ఆదిశేషుడి అంశగా...

19 Nov, 2017 02:30 IST|Sakshi

సహస్రాబ్ది ధారావాహిక – 6రామానుజ మార్గం

శ్రీ కృష్ణుడి అవతారం ముగిసి ద్వాపరయుగం అంతరించింది. కలియుగంలో అధర్మం విజృంభిస్తున్నది. పరీక్షిత్తు, జనమేజయుడి తరువాత ధర్మపాలన కరువైపోయింది. వేదాలను పరిహసించి వ్యతిరేకించి ధర్మం తప్పి చరించే వితండ వాదాలు, మతాలు పెరిగిపోయాయి. విచ్చలవిడి జీవనం సామాన్యమైంది. నాస్తికుల ఆగడాలకు అంతులేదు. ఆస్తికులు అవమానాలపాలవుతున్నారు. నైతిక విలువలు సన్నగిల్లి కలికాలపు పోకడలు వీరవిహారం చేస్తున్నాయి. నారాయణుడు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాడు. మనకు కనిపించే దృశ్యమానమైన జగత్తు మాత్రమే సర్వం కాదు. ఈ పథ్వీప్రకృతి మండలానికి ఆవల సప్తావరణల మీదట, అప్రాకృతమైన, విలక్షణమైన పరమపావనమైన ప్రదేశం ఒకటుంది. ఆ దివ్యప్రదేశాన్ని శ్రీవైకుంఠమని అంటారు. అది క్షతిలేని నిత్యవిభూతి. అక్కడికి చేరిన జీవులకు మళ్లీ పుట్టుక ఉండదు. వారిని ముక్తులని అంటారు. అక్కడ నారాయణుని ప్రేమ వలె విరజానది అనునిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ముక్తజీవి ఆ నదిలోస్నానం చేస్తే ఆత్మకు అంటియున్న సూక్ష్మశరీరపు వాసనలన్నీ తొలగిపోయి దివ్యశరీరం వస్తుంది. అక్కడ ఇరమ్మదమనే సరస్సు, దాని ప్రక్కన అశ్వత్థ (రావి) వృక్షం కూడా ఉన్నాయి.

అక్కడ ముక్తులతో పాటు నిత్యసూరులు ఉంటారు. నిత్యులు (నిత్యసూరులు) అంటే– నిరంతరం నారాయణుని సేవించే అనంతుడనే మహాసర్పము, గరుడుడు, విష్వక్సేనుడు మొదలైన వారు అక్కడ నివసిస్తుంటారు. నారాయణుడు  శయనించినపుడు మెత్తని పరుపుగానూ, కూర్చున్నపుడు మంచి ఆసనంగానూ, హరి ప్రతికదలికకు అనుగుణంగా తనను తాను అనుగుణంగామార్చుకుంటూ ఉండే అనంతుడు అత్యంత ప్రియసేవకుడు. అంతులేనంతగా విస్తరించగల శక్తిమంతుడు కనుక ఆ మహాసర్పాన్ని అనంతుడని అంటారు. మొట్టమొదటి శేషుడు కనుక ఆదిశేషుడనీ అంటారు. త్రిలోకాలలో స్వామిని ఎక్కడికైనా తీసుకుని వెళ్లగల అద్భుతమైన సజీవ వాహనం గరుత్మంతుడు. అపారమైన విష్ణు గణాల సేనలకు సేనానాయకుడు, సేనానాథుడు విష్వక్సేనుడు. జీవులై సంసారబంధాల్లో చిక్కుకున్నా, భగవంతుడిని ఆరాధించి, హరి దివ్యానుభూతిని అనుభవించి, నారాయణుని అనుగ్రహంతో ముక్తిపొంది పరమపదం చేరి పరంధాముని సేవలో మునిగిపోయే అనేకమంది ముక్తులు వైకుంఠ వాసులు.

చింతాక్రాంతుడైన శ్రీహరి
ఆ వైకుంఠనగరిలో ఏముంటాయో, ఏ విధంగా ఉంటాయో చెప్పడం కష్టం. అదొక ఆనందవనం, ఆనంద నిలయం. అమృత సరస్సులు, మనోహరమైన ఉద్యానవనాలు, కాంతి పుంజాల తోరణాలు, నిర్మలమైన సుగంధ వాయువులు, అపురూపమైన ఫలవృక్షాలు, బంగారు మేడలు, రత్న ఖచిత ప్రాకారాలు, ఆలయాలు, మంటపాలు గోపురాలతో అలరారే సువిశాల ప్రదేశం. ఆ వైకుంఠంలో మణిమయమైన వేయి స్తంభాల మంటపంలో దివ్యచందన సుగంధాల మధ్య తనకు పరుపుగా అమరిన అనంతునిపై హరి శయనించి ఉన్నాడు ఆ హరి పసుపుపచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు (పీతాంబరుడు), ఓ పక్కన భూదేవి, మరో పక్క శ్రీదేవి ఉన్నారు. అతను నాలుగు చేతులలో శంఖ చక్ర గదాయుధాలు ధరించి మరో చేత పద్మం పట్టుకుని ఉంటాడని పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి.   ఆనందం తప్పమరేదీ ఉండని ఆ మహాలోకంలో నారాయణుడు ఉన్నా మనసులో విచారం హరి వదనంలో ప్రతిఫలిస్తున్నది. విచారవదనాన్ని గమనించి అనంతుడు. ఆ ‘‘ఏమిటి స్వామీ చింతాక్రాంతులైనారు?’’ అనడిగాడు.

ఈ మానవులకు మంచికోసం ఇచ్చిన శరీరాన్ని బుద్ధిని మంచికి ఉపయోగించడం లేదే, ఇతరుల స్త్రీలను, సంపదలను హరించడానికి వినియోగిస్తున్నారే, పరమ స్వార్థపరులై పరమపదాన్నే మరిచారే అని హరి ఆలోచిస్తున్నాడు. ఆ విషయమే అనంతుడికి వివరించారు.హరి: దేహమే ఆత్మ అనుకునే అజ్ఞానులకు,  బుద్ధి వక్రీకరించి దుర్మార్గంలో జీవించే మూఢులకు జ్ఞానోదయం కలించడం ఎలా అని మధనపడుతున్నాను.అనంత: సంభవామి యుగేయుగే అంటూ ధర్మసంస్థాపనకు సంభవిస్తారు కదా స్వామీ, మళ్లీ అవతరించే సమయం ఆసన్నమయినట్టున్నది కదాహరి: ఈసారి నేను కాదు, నీవు పుడమిలో అవతరించాలి. ఓ రెండొందల సంవత్సరాలు జీవులను ఉద్ధరించి మరలి రావాలి.అనంత: స్వామీ... మిమ్మల్ని విడిచి రెండు శతాబ్దాలా? అయినే నేనేం చేయగలను? రామావతారంలో లక్ష్మణుడిగా మీ వెంటే ఉన్నాను. మీరు శ్రీకృష్ణుడైనపుడు బలరాముడిగా కాపాడుకున్నాను. మీరు లేకుండా నేను భూమిపై నిలువలేను. మీరు లేకుండా మీవలె మహాయుద్ధాలు చేయగలనా?  మీరు శంఖ చక్రగదాశార్ఞ ధరులు. నాకా ఏ ఆయుధాలూ లేవు.

