ధన పిశాచం

17 Dec, 2017 00:44 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

సాయంకాలం ఆరుగంటలైంది. చలికాలం కావడంతో అప్పుడే చీకటి పడింది.సంజీవ్‌ హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ ఆన్‌ చేసి న్యూస్‌ వాచ్‌ చేస్తున్నాడు.కాలింగ్‌ బెల్‌ మోగింది.‘పనిమనిషి ఇప్పుడే గదా వెళ్లింది. మళ్లీ వెనక్కి వచ్చిందా ఏం? లేకపోతే ఎవరొచ్చారు?’ అనుకుంటూ వెళ్లి తలుపు తీశాడు.గేటు దగ్గర ఎవరో యువతి నిలబడి ఉంది. భుజానికి హ్యాండ్‌బ్యాగ్‌ తగిలించుకుని, లగేజీ బ్యాగ్‌ పట్టుకుని కనిపించింది. వరండాలో లైట్‌ వేసి గేటు దగ్గరికి వెళ్లాడు.ఆమె అతణ్ని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమెను ఎక్కడా చూసిన జ్ఞాపకం రావడంలేదు.‘‘ఎవరండీ?’’ అడిగాడు సంజీవ్‌.‘‘హరిత ఫ్రెండ్‌ని. తనని పిలవండి’’ అన్నది.‘‘సారీ అండీ! వదిన లేదు’’‘‘వాట్‌? నన్ను రమ్మని తను ఎక్కడికి వెళ్లింది?’’‘‘మార్నింగ్‌ నాగార్జునసాగర్‌ వెళ్లారండీ’’‘‘నైట్‌కి వచ్చేస్తారా?’’‘‘ఊహూ.. రారండీ. నాగార్జునసాగర్‌ నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్తారు. ఈ నైట్‌ అక్కడే ఉంటారు. రేపు మార్నింగ్‌ అక్కడ దైవ దర్శనం చేసుకుని బయల్దేరతారు. లాంచీలోనే తిరుగు ప్రయాణం. నాగార్జునసాగర్‌ వచ్చి హైదరాబాద్‌ వస్తారు. రేపు నైట్‌కి ఇంటికి వస్తారు.’’ చెప్పాడు సంజీవ్‌.‘‘నన్ను గేటు దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఇంట్లోకి రానివ్వరా’’ నిష్టూరంగా అన్నది ఆమె.‘‘సారీ.. వెరీవెరీ సారీ..’’ అంటూ వెళ్లి గేటుకు వేసిన తాళం తీశాడు. ఆమె లోపలకు వస్తూ... ‘‘ఐ యామ్‌ శాలిని’’ అన్నది చేతిని ముందుకు చాచి.

‘‘సంజీవ్‌. నందీశ్వర్‌ కజిన్‌ బ్రదర్‌ని..!’’ అంటూ కరచాలనం చేశాడు.ఇద్దరూ లోపలకు వచ్చారు. ఆమె సోఫాలో కూర్చుంది.‘‘నన్ను రమ్మని తను టూర్‌ వెళ్లిందన్న మాట హరిత. బాగుంది. కాల్‌ చేస్తుంటే లైన్‌ కలవడం లేదు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. సిటీలో ఉందా? లేదా అని. ఇంటికి లాక్‌ చేసుంటే చచ్చేదాన్ని. మీరున్నారు కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఏదైనా హోటల్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఒంటరిగా లాడ్జిలో ఉండాలంటే భయంగా ఉంటుంది కదండీ. అసలే రోజులు బాగాలేవు. ఒంటరిగా ఫారిన్‌గర్ల్స్‌ వస్తారు పాపం. వాళ్లని రేప్‌ చేసి మర్డర్‌ చేశారని చదివితే హడలిపోతాను. ఇండిపెండెన్స్‌ వచ్చి సెవంటీ ఇయర్స్‌ అయినా ఆడవాళ్లకు సేఫ్టీ లేదండీ మన దగ్గర..!’’శాలిని టీవీ యాంకర్‌లా లొడలొడా వాగుతోంది.‘‘ఔనండీ.. ఔను..!’’ అన్నాడు ఆమెవైపు విచిత్రంగా చూస్తూ.ఆమె సెల్‌ఫోన్‌ తీసి డయల్‌ చేసింది. విసుగ్గా ముఖం పెట్టింది.‘‘హరిత నంబర్‌ కలవడం లేదు. వాయించాలి దాన్ని. నన్ను రమ్మని తను టూర్‌ ఎందుకు వెళ్లిందో? ప్లీజ్‌ మీరు కూడా ట్రై చెయ్యండి. లైన్‌ కలుస్తుందేమో?’’ అతణ్ని రిక్వెస్ట్‌ చేస్తూ అన్నది.సంజీవ్‌ కూడా సెల్‌ఫోన్‌ తీసి ట్రై చేశాడు.‘‘లేదండీ.. అన్నయ్య ఫోన్‌ కూడా కలవడం లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం అంతా ఫారెస్ట్‌ ఏరియా కదండీ. టవర్స్‌ ప్రాబ్లం అనుకుంటాను’’ అన్నాడు. ‘‘అంతే అయివుంటుంది లెండి. ఈ నైట్‌ ఇక్కడ స్టే చేయొచ్చుగా నేను. ప్రాబ్లమ్‌ ఏమీ లేదుగా..!’’ శాలిని ఓరగా చూస్తూ గోముగా అన్నది.

