ఆ చీకట్లో.. ఆ చినుకుల్లో

13 Oct, 2019 09:05 IST|Sakshi

ఇది మీ పేజీ 

నాలుగు సంవత్సరాల క్రితం నాటి సంగతి ఇది. నెల్లూరు నుండి కడప జిల్లాలోని పప్పిరెడ్డిపల్లె అనే చిన్న ఊరికి వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం నెల్లూరు నుండి బయలుదేరాను. బస్సు తెల్లవారుఝామున ఒంటిగంటకు చేరింది. అక్కడి నుంచి పప్పిరెడ్డిపల్లె వెళ్లాలంటే రాయచోటికి వెళ్లే బస్సు ఎక్కి, కొండలవారిపల్లె అనే గ్రామ సమీపంలో ఉన్న రోడ్డుపై దిగి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న పప్పిరెడ్డిపల్లె నడుచుకుంటూ వెళ్లాలి.ముహుర్తం టైమ్‌కు వెళ్లాలి కాబట్టి రాత్రి ఒంటిన్నర గంటకు రాయచోటికి పోయే బస్‌ ఎక్కాను. అప్పుడే వర్షం మొదలైంది. బస్‌ కిటికీలు బిగించారు.సరిగ్గా రెండున్నర గంటలకు కండక్టర్‌ నన్ను లేపి ‘‘కొండవారిపల్లె స్టాప్‌ వచ్చింది’’ అని దిగమన్నాడు. బస్సు దిగాను. చిమ్మచీకటి. చిరు జల్లులు.

‘‘ఊరేదయ్యా?’’ అని అడిగితే– ‘‘ఎదురుగా ఉన్న డొంక వెంబడి వెళ్తే ఒక కిలోమీటర్లో ఆ ఊరు వస్తుంది’’ అని చెప్పాడు.నరసంచారం లేదు. కనుచూపు మేరలో లైట్లు లేవు. ఊరికి పోయే డొంక కనిపించలేదు. మూడు కిలోమీటర్లు ఆ చీకట్లో ఎలా పోగలను? అని రోడ్డుపైన చీకట్లో నిల్చున్నాను.ఒక గంట గడిచింది. ఒకటి రెండు లారీలు, ఒక వ్యాన్‌ వెళ్లిపోయాయి. నాకు ధైర్యం సడలింది. ఏదో ఒక బస్సు ఎక్కి అటు రాయచోటికి కాని వెనుదిరిగి కడపకుగాని పోదామని  ఎంత ప్రయత్నించినా ఏ బస్సూ ఆపలేదు. రోడ్డు దిగి రెండు గజాలు నడిచాను, తెల్లగా సున్నం రాసిన దిమ్మలాంటిది ఉన్నట్లు కనిపించింది.
కొంచెం కళ్లు చిట్లించి చూడగా దానికి మెట్లున్నట్లు గమనించాను.

నిదానంగా మెట్లు ఎక్కగా, కాలి స్పర్శ వల్ల అది ఒక అరుగుగా, దానికి రెండ్లు మెట్లున్నట్లు గమనించాను. నిదానంగా మెట్లు ఎక్కి అరుగు దగ్గరకు చేరాను. ముందు భుజాన ఉన్న సంచి తీసి ఆ అరుగు మీద పెట్టి కొంచెంసేపు కూర్చుందామనిపించింది.సంచి అరుగు మీద పెడుతుంటే ‘టంగ్‌’మని శబ్దం రాగా సంచిలో ఒక చిన్న పెన్‌టార్చి ఉన్న విషయం గుర్తుకువచ్చింది. అబ్బ! దీని సంగతే మరిచిపోయానే అనుకొని టార్చి బయటకు తీసి బాటరీలు సరిచేసి లైటు వేశాను.అరుగు ఒక పక్క ఎత్తుగా ఉంది.

‘ఏమిటబ్బా!’ అని లైటు అన్ని పక్కలకు వేశాను.అరుగు ఒక పక్క ఎత్తుగా ఉంది.‘మన్నెం రామసుబ్బమ్మ, నిర్యాణం’ అని ఉంది.ఇంకేముంది, గుండె గుభేలుమంది. అది శ్మశానం అని ఆ అరుగు గోరీ అని తెలియగానే భయం మొదలైంది. వెంటనే ఆ అరుగు మీద సంచి తీసుకొని గబగబా రోడ్డు మీదికి వచ్చాను. ఆంజనేయదండకం మొదలుపెట్టాను. ఒక గంట తరువాత ఒక బస్సు నాకు దూరంగా రోడ్డుపై ఆగింది. నేను గబగబా బస్సు దగ్గరకు పోయాను. అందులో నుంచి ఏడెనిమిది మంది ప్రయాణికులు దిగారు,కొంతసేపటికి వాళ్లలో ఒకరు ‘‘అరే నువ్వట్రా!’’ అని గుర్తుపట్టి ‘‘అక్కడికేనా?’’ అని అడిగాడు. ‘‘అవును’’ అన్నాను. ‘‘మన వాళ్లు వ్యాన్‌ పంపుతున్నారు’’ అనేసరికి ‘హమ్మయ్య’ అనుకున్నాను. ఇప్పటికీ బస్సులో ప్రయాణం చేస్తే ఈ సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుకుంటాను.
– పి.వి.సుబ్రహ్మణ్యం, నెల్లూరు 

మరిన్ని వార్తలు