‘నిషేధం’ చెరలో రైతుల భూములు

5 Jul, 2019 02:38 IST|Sakshi

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది రైతు కుటుంబాలను గత అయిదేళ్లుగా కలచి వేస్తున్న సమస్య ‘నిషేధ జాబితా’. ఈ నిషేధ జాబి తాలోకి ఎప్పుడు తమ భూమి వెళ్తుందో తెలియక ప్రతి రైతు కుటుంబమూ ఆందోళనపడింది. భూ లావాదేవీల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లిన రైతులకు అక్కడి సిబ్బంది ‘మీ భూమి రిజిస్టర్‌ చేయడానికి అనుమతిలేద’ని జవాబివ్వడం రివా జుగా మారింది. ఎందుకని ప్రశ్నిస్తే మీ భూమి సెక్షన్‌ 22ఏ(ప్రొహిబిషన్‌) జాబితాలో ఉందని అక్కడివారు చెబుతున్నారు. దీని అర్థ్ధమేమిటో, తమ భూమి ఎందుకు ఈ జాబితాలోకి పోయిందో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. వాస్తవానికి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేం దుకు ఈ సెక్షన్‌ రూపొందించారు. కానీ టీడీపీ హయాంలో ఇది పూర్తిగా దుర్వినియోగమైంది. తమ వ్యతిరేకులని అనుమానం వస్తే చాలు తహసీల్దార్‌ లకు చెప్పి ఆ రైతుల భూమిని సెక్షన్‌ 22ఏ జాబితాలో పెట్టించడం టీడీపీ నేతలకు రివాజుగా మారింది. 

ఇది శ్రుతిమించిందని, ఇదిలాగే సాగితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని గ్రహించిన అప్పటి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జీవో ఎంఎస్‌ నంబర్‌ 575 జారీ చేసింది. దాని ప్రకారం 1954కు ముందున్న భూములు రైతుల హక్కు భుక్తంలో ఉన్నా, వారి పేరున రిజిస్టర్‌ అయి ఉన్నా ఆ భూములను సెక్షన్‌ 22ఏ జాబితా నుంచి తొలగిం చాలని ఆ జీవో నిర్దేశిస్తోంది. కానీ అందుకు జిల్లా కలెక్టర్లు అభ్యంతరం చెప్పడంతో వివరణతో ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. అయినప్పటికీ సమస్య మాత్రం ఎప్పటిలా ఉండిపోయింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి రిజిస్ట్రార్ల పరిధిలో సెక్షన్‌ 22ఏ కింద నాలుగు లక్షల ఎకరాల సర్వే నంబర్లు ఉన్నాయి. దీనిలో కనీసం 25 శాతం...అంటే లక్ష సర్వే నంబర్లకు చెందిన రైతుల భూములన్నీ లావాదేవీలకు అనర్హంగా మిగిలిపో యాయి. మిగిలిన 3 లక్షల సర్వే నంబర్లు కూడా ప్రభుత్వానికి చెందిన భూములుగా చూపుతున్నారు. 

చాలామంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్త కాలు ఇచ్చినా... అవి వివిధ కొనుగోళ్లు, అమ్మకాల్లో పలువురి చేతులు మారినా ఉన్నట్టుండి ఆ భూమి సెక్షన్‌ 22ఏ కిందికిపోతోంది. ఉదా‘‘కు తూర్పు గోదావరి జిల్లాలో 1936లో ఒక భూమి అమ్మకం జరిగింది. 1990లో ఆ భూమిలో రైతు పెద్ద కోళ్ల ఫారం కట్టుకుని దానిపై రూ. 3 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని వ్యాపారం నడుపుకుంటు న్నారు. అయితే నిరుడు అధికారులు షాక్‌ ఇచ్చారు. ‘మీ భూమి సెక్షన్‌ 22ఏలో ఉంద’ని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తన హక్కు భుక్తంలో ఉన్న భూమిని ఇలా ఉన్నట్టుండి ‘నిషేధ జాబితా’లోకి నెట్టేస్తే ఆ రైతు ఏమైపోవాలి? చాలామంది తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం భూమిని అమ్ముకుందామని చూస్తుంటే ఈ సెక్షన్‌ అడ్డొస్తోంది. భూ పరిమితి చట్టం కింద ఉన్న కేసుల రికార్డులు రెవెన్యూ శాఖ వద్ద లేకపోవడంతో అన్ని భూములనూ వారు ఈ సెక్షన్‌ కిందికి తీసుకొస్తున్నారు.

రైతులను ఇబ్బందికి గురిచేస్తున్న మరో అంశమేమంటే–ఒక సర్వే నంబ ర్‌లో ప్రభుత్వ అవసరాల కోసం కొంత భూమిని తీసుకోవాల్సి వస్తే ఆ సర్వే నంబర్‌ మొత్తాన్ని సెక్షన్‌ 22ఏ కింద పెట్టడం. ఈ సమస్యలో చిక్కుకున్న రైతు ముందుగా తహసీల్దార్‌కి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి అది ఆర్‌డీఓకు వెళ్తుంది. ఆపై సబ్‌ కలె క్టర్‌కు చేరుతుంది. చివరాఖరికి జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమం ఏళ్ల తరబడి నడుస్తుంది. ఇన్నేళ్లూ  సర్కారీ కార్యాల యాల చుట్టూ తిరుగుతూ, వివిధ చోట్ల చేతులు తడుపుతూ రైతులు పడే అవస్థ వర్ణ నాతీతం. ఈ జిల్లాలో భూ సంస్కరణల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అథారిటీని మొదట రాజమండ్రి, తర్వాత అమలా పురం, అటుపై కాకినాడకు మార్చడం వల్ల రికార్డులు గల్లంతయ్యాయి. పర్యవసానంగా న్యాయస్థానాల్లో రైతులు గెలిచినా వారి భూములు తిరిగి సెక్షన్‌ 22ఏ కిందికొచ్చాయి.

1923లో భూ సర్వే చేసినప్పుడు కొన్ని భూముల అనుభవదారుల పేర్లు తెలియని సంద ర్భాలుంటే, వాటి వివరాల వద్ద చుక్కలు పెట్టడం ఆనవాయితీగా ఉండేది. కానీ వాటిని సెక్షన్‌ 22ఏ కిందికి తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెట్టారు. అలాగే ఈనాం రద్దు చట్టంకింద భూములను ఆయా ఈనాందార్లు అమ్ముకోవడానికి హక్కు ఉన్నా ఈ జాబితాలో చేర్చడం వల్ల వాటిని సాగు చేసుకుం టున్న రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ సమ స్యలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి ఇప్పటికే తీసు కెళ్లాం. ఇది సాధ్యమైనంత త్వరగా పరిష్కారమవు తుందని.. తమ హక్కుభుక్తంలో ఉన్న భూములపై మళ్లీ తమకు పూర్తి హక్కులు లభిస్తాయని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, 
రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
మొబైల్‌ : 94402 04323
కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి 

మరిన్ని వార్తలు