నోరూరించే పసందైన వంటలు

1 Sep, 2019 11:13 IST|Sakshi

స్నాక్‌ సెంటర్‌

అరటి–క్యారెట్‌ వడలు
కావలసినవి: అరటికాయ – 1 (ఉడికించుకోవాలి), బియ్యప్పిండి – 1 కప్పు, పచ్చి శనగ పప్పు – అర కప్పు(నానబెట్టుకోవాలి), క్యారెట్‌ గుజ్జు – అర కప్పు, ఉల్లిపాయ – 1(సన్నగా తరిగినవి), వెల్లుల్లి ముక్కలు – పావు టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో ఉడికించిన అరటికాయను ముద్దలా చేసుకోవాలి. క్యారెట్‌ గుజ్జు, బియ్యప్పిండి, పచ్చి శనగపప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గారెల పిండి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్‌ సైజ్‌ మిశ్రమం తీసుకుని చేత్తో వడలా నొక్కి.. మరుగుతున్న నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే వడలు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.

ఎగ్‌ పరోటా
కావలసినవి: గుడ్లు – 5, మిరియాల పొడి –1 టీ స్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 3 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, క్యారెట్‌ తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – పావు టీ స్పూన్‌, కొత్తిమీర తురుము – అర కప్పు, కరివేపాకు – 3 రెమ్మలు, గోధుమపిండి – పావు కిలో, నూనె – సరిపడా, నీళ్లు – తగినన్ని

తయారీ: ముందుగా కోడిగుడ్లను ఉడికించి.. సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాత్రలో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము, కరివేపాకు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ.. గుడ్ల తరుగు, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని.. అందులో గోధుమపిండి, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా చేసుకుని.. అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలు చేసుకుని.. మధ్యలో గుడ్డు మిశ్రమాన్ని వేసి అంచులు మడవాలి. ఇప్పుడు నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే బాగుంటాయి.

కీమా సమోసా
కావలసినవి: మటన్‌ కీమా – 1 కప్పు, గరం మసాలా – 1 టీ స్పూన్‌, పసుపు – అర టీ స్పూన్‌, సోంపు పౌడర్‌ –1 టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్‌, ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి), నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా, అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి), గుడ్డు – 1, గోధుమపిండి – 1 కప్పు, మైదాపిండి – 2 కప్పులు, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, నీళ్లు – సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా

తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. వేగిన తర్వాత అల్లం – వెల్లుల్లి పేస్ట్, మటన్‌ కీమా జోడించి గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌ తీసుకొని అందులో.. గోధుమ పిండి, మైదాపిండి, గుడ్డు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కలిపి 15 నిమషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్నచిన్న చపాతీలు చేసుకుని... వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న మటన్‌ కీమా మిశ్రమాన్ని నింపి.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. వీటిని సాస్‌ లేదా కొత్తిమీర చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.
సేకరణ: సంహిత నిమ్మన

మరిన్ని వార్తలు