ప్రజాధనం–పచ్చదనం–మనం

3 Aug, 2018 00:26 IST|Sakshi

సమకాలీనం

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసంఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్యక్రమంగానే మిగిలిపోతుంది. అందుకే ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత నెరవేర్చాలి.

హక్కుల గురించి మాత్రమే మాట్లాడే మను షులకు బాధ్యతల్ని గుర్తు  చేస్తే చురుక్కుమంటుంది. తమ విధులు–బాధ్యతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి దంటారు. మన సామూహిక బాధ్యతలు కూడా ఏతావాతా మనందరం ఉమ్మడి  హక్కులు నిండుగా అనుభవించడానికే అని చెబితే... ఎట్టెట్టా? అని ముక్కున వేలేసుకుంటారు. వ్యక్తిగత హక్కుల భద్ర తకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. హక్కులు, బాధ్య తలూ ఒకే నాణేనికి రెండు వైపులంటే... ‘ఓయబ్బో! ఈయనొచ్చాడయా దిగి... మాకు నీతి పాఠాలు చెప్ప డానికి, హు...!’ అన్నా అంటారు. కానీ, ఇది పచ్చి నిజం! మానవ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్య–ఉపాధి అవ కాశాల కల్పన... ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు మనం హక్కుల గురించి మాట్లాడినంత బాధ్యతల గురించి మాట్లాడం, మాట్లాడనీయం. అదీ ముఖ్యంగా పౌరుల బాధ్యతల గురించైతే అస్సలు మాట్లాడం! ఎంతసేపు ప్రభుత్వాల బాధ్య త–జవాబుదారితనం, అధికారుల విధులు–కర్త వ్యాలు, వాటి విజయ–వైఫల్యాలే మనకు సదా కథా వస్తువు. మన హక్కుల గురించి, అవి భంగపోయిన తీరు గురించి ఎంతైనా మాట్లాడతాం. అవతలి వారి బాధ్యతల గురించి, వాటి అమలులో వైఫల్యం గురించి అంతకన్నా పిసరు ఎక్కువగానే మాట్లా డతాం. మరి మన బాధ్యతల సంగతి? మన విధి నిర్వహణ మాటో! మన జవాబుదారితనం ఏం గాను? కొన్ని విషయాల్లో మనం బాధ్యతల్ని విస్మరిం చడం ఎంతటి విపరిణామాలకు దారి తీస్తుందో తెలు సుకుంటే గుండె తరుక్కుపోతుంది. పర్యావరణమే తీసుకుంటే, దాని పరిరక్షణ రాజ్యాంగం మనకు నిర్దే శించిన బాధ్యత. ఈ విషయంలో ఏ మేరకు మనం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నామని ఎవరికి వారు బేరీజు వేసుకోవాల్సిందే! పౌరులుగా, ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా మనకూ ఈ విషయంలో విహిత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధ నాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసం ఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్య క్రమంగానే మిగిలిపోతుంది.

మంచి పనికి పౌర మద్దతుండాలి
జనాకర్షణ పథకాలతో ఓట్లు పిండుకునే రాజ కీయాలు నడుస్తున్న కాలంలో, ఏ వత్తిడి లేకపోయినా ప్రభుత్వాలు ‘హరితహారం’ వంటి బృహత్‌ కార్య క్రమం తీసుకోవడాన్ని విమర్శకులు కూడా అభినంది స్తారు. అయిదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. నాలుగో విడత హరితహారాన్ని బుధవారమే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ యేడు 40 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 33 శాతం ఉండా ల్సిన అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉన్నట్టు ప్రభు త్వం చెబుతోంది. అది కూడా సందేహమేనని పర్యా వరణవేత్తలంటున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం లోనూ మార్పులు చేసి హరితహారాన్నొక శాశ్వత కార్యక్రమం చేయాలన్న సర్కారు తలంపునకు స్థాని కంగా పౌర సహాకారం ఉంటే తప్ప ఏదీ సాకారం కాదు. ఒకటి, రెండేళ్లలో ప్రతి గ్రామంలో నర్సరీని నడిపే దిశగా అడుగులు పడాలన్నది సర్కారు ఆకాంక్ష. ప్రభుత్వంలోని వివిధ శాఖల్ని అనుసంధా నపరచడం, అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్నీ బాధ్యుల్ని చేయడం, వివిధ రూపాల్లో ఉపాధిహామీ పథకపు నిధుల్నే ప్రధానంగా వినియోగించడం... ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమా నికి గడచిన మూడేళ్లలో 2473 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించింది. గొప్ప కార్యక్రమమే అయినా... మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ద వాటిని బతికించడంలో లేదనే విమర్శ ఉంది. ఎక్కడికక్కడ మొక్కల మనుగడ దక్కేది తక్కువే కావడం ఆందో ళన కలిగిస్తోంది. సగటు నలబై శాతం కూడా దక్క ట్లేదు. నాయకుల శ్రద్ద, అధికారుల నిబద్దత, స్థానిక సంస్థల పాత్ర, పౌర సంఘాల ప్రమేయం, ప్రజల భాగస్వామ్యం మొక్కల్ని అధికశాతం బతికించుకోవ డంలో కీలక పాత్ర వహిస్తాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధిక శాతం మనుగడ నమోదవడం, మహబూబ్‌ నగర్‌ వంటి జిల్లాల్లో అత్యల్ప శాతం మొక్కలే బత కడం ఇందుకు నిదర్శనం. వాటిని బతికించుకోవా ల్సిన బాధ్యత పౌరులు, ప్రజా సంఘాలపైనా ఉంది.

