ఈ సందేశాల పరమార్థం ఏమిటి?

28 Jul, 2018 00:57 IST|Sakshi

జాతిహితం

కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏలో శివసేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. కానీ శివసేన ఎన్డీఏ నుంచి బయట పడితే చాలు రాహుల్‌ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్‌జీ’ అని రాహుల్‌ ఇచ్చిన సందేశా నికి కారణమిదే. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్‌ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి.

భారత రాజకీయాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇక్కడ శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరు. కేవలం మారే స్వార్థ ప్రయోజనాలే కనిపి స్తుంటాయి. ఈ రాజకీయ పొత్తులు, అవి ముగిసి పోవడం–ఇవన్నీ కొన్ని లెక్కల ప్రకారం సాగుతుం టాయి. ఉత్తరాదిన వీటినే హిందీలో ‘జోడ్‌–తోడ్‌ రాజినీతి’ (కలయికలు–చీలికల రాజకీయం) అని పిలుస్తారు. అయితే, ఈ తరహా రాజకీయాలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నేను రాజకీయ విలే కరిగా ఉన్న రోజుల్లో భారత రాజకీయాల్లో గొప్ప గురువులుగా పేరొందిన ముగ్గురు నేతలు ప్రణబ్‌ ముఖర్జీ, ఎల్‌.కె.ఆడ్వాణీ, దివంగత సీతారాం కేసరీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అదృష్టం నాకు దక్కింది.

ఇండియాలో రాజకీయాధికారం ఎలా నడు స్తుందనే విషయంలో విభిన్న అంశాలకు సంబం ధించి ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ‘స్పెషలిస్ట్‌ ప్రొఫెసరే’. దేశంలో మొత్తం రాజకీయ శాస్త్రంలో అత్యంత నిష్ణాతుడైన అధ్యాపకుడు∙ప్రణబ్‌దా  అని నేనంటే ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని భావిస్తాను. 1980ల చివరి నుంచీ ఆడ్వాణీ తన పార్టీ బీజేపీని బలోపేతం చేసే పని ప్రారంభించారు. 1984లో రెండు సీట్లు గెలిచిన ఈ పార్టీని 1989లో 85 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునే స్థాయికి, 1998లో అధికారంలోకి వచ్చే స్థితికి ఆయన తీసు కెళ్లారు. అనేక పార్టీలతో పొత్తుల ద్వారా సంకీర్ణ కూటమి నిర్మాణంతో విజయం సాధించవచ్చని ఆయన చెబుతారు. ‘‘మేం జాతి వ్యతిరేకమని భావించే పార్టీలు ఐదు ఉన్నాయి. వీటిని మిన హాయిస్తే మరెవరితోనైనా పొత్తుకు మేం సిద్ధమే’’ అని ఆయన అంటారు.

ఆడ్వాణీ దృష్టిలో ఈ ఐదు ‘అంటరాని’ పార్టీలు–కాంగ్రెస్, వామపక్షాలు, ములాయం నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), లాలూ నడిపే రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), ముస్లింలీగ్‌(ఇలాంటి తరహా పార్టీలైన ఒవైసీల ఎంఐఎం, అస్సాం అజ్మల్‌ పార్టీ ఏఐయూడీఎఫ్‌ సహా). బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా వేరే దారి లేని శివసేన, శిరోమణి అకాలీదళ్, ఒక దశలో టీడీపీ ఆ పార్టీ పంచన చేరాయి. వీటిలో మొదటి రెండు పార్టీలూ తమ రాజకీయాలకు, అధికారం సాధించడానికి మతమే కీలకం కావడం వల్ల కాషా యపక్షంతో జతకట్టాయి. కాంగ్రెసే తన ఏకైక ప్రత్యర్థి కావడంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 

అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఆడ్వాణీ రూపుదిద్దిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉన్న మొదటి మిశ్రమ సర్కారు. అప్పటి వరకూ సీనియర్‌ నేత జార్జి ఫెర్నాండెజ్‌ ‘అత్తగారి దేశంలో (ఇటలీ–సోనియా మాతృదేశం) సంకీర్ణ ప్రభుత్వాలు లక్షణంగా నడుస్తున్నప్పుడు ఇండి యాలో ఇవి ఎందుకు పనిచేయవు?’ అని గతంలో అన్నప్పుడల్లా జనం భయపడేవారు. తర్వాత ఆ ‘కూతురు’ (సోనియా) నిర్మించిన రెండు సంకీర్ణాలు పూర్తి కాలం పదేళ్లు అధికారంలో కొనసాగాయి. 

‘సంకీర్ణ పరిస్థితులు’ పెద్దగా మారనే లేదు! 
ప్రధాన జాతీయపక్షాలు ఎప్పటికీ పొత్తు పెట్టుకోని పార్టీలు ఉన్నాయి. అలాగే, వేరే దారి లేక ప్రధాన పక్షాలతో చేతులు కలిపే పార్టీలూ ఉన్నాయి. రెండో తరహా పార్టీల్లో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషన లిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ(ఎన్సీపీ) మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం కోసం సిద్ధాంతాలు వదులుకునే రాజకీయపక్షాలకు 75 నుంచి 150 లోక్‌సభ సీట్లు వస్తుంటాయి. అందుకే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజా రిటీకి అవసరమైన 272 సీట్లు ఎలా గెలవాలనే విష యానికి బదులు 160 వరకూ సీట్లు దక్కించుకునే ఇలాంటి పార్టీలపై చర్చ ఎక్కువవుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల ముందునాటి స్థితికి మళ్లీ దేశం చేరుకుంటోందని పరిస్థితులు సూచిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవ కాశం లేదు. ఏ పార్టీకీ 272 సీట్లు రాని 1989 తర్వాత పరిస్థితికి చేరుకుంటున్నాం. 

శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రేకు ట్విటర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ‘‘శ్రీ ఉద్ధవ్‌ ఠాక్రేజీ, జన్మ దిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో ఆనం దంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను,’’ అని సందేశం పంపడంలో పరమార్థం ఏమిటి? మనసులో ఓ మాట, పైకో మాట రాజకీయ నేతలకు సహజమే. రాజకీయ ప్రత్యర్థికి పుట్టినరోజు లేదా పండగ శుభా కాంక్షలు చెప్పడం సర్వసాధారణం. అలాగే, తన బద్ధ రాజకీయ ప్రత్యర్థి దగ్గరకు వెళ్లి ఓ బడా నేత కావ లించుకోవడం చూసి మనం ఆశ్చర్యపడాల్సినది కూడా ఏమీ లేదు. కాని, ఉద్ధవ్‌కు రాహుల్‌ సందేశం విషయంలో మనం కొంత ఆలోచించక తప్పదు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడెవరూ బహిరంగంగా ఎవరికీ శుభా కాంక్షలు తెలిపిన సందర్భాలు లేవు. సైద్ధాంతికంగా పూర్తిగా అసహ్యించుకోవాల్సిన విలువలు పాటించే పార్టీ నేతకు దేశ ప్రజలందరూ చూసేలా ట్విటర్‌లో ఇలా గ్రీటింగ్స్‌ చెప్పడం వింతే మరి. కాంగ్రెస్‌కు బీజేపీ కన్నా శివసేన మరింత అంటరాని పార్టీగా ఉండాలని రెండు పార్టీల నేపథ్యం చెబుతోంది. అదీ గాక, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట మిలో ముఖ్య భాగస్వామ్య పక్షం శివసేన. 

శివసేన అధినేతకు దగ్గరవడానికి రాహుల్‌ ఇప్పుడిలా బహిరంగ ‘ప్రేమలేఖ’తో ప్రయత్నిం చడం మూడు విషయాలను సూచిస్తోంది. ఒకటి, బీజేపీ– శివసేన మధ్య సంబందాలు దెబ్బతినడం ఆయన గమనించారు. రెండోది, 2019 ఎన్నికల్లో తన వ్యూహంపై మరింత స్పష్టత ఇచ్చారు. నేను కాకున్నా ఫరవాలేదు గాని, మోదీకి బదులు ఎవరు ప్రధానిగా అయినా అభ్యంతరం లేదనే విషయం మరోసారి తేల్చి చెప్పారు. ఇక మూడోది, 2019లో దేశంలో సంకీర్ణయుగం మళ్లీ ఆరంభమైతే, రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఆడ్వాణీ చెప్పిన రీతిలో ఉండవనేది రాహుల్‌ అభిప్రాయంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ వ్యూహంపై స్పష్టతనిచ్చిన రాహుల్‌ 
శత్రువు శత్రువు మిత్రుడనేది పాత మాట. నీ శత్రువు సన్నిహిత మిత్రునికి దగ్గరవడానికి నీవు సిద్ధంగా ఉన్నావంటే దేశ రాజకీయాల్లో ఇది కొత్త పంథాకు సంకేతంగా కనిపిస్తోంది. బాగా బలహీనమైన స్థితిలో కాంగ్రెస్‌ ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలంటే సిద్ధాంతాలు పక్కనపెట్టి, కొత్త పోకడలకు తెరతీయవచ్చనే తెలివి రాహుల్‌కు వచ్చి నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్న కారణంగా ఎవరు దేశాన్ని పరిపాలిస్తారనే విషయం మళ్లీ చర్చకు వస్తోంది. లోక్‌సభ ఎన్నికలను నేను తరచు తొమ్మిది సెట్ల టెన్నిస్‌ మ్యాచ్‌తో పోల్చేవాడిని.

