రైతుల ఆందోళన దేనికోసం?

24 Jun, 2018 02:19 IST|Sakshi

ఇటీవల రైతులు, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారుల నిరసన ప్రదర్శ నల సందర్భంలో చెలరేగిన ఘర్షణలను దృష్టిలో పెట్టు కుని పంజాబ్‌లో పది రోజుల పాటు జరగాల్సిన గావ్‌ బంద్‌ (గ్రామాల బంద్‌)ను కుదించాలన్న నిర్ణయం హర్షించదగ్గ పరిణామం. అనేక కొట్లాట లకు దారితీసిన రైతుల ఆందోళనలు మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో రక్తపాతానికి కారణమౌతాయనే భయంతో గావ్‌ బంద్‌ను మధ్యలోనే విరమించడం మంచి నిర్ణయం. కిందటేడాది మధ్యప్రదేశ్‌లోని మాండసోర్‌లో రైతులు ఆందోళనకు దిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మర ణించారు. ఇలాంటి దురదృష్టకర ఘటన పునరా వృతం కాకూడదనే భావనతోనే గావ్‌ బంద్‌ను విర మించారు. రైతుల నిరసనకు న్యాయమైన కారణాలు లేవన్న కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్‌  హరి యాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌... నిజంగా రైతుల పరిస్థితి అంతా బాగుంటే, వ్యవసా యంలో లోపాలే లేకుంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయనే అనుమానం నాకు వస్తోంది.

వ్యవసాయరంగం వ్యవస్థాపరమైన సంక్షో భంలో కూరుకుపోతోంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు నిలకడగా కొనసాగడా నికి కర్షకులను కావాలనే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడకుండా చేస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవ ర్నర్, ప్రసిద్ధ ఆర్థికవేత్త రఘురామ్‌ రాజన్‌ ఇది వరకు చెప్పిన మాటలే దీనికి తార్కాణం. వ్యవసాయాన్ని ఆర్థికంగా గిట్టుబాటయ్యే వృత్తిగా మార్చాల్సిన అవ సరముందని చెప్పడానికి బదులు ‘‘రైతులను వ్యవ సాయం నుంచి బయటకు తీసుకొచ్చి నగరాలకు తరలించడమే అతి పెద్ద సంస్కరణ. ఎందుకంటే, పట్టణ ప్రాంతాలకు తక్కువ వేతనంతో పనిచేసే కార్మికుల అవసరం ఉంది’’ అని సూత్రీకరించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం ఓ ‘ఆర్థిక కుట్ర’ ఫలితమని చెప్పవచ్చు.

నామమాత్రంగా సైతం పెరగని వ్యవసాయో త్పత్తుల ధరలు వ్యవసాయానికి సంబంధించిన తాజా ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే రైతులకు ఏం దక్కుతోందో స్పష్టమౌతుంది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం నాలుగో భాగంలో వ్యవసాయోత్పత్తుల ధరలు కేవలం 0.4 శాతం మాత్రమే పెరిగాయని కేంద్ర గణాంక కార్యలయం (సీఎస్‌ఓ) ప్రకటిం చింది. 2011–12 మధ్య ఐదేళ్ల కాలంలో వాస్తవిక వ్యవసాయ ఆదాయాలు ఏటా అర శాతం కన్నా తక్కువే (ఖచ్చితంగా చెప్పాలంటే 0.44) పెరిగా  యని నీతి ఆయోగ్‌ ఇది వరకటి నివేదికలో వెల్లడిం చింది. వ్యవసాయోత్పత్తుల నికర ధరలు ప్రపంచ వ్యాప్తంగా 1985–2005 మధ్య ఇరవై ఏళ్ల కాలంలో ఎదుగూబొదుగూ లేకుండా నిలిచిపోయాయని ఐక్య రాజ్యసమితి అనుబంధ సంస్థ అంక్టాడ్‌ కొన్నేళ్ల క్రితం విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది.

1970 సంవత్సరంలో గోధుమకు క్వింటాలుకు కనీస మద్దతు ధర 76 రూపాయలుంది. 45 ఏళ్ల తర్వాత, 2015లో గోధుమల ధర క్వింటాలుకు రూ. 1435కు పెరిగింది. అంటే గోధుమ మద్దతు ధర 19 రెట్లు పెరిగింది. ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (డీఏ) కలిపి 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కళా శాల–విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల వేతనాలు 150 నుంచి 170 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల జీతాలు 280 నుంచి 320 రెట్లు పెరిగాయి. అయితే, రైతుల ఉత్పత్తులకు చెల్లించే ధరలు ఈ 45 సంవత్సరాల్లో నిజమైన పెరుగుదల లేకుండా దాదాపు నిలకడగా నిలిచిపోయాయి. అంతేగాక, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 108 రకాల భత్యాలు అందుబాటులోకి వచ్చాయి. కనీస మద్దతు ధర నిర్ణయించే క్రమంలో తమకు కూడా ఇంటి అద్దె అలవెన్స్, వైద్య ఖర్చుల అలవెన్స్, విద్యకు అలవెన్స్, ప్రయాణ భత్యం చేర్చా లని రైతులు ఎప్పుడైనా అడిగారా? అనుమానమే.

ఇంతటి అననుకూల పరిస్థితుల్లో దేశానికి ధాన్యాగారంగా పరిగణించే పంజాబ్‌లో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారన్న విషయం ఆశ్చర్యం కలిగించదు. 98 శాతం నికర సాగునీటి సరఫరా సౌకర్యాలతో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో పప్పుధాన్యాల దిగుబడి సాధి స్తున్నా రైతుల ఆత్మహత్యలకు పంజాబ్‌ కేంద్రంగా మారిపోయింది. 2000–2017 మధ్య కాలంలో 16,600 మంది పంజాబ్‌ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని  మూడు విశ్వవిద్యాలయాల ప్రతిని ధులు ఇంటింటికీ వెళ్లి జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. సాగు సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పడం తేలికే. అయితే, నానా కష్టాలు పడి పండించిన పంటకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయం రైతుకు అందకుండా చేయడమే ప్రధాన కారణం. రాష్ట్ర ఆదాయంలో 88.36 శాతం సొమ్మును జీతాలు, పింఛన్లు చెల్లించడానికి, రుణా లపై వడ్డీలు కట్టడానికి, విద్యుత్‌ సబ్సిడీ చెల్లించడా నికి పోతే రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి మిగి లేది ఎంతో గమనిస్తే సమస్య తీవ్రత అర్థమౌతుంది.

దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ :  hunger55@gmail.com

మరిన్ని వార్తలు