వారంట్‌ బూచితో ఇంత లేకితనమా?

30 Sep, 2018 00:45 IST|Sakshi

సందర్భం

ప్రజా మేలు కాంక్షించే నాయకుని ఆలోచనలు వేరే ఉంటాయి  వివాదాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవటమే రాజనీతి. వరుసగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబుకు బాబ్లీ ప్రాజెక్టు గుర్తుకురాలేదు. కానీ బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన  వారంట్‌ను  తెలంగాణ ప్రభుత్వం కుట్రగా  చెప్పుకుంటూ సానుభూతి ఓట్ల కోసం తన్లాడటం చంద్రబాబు మార్కు పాలిటిక్స్‌లో భాగమే. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ నదీజలాల పంపిణీలో రాజనీతిని ప్రదర్శించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహ హస్తాలను సాచారు. మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర çఫడ్నవిస్‌ను ఒప్పించారు.

‘రాజకీయ విలువలు అస్థి రమైనవి’ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు అంటాడు. అర్థిక శాస్త్రం చదివిన చంద్ర బాబుకు ఏ ఘడియల్లో ఇది వంటబట్టించుకున్నాడో గానీ కౌటిల్యుడే సిగ్గుపడే టట్లు ఆ పదాల ‘అర్థా’న్నే మార్చేశారు.  తెలంగాణ పల్లెల్లో ఉద్యమం ఉరకలె త్తుతున్న రోజుల్లో ‘రెండు కళ్ల సిద్ధాంతాన్ని’ ముంద టేసుకున్నారు. రెండు నాల్కల మాటలకైతే లెక్కే లేదు.  ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ‘మీది ఏ ఇజం’ అని జర్నలిస్టులు అడిగితే ‘నాకు ఏ ఇజం లేదు.. టూరిజం’ అన్నాడు. ఆయన ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. ప్రతి పనిని ఓటుతోనే సరితూకం చేస్తారు. పిల్లని చ్చిన మామకు వెన్నుపోటు పొడిచినా... ఒకప్పుడు నరేంద్ర మోదీని రాష్ట్రంలోకి రాకుండా నిషే«ధిం చాలని నినదించి.. ఆ తరువాత ఆయన్ను కౌగిలించు కొని, మోకరిల్లినా.. ఇప్పుడు ఎన్టీఆర్‌ ఆత్మఘోషిం చేలా ఏకంగా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టు కున్నా... అంతిమంగా అధికార పీఠం దక్కించుకోవా లనే యావే. తాజాగా బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన  వారంట్‌ను  తెలంగాణ ప్రభుత్వం కుట్రగా  చెప్పుకుంటూ సానుభూతి ఓట్ల కోసం తన్లా డటం చంద్రబాబు మార్కు పాలిటిక్స్‌లో భాగమే.

ఆ మధ్యకాలంలో ఓ ఎన్‌బీడబ్ల్యూ వారంట్‌  వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టింది. అటు తిరిగి.. ఇటు తిరిగి నాకూ చేరింది. తీరా చూస్తే  ఆ వారంట్‌ నాదే. తెలంగాణ ఉద్యమ సమయంలో అయిన కేసు అది. రెండేళ్లుగా  కోర్టుకు హాజరు కాకపోవటంతో సిద్దిపేట కోర్టు వారంట్‌  ఇచ్చింది. నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరో దాన్ని వాట్సాప్‌లో పెట్టారు. ‘రామలింగారెడ్డి అధికార దుర్వినియోగం చూడండి’ దానికో క్యాప్షన్‌ పెట్టారు. నేను ఆ ఓ లాయర్‌ను పట్టుకొని  రీకాల్‌ పిటిషన్‌ వేయించాను. కోర్టుకు గైర్హాజరు అయ్యే వాళ్లకు భారత శిక్షాస్మృతిలో ఇది సర్వ సాధారణ వారంట్‌. రాజకీయ నేతలకైతే  ఇటువంటి వారంట్లు అతి సాధారణం. చంద్రబాబు నాయుడుకు బాబ్లీ ఆందోళన  కేసులో వచ్చిన ఎన్‌బీడబ్ల్యూ వారంట్‌ కూడా నూటికి నూరుపాళ్లు ఇటువంటిదే. చంద్ర బాబునాయుడుకు కోర్టులు, కేసులు కొత్తకావు. ఆయన మీద 29 అవినీతి కేసులు ఉన్నాయి. వీటి మీద కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని రాజ్య పాలన చేస్తున్నాడు. ఇటీవల బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన నాన్‌బెయిలబుల్‌(ఎన్‌బీడబ్ల్యూ) వారంటు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పటి వరకు ఆయనకు 37 సార్లు కోర్టు నుంచి నోటీసులు అందాయి.  నిందితులు కోర్టుకు హాజరుకావడం లేదనే కారణంపైన 2015 సెప్టెంబర్‌ 21 మొదటిసారి ఎన్‌బీడబ్ల్యూ జారీ చేశారు. అప్పుడు చంద్రబాబు – మోదీ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు.

