మీ వివేకాన్ని పెంచుకోండి!

16 May, 2019 01:43 IST|Sakshi

ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ కేవలం బెంగాల్‌కి పరిమితం అయిన వ్యక్తి కాదు. భారతీయ సాంస్కృతిక వికాసోద్యమానికి దారి చూపిన మార్గదర్శకుడు. సంకుచిత భావాలతో కుళ్ళి కంపు కొడుతున్న ఛాందస భావాలను కాదని భావోద్యమాలకి రాచబాట వేసిన సంఘ సంస్కర్త. గ్రాంధిక భాషకి బదులు వాడుక భాషని కొత్త పుంతలు తొక్కించి ప్రజల భాషకి పట్టం కట్టిన రచయిత. సామాజిక చైతన్యాన్ని కలిగించే అనేక రచనలు చేయడంతోపాటూ స్వయంగా అనేక గ్రంథాల్ని ముద్రించినవాడు.

వితంతు పునర్వివాహాల కోసం నిరవధిక పోరాటం చేయడమే కాదు, ఏకంగా చట్టం కూడా చేయించేదాకా అలుపెరగని కృషి చేశారు. ఆంధ్రదేశం లోని మన కందుకూరి వీరేశలింగంతో మొదలుపెట్టి దేశంలోని అనేక ప్రాంతాలలో సాంస్కృతిక వికాసానికి దారి చూపిన మహానుభావుడు. విద్యా విధా నం మొదలుకొని వివాహాది విషయాల వరకూ ఆనాడే ఎంతో ప్రగతిశీలంగా ఆలోచించడమే కాదు, అనుకున్న దానిని ఆచరణలో పెట్టిన ఆదర్శవాది.

అమిత్‌ షా యాత్రలో భాగంగా  కోల్‌కతాలోని  సిటీ కాలేజీ విద్యార్థులపై మతోన్మాదులు అమానుష దాడి చేయడమే కాక ఏకంగా కళాశాల ఆవరణ లోని  విద్యాసాగరుడి విగ్రహాన్ని కూల్చ డం మతతత్వశక్తుల అవివేకానికి పరా కాష్ట. సిటీ కాలేజ్‌ చారిత్రక ప్రాముఖ్యం కలది. తూ.గో.జిల్లాలోని మా పిఠాపురానికి, బెంగాల్‌లోని కోల్‌కతా సిటీ కాలేజీకి అనుబంధం ఉంది. సిటీ కాలేజీ నిర్మాణానికి ఉదారంగా ముందుకొచ్చి స్పందించిన వ్యక్తిగా పిఠాపురం యువ రాజాని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.

అటువంటి మహోన్నత కళాశాలపై దాడికి దిగడం మతోన్మాదుల అజ్ఞానానికి చిహ్నం. గాంధీ, అంబేడ్కర్, లెనిన్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌..  ఈనాటికీ మతోన్మాదులను విగ్రహాలుగా సైతం భయ పెడుతున్నారంటే నాటి వాళ్ళ కృషి ఎంతటిదో అర్థం చేసుకోవాల్సిందే. విగ్రహాల్ని కూల్చడం కాదు, వివేకాన్ని పెంచుకోవడమొక్కటే విద్వేష శక్తులకి మిగిలున్న ఏకైక మార్గం. విభేదాలు ఎన్నున్నా ఈశ్వర్‌చంద్ర సాగర్‌ విగ్రహ కూల్చివేతను అభ్యుదయ శక్తులు, ఆలోచనాపరులంతా ఖండించాలి. మతోన్మాదుల ఆగ డాల్ని ప్రజాస్వామికవాదులంతా నిరసించాలి. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌! – గౌరవ్‌ కృçష్ణ, పిఠాపురం

కోల్‌కతా కాలేజీలో ధ్వంసమైన ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం

మరిన్ని వార్తలు