భారత తీరానికి యూరప్‌ హారం

22 Sep, 2019 01:25 IST|Sakshi

విశ్లేషణ

ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలతో మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్‌ కూడా తమిళనాడు, గుజరాత్‌లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్‌ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మతులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా ఏపీ సరుకు రవాణా 50 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. కోటి జనాభాకు మించని గ్రీస్‌ దేశం ఏటా ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమానంగా షిప్పింగ్‌ బిజినెస్‌ ద్వారా ఆర్జించడం గమనార్హం.

భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశంలోని రెండు తీర ప్రాంతాల్లో ‘సముద్ర వాణిజ్య సముదాయాలు’ (మారిటైమ్‌ క్లస్టర్ల)ను ఏర్పాటు చేస్తోంది. ఒకటి గుజరాత్‌లో... రెండోది పొరుగునున్న తమిళనాడులో. మరి సుదీర్ఘమైన తీర ప్రాంతంతో విరాజిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌ లోనూ మరో మారిటైమ్‌ క్లస్టర్‌ రావాలి. దీనికి కేంద్రం పచ్చజెండా ఊపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇపుడెందుకంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సముద్ర వాణిజ్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నౌకా నిర్మాణాలు, నౌకల మర మ్మతులకు సంబంధించిన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. దీనివల్ల విదేశాల నుంచి మన షిప్‌ యార్డులకు నౌకా నిర్మాణాల ఆర్డర్లు పెరిగే అవకాశముంది. దీంతో నిపు ణులు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దేశీ యంగా నౌకా నిర్మాణ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి.

ఎందుకంటే ప్రపంచంలో నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలు మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్‌ కూడా తమిళనాడు, గుజరాత్‌లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్‌ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మ తులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా  ఏపీ సరుకు రవాణా  50 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. 

ఐరోపాతో భారత ఉప ఖండానికి సరైన వారధి సముద్రమే. తీరప్రాంతాలలో వెలసిన అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్, ప్రపంచం లోనే రెండో చిన్న ఖండమైన యూరప్‌ స్నేహగీతం ఆలపిస్తున్నాయి. నిజానికి నాగరిక జీవనం ఆరంభం నుంచీ భౌగోళిక, చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన యూరప్‌ నుంచి రాక పోకలకు భారత్‌ ప్రధాన ద్వారంగానే ఉంటూ వస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఇరుదేశాల స్నేహపూర్వక సంబంధాలు సుహృద్భావ వాతావ రణాన్ని నెలకొల్పాయి. ఐరోపాకు తూర్పున కాస్పి యన్, పశ్చిమాన అట్లాంటిక్, ఉత్త రాన ఆర్కిటిక్, దక్షిణాన మధ్యదరా సముద్రాలతో పాటు ఆగ్నే యాన కాకసస్‌ పర్వతాలు, నల్ల సముద్రం సరి హద్దులుగా ఉన్నాయి. ఇక భారతదేశానికి అత్యధిక జనాభాతో పాటు ఏడు వేల కిలోమీ టర్లకు పైగా సముద్ర తీరం కూడా ఉంది. యూరప్‌ ఖండాన్ని, భారత్‌ ఉపఖండాన్ని మిత్ర దేశాలుగా ఉంచుతున్న ఈ సముద్రాలు... ఇరు దేశాల మధ్య వాణిజ్య అవ కాశాలను మరింత పెంచే అవకాశాలనూ అంది స్తున్నాయి. 

