మన కళా వైభవ కాంతులు

9 Nov, 2014 00:06 IST|Sakshi
మన కళా వైభవ కాంతులు

‘కళలు అంతూ దరీ లేని మహాసాగరం వంటివి. ఆ సాగరం అంతు కనుగొనడానికి తుదికంటూ ప్రయత్నించిన వారిలో నేనూ ఒకడిననే సంతృప్తి నాకు చాలు’ అంటారు కర్నాటి.  కళాప్రపంచానికి పరిచయం అక్కర లేని పేరు కర్నాటి లక్ష్మీనరసయ్య. కళాసాగరంలో విలువైన ముత్యాలను ఏర్చికూర్చి ‘కళావైభవం’ అందించారాయన. పుస్తకంలోకి వెళితే మనం గర్వించదగిన  కళాప్రపంచంలోకి వెళ్లినట్లే.
 
‘అడుగో కోదండ పాణి అడుగో’ అని పాడుకుంటూ తోలుబొమ్మలాట ముందు కూర్చోవచ్చు. ‘అడుగడుగున పద్యములే’ అంటూ అవధానాలలోకి తొంగిచూడవచ్చు. ‘చేరి వినవే శౌరి చరితము’ అని హరికథ వినిపించవచ్చు. అమరావతి శిల్పాలలో కళమునకలై పోవచ్చు. ప్రజానాట్యమండలి డప్పుల చప్పుళ్లు వినవచ్చు. కళాపరిషత్తుల నాటకాలతో చెలిమి చేయవచ్చు. ఒకటా రెండా! జానపద వాజ్ఞయం, శ్రామికగేయ సాహిత్యం, నటరత్నాలు, శిల్పసంపద, నాట్యకళలతో కరువు తీరా కబుర్లు చెప్పుకోవచ్చు.
 
సమాచారం పొంగి పొర్లే ఈ ‘గూగుల్’ కాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరమని ‘కళావైభవం’ మరోసారి నిరూపించింది. ఒకానొక కాలంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన కళాకారులు, తరువాత తరాలకు పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటి వారి గురించి తెలుసుకునే అపూర్వమైన అవకాశం ఈ పుస్తకం ఇస్తుంది. మొట్ట మొదట పాశ్చాత్య రీతిలో చిత్రరచన చేసిన అంకాల వెంకటసుబ్బారావు గురించి ఏ సెర్చ్ ఇంజన్ చెప్పగలదు! అందుకే అనడం...ఇది అక్షరాలా విలువైన పుస్తకం!
 - శ్రీకృష్ణ
 
 కళా వైభవం రచన: కర్నాటి
 పేజీలు: 560; వెల: 450
 సోల్ డిస్ట్రిబ్యూటర్స్: శ్రీ వెంకటేశ్వర బుక్ డిపో, 30-17-3ఎ, వారణాశివారి వీధి, సీతారాంపురం, విజయవాడ-2; ఫోన్: 0866-2444156

 

మరిన్ని వార్తలు