‘‘ఫర్వాలేదండీ.. ఉండండి. మా వదిన ఫ్రెండ్‌ మీరు...’’ అన్నాడు.‘‘రేపు హైటెక్స్‌లో మ్యారేజ్‌కి వెళ్లాలి. మీరూ నాతోపాటు రావాలి’’ అన్నది శాలిని.‘‘నేనెందుకండీ..?’’‘‘భలేవారే! ఒంటరిగా వెళ్తే అదోలా ఉంటుంది. హరిత ఉంటే వచ్చేది’’‘‘సరేలెండి...’’ అన్నాడు సంజీవ్‌ ఇబ్బందిగా చూస్తూ.‘‘ఓకే. నేను ఫ్రెష్‌ అవుతాను.’’ అంటూ లేచి ఒళ్లు విరుచుకుంది శాలిని. సంజీవ్‌ కన్నార్పకుండా నిండైన ఆమె శరీరాన్ని చూస్తున్నాడు. ఏకాంతం. పాతికేళ్ల పరువంలో ఉన్న బ్యూటీ శాలిని. సెక్సీగా కనిపిస్తుంటే ఒంట్లో అలజడి చెలరేగింది అతనికి.ఆమె ఫ్రెష్‌ అయి వచ్చింది.‘‘ఆకలి దంచేస్తోంది. నాకు ఏం మర్యాద చేస్తారు?’’ అన్నది.‘‘మర్యాదా?’’‘‘ఔను. హరిత ఉంటే రెడ్‌వైన్‌తో ప్యారడైజ్‌ బిర్యానీతో మర్యాద చేస్తుంది’’ గోముగా అన్నది.‘‘షూర్‌....’’ అన్నాడు.సంజీవ్‌ ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్లి రెడ్‌వైన్‌ బాటిల్‌ తీశాడు.

