తెలుగు ‘జోకర్‌బర్గ్‌’ డేటా చౌర్యం!

5 Mar, 2019 01:46 IST|Sakshi

రెండో మాట

‘తెలుగుదేశం’ ప్రభుత్వం సోషల్‌ మీడియాను మాధ్యమం చేసుకుని ప్రత్యర్థులకు చెందిన ఓటర్లకు టోపీ పెట్టడానికి సిద్ధమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా దేశం పార్టీ నాయకత్వం, ఆశీర్వాదాలతో నెలకొన్న ‘ఐటీ గ్రిడ్స్‌’ సంస్థకు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌’ ద్వారా ఓటర్ల డేటాను అందజేసే ఏర్పాట్లు టీడీపీ నాయకత్వం చేసుకుందన్నది బట్టబయలైంది. 2014లో మోదీ ప్రధాని అయిన సమయానికే డేటా చోరీకి జుకర్‌బర్గ్‌ అంకురార్పణ చేశాడు. ప్రస్తుతం ఓట్ల వేటలో అన్ని నియమాలను తుంగలో తొక్కి ‘గెలుపు గుర్రం’గా తాను ముద్ర వేయించుకోవాలన్న తాపత్రయంలో చంద్రబాబు చేస్తున్న పని కూడా అదే.

‘‘ప్రపంచవ్యాప్తంగా (భారతదేశం సహా) ఫేస్‌బుక్‌ ఉపయోగించే రెండు బిలియన్‌ల వాడకందార్ల వ్యక్తిగత సమాచారాన్ని (డేటా) తస్కరించడం జరిగిన మాట వాస్తవం. 2013 నుంచి 2015 వరకు సాగుతూ వచ్చిన  ఈ సంగతి మా ఫేస్‌బుక్‌ కంపెనీకి తెలుసు.’’
– ‘‘ఫేస్‌బుక్‌’’ సృష్టికర్త మార్క్‌ జుకర్‌బర్గ్‌ అమెరికన్‌ పార్లమెంట్‌లో ప్రశ్నల పరంపర సందర్భంగా ఒప్పుకోలు( కేంబ్రిడ్జ్‌ అనలిటికా)

‘‘జుకర్‌బర్గ్‌ పద్దతులే అనుసరించి 2019ల ఎన్నికల్లో లబ్ధి పొందేం దుకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నెగ్గడం కోసం 3 కోట్ల 50 లక్షల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా వాడుకుంటోంది. ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తున్న వారి లేదా విమర్శిస్తున్న ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రతిపక్షాల ఓట్లను తొలగించడానికి ప్రభుత్వం కుట్ర బట్టబయలవుతోంది. రెండు తెలుగు ప్రాంతాలకు చెందిన డేటా కుంభ కోణం టీడీపీ యాప్‌ ‘సేవామిత్ర’నే రూపొందించిన ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా’ (ప్రయివేట్‌ లిమిటెడ్‌) సంస్థ ఈ డేటా చోరీ కుంభకోణానికి పాల్పడినట్లు గుట్టు రట్టవడంతో టీడీపీ నేతల్లో కలవరానికి దారితీసింది. ఈ కుంభ కోణం గురించి హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉన్నత శ్రేణి ఐటీ నిపుణుడు తుమ్మల లోకేశ్వరరెడ్డిని కిడ్నాప్‌ చేసేందుకు ఏపీ పోలీ సులు (03–03–2019) ప్రయత్నించారు.
– పత్రికా వార్తలు: 04–03–2019

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పాలన అవసానదశలో ఉన్న ‘‘తెలుగుదేశం పార్టీ’’ అధినేత చంద్రబాబు చేష్టలు, నిర్ణయాలు ‘మతితప్పి’ గతితప్పీ సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎందుకో 12వ శతాబ్ది నాటి కల్హణ మహాకవి ‘రాజతరంగిణి’ రచన గుర్తుకొస్తోంది. ఈ సుందరకావ్య పరి శీలనలో ఎందరో రాజులూ, రాజ్యాలు ప్రస్తావనకు వచ్చాయి. నాటి రాజ్యపాలకుల్లో అన్ని రకాల వారు ప్రస్తావనకు వచ్చారు. ప్రజోపయో గకరమైన మంచి పనులు చేసిన రాజులతోపాటు, నీచులు, పిరికి పందలు,  స్వార్ధపరులు, పరమ కిరాతకులు, లుబ్ధులైన పాలకులూ ఉన్నారు. బహుశా కల్హణ మహాకవి ఆ రోజుల్లోనే.. ప్రజాస్వామ్యం గురించి పైకి స్తోత్ర పాఠాలు వల్లిస్తూనే వాక్‌ సభా స్వాతంత్య్రాల పైన బాహాటం గానూ, నర్మగర్భంగానూ సన్నాయి నొక్కులు నొక్కుతూ పాలన సాగించే మోదీలను, చంద్రబాబుల్ని కూడా చూసి ఉంటారు. అందుకే ఆమాంబాపతు పాలకుల్ని గురించి కల్హణ నిశితంగా ప్రస్తా వించి, ఎండగట్టి ఉంటాడు. చరిత్రకారులు నమోదు చేసిన ప్రపంచ చరిత్ర రచనల్లో ఒక మాట హెచ్చరికగా స్పష్టం చేశారు.

‘దేశంలో పాలకుల వల్ల సామాజిక కల్లోలం, సంక్షోభం తలెత్తినప్పుడల్లా చివరికి దురాత్ములు (విలన్లు) కూడా ఖ్యాతిలోకి వస్తుంటార’ని. పట్టుబడితే దొంగ లేకపోతే దొర. ఇలాంటివాళ్ల మనస్సులు ఎంత కల్లోలానికి గురై తడబడుతూ ఉంటాయో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఉదంతం తెలుపుతుంది. అమెరికన్‌ పార్లమెంటులో డెమోక్రటిక్, రిపబ్లికన్‌ సభ్యులు రెండు రోజులపాటు 10 గంటలకు పైగా ’ఫేస్‌బుక్‌’ కుంభకోణాల గురించి ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు జుకర్‌బర్గ్‌ ఒళ్లు చల్లబడి వణికిపోతూ అదేపనిగా నీళ్లు తాగుతూ విపరీతంగా తడబడిపోయాడట. అయినా పార్లమెంటు సభ్యులు చివరికి జుకర్‌బర్గ్‌ నుంచి కోట్లాదిమంది ఫేస్‌బుక్‌ వినియోగదార్లకు జరిగిన ఘోరమైన అన్యాయానికి సంబంధించి వివ రాలను రాబట్టగలిగారు. అలా ప్రశ్నించి కొరత వేయగల సత్తా ఉన్న వ్యవస్థలు మనకు లేవు. ఉంటే నిద్రపోతున్నాయి.

ఆ సంప్రదాయంతోనే ‘తెలుగుదేశం’ ప్రభుత్వం సోషల్‌ మీడి యాను మాధ్యమం చేసుకుని తెలుగు ఓటర్లకు ముఖ్యంగా ప్రత్యర్థులకు చెందిన ఓటర్లకు టోపీ పెట్టడానికి సిద్ధమైన సందర్భంగానే రాష్ట్ర వ్యాపితంగా ‘గత్తర’ లేచింది. హైదరాబాద్‌ కేంద్రంగా దేశం పార్టీ నాయ కత్వం, ఆశీర్వాదాలతో నెలకొన్న ‘ఐటీ గ్రిడ్స్‌’ సంస్థకు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌’ ద్వారా ఓటర్ల డేటాను అందజేసే ఏర్పాట్లు టీడీపీ నాయకత్వం చేసుకుందన్నది ప్రచారంలో నలుగుతున్న వార్తలు. ఈ ‘బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌’ సంస్థకు అన్ని శాఖల సమాచారాన్ని రాబట్టే పనిని చంద్రబాబు ప్రభుత్వం అప్పచెప్పింది. ఈ బాగోతమంతా  సామాజిక కార్యకర్త, ఐటీ రంగ నిపుణుడైన లోకేశ్వర్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు వెల్లడయ్యేంత వరకూ పాలకులు రాష్ట్ర ప్రజల కళ్లు కప్పుతూ వచ్చారు.

