అ‘ప్రజ్ఞా’వాచాలత్వం!

18 May, 2019 00:45 IST|Sakshi

జాతిహితం 

గత అయిదేళ్లకాలంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షాలకు ప్రత్యర్థులు కూడా చేయలేకపోయిన భంగపాటును సొంత పార్టీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ దిగ్విజయంగా కలిగించారు. గాంధీ హంతకుడు దేశభక్తిపరుడు అంటూ ఆమె చేసిన పదప్రయోగం మోదీ, అమిత్‌ షాలను వారి ప్రజాజీవితం మొత్తంలో ఏ రకంగానూ సమర్థించుకోలేని స్థితిలోకి నెట్టివేసింది. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ, సైద్ధాంతిక శక్తి అయిన ఆరెస్సెస్‌ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు. బీజేపీకి ఓట్లు రాబట్టే సమర్థత విషయంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావించిన  సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌ దానికి భిన్నంగా తన ప్రధానమంత్రి, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. 

సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ సాధించిన ఒక విజ యాన్ని మాత్రం మనం గుర్తించాల్సి ఉంది. నరేంద్రమోదీ, అమిత్‌ షాల విషయంలో ఎవరూ చేయలేని పని ఆమె చేసిపడేశారు. అదేమిటంటే ఒక్కసారిగా వాళ్లను ఆత్మరక్షణలో పడేశారు. అంతేకాకుండా తన పార్టీ అగ్రనాయకత్వం నిజంగా ద్వేషించే మరో పనిని కూడా చేయడంలో ఆమె విజయం పొందారు. పతాక శీర్షికలను నిర్ణయించే వారి శక్తిని కోల్పోయేలా చేశారామె. గత అయిదేళ్లుగా పత్రికల్లో పతాక శీర్షికలను మార్చడంలో, తమకు అనుకూలంగా నియంత్రించడంలో తమ వ్యూహాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న బీజేపీ, తాము కోరుకోని రీతిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. నరేంద్రమోదీ, అమిత్‌ షాలు తమ ప్రజా జీవితంలో మొట్టమొదటిసారిగా ఏరకంగానూ సమర్థించుకోలేని వ్యవహారంలో చిక్కుకున్నారు.

 గాంధీ, నాథూరాం గాడ్సేల వ్యవహారంపై తాజాగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ లేవనెత్తిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే, బీజేపీ ఐటీ సెల్‌ విభాగాధిపతి అమిత్‌ మాలవీయతో పాటు బీజేపీకి సంబంధించిన ట్విట్టర్‌ హ్యాపీ అనుయాయులు వెనువెంటనే ఆమెకు సమర్ధనగా ముందుకురికారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వమ్మయిపోయాయి. గత అయిదేళ్లుగా వ్యక్తులపై లేక సామాజికవర్గంపై బీజేపీకి చెందిన వ్యక్తి ఎలాంటి అసందర్భోచితమైన దాడికి తలపెట్టినా సరే వారిని కాపాడటానికి లేక వారిపై ఆరోపణలను తోసిపుచ్చడానికి ఆ పార్టీ శరవేగంగా పావులు కదపడాన్ని మనందరం చూస్తూ వచ్చాం. కానీ మహాత్మా గాంధీ విషయంలో మాత్రం బీజేపీ ఇలాంటి సాహసాలకు పూనుకోలేదు. పార్టీకి చెందిన కొందరు గాంధీ తప్పులు, దేశ విభజన సమయంలో ఆయన పాత్ర వంటి అంశాలపై తమ తమ డ్రాయింగ్‌ రూమ్‌లలో, గోష్టులలో లేక శాఖా సమావేశాల్లో మాత్రమే వ్యాఖ్యానించి ఉండవచ్చు కానీ బహిరంగంగా మాత్రం వారెవ్వరూ గాంధీపై వేలెత్తి చూపిన పాపాన పోలేదు. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు.

కానీ, కాషాయాంబరధారి అయిన అభ్యర్థి, ఉగ్రవాద కేసులో ముద్దాయిగా ఉన్న హిందూత్వ మూర్తి ఇప్పుడు గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా పిలుస్తోంది. జాతిపితగా మీరు ప్రశంసించిన వ్యక్తి వారసత్వాన్ని మీరు బోనులో నిలబెట్టకూడదు. ఆయన 150వ జయంతి సందర్భంగా ఆ పని అసలు చేయకూడదు. కానీ బీజేపీకి ఓట్లు రాబట్టడంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావిం చిన ప్రజ్ఞా ఠాకూర్‌ దానికి భిన్నంగా తన ప్రధాని, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. స్వయానా సాధ్వి ప్రజ్ఞను ఉద్దేశపూర్వకంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వారే కాబట్టి మోదీ–షా ద్వయం ఆమె చేసిన నిర్వాకానికి నిరుత్తరులైపోయారు. కాషాయ ఉగ్రవాదం అనే పదబంధాన్ని సృష్టించి హిందువులకు హాని తలపెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రచారానికి వ్యతిరేకంగా తమ పార్టీ తలపెట్టిన సత్యాగ్రహమే సాధ్వీ ప్రజ్ఞ రాజకీయ ప్రవేశమంటూ మోదీతో కలిసి అమిత్‌ షా తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరించారు.

ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఒకటి. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ నుంచి దూరంగా జరగడం మోదీ–షాల పార్టీకి ఇప్పుడు అసాధ్యం అనడానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ ద్వయం దూకుడుతో తీసుకొచ్చిన స్వయం ఎంపిక ఆమె. రెండు, పై రాజకీయ ప్రకటనను వివరించడానికి అమిత్‌ షా గాంధీ ట్రేడ్‌ మార్క్‌ అయిన సత్యాగ్రహ భావనను ఉపయోగించారు. గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా ప్రశంసించిన వ్యక్తిని సమర్థించడానికి అదే గాంధీ మానవజాతికి బహుకరించిన విశిష్టమైన అహింసా పోరాటాన్ని మీరు అరువుతెచ్చుకుంటున్నప్పుడు మీరు ఎటువైపు వెళుతున్నారో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. సరైన కారణాలతో కూడా ఎన్నడూ తప్పు పనులకు పాల్పడవద్దన్నది జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ సత్ప్రమాణ సూత్రం. కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను బీజేపీ వివాదాల్లోకి లాగడం గురించి మనకు తెలుసు. హిందూ ఉగ్రవాదంపై తీవ్రాతితీవ్రంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతల్లో అగ్రగణ్యుడు దిగ్విజయ్‌ సింగ్‌. న్యూఢిల్లీలో బాట్లా హౌస్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి, మోహన్‌ చంద్‌ శర్మ అనే పోలీసు అధికారి ధీరోదాత్త త్యాగం గురించి దిగ్విజయ్‌ వ్యంగ్యంగా ప్రకటనలు చేశారు. అది చాలదన్నట్లుగా 26/11 అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా దాన్ని ఆరెస్సెస్‌ కుట్రగా కూడా అభివర్ణించారు. 

బీజేపీ ఉద్దేశం ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణకు గురై అరెస్టైన హిందూ రాడికల్‌ కార్యకర్తలు దిగ్విజయ్‌ సింగ్‌ను లక్ష్యంగా చేసుకోవలసి ఉండింది. కానీ గత నెల చివరలో ప్రజ్ఞ్నా ఠాకూర్‌ తొలిసారిగా పతాక శీర్షికల్లోకి వచ్చి హేమంత్‌ కర్కరేని, ఆయన కుటుంబాన్ని తాను శపించిన కారణంగానే అతడు చనిపోయాడని ప్రకటించారు. (హేమంత్‌ కర్కరే చనిపోయిన ఆరేళ్లకు ప్రత్యేకించి సెప్టెంబర్‌ 29న మాలెగావ్‌ బాంబు దాడి వార్షికోత్సవం రోజునే హేమంత్‌ కర్కరే భార్య కూడా మరణించారని మనం గుర్తించాలి). తర్వాత బాబ్రీమసీదును కూలగొట్టడానికి తాను స్వయంగా ఆ మసీదుపైకి ఎక్కానని సాధ్వీ ప్రజ్ఞా ప్రకటించారు. ఈ రెండు సందర్భాల్లోనూ బీజేపీ సత్వరం స్పందించి నష్టనివారణ చర్యలకు పూనుకొంది. సాధ్విని మౌనవ్రతం పాటించాల్సిందిగా ఆదేశించడమే కాకుండా మోహన్‌ చంద్‌ శర్మపై గతంలో అదేరకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్‌ సింగ్, కాంగ్రెస్‌ పార్టీలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది కూడా. కానీ ఇప్పుడు గాడ్సేని ప్రశంసించడానికి సాహసించిన సాధ్వీని కాపాడే అవకాశమే బీజేపీకి లేకుండా పోయింది.

 1989 నుంచి, బీజేపీ నిదానంగానే అయినా, నియంత్రిత విధానంలో ముందుకెళ్లే వ్యూహాన్ని అవలంబిస్తూ వచ్చింది. అద్వాణీ తలపెట్టిన అయోధ్య ఉద్యమం ప్రారంభ దినాల నుంచి మొదలుకుని ఆ పార్టీ మరింత దూకుడు చర్యలకు తావిస్తూ పోయింది. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు, నేతలను అది పక్కనబెడుతూ వచ్చింది కూడా. సాధ్వి రితంబర, ప్రవీణ తొగాడియా, వినయ్‌ కతియార్‌ వంటి వారిని గుర్తుంచుకోండి. అదేసమయంలో ఉమా భారతి, సాక్షి మహరాజ్, సాధ్వీ నిరంజన్‌ జ్యోతి (రంజాదే, హరాంజాదే ఫేమ్‌), యోగి ఆదిత్యనాథ్‌ వంటి మిలిటెంట్‌ స్వభావం కలిగిన వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకొచ్చింది. 

ఇది మూడు దశాబ్దాలుగా పనిచేస్తోంది. కానీ, తెలివిగా సాగింది. మనలో కొందరం దీన్ని ముందే ఊహించాం. దాద్రిలో గోరక్షకులు అక్లాక్‌ను చంపిన వెంటనే నేను నా జాతి హితం కాలమ్‌లో రాసిన ‘మూక సంస్కృతి ప్రధాన స్రవంతి’ వ్యాసాన్ని పరిశీలించవచ్చు. ప్రజ్ఞా కేవలం ఓ తాజా ఉదాహరణ మాత్రమే, చాలా అవమానకరమైన ఉదాహరణ. ఇదేదో పొరపాటున జరిగిందని కూడా అనుకోలేం. ఇది ఉద్దేశపూర్వకంగా, బాగా ఆలోచించి చేసిన పని అని పార్టీ అధ్యక్షుడే స్వయంగా మనకు చెప్పాడు. ఇది పూర్తిగా దురభిప్రాయంతో కూడిన తెలివితక్కువ ప్రకటన. భారత జాతీయత ఎదిగిన తీరుపై తప్పుడు అవగాహన నుంచి అది వెలువడింది.

భారత దేశాన్ని ఐకమత్యంగా ఉంచుతున్నది ప్రాథమికంగా హిందూయిజమే (హిందూత్వ) అనే తప్పుడు అవగాహనలో ఇదంతా ఉంది. తర్వాత ఆ హిందూయిజం, హిందూత్వ అనేవి ఒకే మతం, ఒకే ప్రజ, ఒకే భాష, ఒకే జాతి అనే ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాయికి కుదించుకుపోయాయి.  ఈ ఎన్నికల్లో  మోదీ మెజారిటీ సాధించినప్పటికీ నాలుగు దక్షిణాది రాష్ట్రాలు(ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ)లోని 103 స్థానాలకు గాను కనీసం రెండు స్థానాలు గెలుచుకునే పరిస్థితి కూడా లేదని మోదీ గుర్తుంచుకోవాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా హిందూయిజాన్ని వ్యాపింపజేసి దాన్ని ఇరుసుగా మార్చుకున్నారు. స్వేచ్ఛాయుత రాష్ట్రాల స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఒక మతం నుంచి ఒకే దృక్పథం, ఒకే ఆలోచనా విధానం, ఒకే గ్రంథం నుంచి ఒకే దార్శనికత ఏర్పడే అవకాశం లేదు. అందువల్లే మన దేశం ఐకమత్యంగా ఉండటమే కాదు, ప్రతి దశాబ్దానికీ మరిత బలమైనదిగా, సురక్షితమైనదిగా ఎదుగుతోంది. అదే సమయంలో ఒకే సిద్ధాంతం కలిగిన పాక్‌ ముక్కలవు తోంది. వైవిధ్యతతో కూడిన సౌఖ్యం భారత్‌ ఆధునిక ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుక. ప్రపంచంలో మరెక్కడా వేర్వేరు సంస్కృతులు సంయమనంతో లేవు. విభిన్నతకు భారత్‌ ఒక బ్రాండ్‌ అయితే, స్విస్‌ తత్వవేత్త కార్ల్‌ జంగ్‌ అన్నట్టు దాని మూల బిందువు మహాత్మా గాంధీ.

నెహ్రూ విధానాలతో పోరాడటం, వాటిపై బురద చల్లడం, దూషిం చటం సులభమే. ఇప్పటికే కొందరు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ హంతకులను కూడా హీరోలుగా పిలవడం మొదలెట్టారు. కానీ మహా త్మాగాంధీని ముస్లింలను బుజ్జగించే రాజకీయాల సంస్థాపకుడిగా భావించే అత్యంత హిందూ మత ఛాందసవాదులకు కూడా గాంధీని లక్ష్యంగా చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశంగానే కనిపించేది. అందుకే ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ని ఎన్నటికీ క్షమించబోనని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో నిజాయితీ ఉండవచ్చు. వచ్చే గురువారం ఎన్నికల కౌంటింగులో ఆమె ఓడిపోవాలని మోదీ ప్రార్థించవచ్చు. లేక గాంధీ పేరుతో గత అయిదేళ్లుగా ప్రమాణం చేస్తూవచ్చిన పార్టీకి ఆ గాంధీ హంతకుడినే హీరోగా ప్రశంసిస్తున్న వ్యక్తిని అదే పార్టీలో కొనసాగించడం కలవరపెట్టవచ్చు కూడా.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు