ప్రణబ్‌ యాత్ర ‘లోగుట్టే్టమిటి’?!

12 Jun, 2018 00:42 IST|Sakshi

రెండో మాట

ప్రణబ్‌ నాగ్‌పూర్‌ ప్రసంగంపై ప్రసిద్ధ గుజరాత్‌ విశ్లేషకుడు, విమర్శకుడు ప్రసాద్‌ చాకో వ్యాఖ్యానిస్తూ ప్రణబ్‌ నాగ్‌పూర్‌ ప్రసంగం ఎక్కడ ఎలాంటి ప్రేక్షకుడినైనా ఇబ్బంది పడకుండా ఒప్పిస్తుంది. ఎందుకంటే, ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా, ఎవరైనా సరే భాష్యం చెప్పగల ఉపన్యాసం అది. ఆ సభలో ప్రణబ్‌ ప్రజల సంతోష సౌఖ్యాల సూచికలో భారతదేశం అథమస్థితిలో ఉందని బాధపడ్డారు. కానీ ఆయన ఆ సుఖ సంతోషాలకు దూరమైన వారెవరో గుర్తించడానికి శ్రద్ధ తీసుకోలేదు. అలాగే వారు సుఖంగా జీవితం గడపలేకపోవడానికి గల కారణాలనూ ఆయన విశ్లేషించి చెప్పడానికి శ్రద్ధ తీసుకోలేదని చాకో అన్నారు.

‘‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌ భారతమాత గొప్ప పుత్రుడు. భారత జాతీయవాదా నికి పునాది రాజ్యాంగబద్ధమైన దేశభక్తి. ఈ దేశానికి లౌకిక పునాదిపై నిర్మితమైన సెక్యులర్‌ విధానం, సర్వ మత విశ్వాసాలతో, భిన్న సంస్కృతులతో దీపిస్తున్న ప్రజాబాహుళ్యం కలగలిసి ఉన్నదే మన దేశం.’’ – ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిక్షావర్‌ మూడో సంవత్సర నాగ్‌పూర్‌ సమావేశంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగం (7.6.18) ‘‘అసలు ప్రణబ్‌ ఎందుకొచ్చినట్టు? అసలా యన్ని ఎందుకు ఆహ్వానించినట్టని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. ఒక్క విషయాన్ని మరచిపోవద్దు– ఏ రోజు నైనా మా ఆరెస్సెస్‌ ఆరెస్సెస్సే, ముఖర్జీ ముఖర్జీయే, ఆయన అలాగే ఉంటారు మరి.’’  మోహన్‌ భాగవత్‌

ఆరెస్సెస్‌ నాగ్‌పూర్‌ శిక్షణా తరగతులయితే ముగి శాయి. కానీ సంఘ్‌ వ్యవస్థాపకుడైన కేబీ హెడ్గేవార్‌ను మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ  భారత మాత మహా పుత్రుడన్న ప్రశంసపై కొందరు నానా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌ స్థాపనకు కారకుడైన మహ్మదాలీ జిన్నా లౌకికవాది అని 2005 జూన్‌లో పాక్‌ పర్యటనకు వెళ్లిన బీజేపీ అగ్రనేత లాల్‌ క్రిషన్‌ అడ్వాణీ తొలిసారిగా కీర్తించినప్పుడు ఆరెస్సెస్‌ నేతలే విరుచుకుపడిన సంగతి బీజేపీ నాయకు లకు పరగడుపు అయిపోయింది. మోదీ ప్రధాని అయ్యాక కూడా అడ్వాణీని బీజేపీలో కొందరు ‘అనా మకుడి’గానే ఆచరణలో చూస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల ఒక సభలో ప్రసంగించడానికి వచ్చిన ప్రధాని మోదీకి గౌరవసూచకంగా నమ స్కారం చేయడానికి వరుసగా నిలబడిన పెద్దల్లో ఒకరైన అడ్వాణీ ముకుళిత హస్తాలతో చేసిన వంద నాన్ని స్వీకరించలేక మోదీ ముఖం తిప్పేసుకున్న దృశ్యాన్ని పత్రికలు స్పష్టంగా ప్రచురించాయి. అలాగే ప్రణబ్‌ నాగ్‌పూర్‌ పర్యటన తర్వాత ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయంలో సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన ప్రసంగం చూస్తే ‘ఎన్నడూ లేనంత అసాధా రణ బలం వచ్చినట్లు సంఘ్‌ నాయకులు భావిస్తు న్నార’ని ‘టైమ్స్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌’ రాసింది. 

అంతే గాదు, ఆరెస్సెస్‌ సేవకులు ప్రణబ్‌తో కలిసి తీయిం చిన ఫొటోలను, హెడ్గేవార్‌ విగ్రహానికి ఆయన పూలమాలను వేస్తున్న ఫొటోలను భావితరాలకు చూపించి ఆ దృశ్యాన్ని నాగరికులెవరూ నొచ్చుకోలే దని నిరూపించడానికి ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోందని ప్రసిద్ధ మీడియా విశ్లేషకుడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌ వ్యాఖ్యానించారు. ఇంతకూ ఈ పక్కవాటు విమర్శలకు, వ్యాఖ్యలకు మూలం ఎక్కడుంది? కలకత్తా నుంచి వెలువడే ఆంగ్ల దిన పత్రిక ‘టెలిగ్రాఫ్‌’ హెడ్గేవార్‌ ప్రసంగాల నుంచి, ప్రక టనల నుంచి సేకరించి ఒక సంకలనంగా ప్రచురిం చిన పుస్తకం (‘పాథీ’ p్చ్టజ్ఛిy) వీటికి ఆధారం. ఈ పుస్తకాన్ని అపూర్వానంద్‌ ఉటంకించారు. ఆరెస్సెస్‌ గురించి తెలుసుకోవాలంటే  ఆ పుస్తకం చదవాల్సిం దేనంటాడు అపూర్వానంద్‌. అందులో ఉదహరించిన హెడ్గెవార్‌ వచనాలు కొన్ని: 1.హిందుస్తాన్‌ కేవలం హిందువులదే. హిందుస్తాన్‌ హిందువుల దేశమే. జర్మన్లకు జర్మనీ ఎలాగో మనది హిందువుల దేశం. 2. ఒక భూమిలోని చెక్కనో, ముక్కనో మనం జాతి అనలేం. ఒకే ఆలోచన, ఒకే భావన, ఒకే సంస్కృతి, ఒకే నాగరికత ఉంటేనే జాతి. ఒకే సంప్రదాయంతో ఉన్నదే జాతి. ప్రాచీన కాలం నుంచి ఈ లక్షణాలు కలదే జాతి. సరిగ్గా ఈ కారణాలన్నింటివల్లనే మన దేశానికి హిందుస్తాన్‌ అన్న పేరొచ్చింది. 

ఇది హిందు వుల దేశం. 3. అలాగే ఇతరుల నుంచి ఆశించడం, అందుకోసం అంగలార్చడం అనేది కేవలం బలహీ నత. కాబట్టి, ఇక నుంచి సంఘ్‌ సేవక్‌లు ‘హిందు స్థాన్‌ హిందువులది మాత్రమే’నని నిర్భయంగా చాటాల్సిందే. సంకుచిత మనస్తత్వాన్ని తొలగించు కోండి. అయితే ఇతరులకు ఇక్కడ నివసించరాదని చెప్పొద్దు. కానీ, హిందువులదైన హిందుస్తాన్‌లో హిందువులు కాని హిందూయేతర్లు నివసిస్తున్నా రన్న నిరంతర స్పృహతో మాత్రం వారు మెలగాలి. హిందువుల హక్కులను ఇతరులు హరించరాదు. 4. కాషాయ జెండా (భగ్వధ్వజ)ను చూడగానే మొత్తం దేశ చరిత్ర తన సంప్రదాయం, సంస్కృతి మన కళ్ల ముందు వాలి పడాలి.

హెడ్గేవార్‌ సందేశం విస్మరించేసినట్లే...
అయితే ఇన్ని ‘సూక్తులు’ ఏకరువు పెట్టిన హెడ్గేవార్, ‘ఇతరులను దేబిరించడం లేదా ఎవరి నుంచో సహాయం కోసం ఎదురు చూడటం పెద్ద బలహీ నతన్న ఆదేశపూర్వక సందేశాన్ని మన పాలకులు మాత్రం పాటించడం లేదు. వారు విదేశీ పెట్టుబడుల కోసం అంగలారుస్తూ, దేశీయ వస్తు తయారీ రంగాన్ని’ ఎందుకు పస్తులు పెడుతున్నారో ప్రజ లకు జవాబు చెప్పాలి. పేరుకు మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం చాటున దేశీయ చిన్న, మధ్యతరహా పరి శ్రమల్ని మాడ్చుతూ విదేశీ గుత్త కంపెనీలకు ద్వారాలు తెరిచి దానినే ‘ఫారిన్‌ మేడ్‌ ఇన్‌ ఇండి యా’గా ఎందుకు మార్చుతున్నారో కూడా చెప్పాలి.

ఇతరులను ‘దేబిరించడం బలహీనతకు నిద ర్శనం అన్న హెడ్గేవార్‌ సూక్తికి తమ విధానాలు పూర్తిగా విరుద్ధమని మోదీ ప్రభుత్వంగానీ, ఆరెస్సెస్‌ నాయకత్వంగానీ భావించడం లేదా? అలాగే వందల సంవత్సరాలుగా దేశంలో నివసించే ఇతర జాతు లను, తెగలను, మైనారిటీలను ‘హిందూయేతర్లు’గా, ‘యవనపాములు’ లేదా విదేశీ సర్పాలనీ ముద్ర వేయడం సరికాదంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆరోగ్యకర సంస్కృతిగా భావించి నాగ్‌పూర్‌ సభలో ప్రకటించిన ప్రణబ్‌ మాటలను ఆచరణయుక్తమైన సందేశంగా మనం భావించాలి. ‘ఇతరులను అడు క్కుని బతికే సంస్కృతిని, అలవాట్లను’ హెడ్గేవార్‌  వ్యతిరేకించిన మాట నిజమే. అయితే అనేక పోరా టాల ద్వారా, అపారమైన త్యాగాలతో గాంధీ, నెహ్రూ, పటేల్, అజాద్, సరోజినీ, భగత్‌సింగ్‌ ప్రభృ తులు నిర్మించిన భారతదేశ విశిష్ట సమ్మేళనా శక్తికి విరుద్ధంగా హెడ్గేవార్‌ అనేక విషయాలు ప్రబోధిం చారు. ప్రణబ్‌ తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావిం చిన సెక్యులర్‌ సౌధాన్ని కూల్చే ప్రయత్నం ఎటువైపు నుంచి జరిగినా అది మోదీ సందు దొరికినప్పుడల్లా తన ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు మద్దతుగా వల్లిస్తున్న ‘125 కోట్లమంది భారత ప్రజల సంక్షేమా నికే’ ముప్పు అని గ్రహించాలి.

 నేడు దేశంలో పాలక పక్షం విశ్వవిద్యాలయ విద్యార్థులపైన, వారి నాయ కులపైన సమావేశ స్వాతంత్య్రానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ అధికార స్థాయిలో జరుపుతున్న దాడులు, పెడుతున్న ఆంక్ష లపై ప్రణబ్‌ తన ప్రసంగంలో నిరసన వ్యక్తం చేయ లేదు. రాజ్యాంగాన్ని ప్రజా వ్యతిరేక ధోరణులకు, విధానాలకనుగుణంగా మొదలంటా మార్చివేయా లని బీజేపీ–ఆరెస్సెస్‌ ద్వయం చేస్తున్న ప్రయత్నా లనూ ప్రణబ్‌ ఖండించలేకపోయారు. ఇక దళితులు, జాతీయ మైనారిటీలపైన ‘లవ్‌ జిహాద్‌’ పేరిట భారీగా వివిధ రాష్ట్రాల్లో సాగిస్తున్న దౌర్జన్యకాండను, ప్రజాస్వామ్య సంస్థలపైన, పాత్రికేయులపైన ప్రజా స్వామ్య ఉద్యమాలపైన, ప్రతిపక్ష నాయకులపైన జరుగుతున్న ‘జులుం’నూ ప్రణబ్‌ తప్పుపట్టకపో వడం ఆయన నాగ్‌పూర్‌ పర్యటనపై అనేక అనుమా నాలకు తావిచ్చింది. గతంలో హిందూ మహాసభ, ఆరెస్సెస్‌ నాయకుడు ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ అను సరించిన మైనారిటీ వ్యతిరేక విధానాలను ప్రణబ్‌ కన్నా సర్దార్‌ పటేల్‌  బాహాటంగా ఖండించారు.

