ఆధునిక తత్వవేత్తలకు ఆద్యుడు

12 May, 2020 01:29 IST|Sakshi

ఇన్‌బాక్స్‌

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు మే 12, 1895లో జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. 14ఏళ్ల వయసున్న కృష్ణమూర్తిని అడయార్‌ దివ్య జ్ఞాన సమాజంలో మొదటిసారి చూసిన లెట్‌ బీటర్‌ తమ సమాజ సభ్యులు ఎదురు చూస్తున్న జగత్‌ గురువు ఈ బాలుడిలోనే ఉన్నాడని ప్రకటించాడు. డాక్టర్‌ అనీబీసెంట్‌ వారిని సమాజంలో చేర్పించడంతోపాటు ఉన్నత విద్యకై ఇంగ్లండ్‌ పంపారు. ఇంతలో తమ్ముడికి జబ్బు చేయడంతో అమెరికా తీసుకువెళ్లారు.

కానీ, తమ్ముడు నిత్యానంద మరణించారు. తమ్ముడి మరణం కృష్ణమూర్తిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఇన్‌ ద ఈస్ట్‌’ అనే ఒక అంతర్జాతీయ సంఘానికి అనీబీ సెంట్‌ ఆయనను అధ్యక్షుడిగా చేశారు. ప్రపంచంలో ఉన్నతమైన గౌరవం లభించినప్పటికీ దానికి విలువ ఇవ్వకుండా సాధారణ జీవి తాన్ని గడిపారు. తరువాత జగత్‌ గురువు పీఠాన్ని స్వీకరించడం ఇష్టంలేదని 1929లో హాలెండ్‌లో జరి గిన సమావేశంలో ఆ సంస్థను రద్దు చేశారు. నాటినుంచి కృష్ణమూర్తి స్వతంత్ర మానవుడిగా అవతరిం చారు. ఎవరి సహాయాన్ని ఆశించక జీవన శిల్పిగా రూపొందారు. భాషకందని భావం తన కళ్లలో, మాటల్లో కదలాడుతూండేది.

అద్భుతమైన చైతన్యం ఆయనను ప్రపంచ దార్శనికునిగా నిలబెట్టింది. జీవన్మరణాలు నాణేనికి రెండు వైపులా ఉండే ముద్రలని ఆయన అన్నారు. జీవించడం ఒక అందమైన కళ. ఆ కళను చక్కగా అనుభవించాలని ఆయన చెప్పారు. మహా ప్రవాహంలాంటి జీవి తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. జీవి తమంటే సత్యమైనది, సుందరమైనది, శివమైనది అంటారు. ప్రపంచాన్ని మంచి మార్గంలో నడిపించడానికి యత్నించిన కృష్ణమూర్తి 17 ఫిబ్రవరి 1986న కన్నుమూశారు.
(నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి)
పింగళి బాగ్యలక్ష్మి, గుంటూరు
మొబైల్‌ : 97047 25609

మరిన్ని వార్తలు