ఐటీ నిపుణుని ఫిర్యాదు పర్యవసానంగానే ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో సోదాలు అనం తర ‘కర్మకాండ’కు పోలీసులు దిగవలసి వచ్చింది. నిజానికి ఈ భారీ ‘డేటా’ స్కామ్‌ బహిర్గతం కావడానికి ముందే కొలది మాసాలుగా వివిధ జిల్లాల్లో బెంగళూరు, చెన్నై కేంద్రంగా ఉనికిలో ఉన్న కొన్ని కూపీ సంస్థల వలంటీర్లు ఆధారంగా టీడీపీ నేతలు ఓటర్ల జాబితాల నుంచి తమ ఓటర్లు కాని ప్రత్యర్థి పార్టీల, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ ఓటర్ల పేర్లను గుర్తించి, తొలగించే ప్రయత్నం సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు జరిగాయి.

ఆ తర్వాత సాధికారికంగా వెల్లడైన ‘దేశం పార్టీ’ నేతల ‘డేటా’ చోరీ! హైదరాబాద్‌ కేంద్రంగానే ఈ కుంభకోణం జరగడమంటే– తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీ స్థాయిలో గంద రగోళానికి దారితీసిన లక్షలాది ఓటర్ల ఓట్లు గల్లంతైనట్టు వచ్చిన గగ్గో లుకు, ఫిర్యాదులకు కూడా చంద్రబాబు ఆశీస్సులున్న ఈ ‘ఐటీ గ్రిడ్‌’ సంస్థే కారణమై ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కొత్త పొత్తుకు గజ్జెకట్టి, ఆంధ్రప్రదేశ్‌ విభజన సూత్రధారిగా చంద్రబాబు తిరిగి స్థానం పొందడానికి ‘పరిగె’లు ఏరుకున్నట్లు నాలుగు సీట్లు సంపాదించడానికి ప్రయత్నించిన సందర్భంగా తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను ‘టాంపర్‌’ చేసి ఉండరని నమ్మకంగా చెప్పలేం. అందుకు కూడా అప్పట్లో ‘ఐటీ గ్రిడ్‌’ను వాడుకొని ఉన్నా ఆశ్చర్యపోవలసిన పనిలేదు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన గోపాలకృష్ణ ద్వివేది ‘కారుచీకటిలో కాంతిరేఖ’లా ఓట్లు తొలగించడానికి భారీగా ఏపీలో అక్రమ దరఖాస్తులు వచ్చినమాట వాస్తవమేనని, ఈ విషయాన్ని తాము గుర్తించామనీ, ఆన్‌లైన్‌ ద్వారా ఓటర్లకు తెలియకుండా వారి పేర్లతోనే ఇతరుల ‘ఫాం–7’ దరఖాస్తు సమర్పించారని స్వయంగా తెలిపారు. ఇలాంటి అక్రమ చర్యల్ని క్రిమినల్‌ చర్యలుగా ప్రకటించాలని, నమోదు చేయాలనీ ద్వివేది చెప్పాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ వాస్తవ ఫిర్యాదులకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం, దాని సంరక్షణ అనేది ప్రజలకు బహు ఖరీదైన విన్యాసంగా మారిందనీ న్యాయవ్యవస్థ గుర్తించాలి. అందుకనే ‘కాస్ట్‌స్‌ ఆఫ్‌ డెమోక్రసీ: పొలిటికల్‌ ఫైనాన్స్‌’ అనే గ్రంథాన్ని సమీక్షిస్తూ ఉమామహదేవన్, దాస్‌ గుప్తాలు ఇలా వ్యాఖ్యానించక తప్పలేదు: ‘‘స్వేచ్ఛగా ఎన్నికలు జరగకుండా ప్రజలకు ప్రజాస్వా మ్యం అనుభవంలోకి రాదు. డబ్బు సర్వాంతర్యామి, అది లేకుండానూ ఎన్నికల నిర్వహణ సాధ్యపడదు. ఆ డబ్బు ఎక్కడనుంచి వస్తుంది, దాన్ని ఎలా వినియోగిస్తున్నారు, దానితో జరిగే లావాదేవీలు ఎలాంటి ప్రభావం కల్గిస్తున్నాయి, ఎన్నికల్లో ఆ ధనం వినియోగం జరుగుతున్న తీరును పరిశీలించేదెవరు? నియంత్రించేదెవరు?’’ 2004 నుంచి 2014 వరకు జాతీయ స్థాయిలో జరిగిన మూడు ఎన్నికలలోనూ పాల్గొన్న 20 వేల మంది అభ్యర్థుల వ్యక్తిగత సంపద పాత్రను అంచనా వేసిన ప్రసిద్ధ విశ్లేషకుడు ‘నీలంజన్‌ సర్కార్‌’ ప్రకారం, అభ్యర్థి వ్యక్తిగత సంపదకు, ఎన్నికలో అతడి విజయావకాశానికి మధ్య ఉన్న అనుబంధం రుజువయింది.