ప్రజల కష్టాలకు కారణాలు విశ్లేషించని ప్రణబ్‌
ప్రణబ్‌ నాగ్‌పూర్‌ ప్రసంగంపై ప్రసిద్ధ గుజరాత్‌ విశ్లేష కుడు, విమర్శకుడు ప్రసాద్‌ చాకో వ్యాఖ్యానిస్తూ ప్రణబ్‌ నాగ్‌పూర్‌ ప్రసంగం ఎక్కడ ఎలాంటి ప్రేక్షకు డినైనా ఇబ్బందిపడకుండా ఒప్పిస్తుంది. ఎందు కంటే, ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా, ఎవరైనా సరే భాష్యం చెప్పగల ఉపన్యాసం అది. ఆ సభలో ప్రణబ్‌ ప్రజల సంతోష సౌఖ్యాల సూచికలో భార తదేశం అథమస్థితిలో ఉందని బాధపడ్డారు. కానీ ఆయన ఆ సుఖ సంతోషాలకు దూరమైన వారెవరో గుర్తించడానికి శ్రద్ధ తీసుకోలేదు. అలాగే వారు సుఖంగా జీవితం గడపలేకపోవడానికి గల కారణా లనూ ఆయన విశ్లేషించి చెప్పడానికి శ్రద్ధ తీసుకో లేదని చాకో అన్నారు. అలాగే, హత్యలకు దారి తీస్తున్న ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల గురించీ, ప్రణబ్‌ ప్రస్తావించకపోవడాన్ని చాకో విమర్శించారు. అన్నింటికంటే అసలు విశే షం–నాగ్‌పూర్‌లో స్వయంసేవకుల విన్యాసాలు పూర్తయిన సందర్భంగా కర్ణాటకకు చెందిన సంఘ్‌ సీనియర్లలో ఒకరైన బసవన గౌడ్‌ పాటిల్‌ యత్నాల్‌ (బీజేపీ కర్ణాటక శాసనసభ్యుడు) మైనారిటీల సంక్షే మం కోసం కార్పొరేటర్లు పని చేయకుండా కేవలం హిందువుల కోసం మాత్రమే పనిచేయాలని, బురఖా లతో ఉన్నవారిని తన ఆఫీసుకు రానివ్వొద్దని ఆదేశిం చారని  ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది.

అంతే గాదు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ అసలు ప్రణబ్‌ వివిధ దశల్లో చేసిన విరుద్ధ ప్రకటనల సారాం శాన్ని ఇలా బయటపెట్టారు: ‘‘జాతీయ కాంగ్రెస్‌ విద్యార్థి యూనియన్‌లో ఆరెస్సెస్‌ స్వభావం గురించి గతంలో ప్రణబ్‌ ఎందుకు చెడుగా మాట్లాడారు? ఇప్పుడు కొత్తగా సంఘ్‌లో ఏది ధర్మంగా, ఏం గొప్పగా కన్పించిందో ఆయన స్పష్టం చేయాలి. లేకుంటే, ఆరెస్సెస్‌ను లౌకికవాద, బహుళత్వ సమా జంలోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నా రని మేం అనుకోవాలా? కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త లుగా మాకు 1960–90ల్లో శిక్షణ ఇస్తున్నప్పుడు మీ తరం నేతలు ఆరెస్సెస్‌ ఉద్దేశాలు, లక్ష్యాల గురించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కానీ 1975లో ఓసారి, తర్వాత 1992లో ఆరెస్సెస్‌పై నిషేధం విధిం చిన సమయంలో మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు. అప్పుడు ఆరెస్సెస్‌ ఎందుకు తప్పని అనిపించింది, ఇప్పుడు ఎందుకు అది మీకు గొప్ప అనిపిస్తోంది?’’ ఈ ప్రశ్నలకు ప్రణబ్‌ తానుగా సూటిగా సమాధానం చెప్పగల స్థితిలో ఉన్నారని ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

మరిన్ని వార్తలు