‘హోదా’ రాకుండా చేసింది చంద్రబాబే!

15 May, 2018 07:04 IST|Sakshi
సీఎం చంద్రబాబు నాయుడు

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి తొలి ముద్దాయి బీజేపీ. రెండో ముద్దాయి కాంగ్రెస్‌ కాగా అసలు ముద్దాయి మాత్రం టీడీపీనే అని చెప్పాలి. విభజన చట్టంలో స్పష్టత ఉన్న హక్కులు కొన్నింటిని, స్పష్టత లేని హక్కులు కొన్నింటిని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. హోదాను స్పష్టత ఉన్న హక్కుల్లో చేర్చి ఉండవచ్చు కానీ కాంగ్రెస్‌ అలా చేయలేదు. కనీసం బీజేపీ అయినా విభజన చట్టం ముసాయిదాను అందుకున్న సమయంలోనే, ఏపీకి అన్ని హక్కుల్ని స్పష్టంగా ఇవ్వాలని, హోదాను కూడా అందులో చేర్చాలని నాటి ప్రభుత్వాన్ని కోరి ఉండవచ్చు. 

అలా చేయకపోగా కొత్తగా కేంద్రప్రభుత్వాన్ని ఏర్పర్చిన తర్వాతయినా పాత ప్రభుత్వం ఆమోదించి ప్లానింగ్‌ కమిషన్‌కు పంపిన హోదాను బీజేపీ అమలు జరిపి ఉండవచ్చు. ఆ పనీ చేయలేదు. పైగా హోదా కోసం కొత్తగా చట్టాన్నీ చేయలేదు. హోదా విషయంలో భంగపాటుకు అసలు కారకుడు చంద్రబాబే. హైదరాబాద్‌ను కోల్పోయి ఆర్థిక అంగవైకల్యం చెందిన కొత్త ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్లు హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. బీజేపీ కూడా పదేళ్లు హోదా ఇవ్వాలని భావించింది. 

కానీ టీడీపీతో 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, ఆ తర్వాత మిత్రపక్షంగా ఉండటం, సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, కేంద్రంలో నడపడంతో బీజేపీ ప్రభుత్వం ఏపీకి సంబంధించిన ప్రధాన అంశాల్లో చంద్రబాబుతో సంప్రదించి నిర్ణయం తీసుకోసా గింది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉండగా, తనకు తనపార్టీకి, తన సన్నిహితులకు లాభం ఉంటుందని భావించిన బాబు పోలవరం విషయంలో కేంద్రాన్ని ఒప్పించారు. ఇదేవిధంగా హోదా విషయంలో చంద్రబాబుతో పలు దఫాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్చించింది. 

హోదా బదులు ప్యాకేజీని ఏపీకి ఇవ్వాలని బాబు పట్టుబట్టడం, ఒత్తిడి పెట్టడం చేశారు. హోదా ఇస్తే అప్పటికే పలు రూపాల్లో హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఆయన పార్టీకి రాజకీయంగా మరింత బలం పెరుగుతుందని అనుమానించి, ఒక దశలో హోదాను ఇవ్వాలనుకున్న బీజేపీని ఇవ్వకుండా చేసి ప్యాకేజీకి సిద్ధపడిపోయారు. 
తన కోరిక ప్రకారమే కేంద్రం హోదా ఇవ్వలేదు కాబట్టి వైఎస్‌ జగన్‌ చేస్తున్న హోదా ఉద్యమాన్ని బలహీనపర్చబోతున్నాననే ఆనందంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటనను నిమిషాల్లోనే ఆమోదించడం, జైట్లీకి, లాబీయింగ్‌ జరిపిన వెంకయ్యకు అభినందనలు తెలపడం, అసెంబ్లీలో అభినందన తీర్మానాలు చేయడం జరిగిపోయాయి. 

పైగా హోదా కోసం ఆందోళనలు చేస్తే చట్టం తన పనిచేస్తుంది, ఉద్యమిస్తే విద్యార్థులు ఉండేది జైల్లోనే అంటూ బెది రింపులకు దిగారు. ప్రతిపక్షనేత జగన్‌ని, ఇతర పార్టీల నాయకుల్ని, విద్యార్థుల్ని అరెస్టు చేయిం చాడు. హోదా రాకున్నా, ప్యాకేజీ వల్లే రాష్ట్రానికి పరి శ్రమలు పరిగెత్తి వస్తున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని బిల్డప్‌ మాటలతో కేంద్రం హోదాను ఇవ్వాల్సిన అవసరం లేదని సంకేతాలు పంపసాగాడు బాబు. ఇలా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితుల్ని సృష్టిం చాడు. మరోవైపున పోలవరం, రాజధాని తదితర అంశాల్లో కేంద్ర నిధుల వాడకంపై లెక్కలు చెప్పకపోవడంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల రాక ఆలస్యం కాసాగింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాలన్నింటికీ తానే కారణమైనా, బీజేపీ మోసగించిందంటూ ప్రజ లను మళ్లీ ఏమార్చుతున్నారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌ జనం ఇప్పుడు నమ్మదగిన నేతగా వైఎస్‌ జగన్‌ను కీర్తిస్తున్నారు. ఆయనను చూట్టానికి, తమ సమస్యలు చెప్పుకోవడానికి తండ్రి వైఎస్సార్‌ పాదయాత్రకు మించి లక్షలాదిగా జనం బయటకు వస్తున్నారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇప్పుడు హోదా రాగం ఎత్తుకున్నాడని బాబును తిట్టిపోస్తున్నారు. జనం సమస్యలు పట్టని మూడు దఫాల సీఎంను కాపాడటానికి పచ్చమీడియా, ఉద్యోగ సంఘాలు, ముసుగు సంఘాలు, జనసేన వంటి పార్టీలు కూడా టీడీపీకి సేఫ్టీ వాల్వులు లాగా పనిచేస్తుండటం విచారకరం. వీరంతా ఇప్పటికైనా మేల్కొంటే మంచిది.

- ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి 
వ్యాసకర్త విశ్రాంతాచార్యులు, చరిత్రశాఖ, ఎస్వీయూ, తిరుపతి ‘ 98495 84324

మరిన్ని వార్తలు