ఎవరు ఐదు సెట్లు గెలుస్తారో వారే విజేత. భారత పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. వచ్చే ఎన్ని కల్లో ‘తొమ్మిది సెట్లు’గా చెప్పే రాష్ట్రాలు ఏవంటే– ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, కర్ణా టక, కేరళ. ఇవి పెద్దవి కావడంతో 9 రాష్ట్రాల జాబి తాలో చేర్చాను. అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో మార్పు అనేది సాధ్యమౌతుంది. అందుకే, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌ను చేర్చలేదు. ఈ 9 రాష్ట్రాల్లోని మొత్తం లోక్‌సభ సీట్లు 342. వీటిలోని ఐదు రాష్ట్రాల్లో గెలిచే సంకీర్ణ కూటమికి దగ్గరదగ్గర 200 వరకూ సీట్లు దక్కే అవకాశముంది. లేకున్నా 160కి పైగానే స్థానాలు తప్పక లభిస్తాయి.  అందుకే 2014 వరకూ 272 సీట్ల గెలుపుకున్న ప్రాధాన్యం ఇక 160 సీట్ల కైవసం చేసుకోవడానికి లభిస్తుందని అనుకోవచ్చు. 

యూపీలో బీజేపీకి సగంపైగా సీట్లు గల్లంతే!
మోదీ–అమిత్‌షా నాయకత్వంలోని బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడ టమే అత్యంత ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరప్ర దేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే బీజేపీకి ఘన విజయం దక్కదు. 2014లో గెలిచిన 73 సీట్లలో సగం కూడా గెలవడం కష్టం. అప్నాదళ్‌ వంటి చిన్న మిత్రపక్షాలు సైతం బీజేపీతో కలిసి ఉంటాయా? అంటే చెప్పడం కష్టం. అలాగే, కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాలో బీజేపీ బలం బాగా తగ్గుతుంది.  ఈ నష్టాలను తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసు కోవాలని బీజేపీ అనుకుంటోంది.

కాబట్టి, యూపీ తర్వాత అత్యధిక ఎంపీలను పంపే అంటే 48 లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్రలో బలం నిలబెట్టుకోవడమే బీజేపీ అతి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మహా రాష్ట్రలో శివసేన సాయం లేకుండా ఒంటరి పోరుతో విజయం సాధించడం గురించి అమిత్‌ షా తన పార్టీ శ్రేణులను సమీకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, శివసేన లేకుండా బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోలేదనే విషయం ఆయనకు తెలుసు. రాహుల్‌కీ ఈ వాస్తవం తెలుసు. 2019 లోక్‌ సభ ఎన్నికలు నేను పైన చెప్పినట్టు 9 సెట్ల టెన్నిస్‌ మ్యాచ్‌లా మారితే, మహారాష్ట్రలో బీజేపీ (ఎన్డీఏ) గెల వకుండా రాహుల్‌ సాధ్యమైనంత కృషిచే యాలి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏలో శివ సేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు.

రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. శివసేన ఎన్డీఏ నుంచి బయటపడితే చాలు రాహుల్‌ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్‌జీ’ అని రాహుల్‌ ఇచ్చిన సందేశానికి కారణమిదే. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రసం గిస్తూ, ఇదే తరహాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావును ‘వికాస్‌ పురుష్‌’ అంటూ ఆయనపై ప్రశం సలు కురిపించారు. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్‌ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిçస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి.

- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

>
మరిన్ని వార్తలు