ప్రచారంపై ఉన్న శ్రద్ద పనిపై ఏది?
మొక్కలు నాటే, అడవులు పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు అదే స్థాయి శ్రద్ద పౌరుల్ని భాగస్వాముల్ని చేయడంపై చూపటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహి స్తున్న ‘వనం మనం’ ఇందుకు నిరద్శనం. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కార్తీక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం కింద కోట్లాది మొక్కలు నాట డాన్ని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. 2015–16లో 30 కోట్ల మొక్కలు నాటినట్టు సర్కారు లెక్క! నేలమీద అవి ఎక్కడున్నాయో జాడే లేదు! మొక్కకు సగటున రూ.15 ఖర్చయినట్టు రికార్డు రాశారు. ఇలా ఒక సంవత్సరం రూ.360 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 18.46 కోట్లు నాటామని, ఈ యేడు మరో 25 కోట్ల మొక్కలు లక్ష్యమనీ అంటోంది. 25 కోట్ల మొక్కల్ని అందించేపాటి నర్సరీల వ్యవస్థే రాష్ట్రంలో లేదనేది విమర్శ. లెక్కలే తప్ప మొక్కలు లేవని, ఉన్న మొక్కలు కూడా మొక్కుబడి పనుల వల్ల సరిగా నాట కుండానే రోడ్ల పైన పారవేసి పోతున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అటవీ ప్రాంతం ఇప్పుడు 24 శాతం ఉందని చెప్పే ప్రభుత్వం, 2029 నాటికి 50 శాతం చేయాలని ‘మిషన్‌ హరితాం ధ్రప్రదేశ్‌’ చేప ట్టినట్టు విస్తృత ప్రచారం చేస్తోంది. పనిలో పనిగా కార్పొరేట్‌ రంగాన్ని, స్థానికసంస్థల్ని, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్ని. పౌర సంఘాల్ని కూడా భాగ స్వాముల్ని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

‘పారిస్‌ ఒప్పందం’లో పలు పర్యావరణ స్వీయ నిర్భందాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో అడుగులైతే నెమ్మదిగా వేస్తోంది. జనాన్ని చైతన్య పరిచే చర్యలే లేవు. ‘నష్టపరిహార అటవీ అభివృద్ధి నిధి నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ’ (కంపా) కింద పెద్ద ఎత్తున నిధులున్నా వాటిని వినియోగించడం లేదని ఏటా ‘కాగ్‌’ తప్పుబడు తోంది. రూ.39000 కోట్లుండగా ఏటా రూ.6000 కోట్లు కొత్తగా జత అవుతున్నాయి. పౌర భాగస్వా మ్యంపై ప్రభుత్వాలేవీ పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. 

రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీం రక్షణ
ఒకరి బాధ్యత మరొకరికి హక్కు అయినట్టే, ఒకరి హక్కు ఇంకొకరి బాధ్యత అని దేశంలోని న్యాయ స్థానాలు పలుమార్లు తీర్పుల్లో స్పష్టం చేశాయి. పర్యావరణ పరిరక్షణ సవ్యంగా జరిగితేనే పౌరులం దరి జీవించే హక్కుకు భద్రత! ఇలా అందరి హక్కు రక్షణ క్రమంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత కూడా అవుతుంది. రాజ్యాంగం 21వ అధికరణంలోని జీవించే హక్కును సమగ్రంగా వివరిస్తూ, కాలుష్యరహిత జీవితం పౌరుల ప్రాథ మిక హక్కని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (ఎమ్‌.సీ మెహతా వర్సెస్‌ యూనియన్‌ ఆప్‌ ఇండియా) 1987లోనే స్పష్టత ఇచ్చింది. అధికరణం 19 (1)(జి) ప్రకారం ఏ వృత్తయినా, ఏ వాణిజ్య– వ్యాపారమైనా నిర్వహించుకోవడం పౌరుల ప్రాథ మిక హక్కే అయినప్పటికీ, దానికి కొన్ని పరిమితు లున్నాయి. సమాజం, ఇతర జనసమూహాల ఆరో గ్యాన్ని దెబ్బతీసే విధంగా పౌరులెవరూ తమ స్వేచ్ఛాయుత వాణిజ్య–వ్యాపారపు హక్కును విని యోగించుకోజాలరనీ సుప్రీంకోర్టు (కూవర్జీ బి.బరుచ్చా వర్సెస్‌ ఎక్సైజ్‌ కమిషనర్, అజ్మీర్‌–1954 కేసులో) చెప్పింది. పౌర హక్కుల పరంగా... వాణిజ్య స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మధ్య వివాదం తలెత్తినపుడు న్యాయస్థానాలు సహజంగానే పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గాలని కూడా న్యాయ స్థానం స్పష్టం చేసింది. దానికి లోబడే ఏ వాణి జ్య–వ్యాపార కార్యకలాపాలైనా చేసుకోవచ్చంది. 

వేదాల నుంచి మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రకృతితో మమైకమై సకల జీవ రాశితో మనిషి సహజీవనం సాగించడాన్నే నొక్కి చెప్పారు. అదే జరిగింది ఇంతకాలం. ‘మానవుని స్వర్గం భూమ్మీదే ఉంది. ఈ సజీవ భూగ్రహం అన్ని జీవులది. ఇది ప్రకృతి వరం. దీన్ని పరిరక్షించు కుంటూ ప్రేమాస్పద జీవనం సాగించాలి’ అని అధ ర్వణవేదంలో ఉంది. పర్యావరణ పరిరక్షణ అన్నది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఆచరణగానే కాకుండా రాజ్యాంగపరంగా కూడా తగు భద్రత ఏర్పా ట్లున్నాయి. అటవుల సంరక్షణ, నీటి నిర్వహణ, భూసార పరిరక్షణలో గ్రామస్థాయి నుంచి స్థానిక సంస్థలకు విశేషాధికారాలు కల్సిస్తూ మనం రాజ్యాం గాన్ని సవరించుకున్నాం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పౌరులకు అందించడం, అందుకోసం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడటం సంక్షేమ ప్రభుత్వాల బాధ్యత (అధికరణం 47, 48) అనేది తిరుగులేని భద్రత! అదే సమయంలో పౌరుల బాధ్యతను కూడా రాజ్యాంగం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తోంది. అడ వులు, చెరువులు, నదులు, జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతిని కాపాడుతూ, పర్యావరణాన్ని అభివృద్ధి పరుస్తూ సకలజీవుల పట్ల దయ, అనుకంపతో ఉండ టం ప్రతి పౌరుని బాధ్యత (అధికరణం 51–ఎ (జి)) అని చెబుతోంది.

ఇప్పుడా స్ఫూర్తి సర్వత్రా రగలాలి. ప్రతి పౌరుడూ తన స్థాయిలో స్పందించాలి. ప్రతి గ్రామమూ కదలాలి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నూరు శాతం విజయవంతమయ్యేలా తోడ్పడాలి. అది ‘కంపా’ అయినా, ‘హరితహారమై’నా, ‘వనం మనం’ అయినా... అక్కడ ఖర్యయ్యే ప్రతిపైసా ప్రజాధనం. అది వృధా కానీయకుండా ప్రయోజనం కలిగించేలా చూసే, చూడాల్సిన బాధ్యత మనది, మనందరిది!

దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ :dileepreddy@sakshi.com
 

మరిన్ని వార్తలు