నాన్నా పులి

23 Jul, 2016 22:34 IST|Sakshi
నాన్నా పులి

కవర్ స్టోరీ : జూలై 29 ఇంట‌ర్నేష‌న‌ల్ టైగ‌ర్ డే
పులి మన జాతీయ జంతువు. పులుల్లో చాలా రకాలు ఉన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే ‘రాయల్ బెంగాల్ టైగర్’... తెలుగులో చెప్పుకోవాలంటే ‘బెంగాలీ రాచపులి’ మన జాతీయ జంతువు. ఇప్పటికీ పులుల జనాభాలో మన దేశానిదే అగ్రస్థానం. స్వతంత్ర దేశానికి జాతీయ జెండా, జాతీయ గీతం ఉన్నట్లే జాతీయ జంతువు, జాతీయ పక్షి వంటివి కూడా ఉండటం ఒక లాంఛనం. జాతీయ జంతువు హోదా కట్టబెట్టడం వల్ల పులులకు ఒరిగిందేమీ లేదు. ఒకప్పుడు మనదేశంలో అడవులు విస్తారంగా ఉండేవి. పులులు కూడా గణనీయంగానే ఉండేవి.

గడచిన వందేళ్లలో అడవుల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది.  పులుల సంఖ్య  మరీ దారుణంగా తగ్గిపోయింది. పులులు ఇక అంతరించిపోతాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవల సేకరించిన పులుల జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో గడచిన మూడేళ్లలో వాటి సంఖ్య ముప్ఫయి శాతం మేరకు పెరిగింది. ఇదొక ఆశాజనకమైన పరిణామం. ఇదే పరిస్థితి ఇంకొన్నేళ్లు నిరంతరాయంగా ఇలాగే కొనసాగితే పులుల మనుగడకు మరేమీ ఢోకా ఉండదు.

 
పులిని చూసి భయపడినోడు పిరికోడు...
 
పులిని కాపాడుకున్నోడు నిజమైన భారతీయుడు...
 
ఇవాళ పిల్లలు భయంతో కాదు... గర్వంగా అంటున్నారు...
 
రాచఠీవికి, గాంభీర్యానికి ప్రతీక పులి. అప్రమత్తతకు, తెగువకు సంకేతం పులి. భీతిగొలిపే స్ఫురద్రూపానికి, తిరుగులేని శక్తికి, లక్ష్యంపైకి విజృంభించి వేటాడే పట్టుదలకు చెరగని చిరునామా పులి.
 
పులుల కథ
జానపద గాథల్లో పులులను ఎదుర్కొన్న సాహస వీరుల కథలను గగుర్పాటుతో ఆసక్తిగా ఆలకించిన జ్ఞాపకాలు చాలామందికి ఉండే ఉంటాయి. నరమాంసం రుచి మరిగిన పులులను వేటాడిన వేటగాళ్ల సాహసాలను కథలు కథలుగా చెప్పుకోవడం తెలిసే ఉంటుంది. జానపద గాథల్లోనే కాదు, పురాణాల్లోనూ పులుల ప్రస్తావన ఉంది. చాలామంది చిన్నప్పుడు సర్కస్‌లో లేదా జూ పార్కులో పులులను చూసి ఉంటారు. అవకాశం ఉన్నవాళ్లు అభయారణ్యాల్లో సఫారీకి వెళ్లినప్పుడు పులులను మరింత చేరువగా చూసి ఉంటారు.

పులుల గురించి చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చాలా సంగతులను, సామెతలను, పులితో పెనవేసుకుపోయిన పదబంధాలను వినే ఉంటారు. ముదురు పసుపు మేనిపై నలుపు తెలుపు చారలతో కనిపించే పులుల గురించి తమకు చాలా సంగతులు తెలుసనే చాలామంది అనుకుంటారు. అయితే, పులుల జీవనశైలి గురించి, వాటి వర్తమాన స్థితిగతుల గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి.

ప్రపంచంలో పులుల సంఖ్య అంతరించిపోయే దశకు చేరుకోవడంతో మేల్కొన్న అంతర్జాతీయ సంస్థలు పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో 2010 నవంబర్ 24న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మొట్టమొదటి పులుల సదస్సును నిర్వహించాయి. ఆ సదస్సు జూలై 29న అంతర్జాతీయ పులుల దినంగా పాటించాలని తీర్మానించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు... ముఖ్యంగా పులుల జనాభా గల దేశాలు అంతర్జాతీయ పులుల దినాన్ని పాటిస్తున్నాయి.
 
