ఆ తల్లి ఏడుపే గుర్తొస్తుంది!

19 Jul, 2015 00:12 IST|Sakshi
ఆ తల్లి ఏడుపే గుర్తొస్తుంది!

ఘటన
అది 2009, సెప్టెంబర్ నెల, ఒక రోజు స్కూల్‌కి వెళ్లే సరికి ఒక అర్జెంట్ వార్త. ఇన్‌సర్వీస్ ట్రైనింగ్‌కి హైదరాబాద్‌కి వెళ్లాలి- అని చెప్పారు. ఇలాంటివి మాకు అర్జెంట్‌గా చాలా తక్కువ సమయం ఇస్తూ వస్తాయి. సరే మా స్కూల్ నుంచి నేను, ప్రభావతి మేడమ్ బయలుదేరాం. హైదరాబాద్‌లో ట్రైనింగ్ జరిగే ప్రదేశం వివరాలిచ్చారు. కానీ మాకు అదెక్కడ ఉందో తెలియదు. నగరంలో దిగి వెతుక్కోవాల్సిందే అనుకుంటూ బయలుదేరాం.

హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగేసరికి మాలాంటి ఎందరో ఉండక పోతారా అనే ధీమాలో రెలైక్కాం. మా రైలు లేటయ్యేసరికి ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరూ స్టేషన్‌లో కనిపించలేదు. ఇక మా పాట్లు మొదలయ్యాయి. ఆటోను పిలిచి ‘రామంతపూర్‌లోని సెయింట్ జాన్స్‌సెమినరీ’ అని చెప్పాం. ‘లోపలికి పోవాల్నా మేడమ్’ అన్నాడతడు. మాకు మాత్రం ఏం తెలుసు... గేటు నుంచి లోపలకు కిలోమీటరు ఉంటుందని. ఏదో అదృష్టం కొద్దీ లోపలికే బేరమాడుకుని ఆటో ఎక్కాం.
 
సెయింట్ జాన్స్ సెమినరీ గేట్ దగ్గర నుంచి లోపలికి పోతూ ఉంటే చిన్న అడవిలో పోతున్నట్లు ఉంది. చక్కగా తలలూపుతున్న చెట్లు, చల్లటి గాలి... అసలు సిటీ వాతావరణమే లేనట్లు హాయిగా అనిపించింది. దారిలో మాలాంటి టీచర్లు బ్యాగ్‌లు మోసుకుంటూ వెళ్లడం కనిపించింది. దేవుడా! గేటు దగ్గర దిగి ఉంటే మాకూ ఇదే పరిస్థితి అనుకుంటూ సెంటర్‌కు వెళ్లే సరికి అప్పటికే ఆలస్యం అయిపోయిందట. పర్సనల్ రూములు లేవు. కామన్ గదుల్లో సర్దుకోవాలని చెప్పారు.

శ్రీకాకుళం, వైజాగ్, నెల్లూరు, రాయలసీమ, ఆదిలాబాద్... మొత్తం ఇరవై మూడు జిల్లాల నుంచి వచ్చిన వారంతా ఉన్నారు. గదిలో పది మంచాలు, టాయిలెట్స్ బయట. ఎవరికి వాళ్లం లోలోపలే ‘ఛ కొంచెం ముందుగా రావల్సింది’ అని తిట్టుకున్నాం. కొంత సేపట్లోనే అందరి పరిచయాలయ్యాయి. రెండు బుజ్జి చందమామలతో కూడా. ఒకరికి ఏడు నెలలు, ఒకరికి ఎనిమిది నెలలు. మరి లేడీ స్టాఫ్‌కి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ వేస్తే ఇలాగే ఉంటుంది. మరీ చంటి పిల్లలైతే అమ్మను అడగరు. కానీ అమ్మను గుర్తు పట్టడం మొదలైతే అమ్మ వెంట రావాల్సిందే మరి. అలాంటి తల్లులు తోడుగా ఒకరు చెల్లిని, మరొకరు అత్తగారిని తెచ్చుకున్నారు.
 
అది రంజాన్ మాసం. వహీదా అత్తగారు రోజా చేస్తూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటే మేము ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లం వంతుల వారీగా బిడ్డను ఆడించేవాళ్లం. రాత్రికి సరదా కబుర్లు, స్కూలు పిల్లల జోక్స్‌తో గడిచిపోయేది.
 ‘‘వృత్తంలో అన్ని రేఖల కంటే పెద్దది ఏది’’ అని అడిగితే ఓ స్టూడెంట్ ‘భూమధ్య రేఖ’ అన్నదట. ‘ఆహా! ఏం స్టూడెంట్ మీకు! మ్యాథ్స్‌లో సోషల్ కలిపి చెప్పింది’ అని దుర్గ టీచర్‌ని ఆట పట్టించాం.
 అది ట్రైనింగ్ మొదలైన మూడో రోజు... మాకు క్లాసు జరుగుతోంది. ఎక్కడి నుంచో చిన్నగా ఏడుపు. చంటి బిడ్డ ఏడుపే. విననట్లే అందరూ రాసుకుంటూన్నారు. పిల్లలను తెచ్చుకున్న తల్లులు మాత్రం ఆదుర్దాగా కిటికీలోంచి బయటకు చూస్తున్నారు.

ఏ తల్లికి బిడ్డ కోసం పాలు పొంగుతున్నాయో ఎవరికి తెలుసు? పరశురామ్ గారు తిరిగి చూసినా ఒప్పుకోరు. అందరూ తల తిప్పకుండా పుస్తకాల్లో తల దూర్చి ఇచ్చిన ప్రాజెక్ట్స్ చూస్తూ ఉన్నాం. సన్నగా మొదలైన ఏడుపు క్రమంగా పెద్దదవుతోంది. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది బిడ్డ. అమ్మ కనిపించే వరకు ఆ ఏడుపాగదు. ఉన్నట్లుంది అనూష మేడమ్ లేచి వెళ్లి పోయింది. పర్మిషన్ అడగాలని కూడా మర్చిపోయిందా క్షణంలో.

కన్నీళ్లు చెంపల మీద నుంచి జారిపోతున్నాయి. తుడుచుకోవాలనే ధ్యాస కూడా లేకుండా ఒకటే పరుగు. అందరం పైకి లేచి కిటికీ లో నుంచి తొంగి చూశాం. ఆ క్షణంలో ఎవ్వరికి కూడా క్లాస్‌లో ఉన్నామన్న స్పృహ కలగలేదు. గుక్క పట్టి ఏడుస్తున్న బిడ్డ ఊపిరి ఆగిపోతుందేమోనన్న ఆందోళన ఒక్కటే.

బాబు అమ్మ ఎత్తుకున్నా ఏడుపు ఆపలేదు. బాగా భయపడిపోయినట్లున్నాడు. బిడ్డను ఎత్తుకున్న తర్వాత కానీ అనూష మేడమ్‌కి తాను క్లాసు నుంచి వచ్చేశానని గుర్తుకు రాలేదు. భయంగా క్లాసు వైపు రాబోతుంటే... అందరం ‘మేడమ్, రూముకి తీసుకెళ్లండి’ అని అరిచాం. బాబును గుండెకు హత్తుకుంటూ కొంగు చాటు చేసుకుంటూ గది వైపు వెళ్లి పోయింది. బిడ్డ ఏడుపు తగ్గుముఖం పట్టడంతో అందరిలో రిలీఫ్. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ఒక్కొక్కరుగా ట్రైనింగ్ ఇన్‌చార్జ్ దగ్గరకు వెళ్లాం. ‘సార్! పసిబిడ్డల తల్లులకు ట్రైనింగ్ వేయొద్దు’ అని రిక్వెస్ట్ చేశాం.

ఆ సంఘటన ఆయన్ను కూడా కదిలించి వేసింది. ‘అలాగే నేను పై వాళ్లకు చెబుతాను’ అని హామీ ఇచ్చారు. మరి ప్రెగ్నెంట్స్ సంగతి? పైగా ఇలాంటి హామీలు ఇవ్వడమే కానీ, అవి అమలు జరగడం ఎప్పుడూ చూడలేదు. అప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్న చంటి బిడ్డల తల్లులను చూసినప్పుడు ఆ రోజు ఆ బిడ్డ ఏడుపు, తల్లి ఏడుపే గుర్తుకు వస్తూ మనసు పిండేసినట్లు ఉంటుంది.
- వాయుగుండ్ల శశికళ, టీచర్, సూళ్లూరుపేట

మరిన్ని వార్తలు