ఎవరి కోసం థర్డ్‌ ఫ్రంట్‌?

30 May, 2018 01:47 IST|Sakshi

సందర్భం

కర్ణాటక ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై ఏ విధంగా ఉంటుంది అనే అంశంతోపాటు తర చుగా వినబడుతున్న మూడో ఫ్రంట్‌ అసలు రూపుదిద్దుకుంటుందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలిద్దాం.

2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో అధి కారం కోసం పోటీపడే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు. కర్ణాటకలో కాంగ్రెస్‌ మద్దతుతో కుమారస్వామి మంత్రివర్గం కొలువు తీరటం ఒక విధంగా కేసీఆర్‌కు అయిష్టం గానే ఉంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ప్రభా వం దాని స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలపడితే అది తన అస్తిత్వానికే ముప్పుగా పరి ణమిస్తుందని ముందే గ్రహించిన కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ అనే నినాదాన్ని ఎన్నికల కంటే ముందే వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు.

మూడో ఫ్రంట్‌ లేదా ఫెడరల్‌ ఫ్రంట్‌ అని పేర్కొంటున్న కేసీఆర్‌ లక్ష్యం వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్‌ బీజేపీల నేతృత్వంలోని ఫ్రంట్లకు సమాంతరంగా మూడో ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి 2019 లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలన్నదే. మన దేశంలో ప్రధాన జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్‌ బీజేపీల అండ లేకుండా మూడో ఫ్రంట్‌ ఏర్పాటు అన్నది అసాధ్యం. ఏర్పడినా అది బలపడదు. బలపడినా అది ఎవరి కోసం అన్నది ప్రశ్న.

అధికార పక్షమైన బీజేపీ పట్ల ప్రజల్లో సహ జంగా ఏర్పడే వ్యతిరేకత కాంగ్రెస్‌కు మూకు మ్మడిగా సానుకూలంగా మళ్లకుండా రాబోయే ఎన్నికల్లో మూడో ఫ్రంట్‌ రూపంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో బహుముఖ పోటీలు జరిగేలా చూస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడి అంతి మంగా అది కాంగ్రెస్‌ ఓటమికి, బీజేపీ గెలుపుకు దారితీస్తుందనే రహస్య ఎజెండా మూడో ఫ్రంట్‌ నినాదం వెనుక దాగి ఉంది. ఈ సత్యాన్ని క్రమంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించి కేసీఆర్‌కు దూరమై కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నాయి. కుమారస్వామి ప్రమాణ స్వీకారో త్సవానికి కేసీఆర్‌ తప్ప అన్ని రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబుతో సహా హాజరై ఒకే వేది కపై కనిపించడం, వాళ్లంతా భవిష్యత్తులో కాంగ్రె స్‌తో జతకట్టి ఉమ్మడిగా బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనేందుకు క్రమంగా సన్నద్ధం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. జాతీయ స్థాయిలో ఏ ఎన్నికలోనైనా సరే బీజేపీకి సరిదీటుగా పోటీ నివ్వగల సత్తా ఉన్న పార్టీ. అందుకే కాంగ్రెస్‌ పార్టీని దేశ వ్యాప్తంగా నిర్వీర్యం చేయగలిగితే ఇక తమకు జాతీయ స్థాయిలో అవరోధాలుండవని, ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి ప్రత్యామ్నాయం లేక అనివార్యంగా తమపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందన్నది బీజేపీ దురాలోచన. 

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ దేశ రాజకీయాలలోనైనా ఉండేది రెండే రెండు కూటములు. ఒకటి అధికారంలో ఉన్న పార్టీ కూటమి అయితే రెండవది ప్రతి పక్షాలతో కూడిన కూటమి. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ ఒక కూట మికి ప్రాతినిథ్యం వహిస్తే ప్రతిపక్షాల కూటమికి కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహి స్తుంది. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ భావజాలంతోపాటు వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక కూటమిలో కొనసాగుతు న్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్థానిక అంశాలతోపాటు వివిధ అంశాలను బేరీజు వేసు కుని ఏ కూటమిలో చేరకుండా తటస్థంగానైనా ఉంటారు కానీ మూడో కూటమిలో చేరరు. మూడో కూటమి వెనుక ఉన్న రహస్య ఎజెండాను క్రమంగా దేశ ప్రజలు ముఖ్యంగా మైనార్టీ సోద రులు కూడా గ్రహించి కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

సమీప భవిష్యత్తులో మధ్యప్రదేశ్, రాజ స్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభ ఎన్నికలు జరు గనున్నాయి. అక్కడ పోటీ ప్రధానంగా జరిగేది కాంగ్రెస్‌ బీజే పీల మధ్యనే. ఆ ద్విముఖ పోటీలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి దేశంలోని లౌకిక శక్తులన్నింటికీ ఆసరాగా నిలబడుతుందని ఆశిద్దాం.

-టి. జీవన్‌ రెడ్డి (వ్యాసకర్త శాసనసభ్యులు, జగిత్యాల), మొబైల్‌: 94400 71330

 

మరిన్ని వార్తలు