చెరసాలలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌

26 Nov, 2017 02:38 IST|Sakshi
టర్కీ ఆమ్నెస్టీ చైర్‌పర్సన్‌ తనెర్‌ (ఎడమ), డైరెక్టర్‌ ఇదిల్‌ (కుడి)

అవలోకనం

టర్కీ ప్రభుత్వం ఆమ్నెస్టీ కార్యకర్తలపై మోపిన ఉగ్రవాద కేసు ఉత్త డొల్ల. విచారణను చూస్తే తీర్పు సత్యానికి అనుకూలంగా వస్తుందనిపించింది. కానీ తనెర్‌కు బెయిల్‌ను నిరాకరించారని విని నిర్ఘాంతపోయాం. చాలా ఏళ్లుగా నేను కోర్టు విలేకరిగా పని చేస్తున్నా మానవహక్కులు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకోసం పోరాడుతున్నవారిని ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని ఎన్నడూ చూడలేదు.

నేనీ వ్యాసాన్ని టర్కీలోని ఇస్తాంబుల్‌ నుంచి రాస్తున్నాను. ఇక్కడి కోర్టులోని ఉగ్రవాద సంబం«ధమైన ఒక కేసు విచారణకు పరిశీలకునిగా నేను వచ్చాను. అంత ర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ టర్కీ శాఖ చైర్‌పర్సన్‌కు, డైరెక్టర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విచారణ అది. నేను కూడా ఈ అంతర్జాతీయ ఉద్యమంలో భాగంగా ఉన్నానని, ఆమ్నెస్టీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌నని పాఠ కుల్లో కొందరికి తెలిసి ఉండొచ్చు. ఇదిల్‌ ఆసెర్, తనెర్‌ కిలిక్‌ అనే నా సహచరులు ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులనే ఆరోపణతో ఆ విచారణ జరుగుతోంది. కొన్ని వారాల క్రితం బెయిల్‌ లభించిన ఇదిల్‌ను కోర్టు బయట కలుసుకున్నాను. తనెర్, జూన్‌ నుంచి ఇస్తాంబుల్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మిర్‌ జైల్లో బందీగానే ఉన్నాడు. అక్కడి నుంచే అతడు వీడియో లింకు ద్వారా విచారణలో పాల్గొన్నాడు.

డిజిటల్‌ భద్రతపై ఒక హోటల్‌లో జరిగిన వర్క్‌షాప్‌కు ఈ కార్యకర్తలిద్దరూ హాజరైన తర్వాత వారిపై ఈ ఆరోపణలను మోపారు. ఆ హోటల్‌ జరిగినది, గూఢ చార కార్యకలాపాలు, కుట్రలో పాల్గొనడం కోసం జరిపిన రహస్య సమావేశమని ప్రభుత్వం మూర్ఖంగా వాదిస్తోంది. జర్మనీ, స్వీడన్‌లకు చెందిన ఇద్దరు విదేశస్తులు కూడా ఈ వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే వారు బెయి ల్‌పై బయటే ఉన్నారు. ఈ కేసు మొత్తంగా ఉత్త డొల్ల. తన ఫోన్లోకి బైలాక్‌ అనే ఒక  ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడనేది తనెర్‌పై మోపిన ప్రధాన ఆరోపణ. ఎన్క్రిప్టెడ్‌ (నిక్షిప్త) సమాచార మార్పిడికి వాడే ఆప్‌ (వాట్సాప్‌ లాంటిది) అది. గత ఏడాది తిరుగుబాటుకు జరిగిన కుట్రకు ముందు, దాని మద్దతుదార్లు రహస్య సమాచా రాన్ని చేరవేయడానికి బైలాక్‌ను ఉపయోగించారని ప్రభుత్వ అరోపణ. తనెర్‌ ఆ ఆప్‌ను వాడాడనే ఆరోపణకు ఎలాంటి ఆధారమూ లేదు. ఆమ్మెస్టీ తనెర్‌ ఫోన్‌ను రెండు సార్లు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపింది. రెండూ ఆ ఫోన్‌లో బైలాక్‌ ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు సున్నా అన్ని తేల్చాయి. ఈ పరీక్షల్లో ఒకటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థ సెక్యూర్‌ వర్క్స్‌ నిర్వహించినది. కోర్టు విచారణలో ఒక నిపుణుడు ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.

ఆ రోజు ఉదయాన్నే మేం జస్టిస్‌ ప్యాలెస్‌ అని పిలిచే ఆధునిక వర్తులాకార భవనం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాం. ఆ భవనంలో చాలా కోర్టు గదు లున్నాయి. విపరీతంగా చలి, గాలులు ఉన్నా, మా నిరసనకు పలు పౌర సమాజ బృందాలు, వ్యక్తులు హాజరయ్యారు. విదేశీ పరిశీలకులలో ఆమ్నెస్టీ బ్రెజిల్, బ్రిటన్‌ శాఖల చైర్‌పర్సన్‌లు, యూరోపియన్‌ యూనియన్, ఐక్యరాజ్య సమితి దౌత్యవే త్తలు కూడా ఉన్నారు. ఆ మానవహక్కుల పరిరక్షకులకు మద్దతుగా చేసిన ప్రకట నను చదివి వినిపించారు. మాతోపాటూ తనెర్‌ 19 ఏళ్ల కుమార్తె గుల్‌నిహల్‌ కూడా ఉంది. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. కోర్టులో లాయర్లు తదితర అధికా రులుగాక, 120 మంది పడతారు. గదంతా నిండిపోగా, చాలా మంది బయట నిల బడాల్సి వచ్చింది. కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వారికి ఒక పక్కన ప్రాసిక్యూటర్‌ కూడా కూర్చొని ఉండటం అసక్తికరంగా ఆనిపించింది. ఆరు గంట లకుపైగా సాగిన ఆ విచారణలో అతను ఒకే ఒక్క సారి, అదీ కొద్ది సేపే మాట్లాడాడు.

