ఐదు నిమిషాల్లో కథ చెప్పమన్నారు...: గీతాకృష్ణ

22 Dec, 2013 02:15 IST|Sakshi
ఐదు నిమిషాల్లో కథ చెప్పమన్నారు...:గీతాకృష్ణ

తొలియత్నం

 అతడు పదం. ఆమె పాదం.
 అతడు గానం. ఆమె ప్రాణం.
 అతడు పాటై ఎగిసినప్పుడు ఆ కెరటాలకు ఆమె అందెల.
 ఆమె నాట్యానికి అతని పదం ఆది తాళం.
 సముద్రం దిగంతమై, కళ అనంతమైనప్పుడు
 కళకు ఆమె చేసే నివేదన నాట్యం.
 ప్రకృతికి అతడి అభిషేకం కవిత్వం.
 ఇద్దరు కళాకారుల ఆధ్యాత్మిక ప్రేమకు
 దృశ్యకవి గీతాకృష్ణ వెండితెరపై చేసిన కళార్చన
 ఈ సంకీర్తన.

 
 అసిస్టెంట్‌గా అంటూ చేస్తే బాలచందర్, బాపు, విశ్వనాథ్ వీళ్ల దగ్గరే చేయాలి. లేకపోతే పూణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్. ఇదీ లెక్క. బాలచందర్‌గారిని కలిస్తే నేనిప్పుడే తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగు సినిమా చేసినప్పుడు తప్పక తీసుకుంటాను. నెక్స్‌ట్ బాపుగారు. నేనిప్పుడు హిందీ సినిమా చేస్తున్నాను, తెలుగు సినిమా చేసినప్పుడు కలువు. ఇక మిగిలింది విశ్వనాథ్‌గారు. నాకు బాగా తెలిసిన కె.వాసు (ప్రాణం ఖరీదు, కోతలరాయుడు వంటి హిట్ చిత్రాల దర్శకుడు)గారి ద్వారా విశ్వనాథ్‌గారిని కలిశాను. అప్పట్లో అది కాన్ఫిడెన్సో, యారగెన్సో తెలియదు. నేను మీ దగ్గర మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేస్తాను. ఆ తరువాత డెరైక్ట్‌గా సినిమా డెరైక్షన్ చేస్తానన్నాను. విశ్వనాథ్‌గారు సరేనన్నారు. ‘సాగరసంగమం’ ఆయనతో అసోసియేషన్ ప్రారంభమైంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు రష్యాలో ఒక ఫిలిం ఫెస్టివల్‌లో విశ్వనాథ్‌గారి రెట్రాస్పెక్టివ్ కోసం అక్కడి నుంచి ఒక టీమ్ వచ్చింది. వాళ్లకు విశ్వనాథ్‌గారి సినిమాలు చూపిస్తూ, వాటి థీమ్‌ను వివరించడం నా పని. చెన్నయ్‌లో ఆండాళ్ ప్రొడక్షన్స్ అధినేత రామ అరంగణళ్‌కు సంబంధించిన ఆండాళ్ థియేటర్ బుక్ చేశాం. వాళ్లకు ఒక్కో సినిమా చూపిస్తూ, ప్రతి రెండు రీళ్లకు ఒకసారి సినిమా ఆపి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. ఇదంతా గమనించిన అక్కడి మేనేజర్ కృష్ణమూర్తి నా గురించి అరంగణళ్‌గారికి చెప్పారు. ఇది గడిచిన కొంతకాలానికి వాళ్ల నుంచి నాకు ఫోన్ వచ్చింది. సినిమా చేస్తావా అని అడిగారు. ఎందుకు చేయను, అందుకోసమే కదా వచ్చింది అన్నాను.
 