ఆ తర్వాత 35 సార్లూ ఎన్‌బీడబ్ల్యూ జారీ చేస్తూ వచ్చింది. అప్పుడూ ఏ చప్పుడూ లేదు. తెలంగాణలో సాధారణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బాబ్లీపై వారెంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి అంపశయ్యమీద ఉన్న టీడీపీకి ఇంత జీవగంజి పోయటానికి, రెండోది  కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు వ్యవహారంపై రెండు రాష్ట్రాల ప్రజానీకం, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరు ణంలో దీనిపై చర్చ జరగకుండా కప్పిపుచ్చేందుకు 37వ ఎన్‌బీడబ్ల్యూ వారంట్‌ కుట్రగా కనిపించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడకుండా చేశారు. సమస్యను పరిష్కరిం చడానికి బదులు మరింత జటిలం చేశారు. ప్రతి చిన్న విషయానికి మహారాష్ట్రతో గిల్లికజ్జాలు పెట్టుకు న్నారు. నిజానికి 2010లో చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగటం కూడా ఓట్ల స్టంటే. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బాబుకు తెలంగాణ ప్రజల మద్దతు లభించక పోవటంతో బాబ్లీ బాట పట్టారు. వివా దాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవటమే రాజ నీతి. వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసినప్పుడు బాబుకు బాబ్లీ ప్రాజెక్టు గుర్తుకురాలేదు. అధికారం పోగానే ప్రాజెక్టు గుర్తొచ్చి ఫైటింగ్‌ కోసం పోయిండు. బాబ్లీ వివాదం ఎప్పటికీ తెగకుండా చేశారు. పైగా తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే మహారాష్ట్ర ఒంటి కాలు మీద లేచే పరిస్థితికి తీసుకొచ్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజనీతిని ప్రదర్శించారు.  ‘మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదు. రైతు ఎక్కడివాడైనా రైతే. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల రంగంలో తీవ్రంగా నష్టపోయాము. తెలంగాణ ఉద్యమం ట్యాగ్‌ లైన్‌ నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే సాగునీటి రంగానికి మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. ముంపు సమస్య లేకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేశాము, సహకరిం చండి అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కడుపులో కల్మషం లేకుండా కావాల్సింది ఏమిటో విడమరచి చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఒప్పించారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌ గంగ నదులపై మూడు బ్యారేజీల నిర్మాణానికి సీఎంలు పరస్పరం అంగీకారం తెలిపారు. తెలం గాణ సీఎం కేసీఆర్, మహా రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్న వీస్‌ సంతకాలు చేశారు. 

మొదటి ఒప్పందం: గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో, 16 టీఎంసీల నీటినిల్వ సామ ర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీ కారం కుదిరింది. ఈ బ్యారేజీ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగా రెడ్డి జిల్లాల్లో 18.19 లక్షల ఎకరాలు కొత్తగా సాగు లోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్‌ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయ కట్టు స్థిరీకరణ చెందుతుంది.

రెండో ఒప్పందం : ప్రాణహితపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, 1.8 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. దీని వల్ల ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్‌–కాగజ్‌నగర్‌ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

మూడో ఒప్పందం: పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసి, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది. కృష్ణా, గోదావరి జలాలను ఎలాగైనా ఆంధ్రాకు మళ్లించుకుపోవాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు, ప్రాజెక్టులు నిర్మాణం కాకుండా కోర్టు కేసులతో అడ్డం పడి తెలంగాణ భూములను ఎండబెట్టాలనే దుర్భు ద్ధితో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలు జతకట్టి ఓట్ల కోసం వస్తు న్నారు. ఇటువంటి తోడు దొంగల పట్ల తెలంగాణ జనం జాగ్రత్తగా ఉండాలే. ఓటుతోనే తరిమికొట్టాలి.

సోలిపేటరామలింగారెడ్డి 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు,
దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141

మరిన్ని వార్తలు