పులులు... పుట్టుపూర్వోత్తరాలు
జంతులోకంలో పులులదీ, పిల్లులదీ ఒకటే జాతి. అందుకే పులిని ‘బిగ్ క్యాట్’ అంటారు. ఇవి స్థూలంగా ‘ఫెలైన్’ జాతికి చెందినవి. ఇవన్నీ మాంసాహార జంతువులు. మనుగడ కోసం ఇతర జంతువులను వేటాడి తింటాయి. ‘ఫెలైన్’ జాతిలో 41 రకాల ఉపజాతులు ఉన్నాయి. ఇవన్నీ సుదీర్ఘ గతానికి చెందిన ఒకే జంతువు నుంచి పరిణామం చెందాయి. వీటిలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. వీటిలో భారీగా ఉండి, అడవుల్లో సంచరించే అన్ని రకాల పులులు, చిరుతలు, సింహాలను ‘పాంథరీన్’ అంటారు. మిగిలిన రకాల పిల్లులను ‘ఫెలినే’ అంటారు.

‘ఫెలైన్’ జాతిలోని జంతువుల్లో పులులే పెద్దగా ఉంటాయి. ఎదిగిన మగపులి బరువు దాదాపు 250 కిలోల వరకు ఉంటుంది. ముక్కు నుంచి తోక వరకు పొడవు సుమారు పది అడుగుల వరకు ఉంటుంది. ఆడపులి బరువు సుమారు 160 కిలోలు, పొడవు దాదాపు ఎనిమిదిన్నర అడుగుల వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు మొత్తం తొమ్మిది జాతుల పులులు ఉండేవి. వాటిలో మూడు జాతుల పులులు పూర్తిగా అంతరించిపోయాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి.
 
మనుగడ సాగిస్తున్న పులులు: రాయల్ బెంగాల్ టైగర్, ఇండో-చైనీస్ టైగర్, మలయన్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రన్ టైగర్
అంతరించిపోయిన పులులు: బాలీ టైగర్, కాస్పియన్ టైగర్, జావన్ టైగర్
 
పులుల రాజ్యం
ప్రపంచంలో పులుల రాజ్యం టర్కీ నుంచి రష్యా తూర్పు తీరం వరకు విస్తరించి ఉండేది. గడచిన వందేళ్లలో పులులు తమ ఆవాసంలో 93 శాతం విస్తీర్ణాన్ని కోల్పోయాయి. అడవుల నరికివేత వల్ల, వేటగాళ్ల వల్ల వాటి జనాభా దాదాపు 97 శాతం మేరకు తగ్గిపోయింది. 1913 నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష పులులు ఉండేవి. 2010 నాటికి వాటి సంఖ్య 3,200కు పడిపోయింది. తాజా లెక్కల ప్రకారం పులుల సంఖ్య 3890కి చేరుకుంది.

వందేళ్లలో పులుల జనాభాలో తొలిసారిగా నమోదైన పెరుగుదల ఇది. ఇకపై కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు కాగలదని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. భారత్, నేపాల్, భూటాన్, రష్యాలలో పులుల సంఖ్య బాగానే పెరిగింది.పులుల జీవితచక్రం
ఆడపులి ఒక ఈతలో రెండు నుంచి ఆరు వరకు పిల్లలను పెడుతుంది. వీటిలో కొన్ని పూర్తిగా ఎదగక ముందే కన్నుమూస్తాయి. పుట్టినప్పుడు పులిపిల్ల బరువు ముప్పావు కిలో నుంచి ఒకటిన్నర కిలో వరకు ఉంటుంది. వాటికి మూడున్నర నెలల వయసు వచ్చేంత వరకు తల్లిపులి వాటిని తన స్థావరంలో ఉంచి, కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
 
ఆ తర్వాత తల్లి వద్ద వేట మెలకువలు నేర్చుకుంటాయి. ఏడాదిన్నర వయసు వచ్చేసరికి సొంతంగా వేటాడే స్థితికి చేరుకుంటాయి. అయితే, రెండున్నరేళ్లు వచ్చేంత వరకు తల్లి వద్దే పెరుగుతాయి. తర్వాత తల్లిని విడిచిపెట్టి వాటి దారి అవి చూసు కుంటాయి.
 
‘హద్దు’మీరనివ్వవు
అడవిలో సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి. సరిహద్దులను గుర్తించడానికి ఇవి ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తాయి. ఒకసారి ఇలా సరిహద్దులను ఏర్పాటు చేసు కున్న తర్వాత, ఆ సరిహద్దులు దాటి ఏ ఇతర జంతువులు ప్రవేశించినా దాడికి తెగబడతాయి. ఆడపులులు మూడున్నర నుంచి నాలుగేళ్ల వయసులోను, మగపులులు ఐదు నుంచి ఆరేళ్ల వయసు లోను పునరుత్పత్తి సామర్థ్యాన్ని సంతరించు కుంటాయి. పులుల ఆయుర్దా యం గరిష్ఠంగా 26 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే, వేట, వైపరీత్యాలు, వ్యాధులు వంటి కారణాల వల్ల వాటి సగటు ఆయుర్దాయం పదేళ్లకు మాత్రమే పరిమితమవుతోంది.
 
