మారోజు వీరన్న అమరత్వం

15 May, 2018 02:51 IST|Sakshi
మారోజు వీరన్న( పాత చిత్రం)

పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణా పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాత మారోజు వీరన్న భౌతికంగా దూరమై 19 సంవత్సరాలు అవుతున్నది.  1999, మే 16న∙కరీంనగర్‌ జిల్లా నర్సింగాపూర్‌లోని మామిడితోటలో అర్థరాత్రి రాజకీయ హత్య గావించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిం చారు. దళిత బహుజన ఆవేశాన్ని చల్లారుస్తూ.. అప్రకటిత ఎమర్జెన్సీ పాలనా సాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పల్లె పల్లెన శ్మశాన శాంతిని నెలకొల్పింది. ఎర్ర పోరాటానికి నీలి మెరుపులు అద్దిన వీరన్న అస్తిత్వ  పోరాటాలకు దిక్సూచిగా నిలిచాడు. 19 ఏళ్లుగా వీరన్న భౌతికంగా లేకున్నా ప్రతి అస్తిత్వ పోరాటంలో సజీవంగా ఉన్నాడు. భారత విప్లవ పోరాట పంథాను కుల నిర్మూలన ఫలకంపై నిర్మించడంలో విఫలం అయ్యి ప్రజ లకు దూరమవుతున్నారనే వీరన్న ఆయన అనుయాయుల విమర్శతోనే నేటి కమ్యూనిస్టులు అంబేడ్కర్‌ను ఎత్తిపడుతున్నారా అనేది చర్చనీ యాంశం. వీరన్న కుల వర్గ జమిలి పోరాట సూత్రాన్ని అన్వయించుకొని నేడు లాల్‌–నీల్‌ ఐక్యత పోరాటంగా ముందుకు సాగుతున్న పార్టీలు సైతం ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ఎత్తుగడనా? లేక సైద్ధాంతికంగానే పంథాను మార్చుకున్నాయా అనేది నేడు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశం. శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవు.  కనుక వీరన్న చూపిన రాజకీయ సైద్ధాంతిక వెలుగులో పురోగమించడమే ఆయన స్మృతిలో నిజమైన నివాళి. సమానత్వ సమాజ మార్గానికి పునాది రవళి.
(మే 16న మారోజు వీరన్న 19వ వర్థంతి)

దుబ్బ రంజిత్, యం. ఏ. పీ.హెచ్‌.డి, అర్థశాస్త్ర పరిశోధక విద్యార్థి, పీ.డీ.ఎస్‌.యు. అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ
 మొబైల్‌ : 99120 67322

మరిన్ని వార్తలు