ఈ ‘జాడ్యం’ ఈనాటిది కాదు

19 Feb, 2019 01:11 IST|Sakshi

రెండో మాట 

తెలుగుదేశం అధినేతలో ప్రకోపిస్తున్న కుల జాడ్యానికి చాలా సంవత్సరాల చరిత్రే ఉంది. వెనక్కు తిరిగి చూస్తే ఆయన గత చరిత్రలో దీనికి సంబంధించి ఎన్నో దృష్టాంతాలు దొరుకుతాయి.  కమ్మ సామాజిక బృందానికే చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు.. రైతుకూలీల, బడుగుజీవుల ఈతిబాధలకు దారీ తెన్నూ చూపడానికి ఎనలేని కృషి సల్పి, పలు ఉద్యమాలు  నిర్వహించిన ఆచార్య రంగా తెలుగు సమాజంలో ఇతర కులాలను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో పోలిస్తే ఆయన కులంలోనే పుట్టిన చంద్రబాబు సొంతమామకు వెన్నుపోటు  పొడవడమే కాకుండా, నమ్మి వచ్చిన ఆశ్రితులను మోసగించి పబ్బం గడుపుకోవడంలో ఆరితేరిపోయారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు పాలనలో ఒకే ఒక సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధా న్యం లభిస్తోందన్నది ఆరోపణ కాదు, నిజం. టీడీపీ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతిని నా జీవితంలో ఎన్నడూ చూడ లేదు. ప్రతిపనికీ 20 నుంచి 30 శాతం దాకా బేరాలు సాగుతున్నాయి’’
– టీడీపీలో అత్యంత సీనియర్‌ నాయకుడు, అదే సామాజిక వర్గాని(కమ్మ)కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్‌ (15.02.2019)

‘‘చంద్రబాబులో కరడుకట్టిన కులతత్వాన్ని వ్యతిరేకించడానికీ, ప్రశ్నించడానికే టీడీపీని విడిచిపెట్టి వైఎస్సార్‌సీపీలో చేరాను. తన కులం లోని ఉన్నత వర్గాలకు తప్ప బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిం దేమీ లేదు. చివరికి పవిత్రమైన పసుపు–కుంకుమను బాబు జారుడు బండపై పోశారు. అవినీతి మార్గంలో అది గాలికి కొంత, నేలపై కొంతా జారవిడిచేశారు’’
– టీడీపీకి రాజీనామా చేసిన చీరాల ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఆమంచి కృష్ణమోహన్‌ (14.02.2019)

మనిషిలో వ్యక్తిత్వ వికాసం కేవలం ఎం.ఏ.లు, రాజకీయ, ఆర్థిక శాస్త్రాలలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ (అదీ పరీక్ష పేపర్లు దిద్దే ప్రొఫెసర్‌ల పుణ్యమా అని)లో పట్టాలు పొందినంత మాత్రాన కలగదు. మరి ఆ ‘వికాసం’ ఎలా ఉదయిస్తుంది– మంచి, చెడుల్ని నిర్ణయించే అతని ప్రవ ర్తనా నిబంధనావళి ద్వారానే రూపొందుతుంది. నిజానికి ఈ పరివర్తన కూడా ఒక విధంగా ‘జన్యు’ (జీన్స్‌) లక్షణ ఫలితమే అయి ఉండాలి. ఈ జన్యువే నాయకుడి మతిస్థిమితాన్ని కూడా తారుమారు చేస్తుంది. పార్ల మెంటు సమావేశాలు ముగిసేముందు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్న ట్టుగా బీజేపీతో నాలుగున్న రేళ్లుగా చెట్టాపట్టాలుకట్టి, కేంద్ర ప్రభుత్వ సంకీర్ణంలో భాగస్వామిగా ఉండి తన ‘తారాబలం’ వికటించేసరికి ఎత్తులు మార్చి నానా బాపతు రాజకీయ పక్షాలతో అకస్మాత్తుగా ‘పొత్తులు’ కలిపాడు బాబు. ఆ పొత్తుల్ని సమర్థించుకొని, తాను తెలుగు దేశం వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ను పొడిచిన వెన్నుపోటుతో సమానంగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకే వెన్నుపోటు పొడవడానికి బాబు సిద్ధమ య్యాడు. అందుకు సాకుగా మతిభ్రమించి ఢిల్లీలో ‘ఐక్య సంఘటన’ పేరిట ఏర్పాటైన సభలో ఆయన ఆడిన పచ్చి అబద్ధం ఏమిటో ఒక్కసారి పరిశీలించండి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అడ్డంకులు కల్గించడమే బీజేపీ –వైఎస్సార్‌ కాంగ్రెస్‌–టీఆర్‌ఎస్‌ల ఎజెండా. వీళ్లే అవంతి శ్రీనివాస్‌ (ఎంపీ) లాంటి వారు టీడీపీ నుంచి వెళ్లిపోవడానికి కారకులు. కనుకనే పొరుగు రాష్ట్రంలో ఆస్తులున్న టీడీపీ నాయకుల్ని బెదిరించి టీడీపీని వదిలి వెళ్లి పోతున్నట్టు వేధించేస్తున్నారు’’ (విజయవాడ 15.02.2019).

