నాకు హక్కులు కావాలి

1 May, 2016 14:44 IST|Sakshi
నాకు హక్కులు కావాలి

కవర్ స్టోరీ
నేడు కార్మిక దినోత్సవం
మనిషి శ్రమను సులువు చేయడానికి పుట్టింది. మనిషి పరిశ్రమను తగ్గించడానికి పుట్టింది. మనిషి అవసరాలు తీర్చడానికి పుట్టింది. కానీ మనిషిని మింగేయడానికి పుట్టలేదు. కాని రాబోయే రోజుల్లో యంత్రం మనిషిని పక్కన పెట్టనుందా? మనిషి శ్రమను తానే చేసి మనిషిని పస్తు పెట్టనుందా? రోబోల విజృంభణతో ఆ ప్రమాదమే కనిపించనుందని విజ్ఞులు భాష్యం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో, అంటే 2045 కల్లా చైనాలో 77 శాతం ఉద్యోగాలు ‘మనుషులు’ పోగొట్టుకో నున్నారు. భారత్‌లో ఈ సంఖ్య 69 శాతం అని అంచనా. అమెరికాలో ఇది కేవలం 47 శాతమే. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రోబోల వాడకం ఉంది కాబట్టి.
    
మనిషి తప్పు చేస్తాడు. తప్పుల నుంచే పాఠాలు నేర్చుకుంటాడు. అందులో నుంచే ఎదుగుతాడు. కాని యంత్రం తప్పు చేయదు. పైగా అది జీతం పెంచ మని అడగదు. సమ్మె నోటీసు ఇవ్వదు. యాజమాన్యాలు ఆరోపించినట్టుగా ‘పని ఎగ్గొట్టి’ టీలు కాఫీలు అని క్యాంటీన్లో గంటలు గంటలు గడపదు. అంతెందుకు... అది ఇంటికి పోదు. ఇంటి నుంచి రాదు. కనుక లేట్ ఎంట్రీ సమస్య కూడా ఉండదు. దానికి తెలిసింది పని చేయడమే. కనుక రోబోను ఎందుకు పెట్టుకోకూడదు? అనే ఆలోచన చాలా సంస్థల యాజమాన్యాలకు వస్తోంది. చైనాలో ‘ఫాక్స్‌కాన్’ అనే అతి పెద్ద కాంట్రాక్ట్ ఉత్పత్తి సంస్థలో పది లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.

2011లో ఆ సంస్థ పది వేల రోబోలను పనిలో విని యోగించింది. సంవత్సరానికి ముప్ఫై వేల రోబోలను పెంచుకుంటూ పోయింది. దాని వల్ల ప్రస్తుత సంవత్స రంలో భవిష్యత్ అవసరాలకు అవసరమైన పది లక్షల మంది మానవ కార్మికులను పనిలోకి తీసుకోవా ల్సిన అవసరం లేదని కంపెనీ తేల్చింది. అంటే అంతమంది చైనా కార్మికుల నోట ఒరిజినల్ మట్టే పడిందన్న మాట. అమెరికా యూరప్‌లలో అంటే ఎక్కడైతే మానవ కార్మికుల పనికి ఎక్కువ వేతనం చెల్లించాల్సి వస్తున్నదో అక్కడ మనుషుల కంటే రోబోలకే ప్రాధాన్యం ఇవ్వొచ్చనే వాదన బలపడుతోంది.

దాని ఫలితంగా డ్రైవర్లు, సేల్స్ బాయ్‌లు, గోడౌన్ కీపర్లు, క్యాషియర్లు, చిన్నా చితకా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వీళ్లంతా 2025 నాటికే పెద్ద స్థాయిలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఆరోగ్య రంగంలో ఇప్పటికే అనస్తీషి యన్లుగా రోబోలు పని చేస్తున్నాయి. క్యాన్సర్‌ను గుర్తించే రేడియాలజిస్టులుగా మనుషుల కంటే రోబోలే సమర్థంగా పని చేస్తున్నాయనే పరిశీలన ఉంది. ఈ నేపథ్యంలో రోబోల ఆక్రమణ ఎక్కడి దాకా వెళ్లనుందనేది అనూహ్యంగా ఉంది. మనిషికి ఉన్న అతి పెద్ద ఆయుధం ఊహాశక్తి.

రోబోలకు లేనిది మనిషికి ఉన్నది అదే. కాని రోబోలు కూడా ఆయా సంస్థల అవసరాల రీత్యా కొన్ని ‘ఊహలు’, ‘ప్రతిపాదన’లు చేయగలిగే స్థితికి టెక్నాలజీ అభివృద్ధి అవుతోంది. ముఖ్యంగా రోబోల వల్ల ఉత్పత్తి పెరగడం. భారీ ఉత్పత్తిని కోరే వారు అందువల్ల కూడా వీటిని ఆదరిస్తు న్నారు. ఇంకో పెద్ద ప్రమాదం ఏమంటే మనిషి ఐ.క్యు. (ఇంటెలిజెన్స్ కోషియెంట్) తీవ్రంగా పెరుగుతూ పోదు. కాని ఈ సంతవ్సరం తయారయ్యే రోబో ఐ.క్యు. కంటే రాబోయే రెండేళ్లలో తయా రయ్యే రోబో ఐ.క్యు. చాలా ఎక్కు వగా ఉండే అవకాశం ఉంది. అంటే రోబోలు తమ మేధస్సును పెంచుకుంటూ పోయి మనిషిని వెనక్కు వదిలేస్తాయన్న మాట. వీటితో మనిషి ఏ మాత్రం పోటీ పడగలడు?
    
మన పురణాలు దేనినీ వదల్లేదు. ఇలాంటి వాటికి కూడా నమూనాలను ఇచ్చి వెళ్లాయి. భస్మాసురుడు తన వరంతో తనే నాశనమయ్యాడు. మనిషి కూడా తను కని పెట్టిన రోబోతోనే తన ఉపాధిని నాశనం చేసుకోబోతున్నాడు. మనిషి యంత్రం కంటే మెరుగ్గా అవిశ్రాంతంగా పని చేయక పోవచ్చు. కాని హృదయంతో పని చేస్తాడు. శ్రద్ధతో పని చేస్తాడు. ఆవేశంతో పని చేస్తాడు. అనురక్తితో పని చేస్తాడు. ఆ పని వెనుక ఆ శ్రమ వెనుక ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. కృతజ్ఞత ఉంటుంది. తాను ప్రకృతికి సమాజానికి ఇవ్వగలిగింది ఇస్తున్నాననే ధన్యత కనిపిస్తుంది. మనిషికి మంచి చెడు తెలుసు. చెడును తగ్గించి మంచిని పెంచుకుంటూ పోవడం తెలుసు.
 
కాని యంత్రానికి అది తెలియదు. అది వికాసం కోసమే కాదు వినాశనం కోసం కూడా పని చేయగలదు. స్పందనే సృష్టికి ఆయువు. స్పందన లేని లోహం ప్రమాదానికి హేతువు. యంత్రం వర్సెస్ మనిషి మనుగడలో మనిషే గెలుస్తాడని మా నమ్మకం!
 
అది రోబోల రాజ్యం!
ఇటీవలి కాలంలో చైనాలో రోబోల వినియోగం బాగా పెరిగింది. దానికి ఉదాహరణ రోబో రెస్టారెంట్. గాంగ్జో నగరంలో ఉన్న ఈ రెస్టారెంట్లో మనుషులకు బదులుగా రోబోలు వెయిటర్లుగా పని చేస్తున్నాయి. కస్టమర్ల దగ్గరకు వచ్చి ఆర్డర్ చెప్పమని అడుగుతాయి. చెప్పినవి రాసుకుని కిచెన్లోకి వెళ్లి చెఫ్‌కి ఇస్తాయి. వంటకాలను తీసుకొచ్చి సర్వ్ చేస్తాయి. ట్రాలీలో డ్రింక్స్ పెట్టి తోసుకుంటూ రెస్టారెంట్ అంతా తిరుగుతుంటాయి. బిల్ ఇస్తాయి. కస్టమర్లు వెళ్లాక గిన్నెలు తీస్తాయి. టేబుల్ క్లీన్ చేస్తాయి. వాటి పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రోబోలైతే టిప్ కూడా ఇవ్వక్కర్లేదు అని మురిసిపోతున్నారు!
 
రోబోటిక్ లాన్ మౌవర్స్ లాన్లలో పెరిగిన గడ్డిని సమంగా కట్ చేస్తాయి. మొక్కలకు నీళ్లు కూడా పెడతాయి. ఆటోమేటెడ్ పూల్ క్లీనర్స్ అతి పెద్ద స్మిమ్మింగ్ పూల్‌ను కూడా మూడు గంటల్లో శుభ్రం చేసేస్తాయి.  పూల్‌ను ముందుగా స్క్రబ్ చేసుకుంటూ వెళ్లి, ఆపైన మంచి నీటితో కడిగేస్తాయి. చెత్త ఉంటే పూర్తిగా తీసేస్తాయి.
 
‘రూంబా’ అనే వాక్యూమ్ క్లీనర్ రోబోలు ఇంట్లో నేలను చక్కగా శుభ్రం చేస్తాయి. ‘డ్రెస్‌మ్యాన్’ అనే రోబోలు బట్టలు ఉతికి, వాటిని ఇస్త్రీ కూడా చేస్తాయి. మరికొన్ని రోబోలు కూరగాయలను కూడా ఇట్టే కట్ చేస్తాయి. అదే విధంగా కొన్ని దేశాల్లో అయితే వంట చేసే రోబోలు కూడా వచ్చేశాయి!
 
 
టీచింగ్ రోబోలు
పిల్లలతో హోమ్‌వర్క్ చేయిస్తాయి. దగ్గర కూర్చుని చదివిస్తాయి. చిన్నపిల్లలకు రైమ్స్ దగ్గర నుంచి పెద్ద వాళ్లకు కాలేజీ పాఠాల వరకూ అన్నిటినీ బోధిస్తాయి.
 
 
అన్ని దేశాల పరిశ్రమల్లోనూ రోబోలను ఉపయోగించడం ప్రారంభించారు. పరిశ్రమల్లో పని చేసే రోబోల కొనుగోళ్లు ఒక్క 2014లోనే 29శాతం పెరిగినట్లు ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్’ సంస్థ వెల్లడించింది.
 
ప్రపంచంలోనే తొలి ‘రోబో ఫామ్’ 2017లో జపాన్‌లో క్యోటో సమీపంలో ప్రారంభం కానుంది. ఈ కూరగాయల ఫ్యాక్టరీలో పూర్తిగా రోబోలే పనులు, పర్యవేక్షణ విధులు నిర్వహిస్తాయి. మనిషి అన్నవాడే అందులో ఉండడట!
 
చైనాలో ‘ఫాక్స్ కాన్’ అనే అతి పెద్ద ఉత్పత్తి సంస్థకు పది లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. 2011లో ఆ సంస్థ 10,000 రోబోలను పనిలో వినియోగించింది. సంవత్సరానికి 30,000 రోబోలను పెంచుకుంటూ పోయింది. దాని వల్ల భవిష్యత్ అవసరాలకు అవసరమైన మానవ కార్మికులు పది లక్షల మందిని పనిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ తేల్చింది. జర్మనీలో కూడా ప్రజల ఉపాధి అవకాశాలకు రోబోలు పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఉపాధిలో 59 శాతం రోబోలు ఆక్రమించుకుంటున్నాయి. రాబోయే కాలంలో కోటి ఎనభై లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని ఒక అధ్యయనం
 చెబుతోంది.
 
సెక్యూరిటీ
రోబోలు ఇంటికి అపరి చితులు వస్తే వెంటనే యజ మాని ఫోన్‌కు మెసేజ్ పంపు తాయి. ఇంట్లో దొంగలు పడితే ఆ తతంగాన్ని రికార్డు చేసి వీడియోను కూడా పంపిస్తాయి.
కర్టెసీ: డిజిటల్

మరిన్ని వార్తలు