పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?

30 Nov, 2014 04:04 IST|Sakshi
పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?

పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?
    
నివృత్తం
 
 ‘పెళ్లి’ అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి దూరంగా వెళ్లిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని, కూతురును మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకుని, మనసారా ఆశీర్వదించి.. ఆమెకు ప్రీతిపాత్రమైన దుస్తులు, పసుపు-కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ‘ఒడిబియ్యం’ పోయడం అనే సంప్రదాయం పాటిస్తున్నారు.
 
ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగుపట్టమన్నాడట
 
కొందరు సందర్భాలను బట్టి మారుతుంటారు. మారడం అంటే ఇక్కడ ప్రతికూల అర్థం తీసుకోవాలి. సంపద ఉంటే ఒకలాగా, పరపతి ఉంటే ఒకలాగా, ఏమీ లేని వాళ్ల వద్ద ఒకలాగా ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన లక్షణం.
 
ఒక పేదవాడికి హఠాత్తుగా ఏ లాటరీయో తగిలి కోటి రూపాయలు వచ్చిందనుకుందాం. అపుడు అతను తన కుటుంబ అవసరాలు తీర్చుకోవడంలో, ఇల్లు-పొలాలు కొనుక్కోవడంలో, విలాసాలు అనుభవించడంలో తప్పులేదు. కానీ డబ్బుంది కదా ... పని మనుషులు ఉన్నారు... కదా అని పగటి పూట ఎండలో పట్టాల్సిన గొడుగును అర్ధరాత్రి పట్టుకోమని చెబితే సమాజం హర్షించదు. అలాంటి వారిని దూరంగా పెడుతుంది. పరిస్థితులకు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ డాబు చూసుకుని బతికే వాడు మిడిసి పడతాడు. అలాంటి వాడికి ఇబ్బందులు కూడా తప్పవన్న అర్థంలో ఈ సామెతను వాడతారు.

మరిన్ని వార్తలు