 అసలీ భయం వెనుక బాబు ఆందోళన వెనుక దాగిన రహస్యం ఏమిటి? ఈనెల 15వ తేదీన టీడీపీని వీడిపోయిన దాసరి రమేష్‌తో పాటు, రమేష్‌ సామాజిక వర్గానికే చెందిన అడుసుమిల్లి జయప్రకాశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కూడా వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డితో ఒకే వేదికపై సమావేశమై ఉండటమే– చంద్రబాబు తలనొప్పికి, మతిభ్రమణకు కూడా కారణమై ఉంటుంది. ఈ సందర్భంగా అవకాశవాద పరాకాష్టకు నిదర్శనంగా రాష్ట్ర రాజ కీయాల్లో ఒక అగ్రకులానికి, అదే సామాజిక వర్గానికి చెందిన ఒక యువ నాయకుడు మరో పెద్ద మనిషి కుమార్తెను వివాహమాడటానికి ముందు చేసిన నీతిమాలిన పని గుర్తుకొస్తోంది. అది తాడేపల్లి గ్రామం. ఆ ఊరి పిల్లను ముందు ఖాయం చేసుకున్నాడా యువనేత. కట్న కానుకల నిర్ణయం కూడా అయిపోయింది. అప్పటికి అతనికి ఉన్న ఆస్తి రెండున్నర ఎకరాలు. అయినా అతనికి పెళ్లికూతురు తల్లిదండ్రులు 3 ఎకరాల జామ తోట, 70 కాసుల బంగారం 50 వేల రూపాయల నగదు కట్నంగా ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ పిల్లతో నిశ్చితార్థం అయిపోయింది. పైగా పెళ్లికొడుకు ఊరి సర్పంచి సమక్షంలోనే తాంబూలాలు పుచ్చుకోవ డమూ అయిపోయింది. కానీ యువనేత అయిన ఆ పెళ్లికొడుకు కాస్తా మాట తప్పి, అవతల మరో పెద్ద మనిషి తాలూకు సంబంధం కళ్లకు జిగేలుమనిపించి, తనకు ‘అవతల మరొకరు 20 లక్షల కట్నం ఇవ్వ జూపారు కాబట్టి’ తాడేపల్లి సంబంధాన్ని సునాయాసంగా వదిలేశాడు. అలా ‘పసుపు–కుంకుమ’ తతంగం ‘మైల’ పట్టడం, నేలపాలు కావటం ఆనాడే జరిగిపోయింది.

