బ్రహ్మోత్సవ పతికి బ్రహ్మాండ నీరాజనం

7 Oct, 2018 01:30 IST|Sakshi

భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట.  తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా  ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం.    ఈసారి అక్టోబర్‌ 10 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీ  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు  పూర్తి చేసింది.

అంకురార్పణతో ఆరంభం... 
వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారం నుంచి లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్తికా సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో (కుండలు)– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలైన నవ ధాన్యాలను పోసి ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు.  ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను అర్పింపచేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.

ధ్వజారోహణం
న భూతో న భవిష్యత్‌ అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక  నూతన వస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీనిని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు.  ఈ పటాన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండ మీదే ఉంటూ ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.

పెద్ద శేషవాహనం – మోక్షప్రాప్తి
ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరిన ప్రదేశం శేషాద్రి, ధరించేది శేష వస్త్రం, పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు.

చిన్న శేషవాహనం
రెండోరోజు ఉదయం స్వామి తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. పెద్ద శేషవాహనం ‘ఆదిశేషుడి’గా, చిన్న శేషవాహనం ‘వాసుకి’గా భావించవచ్చు. శుద్ధ సత్వానికి ప్రతీక అయిన పరమశివుని హస్తాభరణంగా, గళాభరణంగా విరాజిల్లే వాసుకి శ్రీనివాసుని సేవలో తరిస్తున్నారు. 

హంసవాహనం – జ్ఞానప్రాప్తి
రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్ళు వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా హంస వాహనం అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందువల్ల తుచ్ఛమైన కోర్కెలు అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటుతారని ఐతిహ్యం.

సింహవాహనం – కీర్తి ప్రతిష్ఠలు
బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహ వాహనమెక్కి   వేంకటనా«థుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహ వాహనాన్ని గమనశక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై భక్తులకు కనువిందు చేస్తారని ఆర్యోక్తి.

ముత్యపు పందిరి వాహనం – శాంతి సౌభాగ్యాలు
మూడోరోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి జరిగే సుకుమార సేవగా ముత్యపుపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తాడు. 

కల్పవృక్ష వాహనం – ఇహపరలోక సుఖం
కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వేంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యం ప్రసాదిస్తాడు. నాలుగో రోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు.

సర్వభూపాల వాహనం – అధికార ప్రాప్తి
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుతీరుతాడు. సర్వభూపాల వాహన సేవ... జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.  

మోహినీ అవతారం – అజ్ఞాన నాశనం
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదో రోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కారమిస్తారు. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు. 

గరుడవాహనం – సాయుజ్య ప్రాప్తి
తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఐదో రోజు రాత్రి ఊరేగుతాడు. స్వామివారి మూల మూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. వేంకటేశ్వరుడిని అనేక విధాల కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. గరుడునితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది.

హనుమంత వాహనం –  కైంకర్య లాభం
ఆరో రోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు. 

స్వర్ణ రథోత్సవం 
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన స్వర్ణ రథోత్సవం ద్వారా తెలియజేస్తాడు.  స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. 

గజ వాహనం – వైకుంఠ దర్శనం
గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి  ఈ వాహనంపై  ఊరేగుతాడు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.

సూర్యప్రభ వాహనం – ఆరోగ్యప్రాప్తి
బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసార«థిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగుతాడు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతాడు. 

చంద్రప్రభ వాహనం – మనోధైర్యం
ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తాడు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తాడు.

రథోత్సవం  – సద్విద్యా సాధనం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య గోవిందుడు ఈ ఉత్సవంలో ఊరేగుతాడు.

అశ్వవాహనం – మనో నిగ్రహం
ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతాడు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.

చక్రస్నానం – పాప ప్రక్షాళనం
ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్‌ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 

ధ్వజారోహణం
 ఉదయం చక్రస్నానం నిర్వహించిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. 
– తిరుమల రవిరెడ్డి, తిరుపతి 

మరిన్ని వార్తలు