మృగయా వినోదంతోనే ముప్పు

వేట ఒక వేలం వెర్రి. మృగయా వినోదం మన దేశంలో అనాదిగా ఉన్నదే. ఈ వినోదమే మనుషులకు చెలగాటం, పులులకు ప్రాణసంకటంగా పరిణమించింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట రాచరికపు సరదాగా ఉండేది. అక్బర్ చక్రవర్తి విరివిగా పులుల వేటలో పాల్గొనేవాడు. ఆ తర్వాత బ్రిటిష్ హయాంలోనూ మన దేశంలో పులుల వేట విచ్చలవిడిగా సాగినా, స్వాతంత్య్రం వచ్చే నాటికి కూడా పులుల సంఖ్య గణనీయంగానే ఉండేది. బ్రిటిష్ హయాంలో పులుల వేటలో పేరుమోసిన కొందరు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో పులులను హతమార్చేవారు.

కల్నల్ జెఫరీ నైటింగేల్ అనే బ్రిటిష్ సైనికాధికారి 1920ల కాలంలో ఏకంగా మూడువందల పులులను మట్టుబెట్టాడు. చరిత్రకారుడు మహేశ్ రంగరాజన్ అంచనా ప్రకారం 1875 నుంచి 1925 మధ్య కాలంలో వేటగాళ్ల తూటాలకు దాదాపు 80 వేల పులులు బలైపోయాయి. స్వాతంత్య్రానంతర కాలంలో ఇప్పటి ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా మహారాజా తాను 1150 పులులను వేటాడినట్లు 1965లో బహిరంగంగా చెప్పుకున్నాడు. అప్పట్లో రాజవంశీకులు, జమీందార్లు తాము వేటాడిన పులుల చర్మాలను ఇళ్లలో అలంకారంగా ఉంచుకునేవారు. పులిగోర్లతో పతకాలు తయారు చేయించుకుని, వాటిని మెడలో ధరించి దర్పాన్ని ప్రదర్శించేవారు.

ఇక స్వాతంత్య్రానంతరం విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మన ప్రభుత్వం అప్పట్లో ‘షికార్’ (వేట) కోసం భారత్ రావచ్చంటూ విదేశీ పత్రికల్లో ప్రకటనలు గుప్పించింది. అక్కడితో వేటగాళ్ల తాకిడి బాగా పెరిగి, పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పులుల సంఖ్య దారుణంగా తగ్గిపోయిన దశలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రభుత్వం మెలకువ తెచ్చుకుని పులుల సంరక్షణ కోసం 1972లో ‘ప్రాజెక్ట్ టైగర్’కు రూపకల్పన చేసింది. మన దేశంలో 1971 నాటికి పులుల సంఖ్య 1800కు పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ టైగర్ 1973 నుంచి అమలులోకి వచ్చింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టానికి 2006లో సవరణ తెచ్చి, జాతీయ పులుల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో పులుల కోసం 47 అభయారణ్యాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పులులు సంచరించే దేశాలన్నీ కలసి 1993లో గ్లోబల్ టైగర్ ఫోరమ్‌గా ఏర్పడ్డాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పులుల సంరక్షణ కోసం దశాబ్దాలుగా సాగిస్తున్న కృషి ఇప్పుడిప్పుడే సత్ఫలితాలనిస్తోంది.
 
వైద్యంలో పులి
పులి శరీర భాగాలను వైద్యంలో ఉపయోగించే పురాతన పద్ధతి చైనాలో ఇప్పటికీ కొనసాగుతోంది. పులుల శరీర భాగాలతో తయారయ్యే ఔషధాలతో చాలా వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం. పులుల శరీర భాగాల్లో ఏయే భాగాలతో తయారయ్యే ఔషధాలను ఏయే వ్యాధులు నయమవుతాయని నమ్ముతారంటే...
 
పులి పంజా : నిద్రలేమికి
పులి కోరలు : జ్వరాలకు
పులి కొవ్వు : కీళ్ల నొప్పులకు, కుష్ఠువ్యాధికి
ముక్కు చర్మం     : జంతువుల కాట్లకు
పులి ఎముకలు : కీళ్ల నొప్పులు, పక్షవాతం, తలనొప్పులు, విరోచనాలు....
పులి కనుగుడ్లు : మూర్ఛవ్యాధికి, మలేరియాకు
పులి తోక     : రకరకాల చర్మవ్యాధులకు
పులి మీసాలు : పంటి నొప్పులకు
పులి మెదడు : మొటిమలకు, అలసటకు, బద్ధకానికి
పులి మలం : తాగుడు మాన్పించడానికి, మూలవ్యాధికి
పురుషాంగం    : వాజీకరణ చికిత్సలో ఉపయోగిస్తారు
 
పులుల గురించి అవీ ఇవీ...
పులులు తమ సరిహద్దులను నిర్ణయించుకోవడానికి అవి ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో మూత్రం విసర్జిస్తాయని తెలిసిందే కదా! ఆ సరిహద్దుల నడుమ ఉన్న ప్రాంతాన్ని పులి తన రాజ్యంగా పరిగణిస్తుంది. మగ పులి రాజ్యం విస్తీర్ణం దాదాపు 60-100 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఆడపులి రాజ్యం విస్తీర్ణం దాదాపు 20 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
 
సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు పులులు ఇతర జంతువుల మాదిరిగా ధ్వనులు చేయలేవు. అయితే, కళ్లు మిటకరించడం ద్వారా లేదా తన్మయత్వంతో పూర్తిగా కళ్లు మూసుకోవడం ద్వారా అవి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి.
 
నీట్లో ఈదులాడటమంటే పులులకు చాలా సరదా. నదులు, చెరువులు కనిపిస్తే ఒక్కోసారి గంటల తరబడి ఈతకొడుతూ గడిపేస్తాయి. నీట్లో దొరికే జలచరాలను వేటాడి తింటాయి.
 
పులులకు కొంచెం మిమిక్రీ కూడా తెలుసు. పులులు, ఎలుగుబంట్లు తరచుగా ఒకదాని సరిహద్దుల్లోకి మరొకటి ప్రవేశిస్తుంటాయి. ఎలుగుబంట్లు తినే ఆహారాన్ని మాత్రమే కాదు, ఎలుగుబంట్లను కూడా పులులు వేటాడతాయి. తమ ప్రాంతంలో ఎలుగుబంటి ఏదైనా సంచరిస్తున్నట్లు అనుమానం వస్తే, ఎలుగుబంటికి ఎరగా ఉండే జంతువు ధ్వనులతో దానిని ఆకర్షించేందుకు పులి ప్రయత్ని స్తుంది. ఎర ఉందనుకుని వచ్చిన ఎలుగుబంటిపై దాడి చేస్తుంది.
 
పులులు ఇతర జంతువులను చూసి గాండ్రించడం చాలా అరుదు. అవి ఒకదానితో మరొకటి సంభాషించుకోవ డానికి మాత్రమే గాండ్రిస్తాయి. పులి గాండ్రింపు కనీసం రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది.
 
పులుల కళ్లు సాధారణంగా పారదర్శకమైన పసుపు రంగులో ఉంటాయి. అయితే, తెల్లపులుల కళ్లు మాత్రం నీలిరంగులో ఉంటాయి. ఎక్కువగా పులులు గోధుమరంగు ఛాయ కలగలిసిన ముదురు పసుపు రంగులో ప్రస్ఫుటంగా కనిపించే నల్లని చారలతో ఉంటాయి. రంగునిచ్చే పిగ్మెంట్ లోపించిన పులులు తెల్లగా ఉంటాయి. తెల్లపులులు కూడా బెంగాల్ టైగర్ జాతికి చెందినవే.
 
అత్యంత అరుదుగా కొన్ని పులులు పూర్తిగా తెల్లగా లేత రంగు చారలతో, బంగారు రంగులో, పూర్తి నలుపు రంగులో, నీలి రంగులో కూడా ఉంటాయి.
 
పులులకు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి మనుషుల కంటే మెరుగ్గా ఉంటుంది. మనుషులతో పోలిస్తే, వాటి స్వల్పకాలిక జ్ఞాపకశక్తి ముప్పయి రెట్లు ఎక్కువ.
 
మగసింహానికి, ఆడపులికి పుట్టిన వాటిని ‘లైగర్’ అంటారు. మగపులికి, ఆడ సింహానికి పుట్టిన వాటిని ‘టైగన్’ అంటారు.
 
పులి నుదుటి మీద కనిపించే చారల గుర్తుకు చైనా భాషలో ‘రాజు’ అర్థం ఉంది. మనుషుల వేలి ముద్రల్లానే పులుల చారలు కూడా దేనికదే ప్రత్యేకం. ఏ రెండు పులుల చారలూ ఒకేలా ఉండవు.
 
సరదా కోసం పులులను పెంపుడు జంతువుల్లా పెంచుకునే సెలిబ్రిటీలు ఉన్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వద్ద రకరకాల జంతువులు, పక్షులతో పాటు పులులు కూడా ఉన్నాయి. తీరిక వేళల్లో టైసన్ పులులను ఆడించడమే కాకుండా, వాటితో కలసి నీటి కొలనులో జలకాలాడుతుంటాడు. పాప్‌స్టార్ పారిస్ హిల్టన్ కూడా ఒక పులిని పెంచుకుంటోంది.

మరిన్ని వార్తలు