ఆ ఘట్టం అలా ముగియగా, తరువాత ఎదిగిన మైకంలో ‘యువ నేత’ మరో పాపపు అధ్యాయానికి తెరతీశాడు. అతనికి ఉన్న ఒక కంపెనీకి తన స్నేహితుడైన మరొక పేరుమోసిన స్నేహితుడ్ని కూడా డైరెక్టర్‌గా చేర్చుకుని అతనికి చేసిన మోసం ఓ పెద్ద ఫోర్జరీ కావటం. ఇంతకీ ఏం జరిగిందట– ‘నువ్వు పదూళ్ల పాపరాజువి, కంపెనీ ట్రాన్షా క్షన్స్‌కు అవసరమైన తీర్మానం చేయవలసివస్తే నీవు ఎక్కడ ఉంటావో వెతకలేం కాబట్టి రెండు తెల్ల కాగితాల మీద నీ సంతకాలు చేసి పొమ్మ’ని ఆ యువనేత కోరగానే ఆ పదూళ్ల పాపరాజు కాస్తా తెల్ల కాగితంమీద (బ్లాంక్‌ పేపర్‌) నమ్మకంగా చేవ్రాలు చేసి ఇచ్చాడు. ఇక అంతే సంగ తులు– ఆ బ్లాంక్‌ పేపర్‌మీద ఆ యువనేత ‘కంపెనీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగిస్తూ’ తన స్నేహితుడికి తెలిపాడు. యువనేత నేరాన్ని సహించలేని అతని స్నేహితుడు న్యాయస్థానంలో ‘చీటింగ్‌ కేసు’ వేశాడు. ఆ దెబ్బతో చెమటలు పట్టిన ‘యువనేత’ ఎలాగోలా రాజీ బేరా నికి వచ్చి ‘బతుకు జీవుడా’ అని బయటపడాల్సి వచ్చింది. ఈ విష యాన్ని ప్రముఖ న్యాయ వాది బొజ్జా తారకం నాకు చెప్పి, చీటింగ్‌ కేసు తాలూకు దాఖలైన రుజుపత్రాన్ని కూడా నాకు చూపించాడు. 

విశేషమేమిటంటే ఈ ఘటన ఆ యువనేత కులస్థుడి విషయంలోనే జరిగిందని మరచి పోరాదు. దాసరి రమేష్‌ ప్రభృతుల విమర్శ ఆల స్యంగా వచ్చినా నిష్పాక్షికమైన విమర్శలకు ఆ అగ్రకులానికే చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఆచార్య ఎన్జీ రంగా సమాజంలో ‘కుల గజ్జి’కి సమాధానంగా గౌతులచ్చన్న, ప్రగడ కోటయ్య లాంటి వారిని కాంగ్రెస్‌ నిర్మాణంలో భాగస్వాముల్ని చేసి, వారి ఎదుగుదలకు చేదోడు వాదోడు కావటం రాష్ట్ర ప్రజలు మరవలేని సత్యం. పైగా నిమ్న జాతులు (మాల/మాదిగ), అణగారిన దళిత వర్గాలు అనే విభజనను రంగా ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. ‘ఈ కుల, వర్గం విభజన గ్రామీణ సామా జిక జీవనంలో విషబీజాలు నాటిం దనీ, గ్రామీణ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండేందుకు వీలు లేకుండా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిం దనీ ఆయన ఏనాడో హెచ్చరించారు.

పదమూడో శతాబ్దం దాకా కృష్ణానదికి రెండువైపులా విస్తరించి ఉన్న జిల్లా కృష్ణాజిల్లా అప్పట్లో దానికి వ్యవసాయక ప్రదేశమని పేరుం డేది. అది క్రమేపీ వ్యవసాయాధార ప్రాంతం కాబట్టి వ్యవసాయం అనేది ‘కృషి’ కాబట్టి. కృషికి మారుపేరు ‘కర్మ’ కాబట్టి, క్రమేపీ దానికి ‘కమ్మ’ రాష్ట్రమని పిలుస్తూ ఉండేవాళ్లు. అంతేగాదు, రంగాజీ మరో సామాజిక కోణాన్ని కూడా తన చారిత్రిక అధ్యయనంలో పేర్కొన్నారు: ‘‘భారతదేశంలో వ్యవసాయ కుటుంబాల మూలాలు ఆదిమ జాతి సంతతికి చెందినవనీ’ అలాంటి ఆదిమజాతి సంతతుల్లో సగం సంత తులు సోదరులుగా మెలిగేవాళ్లనీ, మిగతా సగంతో వివాహాది సంబం ధాలుండేవనీ విశాల సామాజిక దృక్పథంతో తన ‘స్వీయచరిత్ర’లో వివ రించారు కూడా. తన వంశ పునాదులు కడప–నెల్లూరుల నుంచి బయ లుదేరి గుంటూరు–కృష్ణాల దాకా విస్తరించినా ‘కులం’ దృష్టి నుంచి చరి త్రను ఆయన పరిశీలించినవాడు కాదు. వీరశైవం, వీర వైష్ణవం సమాజ సంసర్గతకు దోహదం చేసిన 12వ శతాబ్దపు బసవ సిద్ధాంతాన్ని ఆయన కొనియాడారు. అదే శతాబ్దంలో కుల వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన బ్రహ్మనాయుడి ‘చాపకూడు’ సిద్ధాంతాన్నీ అందుకే ప్రేమించాడు రంగా. వెలమ, కమ్మ, బలిజ, బోయ, ముత్రాసు, తెలిక, వొంతరి, రెడ్డి, కమ్మ కర్షక ప్రజాబాహుళ్యం నాటి సమాజాభివృద్ధికి కంటకంగా తయారవు తున్న సాంఘిక దురాచార కట్టుబాట్లను ఛేదించి సామాజికుల ఐక్యతకు, తద్వారా ఐక్యతా శక్తిగా రాజకీయ వ్యవస్థను తీర్చి దిద్దడానికి ప్రతా పరుద్రుడి దూరదృష్టిని రంగా కొనియాడిందీ ఈ ‘కులపిచ్చి’ని మాన్పిం చడానికే. అందుకే 14వ శతాబ్దపు నాయక పూర్వులైన ప్రోలయ, కాపయ, వినాయకదేవ, హరిహర, బుక్క, వీర భల్లాల, సోమ దేవా దులకు, సామాజిక ఐక్యత కోసం స్వేచ్ఛా పోరాటంలో పరస్పరం సహ కరించుకుని ఒక్కతాటిపై నడిచిన దక్షిణాపథం నాయక గణానికీ (14వ శతాబ్ది) రంగా వేనోళ్ల కీర్తించవలసి వచ్చింది. 

ఈ చరిత్ర పాఠంలో భాగంగా, దివంగత నేత ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంపైకి క్రమశిక్షణతో దూసుకువచ్చి ఈ కొసనుంచి ఆ కొస వరకూ ఉత్తర, మధ్యాంధ్ర, రాయలసీమ దాకా వైఎస్సార్‌సీపీకి బలంగా ముడి బిగించి, హత్యా ప్రయత్నం సహా అన్నిరకాల అడ్డంకులను దాటి అజా తశత్రువుగా ముందుకుపోతున్న జగన్‌మోహన్‌రెడ్డి గతకాలపు సామా జిక వివక్షా రాజకీయాలకు, విధానాలకు స్వస్తి పలకడం వేనోళ్ల హర్షిం చదగిన పరిణామం. అందుకే రాష్ట్రంలోని దాదాపుగా అన్ని సామాజిక శ్రేణులకు అతను సన్నిహితమై తలలో నాలుకగా వెలుగొందుతున్నారు. ఈ చక్రబంధంలో ఇరుక్కుపోయి, బతికి బట్టకట్టడం ఎలాగో చూసుకోవ డమే బాబుకి మిగిలిన ‘దింపుడుకళ్లం’ ఆశ.

ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు