రాజన్న రాజ్యంలో.. జలయజ్ఞం

4 May, 2014 11:13 IST|Sakshi
రాజన్న రాజ్యంలో.. జలయజ్ఞం

బాబు పాలన:   బాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కానీ, కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది.
 -    కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులను అప్పట్లోనే నిర్మించి ఉంటే  ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా వచ్చేది.
 -    బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన వ్యయం రూ. 700 కోట్లు మాత్రమే. అంటే.. ఏడాదికి వంద కోట్లను కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు.
 -    ఇంకుడుగుంతలపై చూపిన శ్రద్ధ భారీ ప్రాజెక్టులపై చూపలేదు.
 -    ఆనాడు కేంద్రంలో తానే చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... కేంద్రంలో మాట్లాడి ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపలేకపోయారు. మన రాష్ట్ర సాగునీటి హక్కులు కాపాడలేక పోయారు.
 రాజన్న రాజ్యం
 అందుబాటులోకి వచ్చిన ప్రతి నీటి బిందువునూ ఒడిసి పట్టుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రాష్ట్ర ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని కలలుగన్న ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన మహాయజ్ఞం... జలయజ్ఞం!  దివి నుంచి భువికి గంగను రప్పించే భగీరథయత్నం.. కరవు కాటకాలను తరిమికొట్టడానికి చేపట్టిన వజ్రాయుధం.. కోటి ఎకరాలకు నీరందించి రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు మహానేత తీసుకున్న దృఢసంకల్పం  జలయజ్ఞం!
 
 -    ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించారు వైయస్సార్. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 86 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు.
 -    జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో ఐదేళ్లలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేశారు. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి, సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు.
 -    ఐదేళ్లలోనే రూ. 53 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. చాలా ప్రాజెక్టులు చివరిదశకు చేరుకున్నాయి.
 -    ఆయన హయాంలో వేగంగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులు తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. డిజైన్‌ను మార్చడం వల్ల మళ్ళీ టెండర్లను ఖరారు చేయానికే ప్రభుత్వం మూడేళ్ళ సమయాన్ని తీసుకుంది. వైఎస్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అదే వేగంతో జరిగినట్టయితే... ఈ సమయానికి పూర్తయి...పశ్చిమ గోదావరి జిల్లాలో 7.2 లక్షల ఆయకట్టుకు నీటి వసతిని కల్పించడంతో పాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించడానికి, విశాఖపట్టణానికి 30 టీఎంసీల నీటి సరఫరాకు అవకాశం ఉండేది.
 -    ఆ ఒక్క ప్రాజెక్టునే కాదు, మహానేత మరణానంతరం ఇతర ప్రాజెక్టులను సైతం పట్టించుకున్న నాధుడే లేడు.
 
 జగన్ సంకల్పం
 పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంది. పోలవరంతోపాటు పెండింగ్‌లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాతిపదికపై నిర్మాణం పూర్తిచేయడం జరుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రభావం మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్, వినిమయ రంగాలపై ప్రసరించి, 2004-09 మధ్య విస్తరించిన అభివృద్ధి మాదిరిగానే ఆయా రంగాల పురోగతికి దోహదం చేస్తుంది.  సిమెంట్, స్టీల్, నిర్మాణ సామగ్రి... వీటన్నింటి కొనుగోళ్ళూ పెరగటం, మైనింగ్, ట్రాన్స్‌పోర్టు పెరగటం అంటే ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా మళ్ళీ జీవం పోయటమే!

మరిన్ని వార్తలు