ఎక్కువ సమయం తీసుకున్నది తనెర్‌ తర ఫు న్యాయవాదే. డిఫెన్స్‌ తరఫున నిపుణుడైన సాక్షి బైలాక్‌ ఆప్‌ సమస్య గురించి వివరంగా మాట్లాడాడు. తనెర్‌ ఫోన్‌ లోని సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేసుకున్నాక పోలీసులు తిరిగి ఇచ్చేశారు. తనెర్‌ ఎన్నడూ బైలాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉండే అవకాశమే లేదని అతను నిర్ధారించాడు. కుట్ర యత్నం తర్వాతి వరకు తాను బైలాక్‌ గురించి వినలేదని తనెర్‌ సాక్షిగా చేసిన ప్రక టనలో తెలిపాడు. అయినా. మొదటి విచారణలో కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేయలేదు. ఆ విచారణ పూర్తయ్యాక నా సహచరుడు జాన్‌ డల్‌  హూసెన్‌ ‘‘ఏ ఆధా రాలూ లేకుండా రావడానికి ప్రాసిక్యూటర్‌కు మూడు నెలలకు పైగా పట్టింది. ఈ కేసును కొట్టి పారేయడానికి న్యాయమూర్తికి అరగంట కూడా పట్టదు’’ అన్నాడు.

కానీ కేసును కొట్టేయలేదు. నేను ఇప్పుడు వర్ణిస్తున్నది రెండో దఫా విచా రణనే. మధ్యలో కూచున్న సీనియర్‌ న్యాయమూర్తి, నిపుణుణ్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. విచారణ జరుగుతున్నంత సేపూ సత్యానికి అనుకూలంగానే తీర్పు వస్తుందనే మాకు అనిపించింది. విచారణంతా టర్కిష్‌ భాషలోనే జరిగింది. నిపుణుడు చెప్పిన సాక్ష్యం కలిగించిన ప్రభావం ఎలాంటిదో అంచనా వేయడం కష్టం కాలేదు. తనెర్‌ సూటిగా, ఉద్వేగరహితంగా తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున బెయిల్‌పై తనను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. రోజంతటిలో ప్రాసిక్యూటర్‌ మాట్లాడిన ఏకైక వాక్యాన్ని విన్నాం. ప్రభుత్వం బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నది అని చెప్పాడు.

ఆరు గంటలకు పైగా సాగిన విచారణ తర్వాత న్యాయవాదులు, నిందితులు తప్ప మిగతా అంతా ఖాళీ అయిపోయింది. మమ్మల్ని బయట వేచి ఉండమ న్నారు. ఆ తర్వాత బెయిల్‌ నిరాకరించారని మాకు చెప్పారు. ఆ వార్త మాకు అందరికీ దిగ్భ్రాంతిని కలుగచేసింది, చిన్న పిల్ల గుల్‌నిహల్‌ ఆ మాటకు గుండె చెదిరిపోయింది. చాలా ఏళ్లుగానే నేను కోర్టు విలేకరిగా పనిచేస్తున్నా మానవ హక్కుల కోసం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదంతో ముడి పెట్టి  ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. మన ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధిని పంపి ఉంటే బావుండేదని నా అభిప్రాయం. తదుపరి విచారణకైనా అ పనిచేస్తారని ఆశిస్తాను. ఇది, టర్కీతో మనం తప్పక ప్రస్తావించాల్సిన సమస్య.

ఒక భారతీయునిగా, చరిత్ర విద్యార్థిగా నాకు టర్కీలో జరిగింది నిరుత్సాహం కలిగించింది. వెయ్యేళ్ల క్రితం తురుష్కులు మన దేశానికి రావడానికి ముందు నుంచీ టర్కీ ప్రజలతో మనకు సాంస్కృతిక సంబంధాలున్నాయి. మన దేశ ముస్లిం పాల కులలో పలువురు టర్కీకి చెందినవారు. మొహమ్మద్‌ గజినీ తురుష్క మూలాలు న్నవాడు. బాబర్, చంగ్తార్‌ తురుష్కుడు. మైసూర్‌ పాలకుడు టిప్పు కూడా తన పూర్వీకులు తురుష్కులేనని తనను ‘సుల్తాన్‌’గా పిలిపించుకునేవాడు. అటువంటి గొప్ప, సుప్రసిద్ధులైన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే టర్కీ ప్రభుత్వం నా సహచ రులపై విచారణను మరింత మెరుగైన పద్ధతిలో నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. నా సహచరులు టర్కీ ప్రజల హక్కుల కోసం, వారి బాగు కోసం పనిచేస్తున్నవారు.


- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com

>
మరిన్ని వార్తలు