పాలన వీడి ప్రత్యర్థులపై గురి

15 Dec, 2018 01:28 IST|Sakshi

జాతిహితం

యువ భారతీయులు 2014లో బ్రాండ్‌ మోదీ తమకు అమ్మిన ఆశను, ఆశావాదాన్ని ఎంతో మక్కువగా కొనిపడేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందిరాగాంధీ యుగం నాటి కాంగ్రెస్‌గా మారిపోవడమే కాకుండా ఒక ఆవును కూడా తోడు తెచ్చుకోవడంతో అదే యువతరం ఇప్పుడు ఆగ్రహంతో, నిరాశా నిస్పృహలతో దహించుకు పోతోంది. ఇప్పుడు తన సర్కారీ పథకాల గురించి మోదీ జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి, తప్పు చేసినవారిని శిక్షించడానికి బదులుగా గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాలచిట్టాను బయటపెట్టడంలోనే ఆయన కాలం గడిపేస్తున్నారు. 

ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్‌ గురు అలీక్‌ పదమ్‌సే తనకు ఇష్టమైన వాక్యాన్ని పదే పదే చెబుతుండేవారు. ‘క్లయింట్లు తమ బ్రాండ్లను జాగ్రత్తగా తీర్చిదిద్దమని నన్ను అడిగేవారు. నేను నా బ్రాండ్‌ను ఎన్నడూ తీర్చిదిద్దనని, నా పోటీదారు బ్రాండ్‌ను మాత్రమే జాగ్రత్తగా చూస్తానని నేను వారికి చెప్పేవాడిని. ‘దురదృష్టవశాత్తూ అలీక్‌ ఇటీవలే కన్ను మూశారు. నరేంద్రమోదీ, అమిత్‌ షాలు 2014లో ప్రతిపక్షం ఎలా ఘోర తప్పిదాలకు పాల్పడి ప్రతిపక్ష బ్రాండుగా మారిపోయి ఓట్ల బజారులో తమకు విజయం సాధించిపెట్టిందో అదే పాత్రను ఇప్పుడు పోషిస్తున్న వైనాన్ని ఆలీక్యూతో చాట్‌ చేస్తే సరదాగా ఉంటుంది కాబోలు. 

నేరుగా విషయానికి వద్దాం. 2014 వేసవిలో నరేంద్రమోదీ ప్రతి కూలతకు, నిరాశావాదానికి సంబందించిన ఒక్క పదం కూడా పలక లేదు. ఆయన సందేశం చాలా దృఢంగా, స్థిరంగా, నచ్చచెప్పేవిధంగా ఉండేది. అభివృద్ధి, పురోగతి, ఉద్యోగాలు, దృఢ శక్తి, అచ్చేదిన్‌ (మంచి రోజులు).. అన్ని రంగాల్లోనూ ఆయన ఇవే మాట్లాడేవారు. ఒక స్వచ్ఛ మైన, నిర్ణయాత్మకమైన, పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలనను మోదీ జాతికి హామీ ఇచ్చారు. భవిష్యత్తును గురించి మాత్రమే మాట్లా డుతూ తాను దాన్ని ఎలా విప్లవీకరించబోతున్నదీ ప్రత్యేకించి యువత ముందు స్పష్టంగా చెప్పేవారు.

సబ్కా సాథ్, సబ్కా వికాస్‌
గతం గురించి ఆయన ప్రస్తావించారంటే అది ఆర్థిక పతనం, పాలసీ పరమైన పక్షవాతం, యూపీఏ–2 హయాంలో పాలన పూర్తిగా అడుగం టిపోవడం, దాని ప్రధానికి తీరని అవమానం జరగడం, పర్యావరణ అనుమతుల మిషతో కుంభకోణాల మీద కుంభ కోణాలు చోటు చేసు కోవడం, ప్రభుత్వం మొత్తంగా కుంభకోణాలలో కూరుకుపోవడం వంటి అంశాలనే ప్రస్తావించేవారు. అంతే కానీ ప్రజలను వేరుపర్చడం, విడ దీయడం అప్పట్లో మోదీ ప్రసంగాల్లో ఉండేవి కావు. ఆయన కేంపెయిన్‌ థీమ్‌ ఏదంటే సబ్కా సాథ్, సబ్కా వికాస్‌ (అందరితో ఉంటాను, అంద రినీ ఎదిగేలా చేస్తాను) మాత్రమే.

ఈ సబ్‌కా సాథ్‌ వెనుక ఉన్న సందేశం ఒక్కటే. నాకు సమస్యలు తెలుసు. నేను పరిష్కారాలతో వచ్చాను. నాకు మీ తీర్పును, సమ యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి, అన్నదే ఆ సందేశ సారాంశం. ఆ సందేశం గొప్ప ప్రాడక్టుగా మారి తన ప్రతిపక్షాన్ని ఊచకోత కోసేసింది. కానీ వచ్చే ఎన్నికలు ఇక ఆరునెలల్లో రాబోతుండగా మోదీ సందేశం దాదాపు వ్యతిరేకదిశకు మారిపోయింది. ఇందిరాగాంధీ తర్వాత దేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ ఆవిర్భవించారు. కానీ ఇప్పు డేమో కాంగ్రెస్‌ పార్టీ తనను పని చేయనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. చివరకు భారత్‌ మాతాకు జై అనే తన ఊతపదాన్ని కూడా కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని ఇటీవలి తన ఎన్నికల ప్రచారంలో మోదీ వాపోయారు. అంటే నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ని నిర్వీర్యం చేసిన 10 జన్‌పథ్‌ ఇప్పుడు కేవలం 47 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పటికీ మోదీని ఊపిరా డకుండా చేస్తోందన్నమాట.

మోదీ ప్రభుత్వ పాలనను పరిమితం చేస్తానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు సమయమంతా తన సర్కారీ పథకాల గురించి జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి తప్పుచేసినవారిని శిక్షించడానికి బదులుగా, గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాల చిట్టాను బయట పెట్టడంలోనే మోదీ కాలం గడిపేస్తున్నారు. 54 నెలల పాటు సంపూర్ణ అధికారాన్ని అనుభవించి, ప్రభుత్వ ఏజెన్సీలను సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తర్వాత దేశ ప్రజలకు ఒరిగింది ఇదే మరి.

పాలనను పరిమితం చేయడం, గుజరాత్‌ తరహా పారిశ్రామికుల నేతృత్వంలోని అభివృద్ధికి తావియ్యడానికి బదులుగా, మరిన్ని కరపత్రా లను మాత్రమే అందిస్తున్నారు. పైగా భవిష్యత్తు గురించి చాలా అరు దుగా మాత్రమే మోదీ మాట్లాడుతుండటం ఆశ్చర్యం గొలుపుతోంది. పైగా గతంలోకి చాలా దూరం వెళ్లిపోయి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆయన తండ్రి, పుత్రిక, పటేల్, శాస్త్రిల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు, వికాస్, సంపద వంటి వాగ్దానాలు గూట్లో చేరాయి. జాతి ఐక్యత, సబ్‌కా సాత్‌ బదులుగా ప్రతి సీజన్‌లోనూ మతపరమైన విభజన మాత్రమే కర్తవ్యంగా మిగిలిపోతోంది. ఈ విషయంలో యోగి ఆదిత్య నాథ్, అమిత్‌ షా దాని పెద్ద ఆయుధాలుగా మారిపోయారు.

అంటే తన సొంత బ్రాండును, లేక ప్రొడక్టును మోదీ నాటకీయం గానే వ్యతిరేక దిశకు మళ్లించేశారు మోదీ. తన సొంత పనితీరు, చేసిన వాగ్దానాల అమలు గురించి ఆలోచించడం మాని, తన ప్రత్యర్థుల ప్రాచీన గతానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఓట్లు దండుకోవాలని ప్రయత్నించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా తన వాగ్దానాల విష యంలో మోదీ తీరు ఎలా ఉందంటే,  ‘ఓహ్, వారు ఉద్యోగాలు అడుగు తున్నారా? అయితే వారికి తలొక ఆవును ఇవ్వండి చాలు..’

పనిచేయని గోరక్షణ
మరోవైపున భారత్‌లో ఉద్యోగాలులేని యువసైన్యం గ్రామీణ ప్రాంతాల్లో కేరమ్స్, పేకాట అడుకుంటా గడిపేస్తున్నారు లేకపోతే ఊరకే పొగ తాగుతూ, చాట్‌ చేస్తూ, దాదాపుగా ఉచిత డేటాను అందిస్తున్న చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్లలో చెత్తనంటినీ చూస్తూ పొద్దుçపుచ్చుతున్నారు. కానీ వీరిలో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతోంది. మోదీని అధికారంలోకి తీసు కొచ్చిన వారి ఆకాంక్షలు, ఆత్మగౌరవ తృష్ణ వంటివాటిని బలిపెట్టడానికి కూడా వెనుదీయని వీరు ఇప్పుడు తమ హృదయం నిండా గోరక్షణ కర్తవ్యసాధనలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. కాని ఇటీవలే ముగి సిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పవిత్ర కర్తవ్యం పనిచేసినట్లులేదు.

నరేంద్రమోదీ పచ్చి వ్యతిరేకులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామీణ, రైతుల దుస్థితి ఫలితమే అని ఎవరైనా విశ్లేషిం చవచ్చు. కానీ బీజేపీ ఈ రాష్ట్రాల్లోని చాలా నగరాలను కూడా పోగొట్టు కుంది. మోదీ మద్దతుదార్లలో చాలా పెద్ద, గొంతుబలం కలిగిన, ఆశా వాదులు పట్ణణ, సెమీ అర్బన్‌ మధ్యతరగతులకు చెందిన వారు, నిరు ద్యోగ యువతే మరి. 2018లో నెహ్రూను పునరుత్థానం చెందించి మళ్లీ ఆయన్ని సమాధి చేయాలన్న పిలుపును వీరెవరూ పెద్దగా పట్టించుకు న్నట్లు కనిపించలేదు.

గందరగోళపడుతున్న ఓటర్లు
2014 సార్వత్రిక ఎన్నికల తీర్పు తర్వాత, భారత్‌లో సహస్రాబ్దిలో, భావజాలరహిత తరం ఆవిర్భవించిందని నేను రాశాను. నేను నీకేమీ బాకీ లేను అనే తరహా తరం పుట్టుకొచ్చింది. రాజరికానికి, వంశపాల నకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని వారు తోసిపుచ్చేశారు. ఆ ప్రకారమే కాంగ్రెస్‌ను శూన్యంలోకి నెట్టేశారు. కానీ ఇప్పుడు మోదీ, షాలు ఆ వంశ పాలనకే వ్యతిరేకంగా పోరాడమని మళ్లీ పిలుపు ఇస్తున్నారు. కానీ ఇది పనిచేయడం లేదు. ఓటర్లు గందరగోళ పడుతున్నారు. వారి ప్రశ్న ఒకటే. ‘నేను ఆలోచిస్తున్న వ్యక్తి మీరేనా?’

2014 నాటి మేధోవంతమైన కేంపెయిన్‌లో సోనియా గాంధీ ఆమె సంక్షేమవాదం గురించి ఒక అద్భుతమైన కథను నరేంద్ర మోదీ జనా లకు చెప్పేవారు. ఒక రైతు అడవిలో వెళుతూ ఆకలితో ఉన్న సింహం దారికి అడ్డంగా నడి చాడు. అతడిని చంపి తినేయాలని సింహం మాటు గాచింది. కానీ రైతు ప్రశాంతంగా ఉన్నాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి దిగకు, అంటూ అతడు సింహాన్ని హెచ్చరించాడు. లేకుంటే నిన్ను నా తుపాకితో కాల్చే స్తాను. సింహం ఆగింది. రైతుకేసి తీక్షణంగా చూసింది. కానీ తుపాకి ఏదీ అని అడిగింది. 

ఆ రైతు తన కుర్తా జేబునుంచి మడిచిన కాగితం బయటకు లాగాడు. ‘‘ఇదిగో ఇక్కడ ఉంది షేర్‌ భాయ్, తుపాకి ఇంకా దొరకలేదు కానీ సోనియా గాంధీ నాకు గన్‌ లైసెన్స్‌ ఇచ్చింది మరి’’. వేలాదిమంది జనం పకపక నవ్వారు. వారు ఈ కథ లోని సందేశం అర్ధం చేసుకున్నారు. దారిద్య్రం, నిరుద్యోగం, భవిష్యత్తుపై ఆకాంక్షలను కేవలం హక్కుదారీ పథకాలు నెరవేర్చలేవు. హక్కులు సంక్రమింపజేసే చట్టాలు(ఆ రైతుకు తుపాకి లైసెన్స్‌ ఇవ్వడంలాంటివి) మద్దతిచ్చినా సరే ఆ సమస్యలు తీరవు. పైగా జాతీయ ఉపాధి పథకం అనేది దశాబ్దాల కాంగ్రెస్‌ ప్రభుత్వాల తీవ్ర వైఫల్యానికి అతి గొప్ప సాక్ష్యమని మోదీ విమర్శించారు.

కానీ అదే పథకంలోకి తానే ఇప్పుడు మరింత డబ్బు గుప్పిస్తున్నారు. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ పేదల ఆరోగ్యం కోసం మోదీ ఇస్తున్న తుపాకి లైసెన్సులా ఉంది. 2014లో మోదీ ఒక వంశ పాలనను ఓడించారుగానీ దాని రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని మాత్రం కౌగలించు కున్నారు. సిద్ధాంతాలతో పనిలేకుండా 2014 నుంచి గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వరకూ మోదీని చూసి ఓట్లు కుమ్మరించిన ఓటర్లు ఇప్పుడు అదే మోదీ విధానాలను చూసి గందరగోళంలో పడు తున్నారు. 

2014లో నరేంద్రమోదీ, అమిత్‌షాలు తమకు ఎదురే లేదు అన్న విధంగా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించారు. కానీ ఇప్పుడు వారే ఆగ్ర హిస్తున్నారు. గదమాయిస్తున్నారు. తామే బాధితులమని వాపోతు న్నారు. ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు అడుగుతున్నారు తప్ప తమకు ఓటేయ వలసిందిగా వీరిప్పుడు అడగటం లేదు. గెలిచే టిక్కెట్లను తమ వద్ద ఉంచుకుని కూడా ఇలా తమను ప్రతిపక్ష స్థానంలోకి ఎందుకు మార్చు కుంటున్నారు అనేది గమనించినట్టయితే మనముందు లేని అలీక్‌ పద మ్‌సే కూడా పకపకా నవ్వుతారు కాబోలు!

వ్యాసకర్త: శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌, twitter@shekargupta

మరిన్ని వార్తలు