బీసీల గొంతుకోసిన బాబు

28 Apr, 2018 02:09 IST|Sakshi
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

బీసీ న్యాయవాదులు అమరనాథ్‌ గౌడ్, అభినవ కుమార్‌లు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించటానికి అర్హులు కారంటూ ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు రాసిన లేఖ బహిర్గతమైంది. బీసీ న్యాయవాదులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వారి నియామకాలను అడ్డుకోవాలని బాబు ప్రయత్నించారు. అయితే, ఇంటెలిజెన్స్‌ శాఖ పరిశీలనలో బీసీ న్యాయవాదులపై చేసిన ఆరోపణలపై అబద్ధాలని తేలిపోవడంతో, వారిని కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తులుగా నియమించింది.

కేంద్రమంత్రికి బాబు రాసిన లేఖల్ని జస్టిస్‌ ఈశ్వరయ్య బయటపెడుతూ మరిన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. వాటన్నింటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉంది.సుప్రీంకోర్టులోగానీ, రాష్ట్ర హైకోర్టులోగానీ, జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్‌ సూత్రాన్ని పాటించడం లేదు, పైగా కొలీజియం పద్ధతి ద్వారా జడ్జీలే, జడ్జీలను నియమించే విధానం కొనసాగుతున్నందువల్ల ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ జడ్జీల సంఖ్య బహు స్వల్పంగా ఉంటోంది. గత 68 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో మొత్తం సుమారు 200మంది న్యాయమూర్తులు నియమితులు అవగా, వారిలో ఒకరిద్దరు తప్ప బీసీ న్యాయమూర్తులు లేరు.

వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రస్తుతం 600 మందికి పైగా న్యాయమూర్తులు పనిచేస్తుండగా బీసీ న్యాయమూర్తులు 80 మంది కూడా లేరు. జనాభాలో 50 శాతానికి మించి ఉన్న బీసీలకు న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం లేదు. జిల్లా స్థాయిలో ఉన్న రిజర్వేషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో ఎందుకు పాటించరు? రాబోయే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఎక్కువమంది బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. కనుక బీసీ న్యాయవాదులు హెచ్చు సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.

వై. కోటేశ్వరరావు,  సీనియర్‌ న్యాయవాది, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ మహాజన సమితి, మొబైల్‌ : 98498 56568 
(నేడు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ న్యాయవాదుల సభ సందర్భంగా)

మరిన్ని వార్తలు