ఈ చట్టాలు ఎవరి చుట్టాలు?

6 Sep, 2018 01:01 IST|Sakshi

నక్సల్స్‌తో సంబంధాలున్నాయని, ప్రధాని హత్యకు కుట్రపన్నారని చేసిన ఆరోపణల ఆధారంగా కోర్టులో హక్కుల ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి, వారిపై అభియోగాలు రుజువుకావడం లేదా కాకపోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయి. తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించే వారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే యూఏపీఏ చట్టం కింద అభియోగాలు నమోదు చేస్తారు. ఈ తరహా వేధింపుల చట్టాలు పాలకపక్షానికి రాజకీయ ప్రయోజనం కలిగిస్తాయి. ఈ కేసుల్లో చిక్కుకున్న వారు ఏళ్ల తరబడి విచారణ పేరుతో నిర్బంధంలో మగ్గిపోతుంటారు. 

చట్టాన్ని తన పని తనను చేసుకోనివ్వండి, అని ఈ రోజుల్లో కొందరు తెలివిగా చెబుతారు. వాస్తవానికి దాడులు, బెదిరింపులు, అరె స్టులతో వేధింపుల ఆట మొదలవుతుంది. చట్టాన్ని ఇష్టమొచ్చినట్టు వంచి తమకు అనుకూలంగా వాడు కుంటారు పాలకులు. మంచి, చెడు మధ్య, చట్ట బద్ధ మైన, చట్ట వ్యతిరేక ప్రవర్తన మధ్య సాక్ష్యాధారాలను బట్టి ఏది న్యాయమైనదో తేల్చడంపైనే చట్టాల అమలు ఆధారపడి ఉంటుంది. ఇటీవల పుణె పోలీ సులు అరెస్టు చేసిన ఐదుగురు హక్కుల ఉద్యమ నేతలు సుధాభరద్వాజ్, గౌతమ్‌నవలాఖా, అరుణ్‌ ఫెరీరా, వరవరరావు, వర్నన్‌ గొన్సాల్వ్స్‌పై చేసిన ఆరోపణలను బట్టి వారికి నక్సల్స్‌తో సంబంధా లున్నాయని లేదా భీమా కోరేగావ్‌ హింసలో వారికి పాత్ర ఉందని లేదా వారంతా కలిసి ప్రధాని హత్యకు కుట్రపన్నారని అనుకోవాలి. కాని, కోర్టులో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి. వారిపై అభియోగాలు రుజువుకావడానికి లేదా కాక పోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజ కీయ ప్రయోజనాలు దక్కుతాయి.

తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించేవారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగాలు నమోదు చేస్తారు. అయితే, నేరం నిరూపించడానికి లేదా నిరూపించ లేకపోవడానికి అంత ప్రాధాన్యం ఉండదు. ఉగ్రవాద చర్యలు, సంస్థలు, దేశ ఆర్థిక భద్రతకు ముప్పు తెచ్చే నేరాలూ–ఇవన్నీ యూఏపీఏ పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకుంటే పోలీసు కస్ట డీలో గరిష్ట కాలం ఉంచవచ్చు. 180 రోజుల వరకూ చార్జిషీటు దాఖలు చేయకపోయినా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. అంతేగాక దీని కింద అరెస్టయిన వారికి బెయిలు దొరకడం కష్టం. రుజువుకాని సంబం ధాలపై ఆధారపడి చేసే అభియోగాలను బట్టి నింది తులను దోషులుగా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువ ఉంది.

2007లో యూఏపీఏ నిబంధనల కింద అరెస్టుచేసిన వర్నన్‌ గొన్సాల్వ్స్‌పై మొత్తం 17 అభియోగాలు నమోదు చేశారు. వీటన్నిటి నుంచి నిర్దోషిగా బయటపడటానికి ముందు ఆయన తన జీవితంలో ఆరేళ్లు జైల్లో గడపాల్సివచ్చింది. కాబట్టి యూఏపీఏ కింద అరెస్టయినవారు ఎవరైనా ఇలాంటి కష్టాలు తప్పవు. మహ్మద్‌ అమీర్‌ఖాన్‌ ఈ చట్టం కింద చేసిన 18 ఆరోపణల నుంచి విముక్తి పొంద డానికి 14 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఇంకా మహ్మద్‌ అబ్దుల్‌ కలీం వంటి వేలాదిమంది తమ జీవితాల్లో కీలకమైన సమయాన్ని కారాగారాల్లోనే గడపాల్సి వచ్చింది. ఇలాంటి తీర్పులు వచ్చేనాటికి ఈ చట్టం కింద నిర్బంధంలో గడిపిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా నీరసించిపోతారు.

యూఏపీఏ కింద అరెస్టు చేయడమే.. నిందితులకు తర్వాత ఎదురయ్యే నిర్బంధం కారణంగా ఓ తరహా క్రమశిక్షణలా, అదుపు చేసే టెక్నాలజీలా పనిచేస్తుంది. ఆగస్టు 28న పైన చెప్పిన ఐదుగురు ప్రముఖులను అరెస్ట్‌ చేయ డానికి ముందు జూన్‌లో ఐదుగురిని మహారాష్ట్ర పోలీ సులు అరెస్ట్‌ చేశారు. జనవరి ఒకటిన భీమా కోరే గావ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించే ఈ అరెస్టులూ జరిగాయి. గత మూడు నెలల్లో అరెస్టు చేసిన ఈ పది మంది, రెండు మూడేళ్లలో అరెస్టయిన అనేక మంది కూడా ప్రజల కోసం పనిచేసే ఉద్యమ కార్యకర్తలు, లాయర్లు, జర్నలిస్టులు, విద్యావేత్తలు. దేశంలో అత్యంత బలహీన స్థితిలో ఉన్న బడుగు వర్గాలైన ఆదివాసీలు, దళితులు, విచారణ ఖైదీల తర ఫున వారు చట్టబద్ధ పోరాటాలు చేస్తున్నారు. 

జూన్‌లో అరెస్టయినా చార్జిషీట్‌ పెట్టలేదు!
యూఏపీఏ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న కేసుల్ని పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమౌతాయి. భీమా కోరేగావ్‌ హింసను సాకుగా చూపి జూన్‌లో అరెస్ట్‌ చేసిన ఐదుగురిపై ఇంతవరకు అభియోగ పత్రం దాఖలు చేయలేదు. ప్రధానమంత్రి హత్యకు  సంబంధించిన కుట్ర కేసులో దర్యాప్తును మూడు నెలలైనా పూర్తి చేయకపోవడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఒకవేళ నిందితులపై చేసిన అభియో గాలకు సాక్ష్యాధారాలు సరిగ్గా దొరక్కపోతే రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆధారాలు లేకుండా కొందరిని ఎందుకు లక్ష్యంగా చేసుకుని వారిని జైళ్లలో పెట్టారు? వారు ‘పట్టణ నక్సల్స్‌’ అనీ దేశాన్ని ‘ముక్కలు ముక్కలు’ చేసే ముఠా అని ముద్ర వేసి పదేపదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వారిని ఇలా వేధించడం, శిక్షించడం స్వయం ప్రకటిత జాతీయ వాదులకు ఆనందాన్ని, ఊరటను ఇస్తోంది. ప్రాతి నిధ్యం, సమన్యాయ పాలన, స్వేచ్ఛా స్వాతం త్య్రాలు– ఈ మూడు కీలకాంశాలపై ఆధారపడి ప్రజాస్వామ్యం పనిచేస్తుంది.

ప్రాతినిధ్యం అంటే కేవలం చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అధికారంలో ఉన్న వారితో మాట్లా డటం తెలియని, చట్టాలు ఉపయోగించు కోవడంపై అవగాహన లేని నోరులేని ప్రజల తరఫున పని చేయడం కూడా ప్రాతినిధ్యమనే ముఖ్య విషయం కిందకు వస్తుంది. ఆదివాసీలు, దళితులు, కార్మి కులు వంటి బడుగువర్గాల తరఫున న్యాయస్థానాల్లో పోరా డుతున్న లాయర్లు–సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫెరీరా, సురేంద్ర గాడ్లింగ్, ఉపేంద్ర నాయక్‌ (ఒడిశా), మురుగన్‌ (తమిళనాడు), సత్యేంద్ర చౌబే (ఛత్తీస్‌ గఢ్‌). వీరందరినీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వేధి స్తూనే ఉన్నాయి. బలహీనవర్గాల ప్రజల తరఫున వాదించకుండా పారిపోయేలా చేయడానికే లాయ ర్లను అరెస్టు చేయడం లేదా అరెస్టు చేస్తామని బెది రించడం, యూఏపీఏ వంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు ప్రయోగించడం జరుగుతోంది. దేశంలో అభివృద్ధి ఏకపక్షంగానే ఉంటుందని, ఇలా కొందరికి ప్రగతి ఫలాలు లభించే ఏకపక్ష అభివృద్ధిని ఎవరూ ప్రశ్నించకుండా చేయడమే ఇలాంటి చట్టాల కింద అభియోగాలు మోపి ఉద్యమకారులను, హక్కుల కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం ప్రభుత్వాల ఉద్దేశం. 

న్యాయపాలన ఎక్కడుంది?
ప్రజాస్వామ్యం రెండో ప్రధాన లక్షణం న్యాయ పాలన, చట్టాలు అమలు చేసేవారు జవాబుదారీగా పనిచేయడం. ప్రజల హక్కులు కాపాడటమేగాక, వాటిని హరించే సందర్భాల్లో బాధితులకు తగిన సాయం, ఊరట లభించేలా చేయడమే న్యాయ పాలన లక్ష్యం. ఆదివాసీలు, స్థానిక జాతుల ప్రజలు వారి భూములను కాపాడుకోవడానికి సంబంధించి రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూలులో ప్రత్యేక చట్టాలు, అటవీ హక్కుల చట్టం(2006) ఉన్నాయి. అటవీ, షెడ్యూల్డ్‌ ప్రాంతాల భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్‌ సంస్థలు జనంతో సంప్ర దింపులు జరపాలి. ఒడిశా నియంగిరిలో డొంగరియా కోంధుల భూమి విషయంలో సుప్రీంకోర్టు ఈ విషయమే తేల్చిచెప్పింది. కాని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలను జవాబుదారీగా, బాధ్య తతో మెలిగేలా చేయడం మీడియా విధి.

మారు మూల అటవీ ప్రాంతాల్లో చట్టాల ఉల్లంఘనతో ఆది వాసీలకు అన్యాయం జరిగితే సమాచారం సేకరించి, జాతీయ మీడియాకు అందించే జర్నలిస్టులు అనేక కష్టాలు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి న్యాయమైన సమాచారం జాతీయస్థాయి మీడియా సంస్థలకు చేరకుండా ఆపడానికి అనేక మంది జర్నలిస్టులను ప్రభుత్వాలు, చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ విభాగాలు నానా వేధింపులకు గురిచేస్తున్నాయి. వారిపై నిఘాతోపాటు వారిని బెది రించడం, అరెస్ట్‌ చేయడం లేదా పనిచేసే ప్రాంతాల నుంచి పంపించేయడం నిత్యం జరిపే వేధింపుల్లో భాగం. ఛత్తీస్‌గఢ్‌ ప్రజా భద్రతా చట్టం కింద జర్నలి స్టులు మాలినీ సుబ్రమణ్యం (జగదల్‌పూర్‌లోని ఆమె ఇంటిని ధ్వంసం చేశారు, ఊరు వదిలిపోయే వరకూ రాళ్లు విసిరారు), దీపక్‌ జైస్వాల్, సొమూరూ నాగ్, సంతోష్‌ యాదవ్‌లను బస్తర్‌లో అరెస్ట్‌ చేశారు.

అంతరిస్తున్న స్వాతంత్య్రాలు
అనేక స్వాతంత్య్రాల ద్వారా ప్రజాస్వామ్యం పని చేస్తుంది. మాట్లాడే, భావాన్ని వ్యక్తంచేసే, సంఘాలు పెట్టుకునే, అసమ్మతి తెలిపే స్వాతంత్య్రాలు ప్రధా నమైనవి. జన సమీకరణ, అభిప్రాయాలు, ఎజెం డాల మధ్య పోటీ ద్వారా ప్రజాస్వామ్యం చక్కగా పనిచేస్తుంది. అసమ్మతి వ్యక్తీకరణ ప్రజాస్వామ్యానికి అవసరమనే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్‌ సూటిగా చెప్పారు. ఉదారవాద ప్రజా స్వామ్య వ్యవస్థను అర్థంచేసుకుని ఆయన ఈ విష యంపై వివరణ ఇచ్చారు.

అందుకూ అసమ్మతి ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్‌ అనీ, దాన్ని పని చేయనివ్వకపోతే పేలుడు తప్పదని ఆయన హె^è్చ రించారు. చట్టాలు గౌరవించే ప్రజలందరికీ మేలు చూస్తూ జనరంజకంగా సాగాల్సిన ప్రజాస్వా మ్యంలో తరచూ జనం కోసం పనిచేసే వారిని అరె స్టులు, నిర్బంధాలతో ఎందుకు ప్రభుత్వాలే వేధిస్తు న్నాయి? అలాగే, యూఏపీఏ, దానికి ముందు అమలులో ఉండి రద్దయిన ఉగ్రవాద నిరోధక చట్టం, ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం వంటివి ఎందుకు వస్తున్నాయి? అవి కొనసాగడానికి కారణాలేంటి? చట్టాలు గౌరవించే పౌరులను బోధన, న్యాయవాద వృత్తి, రచన, ఉపన్యాసాలు ఇవ్వడం, వార్తా సేకరణ వంటి తమ వృత్తుల్లో కొన సాగకుండా నిరోధించడానికి నిరంతరం వారిని రాక్షస చట్టాలతో వేధించే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారు? అనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు పాలకులు తప్పక జవాబు చెప్పాలి.

హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, లాయర్లపై వేధిం పులు కొనసాగడాన్ని చూస్తే– పాలకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని భావించేవారిని అడ్డుతొల గించుకుంటారని సూత్రీకరించిన అమెరికా సిద్ధాంత కర్త హెన్రీ గిరోక్స్‌ గుర్తుకొస్తారు. ప్రజలను అణచి వేసే రాజ్యం భారత కార్పొరేట్‌ సంస్థల ప్రయోజ నాలు కాపాడటానికే పనిచేస్తుంది. అందుకు అవసర మైతే ఆదివాసీలు, పేదలు, బలహీనవర్గాలను మరింత దుర్భర, దారుణ పరిస్థితుల్లోకి నెట్టడానికి కూడా అనుమతిస్తుంది. 

రాజశ్రీ చంద్ర
రాజనీతి శాస్త్ర విభాగం
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్, ఢిల్లీలోని జానకీదేవి మెమోరియల్‌ కాలేజీ

మరిన్ని వార్తలు