దాడులు, దౌత్యంతో దారికొచ్చిన పాక్‌

3 Mar, 2019 00:47 IST|Sakshi

అభిప్రాయం

జమ్మూ నుంచి శ్రీన గర్‌ వెళ్లే దారిలో పుల్వామా జిల్లా అవంతిపుర సమీ పంలో గత నెల 14న ఉగ్ర వాది ఒకడు మానవ బాం బుగా మారి 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్ట నబెట్టుకున్న ఘటన అనం తర పరిణామాలు అంతర్జా తీయంగా సంచలనం కలిగించాయి. ఈ ఉద్రిక్తతల తీరు గమనించిన ప్రపంచ దేశాలన్నీ భారత్‌– పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన చెందాయి. పాకిస్తాన్‌ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను కూకటివేళ్లతో పెకిలించి తీరా లన్న కృతనిశ్చయాన్ని మన దేశం ప్రదర్శించడమే ఇందుకు కారణం. గత నెల 26 తెల్లవారుజామున పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ మీదుగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)కు చెందిన 12 మిరాజ్‌ యుద్ధ విమానాలు దూసుకెళ్లి పాక్‌ భూభా గంలో ఉన్న బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ కేం ద్రాన్ని ధ్వంసం చేశాయి. అనంతరం మన సరి హద్దులకు సమీపంగా ఉన్న ముజఫరాబాద్, చకోతి ల్లోని ఉగ్రవాద శిబిరాలను కూడా నేలమట్టం చేశా యి. మన యుద్ధ విమానాల రాకను గుర్తించి వాటిని ఎదుర్కొనాలని ప్రయత్నించి పాకిస్తాన్‌ భంగప డింది. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అను గుణమైనవే.

అందులోని 51వ అధికరణ ప్రకారం ఏ దేశమైనా తన ప్రజల రక్షణ కోసం, తనపై జరిగే దాడుల నుంచి రక్షించుకోవడం కోసం శత్రుదేశంపై దాడి చేయవచ్చు. ఇందుకు భద్రతామండలి అను మతి తీసుకోనవసరం లేదు. ఆ దేశం ఒంటరిగా లేదా వేరే దేశాల సహకారంతో శత్రుదేశంపై దాడులు చేయవచ్చునని ఆ అధికరణ స్పష్టం చేస్తోంది. మన ఐఏఎఫ్‌ దాడులతో ఖంగుతిన్న పాకిస్తాన్‌ సైన్యం ఫిబ్రవరి 27న  ఎఫ్‌–16 యుద్ధ విమానాలతో సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు ప్రయత్నించింది. కానీ ఐఏఎఫ్‌ అప్రమత్తంగా వ్యవహరించి ఆ చర్యను వెంటనే తిప్పికొట్టింది. ఒక ఎఫ్‌–16ను కూల్చింది కూడా. ఈ క్రమంలో మన మిగ్‌ యుద్ధ విమానం సాంకేతిక కారణాల వల్ల కూలటం, దాని పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను పాకిస్తాన్‌ సైన్యం నిర్బంధించటం జరిగాయి. మన దేశం వెనువెంటనే పాకిస్తాన్‌ అనుసరిస్తున్న పోకడలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చి దౌత్యపరంగా పావులు కదిపి చురుగ్గా వ్యవహరించడంతో పాకిస్తాన్‌ ఒంటరైంది. పాకిస్తాన్‌తో సత్సంబంధాలున్న చైనా సైతం పాకి స్తాన్‌ను హెచ్చరించడం మన దౌత్యవేత్తల నేర్పరిత నానికి అద్దం పడుతుంది. గత్యంతరంలేని పరిస్థి తుల్లో అభినందన్‌ను అరెస్టు చేసిన రెండో రోజే ఆయ నను మార్చి 1న భారత్‌కు అప్పగిస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించడానికి దౌత్య పరంగా పాకిస్తాన్‌పై వచ్చిన ఒత్తిళ్లే కారణం. 

ఉద్రిక్తతలకు కారణం ఎవరు?
పుల్వామా విషాద ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహ మ్మద్‌ దానికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఆ సంస్థకు పాక్‌ సైన్యానికి చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అండదండలున్నాయన్నది బహిరంగ రహ స్యం. పాకిస్తాన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అదుపులోనికి తీసుకు నేది. అతడిని విచారించి తగిన ఆధారాలు సేకరించేది. మన దేశానికి అప్పజెప్పేది. కానీ అందుకు భిన్నంగా మీరే ఆధారాలు ఇవ్వాలని అది మన దేశాన్ని కోరుతోంది. ముంబైపై ఉగ్రదాడి మొదలుకొని అనేక ఘటనలపై మన దేశం ఇచ్చిన ఆధారాలను బుట్టదాఖలా చేసిన చరిత్ర ఉన్న పాకిస్తాన్‌ ఇప్పుడు మరోవిధంగా స్పందిస్తుందని భ్రమపడవలసిన అవసరం లేదు. అత్యంత సాధా రణ కుటుంబాలనుంచి వచ్చి దేశ రక్షణలో నిమగ్న మైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను ఉగ్రవాది బలితీసుకున్న ఉదంతంతో దేశమంతా కంటతడి పెట్టింది. కనుకనే ఈ మతిమాలిన ఉగ్రమూకల చర్యలకు చరమగీతం పాడాలని మన ప్రభుత్వం నిర్ణయించింది.   

