డోన్ట్ వరీ... బి పాజిటివ్!

7 Nov, 2015 23:08 IST|Sakshi
డోన్ట్ వరీ... బి పాజిటివ్!

ఆదర్శం
 కండర కండరులతో బ్యాంకాక్ సందడి సందడిగా ఉంది. ‘మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్’ కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో వచ్చారు. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎన్నో లెక్కలు, అంచనాలు. పోటీలు మొదలయ్యాయి. 65 కేజీల కేటగిరిలో మణిపూర్‌కి చెందిన ప్రదీప్‌కుమార్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడన్న వార్త ప్రపంచాన్ని తాకింది. ప్రదీప్ ముఖం అయితే ఆనందంతో వెలిగిపోయింది. అయితే అది ఆటలో గెలిచిన ఆనందపు వెలుగు కాదు. చీకటిని సవాలు చేసిన సాహసోపేత వెలుగు. అవమానం నడ్డి విరిచే ఆత్మ స్థ్యైర్యం నుంచి పుట్టిన వెలుగు. ఆ వెలుగు మళ్లీ కొద్ది రోజుల్లోనే మరోసారి అతనిలో కనిపించింది... ‘మిస్టర్ సౌత్ ఏషియా’ టైటిల్ గెలుచుకున్నప్పుడు! అతనిలో అంతటి విజయగర్వానికి కారణం తెలుసుకోవాలంటే... అతని గురించిన ఓ నిజం తెలుసుకోవాలి.
 
 1986. హెరాయిన్ మణిపూర్‌ను మత్తులో ఊపేస్తున్న కాలం. ఇంటర్ చదువుతోన్న ప్రదీప్, తన కజిన్ కారణంగా హెరాయిన్‌కు అలవాటు పడ్డాడు. అది తీసుకున్నప్పుడల్లా ఏదో శక్తి వచ్చినట్లు అనిపించేది. దాంతో దానికి బానిసైపోయాడు. అతడి దృష్టి మార్చ డానికి పై చదువుల కోసం ఒడిశాకు పంపించారు తల్లిదండ్రులు. అక్కడ ప్రదీప్‌కి హెరాయిన్ జాడ కనిపించలేదు. కానీ బ్రౌన్‌షుగర్ పరిచయమయ్యింది. ఆ కొత్త మత్తులో మునిగి తేలసాగాడు. పతనం వైపుగా ఒక్కొక్క మెట్టూ దిగు తూనే ఉన్నాడు. మెల్లగా చదువుతో పాటు జ్ఞాపకశక్తి కూడా దెబ్బ తినడం మొద లైంది. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుండేవి కావు. భవిష్యత్ ఎంతమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.
 
 సరిగ్గా అప్పుడే ఎయిడ్‌‌స అన్న మాట తొలిసారి విన్నాడు ప్రదీప్. ‘సిరంజీలను షేర్ చేసుకోవడం ద్వారా కూడా హెచ్‌ఐవీ సోకవచ్చు’ అని తెలిసి హడలిపోయాడు. మత్తుమందు తీసుకునే క్రమంలో ఎన్నో సార్లు ఇతరులు వాడిన సిరంజిని తాను వాడాడు. అంటే తనకి కూడా?... ఆ ఆలోచనే వణికించింది. ఇంకెప్పుడూ అలా చేయకూడదనుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.     
 
 ఒకరోజు తీవ్రమైన గొంతునొప్పి, జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గలేదు. ఏమీ తినలేని పరిస్థితి. దాంతో రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్)కు వెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి టీబీ అని చెప్పారు. బరువు తగ్గడం మొదలైంది. 30 కేజీలకు చేరుకున్నాడు. ఇక బతుకుతాడన్న నమ్మకం ఎవరికీ లేదు. చివరి ప్రయ త్నంగా గౌహతి మెడికల్ కాలేజీకి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. అప్పుడే అతనికి ఉన్నది టీబీ కాదని, ఎయిడ్‌‌స అని తెలి సింది. షాకైపోయాడు ప్రదీప్. ఏది జరగ కూడదనుకున్నాడో అదే జరిగిందని కుంగి పోయాడు. లోకమంతా ఏకమై తనను చూసి నవ్వుతున్నట్లు, తనను దూరంగా తరిమికొడుతున్నట్లు అనిపించేంది. దానికి తగ్గట్టుగానే ఫ్రెండ్‌‌స అందరూ దూరమై పోయారు. చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. బంధువులూ ఛీదరించుకున్నట్టు చూసేవారు.
 
 ఆ అవమానాలతో, ఆలో చనల భారంతో అలిసియాడు. ఆ బాధ లోంచి ఓ ప్రశ్న పుట్టింది. నేనేం తప్పు చేశాను? నాకు తెలియకుండానే ఈ వ్యాధి వచ్చింది. ఇది కేవలం జబ్బు. దీనికి నేను ఈ సమాజంలో బతికే అర్హతను కోల్పో వాలా? అలా అనుకోగానే కసి పెరిగింది. ‘ఇక భయపడుతూ బతకను. నా నుంచి దూరంగా వెళ్లిపోయినవాళ్లే నన్ను వెతు క్కుంటూ వచ్చేలా చేస్తాను’ అనుకున్నాడు. ఆ నిర్ణయం అతనిలో కొత్త శక్తి నింపింది.
 
 కానీ ముందు శరీరానికి శక్తి రావాలి. అందుకే హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు ప్రదీప్. రోజూ ఉదయం వాకింగ్ చేయడం ప్రారం భించాడు. మూడేళ్ల తరువాత పొరుగూరు లోని జిమ్‌లో చేరాడు. తన పరిస్థితి అక్కడెవరికీ తెలియదు కాబట్టి ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. అక్కడి యువ కుల బాడీ చూసి తనకూ అలా ఉంటే బాగుణ్ననిపించింది.
 
  ‘‘నేను బాడీ బిల్డింగ్ చేయవచ్చా?’’ అని డాక్టర్‌ను అడిగాడు. ఆయన ‘నో’ అన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. పట్టు వదలకుండా ప్రయత్నిం చాడు. బాడీ పెంచాడు. మూడేళ్ల తర్వాత ‘మిస్టర్ మణిపూర్’ టైటిల్‌ను గెలుచు కున్నాడు. ఆరోజు స్టేజిమీద తనకు హెచ్‌ఐవీ ఉందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ప్రదీప్. ‘‘నాలాంటి హెచ్‌ఐవీ పాజిటివ్ పేషెంట్లలో ఆత్మస్థైర్యం నింపడానికే  నిజం చెప్పాను’’ అన్నాడు. అతడు చెప్పిన నిజం వృథా పోలేదు. ఎందరో స్ఫూర్తి పొందారు. బాడీ బిల్డరులుగా మారారు. తలరాతనే తిరిగి రాసిన ప్రదీప్... ఇప్పుడు వాళ్లందరికీ గురువు!      
 

మరిన్ని వార్తలు