 రామ్ అరంగణళ్‌గారిని కలవగానే నా చేతిలో ఫైల్స్ చూసి ఏంటివన్నీ అని అడిగారు. నేను తయారుచేసుకున్న సబ్జెక్ట్స్ అన్నా. మొదట అవన్నీ పక్కన పెట్టు అన్నారు. మొదట నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాల్లో చెప్పడం నేర్చుకో. అందుకు కావాలంటే ఇంకో అయిదు నెలలు తీసుకో. ఎందుకంటే నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాలకు మించి చెపితే అవతలివాళ్లకు నిద్ర వచ్చే ప్రమాదముంది. అయిదు నిమిషాల కథను తెరమీద మూడు గంటల్లో చెప్పడం తరువాత పని అన్నారు. అయితే నాకు ఒక గంట టైమ్ కావాలని అడిగాను. సరేనని నాకో గది కేటాయించారు. గంట తరువాత కలిసి పది నిమిషాల్లో రెండు కథలు వినిపించాను. నీ వయసుకు మించిన కథలు చెప్పావని మెచ్చుకున్నారు. అందులో ఒక కథలో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ల మధ్యకు మరో చిన్న బాబు రావడమనే కథ ఆయనకు చాలా నచ్చింది. అయితే అది మ్యాన్ ఉమన్ అండ్ ఏ ఛైల్డ్ అనే నవల నుంచి తీసుకున్నానని, అది హాలీవుడ్‌లో క్రామర్ వర్సెస్ క్రామర్ అనే సినిమాగా వచ్చిందని చెప్పాను. దాని ఆధారంగా శేఖర్‌కపూర్ మాసూమ్, బాలూమహేంద్ర మలయాళంలో ఓలంగళ్ తీశారని చెప్పాను. అయినా మనం చేద్దామన్నారాయన. నేను విశ్వనాథ దగ్గర మూడు సినిమాలు చేస్తానని మా అన్నకు మాట ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు సినిమా చేయలేనన్నాను. కానీ నాకిదో గొప్ప అనుభవమని చెప్పి వచ్చేశాను.
 
 ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ చేస్తున్నప్పుడు కమలహాసన్, నేను చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. ‘స్వాతిముత్యం’ మధ్యలో ఉన్నప్పుడు మా ఊరి పక్కన కడియానికి చెందిన గిరిజాల కృష్ణారావు, డాక్టర్ గంగయ్యను పరిచయం చేశారు. ఆయన సినిమా చేద్దాం కధ చెప్పమనగానే రెండు కథలు వినిపించాను. మన్మథ పూజారి, సంకీర్తన కథల్లో రెండవది ఆయనకు బాగా నచ్చింది. విశ్వనాథ్‌గారికి చెబితే సరే అన్నారు. తరువాత ‘స్వాతిముత్యం’ శత దినోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ వేదిక మీదే విశ్వనాథ్‌గారి శిష్యుడు, దర్శకుడు కాబోతున్నారని ప్రకటించారు.
 
  హీరో కాశీ పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా సచిత్ర వారపత్రికలో కవర్‌పేజీలో ఒక యువకుడి ఫొటో చూశాను. కింద అక్కినేని వారసుడు నాగార్జున హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నాడని వార్త. అది పట్టుకెళ్లి కమలహాసన్‌కు చూపించాను. ఎవరితను అని అడిగాడు. నాగేశ్వరరావుగారి అబ్బాయి అనగానే బావున్నాడన్నారు. తరువాత నాగేశ్వరరావుగారిని కలిసి కథ చెప్పాను. పొయెటిక్‌గా ఉంది, కొంచెం దృష్టి పెడితే చాలా బాగా వస్తుందన్నారాయన. అప్పటికే నాగేశ్వరరావుగారి నిర్మాతలు నాగార్జునతో సినిమాలు వరుసగా ప్రకటిస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్‌లో విక్రమ్ మొదలైంది. విక్రమ్ ఒక షెడ్యూల్ అయ్యాక, సంకీర్తన మొదలైంది.
 
 హీరోయిన్ కీర్తన పాత్ర కోసం చాలామందిని చూశాం. శోభన ,అమల ఇంకా చాలా మందిని అనుకున్నా రకరకాల కారణాల వల్ల కుదరలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి రామారావుగారి ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఫిల్మోత్సవ్ జరుగుతోంది. అందులో ప్రారంభోత్సవ నృత్యానికి నేను వెళ్లాను. స్టేజ్ మీద ఒక యాభై మంది డ్యాన్సర్స్ ఉన్నారు. అందులో ఒకమ్మాయి నన్ను ఆకర్షించింది. కార్యక్రమ నిర్వాహకురాలు రాజసులోచనగారిని కలిస్తే తన పేరు రమ్యకృష్ణ అని చెప్పింది. అడ్రెస్ తీసుకుని ఫొటో షూట్ చేసి తనను ఎంపిక చేసుకున్నాం. తను అంతకుముందు ఒక సినిమాలో ఏదో చిన్న పాత్ర చేసినా, పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా తనకిదే మొదటి సినిమా.
 