ఈ పోటా పోటీ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థులు ఇతరులకన్నా 20 రెట్లు ఎక్కువ సంపన్నులున్నారని నీలం జన్‌ అంచనా. చివరికి వివిధ పార్టీల నుంచి పోటీ చేసే సంపన్న అభ్యర్థులలో కూడా అత్యంత సంపన్నుడుగా ఉన్నవాడికే గెలుపు అవకాశం ఎక్కువగా ఉందని రుజువైంది. ఇప్పుడు ఇలా ఓట్ల వేటలో అన్ని నియ మాలను తుంగలో తొక్కి ‘గెలుపు గుర్రం’గా తాను ముద్ర వేయించు కోవాలన్న తాపత్రయంలో బాబు చేస్తున్న పని కూడా అదే. రోమన్‌ రిపబ్లిక్‌ పతనానికి దారితీసింది కూడా ఈ ఓట్ల క్రయ విక్రయాలే (కొనడాలు, అమ్మడాలు)నని రోమన్‌ మహా చరిత్రకారుడు ప్లూటార్క్‌ రెండు వేల ఏళ్లనాడే లిఖితం చేశాడు. 2014లో మోదీ ప్రధాన  మంత్రి అయిన సమయానికే డేటా చోరీకి జుకర్‌బర్గ్‌ అంకురార్పణ చేశాడు. ఏపీలో నేటికీ అధికార స్థాయిలో మరొక ‘జుకర్‌బర్గ్‌’ తయారయ్యాడు.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ధన సంచులతో అవినీతికి పాల్పడ టానికి విరుగుడుగా కొన్నాళ్లు ప్రభుత్వమే ‘ఇంత శాతం’ చొప్పున ‘ఫండింగ్‌’ ఇచ్చే ప్రతిపాదన తెచ్చింది. అది పోయి ‘ఎలక్టోరల్‌ బాండ్‌’ విధానం ద్వారా అవినీతి ఎన్నికల వ్యవస్థను ‘నీతిమంతం’ చేసే తలంపుతో బయల్దేరింది. ఇదీ చివరికి ‘కట్టుబానిస’ పద్ధతిలోనే తయారయింది. రాజకీయ పార్టీ ఖర్చు చేసే డబ్బుకి పరిమితులు విధించగల శక్తి ఈ ఎలక్టోరల్‌ బాండ్లకు లేదనీ, ఈ బాండ్ల పేరిట విదేశీ ధనరాశులు కూడా ఈ రీతిగానే రావొచ్చనీ, చివరికి పతనమవుతున్న కంపెనీ కూడా ఈ బాండ్ల పేరిట రాజకీయ పార్టీలకి డబ్బు ధారాదత్తం చేయవచ్చనీ మాజీ ఎన్నికల కమిషనర్‌ డీపీ రావత్‌ పదవీ విరమణ చేస్తూ చేస్తూ ఒక టుమ్రీ విసిరిపోయాడు. ఇదీ మన ప్రజాస్వామ్యం!


వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు