నాడు...
అలా చంద్రుడి వైపు చూస్తున్నప్పుడు అతడికి మెరుపులాంటి ఐడియా వచ్చింది.
‘‘టీవీ చానళ్లన్నీ భూమి మీదే ఉన్నాయి. పాపం చంద్రుడిపై ఒక్క టీవీ చానల్‌ కూడా లేదు. చంద్రుడిపై టీవీ చానల్‌ మనమే స్టార్ట్‌ చేద్దాం. మన చానల్‌ పేరు ‘మూన్‌మూన్‌సేన్‌’. చంద్రుడిపై తొలి టీవీ చానల్‌ పెట్టిన దేశంగా నార్త్‌ కొరియా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి’’ అని చుట్ట వెలిగించాడు.
వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు.
‘యంయంయస్‌’ చానల్‌ కోసం ‘ఖబడ్డార్‌...నువ్వా నేనా?’ అనే పోగ్రాంను డిజైన్‌ చేశాడు క్రియేటివ్‌ హెడ్‌ కిట్టప్ప సుంగ్‌ మిన్‌ జిన్‌ సూ.
ఈ పోగ్రాం కాన్సెప్ట్‌ ఏందంటే... ఒక టాపిక్‌పై ఇద్దరు వ్యక్తులు భయంకరంగా వాదులాడుకోవాలి. ఆ ఇద్దరూ ఎవరా? అని ప్రపంచం మొత్తం జల్లెడ పట్టి వెదికారు. చివరికి ఇద్దరి పేర్లు ఫైనల్‌ అయ్యాయి. ఆ ఇద్దరే రామ్‌గోపాల్‌ వర్మ, పాల్‌!

‘కేఎన్‌ఎన్‌’ (ఖబడ్డార్‌...నువ్వా నేనా?) కోసం చంద్రమండలపై బ్రహ్మాండమైన సెట్‌ వేయించారు. 
చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ కాబట్టి ఇద్దరి బరువుకు రెట్టింపు బరువైన కోట్‌లు వేయించారు.
రెండు భారీ సింహాసనాలను తయారు చేయించి రామ్‌గోపాల్‌వర్మ–పాల్‌లను ఎదురుబొదురుగా కూర్చోబెట్టారు.
చంద్రుడి మీద గాలి ఉండదు కాబట్టి  ఇద్దరికీ వంద చొప్పున విసనకర్రలు ఇచ్చారు.
చంద్రుడిపై అంతులేని దుమ్ముధూళీ కాబట్టి ఇద్దరికి ఇరవై రిన్‌ సబ్బులు, మినరల్‌ వాటర్‌ బాటిళ్లు, నల్ల  కళ్లజోళ్లు  ఇచ్చారు.
‘‘మరి వోడ్కా!’’ ఆశగా ఆడిగాడు వర్మ.
‘‘మిత్రమా! భూమి మీద వందకేజీలు ఉన్నవాడు... ఇక్కడ యాబై కేజీల బరువు కూడా ఉండడు. ఎందుకంటావ్‌? ఎందుకంటే ఇక్కడ గురుత్వకార్షణశక్తి తక్కువ కాబట్టి. అలాగే... ఇక్కడ ఫుల్‌బాటిల్‌ కొట్టినా  నైంటీ ఎమ్‌ఎల్‌లో సగం తాగినట్లు కూడా ఉండదు. అసలు ఇక్కడ మత్తు పని చేయదు’’ చెప్పాడు క్రియేటివ్‌ హెడ్‌ కిట్టప్ప.
‘‘ఇట్స్‌ ఓకే’’ అన్నాడు వర్మ మూతి తిప్పుకుంటూ.

‘‘బ్రదర్‌... డిబేట్‌ స్టార్ట్‌ చేద్దామా? ఇంతకీ ఏ టాపిక్‌ మీద డిబేట్‌ చేద్దాం?’’ ఉత్సాహంగా వర్మను అడిగాడు పాల్‌.
‘‘డిబేట్‌ మీదే స్టార్ట్‌ చేద్దాం’’ అని ఇలా మొదలు పెట్టాడు వర్మ...
‘‘డిబేట్‌ ఈజ్‌ ఏ ప్రాసెస్‌ దట్‌ ఇన్వాల్స్‌ ఫార్మల్‌ డిస్‌కషన్‌ ఆన్‌ ఏ పర్టిక్యులర్‌ టాపిక్‌. యూ నో... డిబేటింగ్‌ సొసైటీస్‌ ఎమర్జ్‌డ్‌ ఇన్‌ ఇంగ్లాండ్‌ ఇన్‌ ఇది ఎర్లీ 18 సెంచరీ...’’
‘‘సోదరా ఆగు... ఇంగ్లండ్‌ అంటే గుర్తుకు వచ్చింది...
ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌... హీ ఈజ్‌ ద ఫస్ట్‌ కజిన్‌ ఆఫ్‌ క్వీన్‌ ఎలిజెబెత్, పీటర్‌ మార్క్‌... ది ఎల్డర్‌ చైల్డ్‌ అండ్‌ ఓన్లీ సన్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌ రాయల్‌... వీళ్లందరు కూడానూ.. నా సలహా లేనిదే పొద్దున బ్రష్‌పై పేస్ట్‌ కూడా పెట్టుకోరు...’’ చెప్పుకుంటూ పోతున్నాడు పాల్‌.
‘‘మిస్టర్‌ పాల్‌... నేనేం మాట్లాడుతున్నాను... నువ్వేం మాట్లాడుతున్నావు? నీకెవరు పరిచయం ఉంటే నాకేంటి?’’ చిరాకు పడ్డాడు వర్మ.
‘‘ఇదిగో ఈ చిరాకే, కోపమే  సోదర మానవుల మధ్య చిచ్చు రగులుస్తుంది. ఐక్యతకు తూట్లు పొడుస్తుంది... అందుకే అంటున్నాను... టు సేవ్‌ ది నేషన్‌ వుయ్‌ ఆల్‌ మస్ట్‌ వర్క్‌ టు గెదర్‌... అందుకే ఐ నీడ్‌ పొలిటికల్‌ ఫండ్‌... ఇండియా షుడ్‌ లీడ్‌ ద వరల్డ్‌... చెట్టో రక్షతి రక్షితః... పెద్దలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి... తగిన చిల్లరతో బస్సులో ప్రయాణించండి... కండక్టర్‌కు సహకరించండి’’ వీరవిహరం చేస్తున్నాడు పాల్‌.

‘‘మిస్టర్‌ పాల్‌... మీరు చిల్లర అంటే గుర్తుకు వచ్చింది... కొన్ని సంవత్సరాల క్రితం మనీ అనే సినిమా తీశాను. సూపర్‌ హిట్‌ అయింది. దానికి సీక్వెల్‌గా ‘చిల్లర’ అనే సినిమా తీయాలని డిసైడయిపోయాను. అయితే ఆ సమయంలో నాకు ఫ్లాప్‌ల మీద ఫ్లాపులు పిలవని చుట్టంలా వస్తున్నాయి... అయినా సరే... ఎలాగైలా సినిమా చేయాలని డిసైడయిపోయాను... నా దగ్గర బడ్జెట్‌ చూసుకుంటే  చిల్లర తప్ప ఏమీ లేదు... ఈ రూపాయి, రెండు రూపాయల చిల్లరతో సినిమా ఏంచేస్తాం...’’ చెప్పుకుంటూ పోతున్నాడు వర్మ.
‘‘సోదరా... సమయమంటే గుర్తుకు వచ్చింది. సమయమంటే టైమ్‌... నీ టైమ్‌ బాగుందా? బ్యాడా? అని ఎందరో అమెరికా ప్రెసిడెంట్‌లకు చెప్పాను. అవన్నీ నిజమైన విషయం వరల్డ్‌ అంతటికీ తెలుసు...’’ దూసుకుపోతున్నాడు పాల్‌.
ఈ చర్చల ధాటికి చంద్రుడిపై ధూళి తుపాను వచ్చింది.
భూకంపంలాగా చంద్రకంపం కూడా వచ్చింది.
అయినా సరే... ఇద్దరు డిబేట్‌ చేస్తూనే ఉన్నారు... అప్పుడు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్, కొరియా ప్రెసిడెంట్‌కు ఫోన్‌ చేసి ఇలా వార్నింగ్‌ ఇచ్చాడు...
‘‘ఒరే తిక్కలోడా... నీ చానల్‌ మూసేసి ఆ ఇద్దరినీ భూమిపైకి పంపించకపోయావో... నిన్ను శాశ్వతంగా పైకి పంపిస్తాను’’
ఈలోపు భూమిపై ‘సేవ్‌ ది మూవ్‌’ అనే ఉద్యమం మొదలైంది.
– యాకుబ్‌ పాషా

మరిన్ని వార్తలు