నిబద్ధ జర్నలిజానికి నిరుపమాన నిదర్శనం

26 Aug, 2018 00:46 IST|Sakshi

సందర్భం

కులదీప్‌కు సంబంధించినంతవరకు అన్నిటికన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు. మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్‌–సెప్టెంబర్‌ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్‌లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్‌ నాయకుడు మహ్మదలీ జిన్నా లాహోర్‌ పర్యటనకు వచ్చారు. జిన్నాతోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమానంలో లాహోర్‌ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలితంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్‌లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండియాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనించారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని, ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపంచానికి వెల్లడించింది కులదీప్‌ నయ్యర్‌

కులదీప్‌ నయ్యర్‌ నాకంటే 20 ఏళ్లు పెద్ద. కాని, 1975 శీతాకాలంలో న్యూఢిల్లీలోని త్రివేణీ కళా సంఘంలో జరిగిన మధ్యాహ్న భోజన సమావేశంలో తొలిసారి మేం కలుసుకున్నప్పటి నుంచీ మంచి స్నేహితుల మయ్యాం. లండన్‌లోని ద సండే టైమ్స్‌లో వేసవి స్కాలర్‌గా పనిచేసి అప్పుడే దేశ రాజధానికి తిరిగొచ్చాను. నయ్యర్‌ వల్ల నేను ఎలా ఇబ్బందిపడ్డానో చెప్పడానికే అక్కడకు ఆయ నను ఆహ్వానించాను. ఓ శుక్రవారం మధ్యాహ్నం ద సండే టైమ్స్‌ సాహిత్య విభాగం ఎడిటర్‌ త్వరలో ప్రచురించే కుల దీప్‌ పుస్తకం పేజీల ప్రూఫుల కట్ట పట్టుకుని నా డెస్క్‌ దగ్గరకు వచ్చారు. ఇండియాలో ఎమర్జెన్సీ కారణంగా ఆ సమయంలోనే నయ్యర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఆంగ్ల వారపత్రిక ఎడిటర్‌గా పనిచేస్తున్న ప్రఖ్యాత జర్నలిస్ట్‌ హెరాల్డ్‌ ఈవాన్స్‌ కులదీప్‌ అరెస్టుపై వార్తా కథనం రాయాలని నన్ను కోరారు.

నేను ఆ ప్రూఫులు చదివి 300 పదాల వార్త రాశాను. పొగరుబోతు ప్రధానోపాధ్యాయురాలు తన క్లాసు లోని విద్యార్థు లను ఎలా బెదరగొడతారో ఇందిరాగాంధీ కూడా కేబినెట్‌ సమావేశాల్లో తన మంత్రులను అలాగే చూస్తారని నయ్యర్‌ చెప్పిన విషయం కూడా రాశాను. ఈ వార్త ఇందిరకు నచ్చలేదు. లండన్‌ నుంచి ఢిల్లీలో దిగగానే ఎయిర్‌ పోర్ట్‌లో పోలీసులు మూడు గంటల పాటు నా బ్యాగులన్నీ క్షుణ్నంగా తనిఖీచేశారు. వాటిలో అభ్యంతరకరమైనదేదీ దొరకకపోవడంతో నన్ను బయటకు వెళ్లనిచ్చారు. నేను ఈ సంగతి వివ రించాక, నేనూ, కులదీప్‌ పగలబడి నవ్వుకున్నాం. ‘‘ఇందిరను మీరెప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా?’’ అని ఆయనను అడిగాను. ‘నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు, ఇంటర్వ్యూ ఇవ్వాలని అడగలేదు’ అని ఆయన జవాబిచ్చారు. ఎందుకని అడగలేదని ప్రశ్నిం చగా, ‘నన్ను చూడడానికి ఆమె ఎన్నటికీ అంగీకరించ రని అనుకున్నా’అని ఆయన తెలిపారు.

అప్పటి నుంచీ ఆయన, నేనూ అప్పుడప్పుడూ కలుస్తుండే వాళ్లం. ఏడాది క్రితం చివరిసారిగా బంగ్లా దేశ్‌ హైకమిషన్‌లో కల్సుకున్నాం. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాకు స్వాగతం పలుకుతూ హైకమిషనర్‌ సయ్యద్‌ మువజ్జమ్‌ అలీ ఇచ్చిన విందులో ఇద్దరం పాల్గొన్నాం. అప్పుడు కులదీప్‌ చేతికర్రతో, ఓ మనిషి సాయంతో అక్కడికి వచ్చారు. కార్యక్రమం చివర్లో బయల్దేరే ముందు ‘‘నేను మరో పుస్తకం రాస్తు న్నాను, తెలుసా?’’ అన్నారు కులదీప్‌. దాదాపు 80కి పైగా పత్రికలకు వేలాది వ్యాసాలతోపాటు ఆయన 15 గ్రంథాలు రాశారు. ఈ పుస్తకాలన్నీ పాఠ కాదరణ పొందాయి. మరో ప్రసిద్ధ జర్నలిస్టు కుష్వంత్‌ సింగ్‌తో కలిసి ఓ పుస్తకం రాశారు. లాహోర్‌ లా కాలే జీలో కులదీప్‌కు కుష్వంత్‌ పాఠాలు చెప్పారు. 1979 డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచా రంలో ఇందిరాగాంధీతోపాటు ఓ ఫోకర్‌ ఫ్రెండ్‌షిప్‌ విమానంలో నేను కూడా వెళ్లాను. ఆమె దేశ వ్యాప్తంగా అనేక బహిరంగ సభల్లో ప్రసంగించడం దగ్గర నుంచి గమనించాను. అప్పుడు నేను పనిచేస్తున్న ఆంగ్ల పక్ష పత్రిక ఇండియా టుడేలో మూడు పేజీల వ్యాసం రాశాను. ఇందిర ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ ప్రధాని అవుతారని ఈ వ్యాసంలో చెప్పాను. ఓ దౌత్య విందులో అదే వారం కులదీప్‌ను కలిశాను.

తల అడ్డంగా ఊపుతూ ‘ఎంత పని చేశావు? నీకు రాజ కీయాల గురించి ఏమీ తెలియదు. నువ్వేమో ఇందిర మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పావు. ఈ విషయం ఇక మర్చిపో. అది ఎన్నటికీ జరగదు. పాత్రికేయునిగా నీ జీవితం నాశనం చేసుకున్నావు’ అని ఆయన అన్నారు. తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమిద్దరం మారిషస్‌ రాజధాని సెయింట్‌ లూయిస్‌ వెళ్లాం. కులదీప్‌ వచ్చారని తెలుసుకున్న ఆ దేశ గవ ర్నర్‌ జనరల్‌ సర్‌ శివసాగర్‌ రాంగులాం హిందూ మహాసముద్రానికి ఎదురుగా నిర్మించిన తన భారీ నివాస భవనానికి టీ పార్టీకి రావాలని మమ్మల్నిద్దరినీ ఆహ్వానించారు. అక్కడి నుంచి మేం మా హోటల్‌కు కాస్త ఆలస్యంగా చేరుకున్నాం. మాకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి సహాయకుడు ‘మీకు ఆడవాళ్ల తోడు కావాలా?’ అని భయం భయంగా అడిగాడు. ‘పులి తాను తినే జంతువులను తానే వేటాడి పట్టుకుంటుంది’ అని కులదీప్‌ చమత్కరించారు. 

కులదీప్‌ న్యాయశాస్త్రం చదివి లాయర్‌ కావడా నికి తగిన శిక్షణపొందారు. ఓ లాహోర్‌ కాలేజీలో జర్నలిజం డిప్లొమా కోర్సులో చేరారుగాని అందులో ఆయన తప్పారు. ఐఏఎస్‌లో చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఢిల్లీ వచ్చాక కులదీప్‌ మొదట చేసిన జర్నలిస్టు ఉద్యోగం అంజామ్‌ అనే ఓ ఉర్దూ దినపత్రికలోనే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉర్దూ దినపత్రిక విలేకరిగా ఆయన పాత్రికేయ జీవితం మొదలైంది. అయిష్టంగానే పాత్రికేయ వృత్తిలోకి కుల దీప్‌ ప్రవేశించారు. అయితే, చెప్పుకోదగ్గ ప్రావీ ణ్యంతో ఆయన జీవితాంతం జర్నలిస్టుగానే బతి కారు. మంచి రిపోర్టర్‌గా ఆయన ఎన్నో సంచలన వార్తలను మొదటిసారి రాసి దేశవ్యాప్తంగా కీర్తినార్జిం చారు. ఇక్కడ అలాంటి సంచనల వార్తల జాబితా ఇవ్వడానికి వీలులేనన్ని ఎక్కువ ఆయన రాశారు.అయితే, కులదీప్‌కు సంబంధించి వీటన్నిటి కన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు.

మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్‌–సెప్టెంబర్‌ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్‌లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్‌ నాయ కుడు మహ్మ దలీ జిన్నా లాహోర్‌ పర్యటనకు వచ్చారు. జిన్నా తోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమా నంలో లాహోర్‌ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలి తంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్‌ లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండి యాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనిం చారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపం చానికి వెల్లడించింది కులదీప్‌ నయ్యర్‌. జిన్నాతో పాటు లాహోర్‌ వచ్చిన పాక్‌ జర్న లిస్టు మరణించాక కొన్నేళ్లకు ఆయన భార్య చెప్పగా కులదీప్‌కు ఈ విషయం తెలిసింది.

ఎస్‌ వెంకటనారాయణ 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు