కలలు నెరవేరుతున్న కాలం

2 Jun, 2020 01:41 IST|Sakshi

సందర్భం 

2014 జూన్‌ 2 ఈ నేల కన్న కలలు నెరవేరిన రోజు. ప్రజల సామూహిక ఆశయం గెలిచి ప్రత్యేక  రాష్ట్రం ఏర్పడిన రోజు. ఇది తెలం గాణ మరిచిపోలేని రోజు. కలాలు, గళాలు, గర్జించిన కంఠాలు, గెలుచు కొచ్చినరోజు. మిలియన్‌ మార్చులు, సకలజనుల సమ్మెలు, సాగర హారాలు, సడక్‌ బందులు సామూ హికంగా గెలిచివచ్చిన రోజు. వీటన్నింటిని గెలిపించు కుంటూ తెలంగాణ కోసం తనను తాను ఆత్మబలిదానం చేసుకునేందుకు ఆమరణ నిరాహార దీక్షకు దిగి పార్ల మెంటును, దేశాన్ని కదిలించిన ఒక సత్యాగ్రహి సాహస యాత్ర గెలిచివచ్చిన రోజు.

రాష్ట్రం సాధించుకున్నాక పునర్నిర్మాణ సమరం మొద లైంది. ఉద్యమస్ఫూర్తిని అట్లనే కొనసాగిస్తూ తెలంగాణ కొత్త నిర్మాణాలకు సూత్రధారిగా మారింది. భౌగోళిక బెర్రలు గీసుకున్నాం బాగుంది. మరి ఈ కన్నీళ్లను తుడిచే నీళ్లెట్లా రావాలి? దిగువకు పోయే నీళ్లు ఎగువకు ఎట్లెక్కాలి? బీడు భూములు పచ్చటి పంటపైర్లుగా మారటానికి నడుం కట్టింది. ఇది పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. బడుగు బల హీన దళిత మైనార్టీ గిరిజన ఆదివాసీలు 90 శాతంగా వున్న రాష్ట్రం. ప్రతిఒక్కరూ తమకు తాము స్వతంత్రంగా స్వేచ్ఛగా నిలువగలగాలి. శివుని తలపైన గంగమ్మను తేవటం లోకా నికి తెలిసిన భగీరథ పాఠం. పల్లానికి పోయే నీళ్లను ఎదు రెక్కించే విద్య తెలిసిన జలసూత్రధారి మాత్రమే కొండ పోచమ్మ సాక్షిగా గోదారి గంగమ్మను కాళేశ్వరం నుంచి వేము లవాడ మీదుగా వందల కిలోమీటర్లు నడిపించి కరువు నేలపై అభిషేకం చేయించటం అపూర్వ సృష్టి. నీటిశాస్త్రాల చరిత్రలో ఇది నూతన అధ్యాయం. తడారిన ఎండిన భూముల గొంతు తడుపుతున్నప్పుడు పొందిన ఆనందపు పొంగులు ఈ నేలంతా అలలు అలలుగా ఎగిసి పడుతు న్నాయి. ఇపుడు తెలంగాణ పసిడి పంటల పచ్చటి పైరుతల్లి. 

విడిపోతే భూమి బద్దలైపోతదన్న వాదనలు వీడి పోయాయి. పుకార్లన్నీ తేలిపోయి భాగ్యనగరం దేశానికే మత సామరస్య కేంద్రమయ్యింది. మందిర్, మసీద్, చర్చీలన్నీ మనమంతా ఒకటే అనే మానవీయ గంటలు మోగిస్తున్న నగార తెలంగాణ. ఎన్నెన్నో కోసులు నడిచిపోయి బిందెడు నీళ్లు తెచ్చుకునే స్థితినుంచి ఇంటింటికి నల్లా నీళ్లొచ్చాయి. చితికిపోయిన వూర్లను చిగురింపచేయటానికి చెరువుల పూడికలు తీశారు. ఎండకాలంలో కూడా చెరువుల నిండా నీళ్లు మత్తడి దుంకే దృశ్యం నేటి తెలంగాణ! మిషన్‌ భగీ రథలు ఇంటింటికి నీళ్లిస్తే, మిషన్‌ కాకతీయలు చెరువులకు జలకళనిచ్చాయి. ఏ నేలలో ఏ పంట బాగా పండుతుందో, ఏ పంటవేస్తే రైతుకు లాభదాయకమో ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం పంటసూచికగా మారింది. వూరూరా మట్టిని చూసి పంటల పట్టికలు తయారవుతున్నాయి. వ్యవసాయం దిక్కుమాలినదైందని దుఃఖిస్తున్న రైతు కూలీలను గుండె లకు హత్తుకుని వాళ్లకు నీళ్లనిచ్చి, ధైర్యాన్నిచ్చి, రైతుబంధు పథకాన్నిచ్చి కొండంత అండగా నిలిచింది ఈ ఆరేళ్ల తెలం గాణ. రైతును రాజును చేస్తానని దీక్షబూనింది తెలంగాణ. దేశానికి ధాన్యాగారంగా నిలిచింది తెలంగాణ.

60 ఏళ్లలో చివికిపోయిన గ్రామం క్రమంగా నిలబడ గలుగుతున్నది. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు చితికిన దశనుంచి లేచి నిలబడే దశకు చేరుకునే ప్రక్రియ మొద లైంది. వ్యవసాయం వర్ధిల్లటం వల్ల గ్రామం నిలదొక్కుకునే స్థితికి వచ్చింది. ఆ గ్రామం బడుగు బలహీన వర్గాలకు చేయుతగా నిలవాలి. సాంప్రదాయ వృత్తులను ఆధునీకరిం చుకోవాలి. చిన్నపరిశ్రమలు విస్తృతం కావాలి. ప్రధానంగా వ్యవసాయాధారిత పరిశ్రమలతో గ్రామాల ముఖచిత్రాన్నే మార్చేస్థితికి తెలంగాణ చేరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఎవరూ చేయలేనిది, ఎవరూ రాయలేని కొత్త చరిత్ర. తెలం గాణ తన నూతన చరిత్రను తనే రాసుకుంటూ ముందుకు సాగుతోంది. గ్రామం ఆర్థిక స్థిరత్వంతో ఆత్మగౌరవంతో నిల బడుతుందంటే గెలిచి నిలిచేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలేనన్న బలమైన నమ్మకం కలుగుతోంది. అట్ట డుగు వర్గాలు ఉత్పత్తి శక్తులుగా మారాలి. ఈ ఉత్పత్తి శక్తులు తయారుచేసే వస్తువులు మేడిన్‌ తెలంగాణగా మారి ప్రపం చం చేతుల్లోకి పోవాలి. ఆ దిశగా తెలంగాణ సన్నద్ధమవు తుంది. ఇది తెలంగాణ అనంతర అభివృద్ధి దృశ్యం. 

తెలంగాణలో సంచారజాతుల బిడ్డలు గురుకులాలకు పోయి ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణలో ఇది జరుగలేదు. పాలనను ఇంటి గడపల దాకా తేవటానికి రాష్ట్ర సెక్రటేరియట్‌ను గ్రామ సెక్రటేరి యట్‌ దాకా తేవటానికి ముప్పయి మూడు జిల్లాలుగా విభ జింపబడింది. దీనివల్ల అన్ని శాఖలు మారుమూల గ్రామం దాకా ఎప్పుడంటే అప్పుడు ఆకస్మికంగా వెళ్లి సమస్యల పరి ష్కారాలు చేయగలవు. రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖల సంస్కరణలు కూడా త్వరలో కొలిక్కివస్తే తెలంగాణ పాలనా రంగంలోనే వినూత్న మార్పులకు దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో నినదించిన నినాదా లన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరింపబడుతూ ఆరు సంవత్స
రాల అభివృద్ధి మైలురాళ్ళను దాటుతున్నది తెలంగాణ ప్రభుత్వం. గత అరవయ్యేళ్ల కాలం చేయలేని పనిని ఈ ఆరేళ్ల కాలం చేసింది. దీన్ని సమస్త తెలంగాణ చూసింది. ఇంకా గంపెడాశతో చూస్తుంది. ఇది నిజం. 

రాష్ట్రం తెచ్చుకుని తెలంగాణ గెలిచింది. ఈ నేలమీద ప్రజలు గెలిచారు. ఎటు చూసినా నీళ్లు కన్పిస్తున్నాయి. నేలలు పచ్చబడ్డాయి. నగర తెలంగాణ నగరీకరించబడు తుంటే గ్రామీణ తెలంగాణ హరితీకరించబడుతున్నది. విప్లవాలు విరబూసిన నేలమీద వ్యవసాయం వర్ధిల్లుతు న్నది. ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క వ్యవసాయ పరిశోధనా క్షేత్రంగా మారబోతున్నది. ఈ నేలమీద వున్న ప్రతి సాంకేతిక కళాశాల ఆ ప్రాంత ప్రజల భౌగోళిక సామాజిక పరిస్థితు లపై అధ్యయనం చేసి పరిష్కారాల పరిశోధనలు చేయాలి. విశ్వవిద్యాలయాలు ఆ ప్రాంతాల అభివృద్ధి లైట్‌లుగా వెలు గొందాలి. ఇక్కడ తయారయ్యే వైద్య, సాంకేతిక, వ్యవ సాయ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఈ నేల రుణం తీర్చుకునే శక్తులుగానేగాక దేశదేశాలకు ఇక్కడి జ్ఞానాన్ని పంచే జ్ఞాన సేవకులుగా తయారయ్యే దశకు తెలంగాణ ఎదగాలి. 

పొందిన విజయాల నుంచి చేరాల్సిన లక్ష్యాల  వైపునకు నడుచుకుంటూ పోవటమే పరిణామ క్రమం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి మాత్రమే కాదు. తెలంగాణ ఆశల, ఆకాంక్షల, ఆశయాల నిలువెత్తు జెండా. ఆయన జూన్‌ 2 తెలంగాణ అవతరణ సాక్షిగా రాష్ట్రసాధన ఉద్యమాన్ని అలుపెరగకుండా కొనసాగించిన ఉద్యమకారుడు. ఉద్యమ కారుడే పాలకుడై ఆరేళ్లుగా అప్రతిహతంగా అభివృద్ధిని కొన సాగిస్తున్న పునర్నిర్మాణ సూత్రధారి, పాత్రధారి. 

వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్‌,  కవి, విమర్శకులు
మొబైల్‌ : 94401 69896

మరిన్ని వార్తలు