కరెంటు లేకున్నా కూల్ కూల్!

15 Nov, 2015 01:31 IST|Sakshi
కరెంటు లేకున్నా కూల్ కూల్!

భలే బుర్ర
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫ్రిజ్. ఒకప్పుడు అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే వాడగలిగేవాళ్లు. ఆర్థిక సరళీకరణల తర్వాత మధ్యతరగతి ఇళ్లలో ఇప్పుడు ఫ్రిజ్జులు కనిపిస్తున్నా, పేదలకు మాత్రం ఇదింకా అపురూపమైన వస్తువే. ఫ్రిజ్జంటే మాటలా..? కొనాలంటే బోలెడు సొమ్ము ఉండాలి. అప్పో సొప్పో చేసి కొన్నా... దానికి నిత్యం విద్యుత్తు అందుతూనే ఉండాలి. ఫలితంగా కరెంటు బిల్లు పెరుగు తుంది. ఖర్మ కాలి అది గానీ పాడైతే, దానికి మరమ్మతు చేయడం కూడా భారీ ఖర్చుతో కూడుకున్న పనే.
 
ఇవన్నీ తట్టుకోవడం సామాన్యులకు భారమే! అందుకే ఫ్రిజ్ ఇప్పటికీ కొన్ని వర్గాల వారికి అందుబాటులో లేదు. అయితే, ఇలాంటి బెడదలేవీ లేకుండా, అసలు విద్యుత్తుతోనే పనిలేని ఫ్రిజ్‌కు రూపకల్పన చేశాడు మన్‌సుఖ్‌భాయ్ ప్రజాపతి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఈ ఇంజినీర్ ... విద్యుత్తు ఏమాత్రం అవసరం లేని ఫ్రిజ్‌ను రూపొందించాడు.

ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిజ్ అని పేరు పెట్టి, మార్కెట్‌లోకి తెచ్చాడు మన్‌సుఖ్. ఈ ఫ్రిజ్‌కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి.
 
బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిజ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు దాదాపు మూడువేలు... అంతే!
 

>
మరిన్ని వార్తలు