ఇమ్రాన్‌ ఖాన్‌ స్వోత్కర్ష
అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో అభినందన్‌ను విడుదల చేసిన పాకిస్తాన్‌ ఆ చర్య శాంతి కోసమేనని అందరినీ నమ్మించడానికి విఫల యత్నం చేస్తున్నది. యుద్ధం ప్రారంభమైతే ఎక్కడికి వెళ్తుందో తెలియదని, అందుకే ఉద్రిక్తతలను తగ్గిం చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఇమ్రాన్‌ చెబుతున్నారు. ఇందులో నిజమెంత? మన దేశంతో ఆయన నిజంగా శాంతిని కోరుకునేటట్లయితే గద్దెనెక్కిన వెంటనే తమ భూభాగంలోని ఉగ్రవాద ముఠాలను నిర్మూలించేవారు. అందులో విఫలం కావడం వల్లే భారత్‌ చర్యలు తీసుకోవలసి వచ్చింది. మన దేశం ఎంతో బాధ్యతగా మెలిగి సైనిక స్థావ రాలపై, పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేయ కుండా కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి అభినందన్‌ను విడు దల చేసి, అది తమ ఉదారతగా, శాంతి కోసం తీసు కున్న చర్యగా చిత్రించడానికి ఇమ్రాన్‌ చేసిన ప్రయ త్నం ఎవరినీ నమ్మించలేదు. చాలా తక్కువ సమ యంలో ప్రధాని నరేంద్రమోదీ అత్యంత చాక చక్యంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం అభి నందించదగిన విషయం.

జెనీవా ఒడంబడిక ఏం చెబుతోంది?
యుద్ధం జరిగినప్పుడు దానికి సంబంధించిన నియ మాలు ఏ పక్షమూ ఉల్లంఘించకుండా చూడటం, ప్రపంచ శాంతిని కాపాడటం జెనీవా ఒడంబడిక లక్ష్యం. రణరంగంలో క్షతగాత్రులైనవారికి, రోగగ్రస్తు    లైనవారికి మానవీయ దృక్పథంతో సాయం అందిం చాలని అందులోని 9వ అధికరణ చెబుతోంది. గాయపడినవారిని, రోగులను చంపడం నిషిద్ధమని , వారిపై జీవ సంబంధ పరీక్షలు బహిర్గతం చేయడం కూడా సరికాదని 12వ అధికరణ వివరిస్తున్నది. యుద్ధ ఖైదీలుగా పట్టుబడినవారు పురుషులైనా, స్త్రీలైనా వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలి. పట్టు బడిన యుద్ధ ఖైదీలు కేవలం వారి పేరు, ర్యాంక్, హోదా, పుట్టిన తేదీ, క్రమ సంఖ్య చెబితే చాలు. యుద్ధ ఖైదీలకు వారి కుటుంబ సభ్యులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి, తమ జాగ్రత్తకు అవసరమైన వస్తువులు వారు దగ్గర ఉంచుకో వడానికి హక్కుంటుందని జెనీవా ఒప్పందం స్పష్టం చేస్తున్నది.

అయితే 1999నాటి కార్గిల్‌ యుద్ధ సమ యంలోనైనా, అంతక్రితమైనా, ప్రస్తుత ఘటన ల్లోనైనా ఎప్పుడూ పాకిస్తాన్‌ జెనీవా ఒడంబడికను గౌరవించలేదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో మన పైలట్‌ నచికేత విడుదలకు 8 రోజులు తాత్సారం చేసింది. అప్పట్లో ఆయనను ఎన్నో రకాలుగా చిత్ర హింసలకు గురిచేశారు. అప్పటి ప్రధాని స్వర్గీయ వాజపేయి చేసిన కృషి పర్యవసానంగా నచికేతను పాకిస్తాన్‌ అప్పగించక తప్పలేదు. అభినందన్‌ విష యానికొస్తే ఆయన నడుపుతున్న విమానం సాంకే తిక లోపంతో కిందపడిపోయిన మాట వాస్తవమైనా ఆయనకున్న గాయాలు గమనిస్తే అక్కడివారు ఆయనను చిత్రహింసలకు గురిచేసిన దాఖలాలు కనిపిస్తాయి. తనవైపుగా జరిగిన ఈ తప్పిదాలను పాకిస్తాన్‌ కప్పిపుచ్చాలని చూసింది.  పట్టుబడిన అభి నందన్‌ను జెనీవా ఒడంబడికకు విరుద్ధంగా పాక్‌ సైన్యం అనేక ప్రశ్నలు వేసింది. ఆయన భారత్‌లో ఏ ప్రాంతానికి చెందినవాడో తెలుసుకోవడానికి అది ప్రయత్నించింది. ఆయన వివాహితుడా, కాదా ఏ యుద్ధ విమానంలో ప్రయాణించారో, ఏ ఉద్దేశంతో ప్రయాణించారో, ఆయనకు అప్పగించిన పనేమిటో అడిగింది. ఈ ప్రశ్నలన్నీ జెనీవా ఒడంబడికను ఉల్లంఘించడం కిందకు వస్తాయి. మొత్తానికి భారత్‌ కఠిన వైఖరితో పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. తన తీరు మార్చుకుని ఉగ్రవాదుల విష యంలో చర్యలు తీసుకుంటేనే ఆ దేశం పరువు నిలబడుతుంది.


ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి 
వ్యాసకర్త రిజిస్ట్రార్, నల్సార్‌ విశ్వవిద్యాలయం

మరిన్ని వార్తలు