హరి: అనంతా, ఇప్పుడు యుద్ధాలతో పనిలేదు. ఆయుధాల అవసరమే లేదు. నీవు వేనోళ్లతో విజ్ఞానం పంచాలి. నీ వేయిపడగలతో ఆధ్యాత్మిక జ్ఞాన కాంతులు విరజిమ్మాలి, వైకుంఠానికి నిచ్చెనలు వేయాలి. పాపాత్ములను కడిగి పరమాత్మునివైపు నడిపించాలి. నీవే ఆచార్యుడివై వెళ్లాలి. బోధకుడవై సాధించాలి. నీకు జ్ఞానమే ఆయుధం. జీవులను పంచ సంస్కారములతో సంస్కరించు నాయనా. నారాయణుడికన్న గురువే గొప్పయని నీవు జీవించి చూపాలి. యాగాలు చేయాలని, కఠినమైన తపస్సులు చేయాలని కష్టాలు పెట్టకూడదు. భూరి దానాలు చేయాలనే సంక్లిష్ఠమైన నిర్బంధాలు, బాధలు ఏమీ లేకుండా శరణుతో సులభమైన తరుణోపాయములు నీవు చెప్పవలసి ఉంటుంది. ఆచార్యుని సేవతోనే జ్ఞాన సముపార్జనతోనే హరి లభిస్తాడని నీవు వివరించాల్సి ఉంటుంది. నా నిత్యవిభూతికి నీవెవరిని పంపినా కాదనను. నన్ను కాదని నిన్నాశ్రయించినా నాకు ఆనందమే. బద్దుడైన జీవిని బాగుచేయడానికి నీ మాట ఏదయినా నామాటే. నిన్ను కాదని నేనెవరకీ మోక్షమీయను, నీకిష్ఠుడే నాకిష్ఠుడు, నీ మాటే నామాట, నీమతమే నా మతము, నీ మంత్రమే నా మంత్రము, నీ ధ్యానమే నా ధ్యానం. నీకు నాకు మధ్య భేదమే లేదు. నిన్ను ఆశ్రయించిన వారి పక్షాన నీవు శరణాగతి చేసినా నాకు సమ్మతమే. నీవారు నావారనే భేదం చూపను.భవబంధాలలో చిక్కుకున్న ఈ బద్ధుడు ఏ విధంగానైనా బాగుపడితే ఇక నాకు కావలసిందేముంది?  అని నారాయణుడు వివరించాడు.ఇది చాలా విశేషం. మోక్షాధికార ముద్రను హరి అనంతుడికి ఇచ్చారన్నమాట. అంటే అనంతుడి ఆజ్ఞలేకుండా మోక్షం ఎవరికీ దొరకదు. దీన్ని ఉభయ విభూతి నిర్వహణాధికారం అంటారు. విభూతిద్వయాధిపత్యంతో రామానుజుడై ఆదిశేషుడు అవతరించడానికి హరి ఆదేశించాడు.హరి ఆజ్ఞను అనంతుడు వేయిపడగలు వంచి శిరసావహించాడు.

భూతపురి శ్రీ పెరుంబుదూర్‌
అది దక్షిణ భారతదేశంలోని శ్రీపెరుంబుదూరు. భూతపురమనీ, అరుణారణ్యము అనీ పిలుస్తారు. శంకరుడు దిగంబరుడై నాట్యం చేస్తూ ఉంటే భూతములు పరిహాసాస్పదంగా నవ్వినారట. శివుడు కోపించి అధోలోకంలోకి వారిని శాపగ్రస్తుల్ని చేసి తోసేసారట. శాపం నుంచి విముక్తి కోసం ఆ భూతములు ఈ అరుణారణ్య క్షేత్రంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మిమ్మల్ని శివుడు అనుగ్రహిస్తాడని వరమిచ్చాడు.‘‘నేను ఇక్కడ నివసిస్తాను, ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యమైన పురంగా నిర్మించండి’’అని ఆ భూతాలను హరి ఆదేశించాడు. భూతములు నిర్మించిన పురము కనుక దీనికి భూతపురమనే పేరు వచ్చింది. ఆదిశేషుడు రాబోయే కాలంలో అక్కడ అవతరిస్తారనే కాబోలు, మాధవుడు కేశవుడైవెలిసాడని ప్రతీతి.ఆసూరి కేశవసోమయాజి అనే శ్రీవైష్ణవస్వామి. యామునా చార్యుల శిష్యుడు శ్రీశైలపూర్ణుడు (తిరుమలనంబి). వీరి చెల్లెలు కాంతిమతిని ఆయన వివాహం చేసుకున్నారు. స్థిరమైన బుధ్ది, మితభాషణం, నిత్యానుసంధాన లక్షణాలతో అత్యంత నిష్ఠాగరిష్ఠులు కేశవ సోమయాజి. నీతిమంతుడు. అసత్యమాడడు. ఆయనకు నిరంతరం హరి నామస్మరణమే. కాని ఆ జంట సంతానంలేక పరితపిస్తున్నారు. నోములు వ్రతాలుచేస్తున్నారు. జపాలు తపాలు చేస్తున్నారు. పెద్దలు సూచిస్తే చంద్రగ్రహణ  సమయంలో సముద్ర స్నానం చేశారు. ఆ తరువాత దానధర్మాలు చేశారు.

పుత్రకామేష్ఠి
చెన్నై(మద్రాస్‌) నగరంలో దివ్యదేశమైన తిరువళ్లికేన్‌ ఉంది. అక్కడ కైరవిణి పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడ వెలసిన పార్థసారథి పెరుమాళ్‌ కు పూజలు చేశారు. అక్కడే పుత్రకామేష్ఠి యాగాన్ని కూడా చేసినారు. పార్థుడికి గీత బోధించి జగద్గురువైన పార్థసారథి కరుణతో కేశవసోమయాజి కాంతిమతీ దంపతుల సంతానరూపంలో మరొక జగద్గురువు రాబోతున్న శుభ ఘడియలు అవి.దశరథుడి తరువాత పుత్రకామేష్ఠి యాగాన్ని కేశవసోమయాజులే చేసినట్టు కనిపిస్తుంది.  పుత్రకామేష్ఠి యాగం తరువాత రాముడు జన్మించినట్టే, కాంతిమతీ కేశవులకు రామానుజుడు పింగళ నామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ పంచమి, గురువారం కర్కాటక లగ్నం మధ్యాహ్నం ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినాడు. అది నవవసంతం.శ్లోకం: మేషార్ద్ర సంభవం, విష్ణోర్దర్శన స్థాపనోత్సుకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే(అర్థం: మేషం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టి, విష్ణువును చేరే మతాన్ని నిర్ధారించిన వాడైన రామానుజుడినే భజిస్తాను)కుమారుడు ఉదయించాడని కేశవ సోమయాజి ఆనందించి భూతపురములో ఇంటింటికీ చెరుకు ముక్కలు పంపించినాడు. తిరుమలలో నున్న తన బావమరిది శ్రీ శైల పూర్ణులకు పుత్రోదయ శుభవార్త పంపినాడు. వెంటనే శ్రీశైలపూర్ణులు పెరుంబుదూరు వచ్చి మేనల్లుడిని పరికించాడు. అతని అమితమైన తేజస్సులో మేనమామకు అద్భుతమైన భవిష్యత్తు దర్శనమైంది. గ్రహచార లక్షణాలను పరిశీలించాడు. ఇతను సామాన్యుడు కాడని శ్రీశైలపూర్ణుడు ఊహించాడు. చెవిదాకా విస్తరించిన కన్నులు...ఈతను కంటితోనే వింటాడా ఏమి? తల మీద విష్ణుపాదముల గుర్తుల వలె ఉన్నాయి. ఇది మహాసర్పలక్షణం. ఈతనెవరు? నమ్మాళ్వార్‌ చెప్పిన భవిష్యదాచార్యుడు ఇతడేనా? కన్నులు అశ్రుపూరితములైనాయి.‘‘ఏమిటన్నయ్యా అంతగా చూస్తున్నావు?’’... అంది కాంతిమతి.  

‘‘కాంతిమతీ. నీ జన్మధన్యమైందమ్మా’’ అని మాత్రం అన్నాడు. మిగిలిన విషయాలు కాలాంతరంలో తెలుస్తాయన్న ఉద్దేశంతో.  నామకరణం చేసే ఘడియ వచ్చింది. శ్రీశైలపూర్ణుల పైనే ఆ బాధ్యత పడింది.
లక్ష్మణుడు జన్మించిన లగ్నంలో పుట్టినవాడు కనుక లక్ష్మణుడనీ, రామానుజుడనీ (రాముని తమ్ముడు) నామకరణం చేశారు. అదే సమయంలో మధురమంగళంలోని కాంతిమతి చెల్లెలు దీప్తిమతి, కమలనయనభట్టులకు పుత్రుడు జన్మించాడు. అతనికి మేనమామ గోవిందుడని నామకరణం చేశారు.ఒకరోజు బ్రహ్మోత్సవాలలో కేశవస్వామి రథం ఆసూరివారింటి ముందు ఆగింది. కాంతిమతీ కేశవసోమయాజి దంపతులు కర్పూర హారతి ఇచ్చి మంగళాశాసనం చేసినారు. తరువాత కదలవలసిన రథం ఎంతలాగినా కదలడం లేదు. కేశవస్వామి ఉత్సవమూర్తి ఆసూరి వారి ఇంటివైపు మరలి ఉంది. కేశవమూర్తి దంపతులకు ఈ మధ్యనే తేజోవంతుడైన పుత్రుడుదయించాడని తెలిసిన అర్చకులు రథం ఆగడంలో ఏదో మర్మముందనుకొని, ఆసూరిదంపతులతో మీ పుత్రుడిని కొనిరండని కోరారు. వారిని రామానుజుని తీసుకుని వచ్చి కేశవస్వామికి చూపిన స్వామి ఆశీస్సులు, అర్చకుల అక్షింతలు అందుకున్న తరువాత రథం కదిలింది. వైష్ణవస్వాములంతా ఆశ్చర్యపోయారు.స్వామి కూడా చూడాలనుకుంటున్నాడు, ఎవరీ బాలుడు శేషుడా లేక విష్వక్సేనుడా? అనుకున్నారు. ఊరేగింపు ముగిసిన తరువాత వచ్చి కొందరు ఈ బాలుడిని చూసారు. నిద్రలో బుసలు కొడుతున్నట్టు పడకలో కుండలిగా నున్నట్టు వారికి తోచింది. ఆ బాలుడికి దిష్టి తగులుతుందని తల్లికి భయం. మీరు ఈతడు మహర్జాతకుడని అందరికీ చెప్పకండి. మా అన్నకు పట్టిన పిచ్చి మీకూ పట్టినట్టుంది. మనమేం పుణ్యం చేసామని మనకు భగవంతుడో ఆతని సేవకుడో పుత్రుడై పుడతాడు? ఇవన్నీ అందరితో అంటూ నా కొడుక్కు దృష్టిదోషం తగిలేట్టు చేయకండి. నరుడి చూపుకు నల్ల రాయి కూడా పగులుతుందంటారు. అని కర్పూరంతో దిష్ఠి తీసిందాతల్లి. మిరపకాయల దిష్టి తీసి మంటలో వేస్తే పెళ పెళ లాడే చప్పుడుతో కాలిపోయాయి. ఈమె కూడా చిటచిట మెటికలు విరిచింది. చెడు చూపులు సోకుతాయని అలంకరించడం మానేసింది. ఓరోజు బాలుడు పాలు తాగకపోతే దిష్టి సోకడం వల్లనే అని ఆమె అనుమానం.  మరోసారి బాలుడు పాలు తాగకపోతే ఏమిటా అని బాలుని తీసుకుని ఆరుబయట మంచిగాలిలో పక్కమీద పడుకోబెడితే కిలకిలమని నవ్వుతాడట. తల్లి చంకనుండి జరజరపాకుతూ సర్రున తలెత్తి చూస్తాడట. బోర్లపడి రొమ్ముతో పాకుతాడట.                  అతని అమితమైన తేజస్సులో మేనమామకు అద్భుతమైన భవిష్యత్తు దర్శనమైంది. గ్రహచార లక్షణాలను పరిశీలించాడు. ఇతను సామాన్యుడు కాడని శ్రీశైలపూర్ణుడు ఊహించాడు. చెవిదాకా విస్తరించిన కన్నులు... ఈతను కంటితోనే వింటాడా ఏమి? తల మీద విష్ణుపాదముల గుర్తుల వలె ఉన్నాయి. ఇది మహాసర్పలక్షణం.
- ఆచార్య మాడభూషి శ్రీధర్‌

మరిన్ని వార్తలు