 మిగతా ముఖ్యపాత్రల్లో గిరీష్ కర్నాడ్, సోమయాజులును తీసుకున్నాం. నిజానికి కథ రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూళ్లో జరుగుతుంది. కానీ రాజమండ్రి, పోలవరం, పట్టెసీమ, దేవీపట్నం ఇలా చాలా ప్రాంతాల్లో చిత్రించాం. గడప లోపల ఒక ఊరు, గడప దాటితే మరో ఊరు. ఇలా చాలా ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. ఇందులో హీరో, హీరోయిన్ మొదటిసారి కలిసినప్పుడు తీసిన సీన్ కోసం మాత్రం చాలా శ్రమపడ్డాం. ఉదయం పూట కీర్తన నదికి నీళ్లకోసం వచ్చినప్పుడు కాశీ పడవలో పడుకుని ఉంటాడు. అందెల శబ్దం విని లేచి మొదట ఆకాశంలో పక్షులను చూస్తాడు. తరువాత కీర్తనను చూస్తాడు.
 
 అలవోకగా ఒక కవిత చెబుతాడు. ఈ సీన్‌లో పక్షులు, నది, అవసరమైన క్లోజప్స్, ఇంటర్‌కట్స్ తీసిన తరువాత కీర్తన సజెషన్‌లో కాశీ, అతడి సజెషన్‌లో కీర్తన షాట్స్, వాళ్లిద్దరి వైడ్ షాట్స్ తీయాలి. అందుకు స్థానికంగా ఉన్న జాలరిని పిలిచి, బోట్ ఏ యాంగిల్‌లో ఉంచాలని చెబుతున్నప్పుడు అర్థం కాక, అతను కొంత అసహనం వ్యక్తం చేశాడు. దాంతో ఆర్టిస్టులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఆ సీన్ వాయిదా వేశాం. షూటింగ్ పూర్తయ్యేలోపు ఆ సీన్ తీయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక అవాంతరం వచ్చేది. చివరికి మద్రాస్ దగ్గర ఎన్నూర్ టూరిస్ట్ ప్లేస్‌లో బ్యాక్‌వాటర్‌లో ఈ సీన్ తీశాం. అది పూర్తయ్యేసరికి ఇంకో సినిమా తీసినంత పనయింది. ఇలా ఎన్నో చోట్ల షూటింగ్ చేసినా అంతా ఒకే దగ్గర తీసినట్టు అనిపించడానికి కారణం, స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్ మీద అవగాహన ఉండటం.
 
 ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇళయరాజా సంగీతం గురించి. తను ఒకరోజు పదిహేను ట్యూన్స్ ఇచ్చాడు. నాకు మరీ అంత సంప్రదాయకంగా కాదు, సెమీ క్లాసికల్ కావాలన్నాను. తరువాత తను ముప్ఫై తొమ్మిది ట్యూన్స్ ఇచ్చాడు. అందులోంచి తొమ్మిది సెలక్ట్ చేసుకుని, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, వేటూరితో పాటలు రాయించాను. తనికెళ్ల భరణి కథను అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా మాటలు రాశారు. సినిమా చూసిన నాగేశ్వరరావుగారు చాలా బాగా తీశావు కానీ, ఈ సినిమా ప్రేక్షకులు నచ్చకపోతే మళ్లీ భవిష్యత్తులో మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేయకు అన్నారు.
 
 సినిమా చూసిన సెన్సార్‌వాళ్లు టైటిల్స్ చూడకపోతే, ఇది విశ్వనాథ సినిమా అనుకోవచ్చు అన్నారు. నేనది కాంప్లిమెంట్‌లా ఫీలయ్యాను. కొన్ని రోజులు ఆ ఆనందంలో తేలియాడాను. ఒకరోజు ఇళయరాజాగారు నాతో నువ్వు, వంశీ విశ్వనాథ్‌లా తీస్తారన్న పేరు తెచ్చుకుంటే ఏం ఉపయోగం. నీదైన మార్క్ కోసం ప్రయత్నించు అన్నారు. ఆ మాట నాపై తీవ్ర ప్రభావం చూపించి, నా సినిమా శైలిని, ఆలోచనా విధానాన్నీ మార్చేసింది.
 
  సినిమాలో పాట అనేది సంభాషణలా ఉండాలనేది నా ఫీలింగ్. అదే పద్ధతిలో సంకీర్తన పాటల రూపకల్పన జరిగింది. ఈ సినిమాలో ప్రతి మాటా ఒక చిన్న పాటలా కవితాత్మకంగా ఉంటుంది.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి
 
 

మరిన్ని వార్తలు