ప్రభుత్వ విద్యకు పునర్‌వైభవం

24 Aug, 2018 00:50 IST|Sakshi

సందర్భం

ఆరేళ్ల క్రితం 2012 డిసెంబర్‌ 2వ తేదీన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం వచ్చింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలకు ఈ చట్టం చేసిన మేలు అంతా ఇంతా కాదు. దాని ఫలితమే వందల కొద్దీ రెసిడెన్షియల్‌ పాఠశాలలొచ్చాయి. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకప్పుడు తిండికీ, బట్టకీ కూడా ఇబ్బందిపడే స్థితిలో ఉండేవారు. ఈ రోజు సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఈ కష్టాలేవీ లేకుండా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టగలుగుతున్నారు. ఫలితంగా ఈ పాఠశాలలు మహోజ్వలంగా విరాజిల్లే స్థాయికి చేరాయి. దీంతో ప్రైవేటు పాఠశాలలపై మోజుపెంచుకున్న మధ్యతరగతి వారు సైతం ఈ ప్రభుత్వ పాఠశాలలౖ వెపు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరిగిందన్న వార్త ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టం కోసం కలలుగం టోన్న నాలాంటి వారికెందరికో శుభవార్త. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సామాన్య ప్రజల సర్వ హక్కులనూ దోచుకుంటోన్న ప్రైవేటీకరణ నుంచి  బయటపడే ప్రయత్నం రాష్ట్రంలో కొంతైనా జరుగు తున్నదనడానికి ఇదొక ఉదాహరణ. అయితే అంత టితో సంతృప్తి పడదామా? అదే మన విద్యావిధానం చివరి లక్ష్యమా? అంటే ముమ్మాటికీ కాదు. ఎందు కంటే పాఠశాల స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగి నంత మాత్రాన వారంతా ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళే స్థితి ఉన్నదా? లేదు. అందులో అత్యధిక భాగం డ్రాపౌట్స్‌గా మారుతున్నారు. సామాన్యుల పిల్లల విద్యాభివృద్ధి లక్ష్యానికి ముందు ఇంకా ఎన్నో సవాళ్ళు అడ్డొస్తూనే ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొ క్కటిగా పరిష్కరించుకుంటూనే తెలంగాణ విద్యా విధానం కొత్త పుంతలు తొక్కుతుంది.. 

గత పదేళ్ళ కృషి ఫలితమే ఇది!
పదేళ్ళ క్రితం వరకూ పేద, దళిత, వెనుకబడిన వర్గాల విద్యపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించ లేదు. విద్యకు పెద్దగా నిధులు సైతం కేటాయించ లేదు. ఆయా సామాజిక వర్గాల రిజర్వేషన్లను సైతం వినియోగించుకునే స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగ లేదు. ఉపాధి అవకాశాలే అంతంత మాత్రం అంటే ఉన్నవాటిని చేరుకునే కనీస స్థాయి సైతం ఈ సమా జిక వర్గాలకు లేకుండా పోయింది. దీనంతటికీ కారణం వారిని తరగతి గదులకు పరిమితం చేసిన మన విద్యావ్యవస్థ. నాలుగు గోడల మధ్య చెప్పిందే చెప్పి ఓ పక్క పిల్లల మస్తిష్కాలను ఓ మూస పద్ధ తిలో తయారుచేసింది. విద్యార్థులు ఉన్నది ఉన్న ట్టుగా బట్టీకొట్టి విషయాలు ముక్కున పెట్టుకొని మూడు గంటల పరీక్షలో దించేస్తే సరిపోయేది. ఆ తరువాత విద్యార్థికి తానేం చదివిందీ గుర్తుండదు. పరీక్షల్లో మాత్రం ఫస్టు మార్కులు ఖరారు.

కానీ గత పదేళ్లుగా ఆయా సామాజిక వర్గాల విద్యార్థుల ఉన్న తికి ప్రత్యేక కృషి జరిగింది. దానికి తోడు ఆరేళ్ల క్రితం 2012 డిసెంబర్‌ 2వ తేదీన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం వచ్చింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్ల లకు ఈ చట్టం చేసిన మేలు అంతా ఇంతా కాదు. దాని ఫలితమే వందల కొద్దీ రెసిడెన్షియల్‌ పాఠశాల లొచ్చాయి. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒక ప్పుడు తిండికీ, బట్టకీ కూడా ఇబ్బందిపడే స్థితిలో ఉండేవారు. ఈ రోజు సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఈ కష్టాలేవీ లేకుండా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టగలుగుతున్నారు. ఫలితంగా ఈ పాఠశా లలు మహోజ్వలంగా విరాజిల్లే స్థాయికి చేరాయి. ఇంతకు ముందు వరకూ ప్రైవేటు పాఠశాలలపై మోజుపెంచుకున్న మధ్యతరగతి వర్గం వారు సైతం ఈ ప్రభుత్వ పాఠశాలల వైపు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. 

పురుషుల కోణంలోనే విద్యావ్యవస్థ
ఇప్పటి వరకూ పాఠ్యాంశాలు కావచ్చు. పాఠశాలల నిర్మాణం కావచ్చు. హాస్టళ్ల విషయం కావచ్చు– వీట న్నింటినీ పురుషుడి కోణం నుంచే చూసింది మన విద్యావిధానం. మన ఇళ్లలోని బాలికలు బడిమెట్లు కూడా ఎక్కకుండా తరాలు గడిచిపోయాయి. కాలం చెల్లిన ఆలోచనలు, సంప్రదాయాలు దీనికి కారణం. అయితే అంతకు మించి విద్యావిధానంలో తిష్టవేసిన పురుషాధిపత్య భావజాలంపై ఇంతవరకూ దృష్టి సారించలేదు. ఇప్పుడిప్పుడే అది జరుగుతోంది.  ప్రధానంగా దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే బాలికలకూ, అన్ని వర్గాల ఆడపిల్లలకూ విద్య అందనంత దూరంలో ఉండడానికీ, అత్యధిక సంఖ్యలో బాలికలు మధ్యలోనే చదువులు మాను కుని ఇంటికే పరిమితం కావడానికీ  ప్రధాన కారణం టాయ్‌లెట్లు. అవి లేకపోవడమే ఆడపిల్లలు మధ్య లోనే చదువు మానేయడానికి ప్రధాన కారణమని జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు తేల్చి చెప్పాయి.

సుప్రీంకోర్టు సైతం పదే పదే ఇదే విష యంపై ప్రభుత్వాలను హెచ్చరించింది. విద్యాహక్కు చట్టంలోనే టాయ్‌లెట్లు, ఇతర మౌలిక అవసరాలు తీర్చే సౌకర్యాలు లేకుండా పాఠశాల నిర్మాణమే జరగ డానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు స్వచ్ఛందంగా వెలుగులోకి తెచ్చాయి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న మానసిక, భౌతిక వేదన, టాయ్‌లెట్లు లేకపోవడం వల్ల వారికి ఎదురౌతున్న సమస్యలపై విస్తృతంగా ప్రచారం చేశాయి. సుప్రీంకోర్టు సైతం పదే పదే మొట్టికాయలు వేసింది. దీని ఫలితంగా ఈ రోజు ఆడపిల్లల కోసం కొద్దో గొప్పో టాయ్‌లెట్ల నిర్మాణం జరుగుతోంది. ఇంకా అనుకున్న స్థాయిలో, అవసరాల మేరకు మరు గుదొడ్లు ఏర్పాటు చేయడం లేదన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. సమాజంలో మాదిరి గానే విద్యావ్యవస్థలోనూ స్త్రీల దృక్కోణం ఇప్పుడి ప్పుడే వెల్లివిరుస్తోంది. అందులో భాగంగానే ïస్త్రీ, పురుష సమానత్వాన్ని బోధించే పాఠ్యాంశాలను సైతం డిగ్రీ స్థాయిలో ప్రవేశపెడుతున్నారు. అన్వేషి లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రయత్నం చేశాయి. జెండర్‌ సెన్సిటివిటీని పెంపొందించే అంశంపై పాఠ్య పుస్తకాన్ని రూపొందించాయి. 

గ్రామాల పునర్నిర్మాణం దిశగా అడుగులు
పట్టణీకరణ మనకు సరికాదన్న విషయం ఏనాడో రుజువయ్యింది. ఆర్థికావసరాలతో పాటు వలసలకు మరో కారణం విద్య. పిల్లల చదువుల కోసం ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు తరలివస్తున్నారు. అక్కడ జీవనోపాధి కష్టమై ఆర్థికంగా చితికిపోయి, తిరిగి కోలుకోలేని స్థితికి చేరుతున్నారు. దీనికి తోడు ప్రైవేటు విద్య ఖర్చు భరించలేని స్థాయికి పెరిగి పోతోంది. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం కావడం, వారి వారి ప్రాంతాల్లోనే అవి అందుబాటులోకి రావడం కొంత ఊరటనిచ్చింది. గ్రామాల్లో వసతుల కల్పన, విద్యావకాశాలను పెంపొందించడంతోపాటు మొత్తంగా గ్రామాల పునర్నిర్మాణంపై దృష్టి కేంద్రీ కరించడం అవసరం. ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు తగినట్టుగా విద్యావిధా నాన్ని మెరుగుపర్చుకోవాలి. ప్రైవేటు స్కూళ్లలో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సామర్థ్యం ఎక్కువన్నది ఇప్పటికే రుజువైన సత్యం. మంచి టీచర్లు ఉన్నారు. కానీ, బోధనా పద్ధతులు మాత్రం పాతవే. ఈ విషయంలో మార్పు అత్యవ సరం. ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఆటో మేషన్‌ను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని వీరు అందిపు చ్చుకోవాలి.

ఈనాటి విద్యార్థులకు సమాచారాన్ని అందించేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వారికి ఎంతో విజ్ఞా నాన్ని అందిస్తోంది. అందులో చెడు కూడా ఉంటోంది. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొత్త టెక్నా లజీని పిల్లలు ఉపయోగిస్తారు. అయితే, ఈ విచక్షణా జ్ఞానాన్ని వారికి అందించే పనిని చేయాల్సింది ఉపా «ధ్యాయులే. అలాగే విద్యాభ్యాసంలో మూస విధా నాన్ని విడనాడి, మెదడుకు పదునుపెట్టే కార్యక్రమం విద్యార్థులకు ఇవ్వాలి. ఇప్పటికే íసీబీఎస్‌సీ విధా నంలో ఆ పద్ధతి ఉంది. విద్యార్థుల్లో విమర్శనాత్మక దృష్టిని పెంచాలి. వారిలో సృజనను పెంపొందించే కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి. ఒక ప్పుడు చదువూ, ఆటలూ ఒకదానికొకటి ముడిపడి ఉండేవి. ఇప్పుడు కూడా ఆటలున్నాయి. కానీ అవి మొబైల్‌ ఫోన్లకే పరిమితమవుతున్నాయి. శారీరక వ్యాయమం పూర్తిగా లేకుండా పోయింది. పాఠశాల లన్నీ నడిచేది బహుళ అంతస్తుల భవనాల్లోని ఇరుకు గదుల్లోనే. ఆటస్థలాలున్న పాఠశాలలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే మనలోని క్రీడాసక్తి ఎంతో ఇట్టే తేలిపోతుంది. పాఠశాల స్థాయిలో వ్యాయామోపాధ్యాయుడిగా ఒక్కరినే నియమి స్తున్నారు. ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు వ్యాయామ ఉపాధ్యాయులను నియమించడం అవ సరం. ప్రాథమిక స్థాయిలోనే ఆటలపై ఆసక్తిని ప్రోత్సహించలేనప్పుడు ఆసియా క్రీడల్లో పతకాలను ఆశించడం అత్యాశే అవుతుంది.

సోషల్‌ మీడియా విశిష్ట పాత్ర
కేరళ వరదల్లో సైన్యం పాత్రనూ, అక్కడి సహాయక చర్యలనూ సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఎందరో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయకచర్యల్లో పాల్గొనేలా చేశాయి. అలా సాయపడిన వారిలో ఐఐటీ విద్యార్థులూ, ఐటీ ఉద్యోగులూ మొదలుకొని సాధారణ మత్స్యకారుల వరకూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు సైతం తమకు తోచిన రీతిలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిలో సామాజిక సేవాతత్పరతను పెంపొందించింది అక్కడి విద్యావిధానం కావచ్చు. అలాగే ముంబైలో ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదం నుంచి ఓ పదేళ్ల చిన్నారి ఎంతో మందిని కాపాడింది. ఆ అమ్మాయి అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రాజెక్టుని మనసు పెట్టి చేయడమే కారణం. ప్రాక్టి కల్‌గా దాన్ని అర్థం చేసుకుంది. సందర్భాన్ని బట్టి తన బుర్రని ఉపయోగించిందా చిన్నారి. దాన్ని సరిగ్గా ఆచరణలో చేసి చూపించింది.

ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఇలాంటి విద్యావిధానమే నిజంగా ఇప్పుడు మనకు కావాల్సింది. ప్రస్తుతం మనకు కావాల్సింది సంస్కరణల పేరుతో ఇచ్చే నగదు కాదు. భవిష్యత్‌ తరాల అవసరాల కోసం డబ్బును పెట్టుబడిగా ఖర్చు చేయాలి. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి. విద్యార్థులకు అవసరమైన లేబొరేటరీలూ, టాయ్‌లెట్లూ, ఇతర భవనాల నిర్మాణం కోసం డబ్బు వెచ్చించాలి. ఏవో సంస్కరణల పేరుతో నగదు ఇవ్వడం వల్ల దాని దుర్వినియోగం జరుగుతోంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆ డబ్బు ఖర్చు చేయడం లేదు. ఆయా కుటుంబాల్లోని పురుషుల తాగుడుకే అది చెల్లిపోతోంది. కనుక ప్రజల డబ్బుని వారి భవిష్యత్‌ అవసరాలను తీర్చే ప్రణాళికల అమలుకోసం పెట్టు బడిగా పెట్టాలి. అటు వైపుగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. తల్లిదండ్రులపై ప్రైవేటు భారం పడ కుండా కాపాడే విధానాలను రూపొందించాలి.

చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,

మరిన్ని వార్తలు