నందీశ్వర్‌ ఇంటికి ఉదయం ఏడింటికి పనిమనిషి రజిని వచ్చింది. గేటు తీసుకొని వెళ్లింది. మెయిన్‌ డోర్‌ నెట్టగానే తెరుచుకుంది.‘‘సంజీవ్‌ బాబూ..!’’ అని పిలిచింది.అతను పలకలేదు. మాష్టర్‌ బెడ్‌రూమ్‌ తలుపు నెట్టింది.బెడ్‌ మీద విగతజీవిగా కనిపించాడు సంజీవ్‌. కళ్లు తెరుచుకొనే ఉన్నాయి. నోరు తెరుచుకొని నాలుక బయటకు ఉంది.రజిని కెవ్వున కేకపెట్టి బయటకు పరుగెత్తింది. గేటు దగ్గర నిలబడి ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వాళ్లు వచ్చారు. ఎదురింటి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగిరెడ్డి, ఎస్సై శ్రీనివాస్, కొందరు కానిస్టేబుల్స్‌ వచ్చారు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. ఫొటోగ్రాఫర్‌ సంజీవ్‌ బాడీని ఫొటోలు తీస్తుంటే, ఫింగర్‌ప్రింట్‌ ఎక్స్‌పర్ట్‌ వాటిని సేకరించే పనిలో పడ్డాడు.    పనిమనిషి రజిని ఏడుస్తూ వరండాలో కూలబడి ఉంది. ఆమెను ఎస్సై శ్రీనివాస్‌ విచారిస్తున్నాడు. ఇంటి యజమాని నందీశ్వర్, అతని భార్య హరిత, పిల్లలు నాగార్జునసాగర్‌ టూర్‌ వెళ్లారనీ, ఇంట్లో నందీశ్వర్‌ బాబాయి కొడుకు ఒంటరిగా ఉన్నాడనీ, తను నిన్న సాయంకాలం ఆరింటి వరకు ఇంట్లో ఉండి పనిచేసి వెళ్లాననీ, ఉదయం వచ్చి చూస్తే తలుపులు తీసే ఉన్నాయనీ, సంజీవ్‌ చనిపోయి కనిపించాడని చెప్పింది రజిని.

మాష్టర్‌ బెడ్‌రూమ్‌ అంతా చిందరవందరగా ఉంది. బీరువాలో దుస్తులన్నీ కిందపడి ఉన్నాయి. దొంగతనం జరిగిందనీ.. డబ్బు, బంగారం పోయివుంటుందని పోలీసులు ఊహించారు.సంజీవ్‌ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కిచెన్‌ షింక్‌లో రెండు ప్లేట్లు, రెండు గాజు గ్లాసులున్నాయి. ఆ రాత్రి సంజీవ్‌తో ఎవరో ఉన్నారనీ, వాళ్లే అతణ్ని హత్య చేసి డబ్బు, నగలు దోచుకెళ్లారని అర్థమైంది. అతనితో గడిపింది ఎవరో తెలియాల్సి ఉంది.పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులో అతణ్ని గొంతు పిసికి చంపారనీ, రాత్రి పన్నెండు గంటలకు చనిపోయాడనీ, అతను ఒక స్త్రీతో గడిపినట్లుగా నిర్ధారణ అయింది. నందీశ్వర్‌ కుటుంబం ఇల్లు చేరుకునేటప్పటికి రాత్రి పదిగంటలైంది. అతను విపరీతంగా బాధ పడుతుంటే, అతని భార్య హరిత ఏడవసాగింది.‘‘రాత్రి మీ తమ్ముడు ఎవరో ఒక స్త్రీతో గడిపాడని రిపోర్టులో ఉందండీ! అతనికి ఎవరైనా గర్ల్‌ఫ్రెండ్‌ ఉందా? ఒంటరిగా ఉన్నానని ఆమెను పిలిపించుకున్నాడా?’’ అని ఇన్‌స్పెక్టర్‌ ప్రశ్నించాడు.‘‘లేదండీ! వాడు ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నాడు. వాడికి గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్నట్టు మా దృష్టికి రాలేదు’’ అన్నాడు నందీశ్వర్‌.‘‘మీ వాడికి కాల్‌ గర్ల్స్‌తో తిరిగే అలవాటు ఏమైనా ఉందా?’’‘‘అబ్బే లేదండీ.. అటువంటి అలవాట్లు లేవు’’‘‘మరి అతను గడిపింది ఎవరితో?’’‘‘అదే అర్థం కావడం లేదు’’‘‘దొంగతనం జరిగిందనేది తెలిసిపోతూ ఉంది. ఏమేం పోయాయో చెప్పండి’’హరిత చెప్పబోతుంటే వారించాడు నందీశ్వర్‌.‘‘క్యాష్‌ లక్ష రూపాయల వరకు ఉందండీ. మా ఆవిడకు ముఫ్ఫై తులాల నగలు ఉన్నాయి. అవన్నీ లేవు’’ చెప్పాడు నందీశ్వర్‌.నందీశ్వర్‌ బాబాయి, పిన్ని, ఇతర బంధుమిత్రులతో ఇల్లంతా నిండిపోయింది. అంతా సంజీవ్‌ అన్యాయమయ్యాడని విచారిస్తున్నారు. సంజీవ్‌ తల్లి గోడు గోడున ఏడుస్తోంది.‘‘వాడు హాస్టల్లో ఉంటున్నాడు. ఇంట్లో ఒక రాత్రి ఉండరా అని నేనే పిలిచాను. వాడి చావుకు నేనే కారణం’’ అని దుఃఖించాడు నందీశ్వర్‌.

ఆ కాలనీ చౌరస్తాలోనే ఉంది నందీశ్వర్‌ ఉన్న డూప్లెక్స్‌ హౌస్‌. ఒక పోల్‌కి వారం క్రితమే సీసీ కెమెరా ఫిక్స్‌ చేశారు. ఆ సంగతి చాలా మందికి తెలియదు.ఇన్‌స్పెక్టర్‌ నాగిరెడ్డి రికార్డయిన ఫుటేజ్‌ పరిశీలిస్తుంటే నందీశ్వర్‌ ఇంటివైపు వెళ్తున్న యువతి కనిపించింది. భుజానికి హ్యాండ్‌బ్యాగ్‌ తగిలించుకొని, లగేజ్‌ ట్రాలీ లాక్కుంటూ వెళ్లింది. ఇన్‌స్పెక్టర్‌ ఆ ఫుటేజ్‌ని వాట్సప్‌లో సిటీలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించాడు. బంజారాహిల్స్‌లో ఇందిరానగర్‌ కాలనీలో ఉంటున్న మాలినిగా పోలీసులకి ఆచూకీ దొరికింది. మాలిని సినీ/టీవీ రంగాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌. పోలీసులు మాలినీని తమదైన శైలిలో విచారిస్తే, ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్దాయి.నందీశ్వర్‌ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పని చేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు. కట్టలకట్టలు డబ్బు తెస్తున్నాడు. హరిత అప్పుడప్పుడూ నగరంలోని జ్యూయెలరీ షాపులకు వెళ్లి నగలు కొంటూ ఉంటుంది. పని మనిషి రజినిని తోడు తీసుకెళ్తూ ఉంటుంది. దాంతో రజినికి డబ్బు, బంగారంపై కన్నుపడింది.రజినికి ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండేవాడు. అతని పేరు మునీర్‌. క్యాబ్‌ డ్రైవర్‌. బాగుపడాలంటే నందీశ్వర్‌ ఇంట్లో దొంగతనం చేయడమే మార్గం అనుకున్నారిద్దరు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మునీర్‌కు మాలినితో కూడా సంబంధం ఉంది. నందీశ్వర్‌ కుటుంబం టూర్‌ వెళ్తున్నట్టు, ఆ రాత్రి సంజీవ్‌ ఒంటరిగా ఉంటాడని రజిని పసిగట్టింది. ముగ్గురు తోడు దొంగలు కలిసి స్కెచ్‌ వేశారు. మాలిని ఇంట్లో డబ్బు, నగలు దొరికాయి. దాదాపు కోటి రూపాయలు క్యాష్, కిలో బంగారు నగలు లెక్కలోకి వచ్చాయి. అంతా అక్రమార్జన కాబట్టి నందీశ్వర్‌ చెప్పుకోలేక పోయాడు. ఇప్పుడు పాపం పండి బయటపడింది. దొంగతనం, హత్య కేసుల్లో రజిని, మాలిని, మునీర్‌ జైలు పాలైతే... అక్రమార్జన కేసులో ఇరుక్కొని నందీశ్వర్‌ సస్పెండ్‌ అయ్యాడు.‘అధికారులను ధనపిశాచం పట్టుకుంది. అడ్డగోలు సంపాదన. ఎవర్ని పట్టుకున్నా కోట్ల కొద్దీ కట్టలపాములు, కిలోల కొద్దీ బంగారు నగలు, వందల కొద్దీ ప్లాట్లు, ఫ్లాట్లు బయటపడుతున్నాయి. వీరి సంపాదన చూసి కన్నుకుట్టిన వాళ్లు నేరస్తులవుతున్నారు. దేశం ఇంకేం బాగుపడుతుంది?’ అని పత్రికలు వ్యాఖ్యానించాయి.
వాణిశ్రీ 

మరిన్ని వార్తలు