భారతదేశ వాణిజ్యమంతా సముద్రయానం పైనే ఆధారపడి ఉంది. 95 శాతం వ్యాపారం పూర్తిగా సముద్రం మీదుగానే సాగుతోంది. ముడి చమురు దిగుమతులలో భారత్‌ది 3వ స్థానం. గ్రీస్‌ నుంచి ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీలను  దిగుమతి చేసుకోవడంలోనూ భారత్‌ వాటాయే అధికం. ఇక నౌకాయాన వాణిజ్యంలో ప్రపంచంలోనే మొదటి స్థానం భారత్‌ది. ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు సాగించే నౌకలలో 50 శాతం గుజరాత్‌లోని అలంగ్‌ పోర్ట్‌ నుంచే సాగుతున్నాయి. భారత నౌకా వాణిజ్యంలో ఎంతగా  దూసుకుపోతోందో  చెప్ప డానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గ్రీస్, భారత్‌ దేశాల మధ్య సముద్రయాన వాణిజ్య సంబంధాల వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. ఇక భారత్‌లోని తీర ప్రాంతంలో 12 శాతం ఆంధ్రప్రదేశ్‌ సొంతం. 974 కిలోమీటర్ల ఈ తీరంలో  ఒక మేజర్‌ పోర్టు, 14 నాన్‌ మేజర్‌ పోర్టులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భాగ స్వామ్యంలో నిర్వహిస్తున్న మరో 6 పోర్టులూ ఉన్నాయి. సముద్రమార్గంలో అత్యధిక సరుకు రవాణా చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది గుజరాత్‌ తరువాతి స్థానం. 2018 నాటికి 15 కోట్ల మెట్రిక్‌ టన్నులున్న సరుకు రవాణా 2020 నాటికి 16.5 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరుకుని 10 శాతం పెరు గుదల నమోదు చేస్తుందనేది తాజా అంచనా.

ప్రాచీనకాలం నుంచి సముద్రరవాణాపై ఆధారప డిన గ్రీస్‌ దేశ జనాభా కోటికి మించదు. గ్రీకుల వాణిజ్యమంతా జల రవాణా ద్వారానే జరుగుతుం డటం మరో విశేషం. అందుకని ఏపీ సముద్ర రవా ణాకు, వాణిజ్యబంధానికి గ్రీస్‌ దేశం సరిగ్గా సరిపో తుంది. దీని కోసం ఏపీ తీరంలో మరిన్ని పోర్టులు, షిప్పింగ్‌ కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది. షిప్పింగ్‌ బిజినెస్‌ ద్వారా ఏటా 25 బిలియన్ల డాలర్లను గ్రీస్‌ దేశం ఆర్జిస్తోంది. ఇది ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమానం. నిజానికి గ్రీస్‌ స్థాయిలో నౌకా రవాణా, షిప్పింగ్‌ బిజినెస్‌లో వృద్ధి సాధిం చేందుకు ఏపీలో అనువైన పరిస్థితులే ఉన్నాయి. తీరప్రాంతంలో వాణిజ్య, వ్యాపారాలు సులభ తరం చేసేలా ప్రభుత్వాలు తగు వి«ధానాలు కూడా రూపొందించాయి. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ వీలు కల్పించాయి. రానున్న రోజుల్లో 35 ఏళ్ల లోపు యువతలో 65 శాతం దేశాభివృద్ధిలో భాగమయ్యే అవకాశం ఉంది. ఇక శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు చేయూతనం దించేందుకు గ్రీస్‌లో అవలంబిస్తున్న విద్యావిధానాలు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు భారత్‌లో కూడా  అమలవుతున్నాయి. కాబట్టి తగు ప్రణాళిక లతో గ్రీస్‌ ఆలోచనలు, ఆచరణను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ పోర్టుల నుంచి ఎగుమతులు దిగుమతులు (లక్షల మెట్రిక్‌ టన్నులలో)

పోర్ట్‌                 2018    2020 నాటికి అంచనా
విశాఖపట్నం      600        650
కృష్ణపట్నం        450        500
గంగవరం          230         250
కాకినాడ          200          220
రవ్వ              20             30


డా. గేదెల శ్రీనుబాబు 
వ్యాస రచయిత పల్సస్‌ సీఈవో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రితో కలిసి ఇటీవల గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రతినిధి

మరిన్ని వార్తలు